ఉపవాసానికి కాలం చెల్లిందా?
“నేను యౌవనారంభంలో ఉన్నప్పటినుండి ప్రతి సోమవారం ఉపవాసం ఉంటున్నాను” అని మృదులాబెన్ అనే సంపన్నురాలైన 78 సంవత్సరాల భారతీయ స్త్రీ చెబుతుంది. అది ఆమె ఆరాధనలో ఒక భాగమై ఉండినది, తనకు చక్కని వైవాహిక జీవితం, ఆరోగ్యవంతులైన పిల్లలు ఉండేలా చూసుకునేందుకు అలాగే తన భర్త రక్షణ కొరకు అదొక మార్గం. ఇప్పుడామె ఒక విధవరాలు, మంచి ఆరోగ్యం కొరకు, తన పిల్లల సౌభాగ్యం కొరకు ఆమె ఇప్పుడు కూడా సోమవారాల్లో ఉపవాసం ఉంటూనే ఉంది. ఆమెలాగే, అత్యధికమంది హిందూ స్త్రీలు ఉపవాసం ఉండటాన్ని తమ జీవితంలో ఒక క్రమమైన భాగంగా చేసుకుంటారు.
ప్రతి సంవత్సరం సావన్లోని (శ్రావణ మాసం) ప్రతి సోమవారం తాను ఉపవాసం ఉంటానని, భారత దేశంలోని ముంబై (బాంబే) శివార్లలో నివసించే మధ్యవయస్కుడైన వ్యాపారవేత్తయగు ప్రకాశ్ చెబుతున్నాడు. హిందూ క్యాలెండర్లో ప్రత్యేక మతపర ప్రాముఖ్యతగల మాసం ఇది. ప్రకాశ్ ఇలా వివరిస్తున్నాడు: “నేను మతపర కారణాలనుబట్టి ప్రారంభించాను కానీ, ఇప్పుడు ఆరోగ్య కారణాలనుబట్టి దాన్ని కొనసాగించవలసిన అదనపు ప్రేరణను నేను కనుగొన్నాను. సావన్ వర్షాకాలం చివరిభాగంలో వస్తుంది గనుక ప్రాముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాలనుండి నా అవయవ నిర్మాణం శుభ్రం చేసుకునే అవకాశాన్ని దానికిస్తుంది.”
ఉపవాసం ఉండటం ఒక వ్యక్తికి భౌతికంగా, మానసికంగా మరియు ఆత్మీయంగా సహాయం చేస్తుందని కొందరు భావిస్తారు. ఉదాహరణకు, గ్రోల్యె ఇంటర్నేషనల్ ఎన్సైక్లోపీడియా ఇలా పేర్కొంటుంది: “ఉపవాసం ఉండటం ఆరోగ్యకరంగా ఉంచుతుంది, మరి దాని విషయంలో జాగ్రత్తవహిస్తే అత్యధిక మానసిక చురుకుదనాన్ని మరియు సహేతుకతను ఇవ్వగలదని ఇటీవలి వైజ్ఞానిక పరిశోధనలు సూచిస్తున్నాయి.” గ్రీకు తత్వవేత్తయైన ప్లాటో పది దినాలు లేక అంతకంటే ఎక్కువకాలం ఉపవాసముంటాడని, గణిత శాస్త్రజ్ఞుడైన పైతాగరస్ తన శిష్యులకు బోధించే ముందు వాళ్ల చేత ఉపవాసం చేయించేవాడని చెప్పబడుతోంది.
కొందరి దృష్టిలో, ఉపవాసమంటే ఒక నిర్దిష్ట సమయం వరకూ ఆహారాన్ని, నీటిని పూర్తిగా మానుకోవడమని అర్థం, అయితే ఇతరులు తాము ఉపవాసం ఉన్నప్పుడు ద్రవ పదార్థాలను తీసుకుంటారు. కొన్ని పూటల్లో తినకపోవడం లేక ప్రత్యేక విధమైన ఆహారాన్ని తినకుండా ఉండటం ఉపవాసమని అనేకులు భావిస్తారు. అయితే ఎక్కువ కాలం వరకు పర్యవేక్షణ లేకుండా ఉపవాసం ఉండటం ప్రమాదకరంకాగలదు. శరీరం తన పిండి పదార్థాల నిల్వనంతటినీ ఉపయోగించుకున్న తర్వాత, అది కండరాల పోషకాలను గ్లూకోస్గా మార్చుతుంది, తర్వాత శరీరంలోని క్రొవ్వు పదార్థాలను తీసుకుంటుంది అని పత్రికా వ్యాస రచయిత పారుల్ సేత్ చెబుతున్నాడు. క్రొవ్వును గ్లూకోస్గా మార్చడం కీటోన్ దేహాలని పిలువబడే విషపూరిత ఉత్పాదకాలను విడుదల చేస్తుంది. ఇవి సమకూడుతుండగా, అవి కేంద్ర నాడీ మండలానికి హాని కలిగిస్తూ మెదడు వైపుకి కదలుతాయి. “అలాంటప్పుడు ఉపవాసం ఉండటం ప్రమాదకరంగా మారగలదు. మీకు అయోమయం, మగత కలుగవచ్చు, పరిస్థితి అంతకన్నా హీనమవ్వవచ్చు. . . . కోమాను, చివరకు మరణాన్ని కూడా [అది కలిగించగలదు]” అని సేత్ చెబుతున్నాడు.
