రాజ్య ప్రచారకుల నివేదిక
యెహోవా తన శత్రువులకంటే బలవంతుడు
సాతాను అతని దయ్యాలు అబద్ధ మతం మరియు అభిచారం ద్వారా సువార్త ప్రకటించడాన్ని ఆటంకపర్చాలని ఎంతోకాలం నుండి ప్రయత్నించారు. బైబిలు 2 కొరింథీయులు 4:4 నందు యిలా చెబుతూ సాతాను దుష్ట తలంపును గూర్చి తెలియజేస్తున్నది: “దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.”
కాని యెహోవా దేవుడు సాతాను కంటె బలవంతుడు. “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై” వుండాలనే తన దైవిక సంకల్పం నెరవేర్చబడడాన్ని ఆపుటకు యెహోవా శత్రువులు చేయగలిగినది ఏదీ లేదు. (1 తిమోతి 2:4) ఆస్ట్రేలియా నుండి వచ్చిన యీ రాజ్య ప్రచారకుల నివేదికలు దీన్ని ఉన్నతపరుస్తున్నాయి.
▫ మతంతో 20 సంవత్సరాలు సంబంధం లేకుండావున్న తరువాత, ఒక స్త్రీ మళ్లీ బైబిలు చదవడం ప్రారంభించింది. బైబిలు యెడల పునరుజ్జీవింప జేయబడిన యీ ఆసక్తి ఆమెలో అనేక ప్రశ్నలు కలిగేలా చేసింది, కాబట్టి ఆమె సమాధానాలు కనుగొనడానికి సహాయం కొరకు దేవునికి ప్రార్థించింది. ఆమెకు సత్యం కొరకు వెదకాలని వుంది, కాని తన పాత మతానికి వెళ్లడం తన సమస్యకు పరిష్కారం కాదని ఆమెకు తెలుసు. బదులుగా, ఒక పాత పుస్తకాల కొట్టుకు వెళ్లి, మతానికి సంబంధించిన పుస్తకాలు ఏవైనా వున్నాయా అని అడగడం ద్వారా ఆమె తన పరిశోధనను ప్రారంభించింది.
తన దగ్గర ఒక మతసంబంధ పుస్తకం, కొట్టులో కాదుగాని యింటివద్ద వున్నట్లు కొట్టు యజమానురాలు జ్ఞాపకం చేసుకుంది. యెహోవాసాక్షులచే ప్రచురించబడిన ఆ పుస్తకం పేరు మీరు పరదైసు భూమిపై నిరంతరం జీవించగలరు. ఆ స్త్రీ అత్యాసక్తితో ఆ పుస్తకాన్ని చదివి, తనకున్న అనేక బైబిలు ప్రశ్నలకు సమాధానాలు పొందింది. టెలిఫోన్ పుస్తకంలో యెహోవాసాక్షుల కొరకు వెదికిన తర్వాత, చివరికి ఆమె వారిని కలిసి క్రమ బైబిలు పఠనం ప్రారంభించింది.
▫ ఒక తాయత్తును అమ్మడాన్ని గూర్చిన ప్రకటన వేయించడానికి ఒక యౌవనస్థురాలు స్థానిక వార్తాపత్రిక సేవలను తీసుకుంది. ఆ ప్రకటన ‘ఎంతో శక్తివంతమైన మధ్యయుగం నాటి తాయత్తు’ అని దాని గురించి సూచించింది. ఒక యెహోవాసాక్షి ఆ ప్రకటనను గమనించింది. ఇవ్వబడిన టెలిఫోన్ నంబరుకు ఫోన్ చేసి, తాయత్తుకున్నదని చెప్పబడుతున్న శక్తికి మూలం గురించి మాట్లాడాలని ఆమె నిర్ణయించుకుంది. దయ్యాల చర్యకు సంబంధించిన బైబిలు దృష్టిని గూర్చిన చర్చ జరిగింది. కేవలం ఒకరోజు క్రితమే దయ్యాలతో తనకున్న సమస్యలకు సహాయం కొరకు తాను దేవునికి ప్రార్థించానని తాయత్తుగల ఆ యౌవనస్థురాలు తెలియజేసింది. టెలిఫోన్ ద్వారా మరోసారి చర్చించడానికి సాక్షి ఏర్పాట్లు చేసింది.
ఆమె ఫోన్ చేసినప్పుడు, ఆ యౌవనస్థురాలు యింటివద్ద లేదు. తల్లి ఫోను ఎత్తి యిలా చెప్పింది: “మీరు నా కుమార్తెకు ఏం చెప్పారో నాకు తెలియదు కాని, జరిగింది మాత్రం ఒక అద్భుతమే!” మొదటిసారి ఫోన్ చేసిన తర్వాత, తన కుమార్తె తన సాతాను సంబంధ చిత్రాలు, పుస్తకాలు అన్నీ పడేసి బైబిలు చదవడం ప్రారంభించిందని ఆమె తెలియజేసింది.
త్వరలోనే, యౌవనస్థురాలిని వ్యక్తిగతంగా కలవడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఆమె వెంటనే యెహోవాసాక్షులతో క్రమంగా బైబిలు పఠించడానికి అంగీకరించింది. వారి క్రైస్తవ కూటాలకు హాజరవ్వడం ద్వారా ఆమె సాక్షులతో సహవసించడం కూడా ప్రారంభించింది. బైబిలు సత్యాల కచ్చితమైన జ్ఞానం ప్రకాశించేలా చేయడం ద్వారా యెహోవా మరొకసారి దయ్యాలను ఓడించాడు.