యథార్థతకు ఏమైంది?
ఓ వందేళ్లకంటే ఎక్కువ కాలం క్రితం, బార్నే బార్నాటో అనే వజ్రాల సట్టావ్యాపారి దక్షిణాఫ్రికా నుండి ఇంగ్లాండ్కు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత, తన గురించి ఒక వార్తాపత్రికలో అచ్చువేయబడిన కథలోని కొన్ని అంశాలను అతడు అంగీకరించలేదు. రెండవ శీర్షిక కొరకు, అంటే “కొన్ని విషయాలను సరిచేసేందుకు” అతడు సంపాదకునికి ఒక చేవ్రాత ప్రతినీ దానితోపాటు పెద్ద మొత్తం డబ్బుకు చెక్కునూ ఇచ్చాడు.
జె. కె. జెరోమ్ అనే ఆ సంపాదకుడు చేవ్రాత ప్రతిని చెత్త కాగితాల బుట్టలో పడేసి చెక్కును తిరిగి ఇచ్చేశాడు. ఆశ్చర్యచకితుడైన బార్నాటో వెంటనే ఆ డబ్బుకు రెండింతలిస్తానన్నాడు. దాన్ని కూడా నిరాకరించడం జరిగింది. “నీకెంత కావాలో చెప్పు?” అని అతడు అడిగాడు. ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ, జెరోమ్ ఇలా అంటున్నాడు: “అది ఇక్కడ, అంటే లండన్లో జరగదని నేను అతడికి వివరించాను.” ఒక సంపాదకునిగా అతడు తన యథార్థతను అమ్ముకోడు.
“యథార్థత” అనే పదం “నైతిక సరళత; నిజాయితీ” అని నిర్వచించబడింది. యథార్థతగల వ్యక్తి విశ్వాసయోగ్యుడు. అయితే నేడు కాపట్యం అంటే యథార్థత లోపించడం, అన్ని వర్గాల ప్రజలనూ పట్టి పీడిస్తుంది.
నైతిక యథార్థత లోపించడాన్ని వివరించేందుకు బ్రిటన్లోని ప్రసార మాధ్యమం “స్లీజ్” అనే పదాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది. ది ఇండిపెండెంట్ వార్తాపత్రిక దాన్ని వివరించిన విధంగా, స్లీజ్ “ప్రేమ వ్యవహారాలూ స్థానిక ప్రభుత్వాలు చేసే హేరాపేరీలూ మొదలుకొని పెద్ద ఎగుమతి ఆర్డర్ల కొరకు ముడుపులు చెల్లించడం వరకూ” అన్నిటినీ ప్రభావితం చేస్తుంది. జీవితంలోని ఏ అంశమూ మినహాయించబడలేదు.
యథార్థత యొక్క అస్థిరమైన ప్రమాణాలు
అయితే యథార్థత అంటే పరిపూర్ణత అని భావం కాదు, కానీ అది ఒక వ్యక్తిలోని మూల గుణాన్ని తప్పక ప్రతిబింబిస్తుంది. వీలైనంత త్వరగా ధనికులవ్వాలనే మన ఈ ప్రపంచంలో, యథార్థత ఒక సద్గుణంగా కాకుండా ఒక ప్రతిబంధకంగా దృష్టించబడవచ్చు. ఉదాహరణకు, పరీక్షల్లో మోసం చేసేందుకు విద్యార్థులు అధునాతనమైన పరికరాలను ఉపయోగించడం అధికమౌతోంది, మరి ఈ క్రొత్త పరికరాలను ఆచూకీ తీయడం కూడా దాదాపు అసంభవం. బ్రిటిష్ విద్యార్థులందరిలో దాదాపు సగానికంటే ఎక్కువమంది విద్యార్థులు మోసగించారని, మరి ఆ విషయంలో బ్రిటన్ ఏకైక దేశం కాదని ఒక బ్రిటిష్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ పేర్కొన్నాడు.
