రాజ్య ప్రచారకుల నివేదిక
యెహోవాను మహిమపర్చే సత్క్రియలు
కొండ మీద తన ప్రసంగంలో, యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు: “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.” (మత్తయి 5:16) అదేవిధంగా, నిజ క్రైస్తవులు నేడు యెహోవాను మహిమపర్చే “సత్క్రియల”లో పాల్గొన్నారు.
ఈ సత్క్రియలు ఏవి? వాటిలో సువార్త ప్రకటన చేరివున్నా మన మాదిరికరమైన ప్రవర్తన కూడా ఓ ప్రముఖమైన భాగం. క్రైస్తవ సంఘానికి ప్రజల్ని మొదటిగా ఆకర్షించేది తరచూ మన సత్ప్రవర్తనే. మాటిన్క్యూలో యెహోవాసాక్షులు ఎలా ‘మనుష్యుల ఎదుట తమ వెలుగును ప్రకాశింప చేస్తున్నారో’ ఈ క్రింది అనుభవాలు ఉదాహరిస్తున్నాయి.
◻ ఇంటింటి ప్రచారపనిలో పాల్గొంటుండగా, యెహోవాసాక్షులలో ఒకామె ఓ కాథోలిక్కు స్త్రీని దర్శించింది. 25 సంవత్సరాలుగా ఈ స్త్రీ పెళ్లి చేసుకోకుండా ఓ పురుషునితో కాపురం చేసింది. దాదాపు ఏడు సంవత్సరాల క్రిందట తాను మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని తీసుకున్నది, కనుక ఆమె యెహోవాసాక్షుల బోధలతో పరిచయాన్ని కల్గి ఉంది.a ఆ స్త్రీ సాక్షితో ఇలా చెప్పింది: “ఎన్నెన్నో మతాలు ఉన్నాయ్. ఈ గందరగోళం మధ్య దేన్ని నమ్మాలో నాకు తెలియదు.” సత్యాన్ని బైబిల్లో మాత్రమే కనుగొనగలమని మరి దాన్ని కనుగొనేందుకు ఆమె లేఖనాల్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలని, దేవుని ఆత్మ మరియు నడిపింపు కొరకు ఆయనకు ప్రార్థన చేయాలని ఆ సాక్షి వివరించింది.
బైబిలు పఠనమందు ఆసక్తి ఉన్నప్పటికీ, యెహోవాసాక్షుల రాజ్యమందిరంలో జరుగు క్రైస్తవ కూటాలకు హాజరవ్వమని అనేకసార్లు చేసిన ఆహ్వానాన్ని ఆ స్త్రీ కొంతకాలం వరకు తిరస్కరించింది. ఎందుకు? ఆమె ఎంతో బిడియం గలది. అయినా, క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినానికి రమ్మని ఆహ్వానించబడిన తర్వాత ఆమె తన బిడియాన్ని అధిగమించి, హాజరయ్యింది.
కూటాన్ని గురించి ఆమెను బాగా ఆకట్టుకొన్నదేమిటంటే రాజ్యమందిరంలోని ప్రేమపూర్వకమైన వాతావరణమే. తన చర్చిలో అలాంటి యథార్థమైన స్నేహబంధాన్ని ఆమె ఎన్నడూ చవి చూడలేదు! ఆ కూటం తర్వాత నుండి ఆమె స్థానిక సాక్షులచే నిర్వహించబడిన కూటాలన్నింటికీ హాజరవ్వడం ఆరంభించింది, తర్వాత తాను కలిసి జీవిస్తున్న పురుషున్ని వెంటనే వివాహం చేసుకుంది. ఆమె ఇప్పుడు సంఘంలో బాప్తిస్మం తీసుకొనిన ఓ సభ్యురాలు.
◻ మరో సాక్షి యొక్క సత్క్రియలు సత్ఫలితాల్ని ఇచ్చాయి. ఆమె ఓ కార్యాలయంలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉంది. కూలి పనికి రియూనియన్ ద్వీపం నుండి ఒక వ్యక్తిని రప్పించిన తర్వాత, కొంతమంది పనివారు అతడు పొట్టిగా ఉన్నాడని అతడిని వెక్కిరించడం ఆరంభించారు. అతడో నవ్వులాట అయ్యాడు. అలాకాకుండా, ఆ సాక్షి అతడి విషయంలో ఎల్లప్పుడూ దయగానూ గౌరవపూర్వకంగానూ ఉంది. త్వరలోనే అతడు, ఆమె ఎందుకింత భిన్నంగావుందని అడిగాడు.
తన గౌరవపూర్వకమైన ప్రవర్తన తాను యెహోవాసాక్షుల నుండి నేర్చుకొనిన బైబిలు సూత్రాల ఫలితమేనని ఆమె వివరించింది. దేవుని సంకల్పాల్ని గురించి మరి క్రొత్త లోక నిరీక్షణను గురించి లేఖనాలు తెలియజేస్తున్న దానిని ఆమె అతనికి చూపింది కూడా. ఆ వ్యక్తి బైబిలు పఠనాన్ని అంగీకరించి, క్రైస్తవ కూటాలకు హాజరవ్వడం ఆరంభించాడు మరియు తనతో కలిసి జీవిస్తున్న స్త్రీని వివాహం చేసుకున్నాడు.
చివరకు అతడు రియూనియన్కు తిరిగి వెళ్లాడు. గతంలో అతడు తన బంధువులతో, విశేషంగా తన భార్య తరపు కుటుంబానికి చెందిన బంధువులతో ఇబ్బందుల్ని అనుభవించాడు. అయితే ఇప్పుడు వారు అతని శ్రేష్ఠమైన క్రైస్తవ ప్రవర్తననుబట్టి ముగ్ధులయ్యారు. ఆ వ్యక్తి బాప్తిస్మం పొందాడు మరియు ప్రస్తుతం పరిచర్య సేవకునిగా ఉన్నాడు. తన భార్య మరియు ఇద్దరు కుమార్తెలతోపాటు ఆ కుటుంబంలోని అనేకమంది సభ్యులు, దేవుని రాజ్య సువార్త ప్రచారకులుగా క్రైస్తవ సంఘంలో సేవిస్తున్నారు కూడా.
[అధస్సూచీలు]
a వాచ్టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ప్రచురించింది.