రాజ్య ప్రచారకుల నివేదిక
రాజ్య సువార్త ప్రకటింపబడును
దేవుని ప్రధాన శత్రువైన అపవాదియగు సాతాను శతాబ్దాలుగా, నిజ క్రైస్తవత్వ వ్యాప్తిని నిరోధించే తన ప్రయత్నాలలో రాజకీయ ప్రభుత్వాలను, అబద్ధ మతాన్ని కుయుక్తిగా ఉపయోగించుకున్నాడు. కాని ఈ పద్ధతులు విఫలమవుతాయి. యేసు “రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను [“ప్రకటించబడవచ్చు” లేక “ప్రకటించబడగలదు” అని కాదుగాని] ప్రకటింప బడును” అని ప్రవచించాడు.—మత్తయి 24:14.
గ్రీసులో సాతాను వైఫల్యం స్పష్టంగా రుజువయ్యింది. ఆ దేశంలో యెహోవాసాక్షులు రాజ్య సువార్తను ప్రకటించకుండా నిరోధించేందుకు గ్రీకు ఆర్థడాక్స్ చర్చీ ప్రయత్నించింది. కాని, ఈ క్రింది అనుభవం ఉన్నత పరుస్తున్నట్లుగా, వ్యతిరేకత ఉన్నప్పటికీ, తగిన సమయంలో బైబిలు సత్యాలు యథార్థ హృదయులను చేరుతాయి.
దాదాపు 30 సంవత్సరాల క్రితం, గ్రీకు ఆర్థడాక్స్ మతాచార్యుడు సువార్తను అంగీకరించి, యెహోవా సాక్షులలో ఒకరవ్వాలనే కోరికను కూడా వ్యక్తం చేశాడు. అయినా, అతని ఈ చర్యను అతని బంధువులు బలంగా వ్యతిరేకించి, సాక్షులతో తన సహవాసాన్ని మానుకునే వరకు అతన్ని వత్తిడి చేశారు. తన కుటుంబాన్ని ప్రీతి పర్చడానికి అతడు మతాచార్యునిగా తన పనిని కొనసాగించాడు; అయినప్పటికీ, సత్యం తెలుసుకోడానికి యెహోవాసాక్షులు తనకు సహాయం చేశారని, అబద్ధ మతంలో ఉన్నత స్థానం కొరకు తాను దాన్ని వదులుకున్నానని అతడు ఎల్లప్పుడు గుర్తించాడు.
అయినప్పటికీ, అవకాశం వచ్చినప్పుడు ఆయన కొన్నిసార్లు యెహోవాసాక్షులకు మద్దతుగా మాట్లాడాడు. కొన్ని సందర్భాల్లో, బైబిలు సత్యాలు నేర్చుకోవాలని ఉంటే సాక్షులతో పఠనం చేయాలని కూడా అతడు ప్రజలకు చెప్పాడు. సంవత్సరాలుగా, కొంతమంది నిజంగా అతని సలహాను అనుసరించారు.
ఇటీవలెనే మతాచార్యుడు చాలా అనారోగ్యంపాలై తాను త్వరలోనే చనిపోతానని గ్రహించాడు. ఆసుపత్రిలో ఉండగా, ఆయన తన పిల్లలను పిలిపించాడు, వాళ్లందరు అయన పక్క దగ్గర సమావేశమయ్యారు.a తాను చనిపోతే, వారు ఆయనను మళ్లీ కలువగలరని ఆయన వారికి వివరించాడు. భూమి మీద పరదైసులో జీవించడానికి మానవులు యెహోవాచేత పునరుత్థానం చేయబడతారనే బైబిలు బోధను గూర్చి ఆయన వారితో మాట్లాడాడు, కాని వారు నిజంగా అది సంభవించడం చూడాలనుకుంటే, వారు బైబిలు నుండి సత్యం నేర్చుకుని, అబద్ధ మతం నుండి తమను తాము దూరం చేసుకోవాల్సి ఉంది. యెహోవాసాక్షులతో సహవసించి, నిజమైన క్రైస్తవులుగా ఎలా తయారు కావాలో వారి యొద్ద నుండి నేర్చుకోమని ఆయన వారిని వేడుకున్నాడు.
తర్వాత కొంతకాలానికే మతాచార్యుడు మరణించాడు. అయితే, అతడు చివరిదశలో తన పిల్లలకు యిచ్చిన ఉపదేశం మంచి ఫలితాలను తెచ్చింది. అతని కుమార్తె, అతని అనేకమంది బంధువులవలెనే, యెహోవాసాక్షులను, వారి పనిని ఎంతో వ్యతిరేకించేది. కాని మరణిస్తున్న తన తండ్రి యొక్క యథార్థమైన కోరికను ఆమె నిర్లక్ష్యం చేయలేకపోయింది, కాబట్టి ఆమె త్వరలోనే యెహోవా సాక్షులను కలిసి, బైబిలు పఠించడం ప్రారంభించింది. ఇటీవలెనే ఆమె తన జీవితాన్ని యెహోవా దేవునికి సమర్పించుకొని, నీటి బాప్తిస్మం ద్వారా తన సమర్పణను సూచిస్తూ, సాక్షి అయ్యింది.
గ్రీసులో, అలాగే యితర 230 దేశాల్లో, యెహోవాసాక్షులు దేవుని పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడతారు. పరిశుద్ధాత్మ యొక్క పూర్తి మద్దతుతోనే వారు యేసు యొక్క ఈ ప్రవచన నెరవేర్పులో భాగం వహిస్తారు: “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు.”—అపొస్తలుల కార్యములు 1:8.
[అధస్సూచీలు]
a గ్రీకు ఆర్థడాక్స్ చర్చీ తమ మతాచార్యుడు వివాహం చేసుకోడాన్ని అనుమతిస్తుంది.