విశ్వాసయోగ్యులు కాని వ్యక్తులు అబద్ధాలు చెప్పినప్పుడూ మోసం చేసినప్పుడు అది అమాయక ప్రజలకు కలిగించే నష్టాన్ని కూడా అలక్ష్యం చేయకూడదు. గత 1984లో భారతీయ నగరమైన భోపాల్లో జరిగిన సంగతిని గురించి ఆలోచించండి, అక్కడ విషవాయువు 2,500 కంటే ఎక్కువమంది స్త్రీ పురుషులనూ పిల్లలనూ హతమార్చి, లక్షలాది మందికి హాని కలిగించింది. ది సండే టైమ్స్ ఇలా నివేదించింది: “బాధితులకు సహాయం చేసేందుకు ఏర్పాటు చేయబడిన సహాయక స్కీములు అవినీతిలో కూరుకుపోయాయి. . . . బోగస్ దావాలు, కల్పిత ప్రమాణ పత్రాలు మరియు నకిలీ సాక్ష్యాలు వేల సంఖ్యలో ఉండటం మూలాన న్యాయసమ్మతమైన కేసులను సరి చూడటమనే పని మరింత సంక్లిష్టమయ్యింది.” దాని ఫలితంగా, పది సంవత్సరాల తర్వాత, అవసరతలో ఉన్న వారికి కలిగిన రూ. 1,645 కోట్ల (16.45 అరబ్) నష్టంలో కేవలం రూ. 12.25 కోట్ల నష్ట పరిహారమే చెల్లించబడింది.
మతం సంగతేమిటి? యథార్థతకు సంబంధించిన ఈ విషయంలో దాని పరిస్థితి ఎలా ఉంది? దుఃఖకరమైన విషయమేమిటంటే, ఇక్కడి ప్రమాణాలు కూడా లౌకిక ప్రపంచంలో వలెనే ఉన్నాయి. ఉదాహరణకు, ఇప్పుడు కౌమార దశలో ఉన్న ఒక అబ్బాయికి అక్రమంగా తానే తండ్రిననే విషయాన్ని ఒప్పుకున్న ఒక రోమన్ కాథోలిక్ బిషప్ అయిన ఏమన్ కేసీ విషయాన్ని పరిశీలించండి. బ్రిటన్కు చెందిన వార్తాపత్రికైన గార్డియన్ సూచించిన విధంగా కేసీ పరిస్థితి, “ఎంత మాత్రం అసాధారణమైనది కాదు.” అదే విధంగా, ది టైమ్స్ ఇలా నివేదిస్తుంది: “బిషప్ కేసీ యొక్క అవమానకర సంఘటనను గురించిన వాస్తవం ఏమిటంటే, అతడి నీచమైన కార్యం ప్రత్యేకమైనదన్నది కాదు, అయితే అవివాహితులుగా ఉండడం విషయంలో మోసగించడం క్రొత్తదీ కాదు లేదా అరుదైనదీ కాదు.” ఈ వాదనకు మద్దతునిస్తూ, అమెరికాలోని రోమన్ కాథోలిక్ మత నాయకుల్లో కేవలం 2 శాతం మందే భిన్నలింగ మరియు స్వలింగ సంబంధాలను విసర్జించారని స్కాట్లాండ్కు చెందిన ది గ్లాస్గో హెరాల్డ్ చెబుతుంది. ఈ సంఖ్య కచ్చితమైనదైనా కాకపోయినా, నైతికత విషయంలో కాథోలిక్ ప్రీస్టులకున్న అపఖ్యాతిని అది సూచిస్తుంది.
అలాంటి ఉదాహరణల మధ్య, ఒక వ్యక్తి నైతిక యథార్థతను కాపాడుకోవడం సాధ్యమేనా? అలా చేయడం యోగ్యమేనా? అలా చేసేందుకు ఏమి కావాలి మరియు అలా చేయడం యొక్క ప్రతిఫలాలేమిటి?