“ట్రైయర్ పరిశుద్ధ వస్త్రం”
రెండు వేల సంవత్సరాల చరిత్రగల ట్రైయర్, జర్మనీలోని అతి ప్రాచీన నగరం.a శతాబ్దాలపాటు ట్రైయర్కు కాథోలిక్ చర్చితో సుస్థిరమైన సంబంధాలుండేవి. 1996లో ట్రైయర్ నందలి కథీడ్రల్లో వస్త్రధాతువును ప్రదర్శనకు పెట్టింది. అది దాదాపు ఆ నగరమెంత పురాతనమైనదో అంత పురాతనమైనది. అది ట్రైయర్ పరిశుద్ధ వస్త్రం అని పిలువబడుతుంది.
ఆ వస్త్రం 1.57 మీటర్ల పొడవు, 1.09 మీటర్ల వెడల్పు ఉండి, పొట్టి చేతులు కలిగివుంది. అది నూలుతో చేయబడినది, వాల్పార్ట్స్ఫూరర్ ట్రైయర్ అండ్ ఉమ్గేబంగ్ (ట్రైయర్ మరియు దాని పరిసరాల యాత్రా గైడు) అనే తన పుస్తకంలో హాన్స్-యోయాకీమ్ కాన్ తెలియజేసినదాని ప్రకారంగా బహుశా దాన్ని పై వస్త్రంగా ధరించి ఉండవచ్చు. ఈ వస్త్రం సా.శ. రెండవ శతాబ్దానికి చెందినదనీ లేక మొదటి శతాబ్దానికి చెందినదనీ కొందరు అంచనా వేస్తున్నారు, శతాబ్దాలు గడుస్తుండగా ఈ వస్త్రంలోని అధిక భాగం బాగుచేయబడి, దానికి ఇతర విధాలైన నూలు చేర్చడం జరిగింది. ఒకవేళ అదే నిజమైతే, అది దాన్ని ఒక అరుదైన వస్త్రంగా, ఆసక్తికరమైన ప్రదర్శనా వస్తువుగా చేస్తుంది.
అయితే, కొందరు ఆ వస్త్రం అరుదైనది మాత్రమే కాదుగాని అది పరిశుద్ధమైనదని కూడా అంటారు, అందుకే పరిశుద్ధ వస్త్రం అని దానికి పేరు. ఇలా ఎందుకు పిలువబడిందంటే, అది యేసు క్రీస్తు ధరించిన అంగీలా కుట్టులేనిది. (యోహాను 19:23, 24) “పరిశుద్ధ వస్త్రం” వాస్తవంగా మెస్సీయకు చెందినదేనని కొందరు అంటారు.
ఆ వస్త్రం ట్రైయర్కు ఎలా వచ్చిందనేది సందేహాస్పదమైన విషయం. దాన్ని “కాన్స్టంటైన్ ది గ్రేట్ తల్లియైన హెలెనా చక్రవర్తిని ఆ నగరానికి బహుకరించిందని” ఉపయుక్త గ్రంథమొకటి తెలియజేస్తుంది. ట్రైయర్లో జుబ్బా ఉనికిని గూర్చిన విశ్వసనీయమైన మొదటి నివేదిక 1196 నుండే ఉందని కాన్ తెలియజేస్తున్నాడు.
కథీడ్రల్లో భద్రపర్చబడిన కోటు 16వ శతాబ్దం నుండి క్రమరహితంగా అప్పుడప్పుడూ ప్రదర్శించబడేది. ఉదాహరణకు, ఆ ప్రదర్శన 1655లో అంటే ముప్ఫై సంవత్సరాల యుద్ధం జరిగిన కొంతకాలానికే జరిగింది, ఆ యుద్ధం వల్ల ట్రైయర్ ఎంతో మూల్యం చెల్లించవలసి వచ్చింది. యాత్రా చిహ్నాల అమ్మకం అప్పుడప్పుడూ ఎంతో రాబడి వచ్చేలా చేసింది.