ఒక సాధనం మరియు ఓ ఆచారం
ఉపవాసం రాజకీయ లేక సాంఘీక ప్రయోజనాలకు ఎంతో శక్తివంతమైన పని ముట్టుగా ఉపయోగించబడింది. భారత దేశంలోని మోహన్దాస్ కె. గాంధీ ఈ అస్త్రాన్ని ఉపయోగించిన ఓ ప్రముఖుడు. కోట్లాదిమంది ప్రజలచే కొనియాడబడే ఈయన, భారత దేశంలోని హిందూ ప్రజానికంపై పటిష్టమైన ప్రభావాన్ని కనపర్చేందుకు ఉపవాసాన్ని ఉపయోగించాడు. మిల్లు కార్మికులు మరియు మిల్లు యజమానుల మధ్య చెలరేగిన పారిశ్రామిక వివాదాన్ని పరిష్కరించేందుకు తాను చేసిన ఉపవాసం యొక్క ఫలితాన్ని వర్ణిస్తూ గాంధీ ఇలా చెప్పాడు: “దాని ముఖ్య ఫలితమేమంటే అందులో ఇమిడి ఉన్న వారందరిలో అది మంచి భావాన్ని నింపింది. మిల్లు యజమానుల హృదయాలు చలించాయి . . . నేను కేవలం మూడు దినాలు ఉపవాసం ఉండగానే సమ్మె నిలిపివేయబడింది.” దక్షిణాఫ్రికా అధ్యక్షుడైన నెల్సన్ మండేలా తాను రాజకీయ ఖైదీగా ఉన్న సంవత్సరాల్లో ఐదు దినాలు నిరాహారదీక్షలో పాల్గొన్నాడు.
అయితే ఉపవాసం ఉండటాన్ని అలవాటుగా చేసుకున్న వారిలో అనేకులు దాన్ని మతపరమైన కారణాలనుబట్టి అలా చేశారు. ఉపవాసం ఉండటం హిందూ మతంలోని ప్రధాన ఆచారం. కొన్ని ప్రత్యేక దినాల్లో, “పూర్తిగా ఉపవాసం ఉండటం జరుగుతుంది . . . కనీసం నీళ్లు కూడా త్రాగరు. తప్పులు, పాపాల క్షమాపణ మరియు సంతోషం, సౌభాగ్యం తప్పక లభించాలని . . . స్త్రీపురుషులు ఇరువురూ కఠిన ఉపవాసం చేస్తారు” అని ఫాస్ట్ అండ్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం పేర్కొంటుంది.
జైన్ మతంలో చాలా తరచుగా ఉపవాసం ఉండటం జరుగుతుంది. ద సండే టైమ్స్ ఆఫ్ ఇండియా రివ్యూ ఇలా నివేదిస్తుంది: “బాంబేలోని [ముంబై] ఒక జైన్ ముని [ఋషి] 201 దినాల వరకూ కేవలం రెండు గ్లాసుల కాచిన నీళ్లు మాత్రమే త్రాగాడు. అతను 33 కిలోల [73 lb] బరువు తగ్గాడు.” కొందరు మరణించేంత వరకూ పస్తులుంటూ ఉపవాసం చేస్తారు, అది వారికి మోక్షాన్ని తెస్తుందని వారి నమ్మకం.
ఇస్లాం మతాన్ని సాధారణంగా అనుసరించే పెద్దలందరూ రంజాన్ నెలలో ఉపవాసం చేయడం తప్పనిసరి. ఆ నెలంతటిలోనూ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకూ ఏ విధమైన ఆహారం లేక నీళ్లు తీసుకోకూడదు. ఈ కాలంలో అనారోగ్యంగా ఉన్నవారు లేక ప్రయాణిస్తున్నవారు వేరే సమయంలో ఉపవాసం చేయాల్సి ఉంటుంది. ఈస్టర్కు ముందు ఉండే 40 దినాలైన లెంట్, క్రైస్తవ మత సామ్రాజ్యంలోని కొందరు ఉపవాసం చేసే సమయం, మరి అనేక మత విభాగాలు ఇతర ప్రత్యేక దినాల్లో ఉపవాసం ఉంటాయి.
కాబట్టి ఉపవాసం ఉండటం అంతరించిపోలేదు. అది అనేక మతాల్లో ఒక భాగం గనుక, ఉపవాసం ఉండాలని దేవుడు కోరుతున్నాడా? అని మనం అడుగవచ్చు. క్రైస్తవులు ఉపవాసం ఉండేందుకు నిర్ణయించుకునే సందర్భాలు ఉన్నాయా? ఇది ప్రయోజనకరంగా ఉండగలదా? తదుపరి శీర్షిక ఈ ప్రశ్నలను చర్చిస్తుంది.
[3వ పేజీలోని చిత్రం]
జైన్ మతం ఉపవాసాన్ని ప్రాణమునకు మోక్షాన్ని సాధించి పెట్టే మార్గంగా దృష్టిస్తుంది
[4వ పేజీలోని చిత్రం]
మోహన్దాస్ కె. గాంధీ ఉపవాసాన్ని రాజకీయ లేక సాంఘీక అవసరాలకు ఎంతో శక్తివంతమైన పని ముట్టుగా ఉపయోగించాడు
[4వ పేజీలోని చిత్రం]
ఇస్లాంలో, రంజాన్ నెలలో ఉపవాసం ఉండటం తప్పనిసరి
[క్రెడిట్ లైను]
Garo Nalbandian