ఈ శతాబ్దంలో “పరిశుద్ధ వస్త్ర” తీర్థయాత్రలు మూడు జరిగాయి, అంటే 1933లోనూ, 1959లోనూ, 1996లోనూ అవి జరిగాయి. 1933లో జర్మన్ రైక్కు హిట్లర్ ఛాన్సలర్గా నియమింపబడిన దినాన్నే తీర్థయాత్ర కూడా ప్రకటించబడింది. కాకతాళీయంగా ఈ రెండు సంఘటనలు ఒకే తేదీన జరగడం, యాత్రా స్థలం పరిసర ప్రాంతాల్లోవున్న పరిస్థితులను ఉన్నతపరుస్తుందని కాన్ తెలియజేస్తున్నాడు. యూనిఫారమ్ ధరించిన నాజీ సైన్యాలు కథీడ్రల్ వెలుపల యాత్రికులకు సైనిక వందనం ఏర్పాటు చేశాయి. ఆ సంవత్సరం రెండున్నర కోట్లమంది ఆ వస్త్రాన్ని చూశారు.
అనేక సంవత్సరాలుగా ట్రైయర్ నగరంలో నివసిస్తున్న హెర్బర్ట్ 1959లోనూ 1996లోనూ జరిగిన తీర్థయాత్రలను ఒకదానితో మరోదాన్ని పోల్చాడు. “1959లో జనంతోనూ, దాదాపు ప్రతి వీధి సందులోనూ చిహ్నాలను అమ్మే దుకాణాలతోనూ వీధులు కిటకిటలాడాయి. ఈ సంవత్సరం మొత్తం వేడుకంతా చాలా నిస్తేజంగా ఉంది.” నిజానికి 1996లో ఆ వస్త్రాన్ని కేవలం 7,00,000 మందే చూశారు, అంటే 1959 నాటి సంఖ్యకంటే పది లక్షలు తక్కువ.
వారు వస్త్రాన్ని చూడడానికి ఎందుకు వెళతారు?
వస్త్రాన్ని ఆరాధనా వస్తువుగా చూడకూడదని చర్చి నొక్కి చెబుతుంది. కుట్టులేని అంగీ చర్చి ఐక్యతకు చిహ్నంగా పరిగణింపబడుతుంది. తీర్థయాత్ర గురించి ప్రకటించేటప్పుడు బిషప్ స్పీటల్ ఇలా చెప్పాడని ఫ్రాంక్ఫర్టర్ ఆలగెమైన్ సైటుంగ్ నివేదిస్తోంది: “మన ప్రపంచంలోని అసాధారణ పరిస్థితి, క్రైస్తవులమైన మనం అసాధారణ సమాధానాలు కలిగివుండేలా మనల్ని రెచ్చగొడుతోంది. ఉద్ధృతమౌతున్న ద్వేషం, క్రూరత్వం, హింసా వెల్లువను తట్టుకొని నిలబడాలి.” వస్త్రాన్ని చూడడం ఒకరికి ఐక్యతను జ్ఞాపకం చేస్తుందని బిషప్ వివరించాడు.
కాని చర్చి ఐక్యతను జ్ఞాపకం చేయడానికి ఎవరికైనా “పరిశుద్ధ వస్త్రం” ఎందుకవసరము? ఆ వస్త్రం పాడైపోతే లేక చింకిపోతే లేక నకలీ వస్త్రమని నిరూపించబడితే అప్పుడేమిటి? అప్పుడు చర్చి ఐక్యత ప్రమాదంలో పడుతుందా? ట్రైయర్కు తీర్థయాత్రకు వెళ్లలేని ప్రజల మాటేమిటి? వారు చర్చి ఐక్యత గురించి అంత శ్రద్ధలేనివారా?
క్రైస్తవ ఐక్యతా అవసరత గురించి గుర్తు చేయడానికి తొలి క్రైస్తవులకు వస్తువులు అవసరమైనట్లు పరిశుద్ధ లేఖనాలు తెలియజేయడం లేదు. వాస్తవానికి, అపొస్తలుడైన పౌలు ఈ మాటలతో క్రైస్తవులను ప్రోత్సహించాడు: “వెలి చూపువలనకాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నాము.” (2 కొరింథీయులు 5:7) అందుకే నిజ క్రైస్తవులు ఆనందించే ఐక్యత ‘విశ్వాసము విషయంలో ఏకత్వము’ అని వర్ణించబడింది.—ఎఫెసీయులు 4:11-13.
[అధస్సూచీలు]
a తేజరిల్లు! (ఆంగ్లం) ఏప్రిల్ 22, 1980, సంచికలోని 21-3 పేజీలను చూడండి.