పాఠకుల ప్రశ్నలు
యేసు, యెష్షయి దావీదుల వంశం నుండి వచ్చాడు కనుక, ఆయన తన పితరులైన యెష్షయి దావీదులకు “వేరు” అని ఎందుకు పిలువబడ్డాడు?
మొక్కకు లేక చెట్టుకున్న వేరు, మొద్దు లేక కొమ్మలకు ముందు వచ్చేదని సహజంగా మీరు అనుకోవచ్చు. అందుచేత కాలక్రమంలో యేసు ఉద్భవించడానికి కారణభూతుడైన యెష్షయిని (లేక ఆయన కుమారుడైన దావీదును) వేరు అని పిలవవచ్చని అనిపించవచ్చు. అయినప్పటికీ, రాబోయే మెస్సియా “యెష్షయి వేరు” అని యెషయా 11:10 ప్రవచించింది, రోమీయులు 15:12 ఈ ప్రవచనాన్ని యేసుక్రీస్తుకు అన్వయించింది. ఆ తర్వాత, ప్రకటన 5:5 ఆయనను గూర్చి “దావీదుకు వేరైన యూదా గోత్రపు సింహము’ అని పేర్కొంది. ఇలా పేర్కొనడానికి కారణాలున్నాయి.
బైబిలు తరచూ మొక్కను, అంటే ఓ వృక్షం వంటి దాన్ని ఉపమాన రీతిగా ఉపయోగిస్తుంది. ఒక విత్తనం మొలకెత్తి పెరుగుతుండగా, దాని కొమ్మలకు లేక ఫలాలకన్నిటికీ ఆధారాన్నిస్తూ రెమ్మల కంటే ముందుగా వేర్లు పెరుగుతాయన్న వాస్తవం నుండి కొన్నిసార్లు యిది తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు, యెషయా 37:31లో యిలా ఉంది: “యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును.”—యోబు 14:8, 9; యెషయా 14:29.
వేరుకు హానికలిగితే, మిగతా వృక్షం దాని ప్రభావాన్ని అనుభవిస్తుంది. (మత్తయి 3:10; 13:6 పోల్చండి.) అందుకు పొందికగా, మలాకీ యిలా రాశాడు: “నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలమి కాలునట్లు అది కాలును . . . వేరైనను చిగురైనను లేకుండ . . . కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (మలాకీ 4:1) దాని భావం స్పష్టంగా ఉంది అంటే, సమూల నాశనం. తలిదండ్రులు (వేర్లు) అలాగే వారి సంతానము కూడా (కొమ్మలు)a నాశనమైపోతారు. ఇది, తలిదండ్రులకు తమ మైనరు పిల్లల యెడల గల బాధ్యతను నొక్కి చెబుతుంది; మైనరు పిల్లల శాశ్వత భవిష్యత్తు దేవుని యెదుటగల తమ తలిదండ్రుల స్థానాన్ని బట్టి నిర్ణయించబడుతుంది.—1 కొరింథీయులు 7:14.
యెషయా 37:31, మలాకీ 4:1 నందలి భాష, వేర్ల నుండి కొమ్మలు (రెమ్మలపైని పండ్లు) జీవాన్ని పొందుతాయనే వాస్తవం నుండి తీసుకోబడింది. ఇది, యేసు “యెష్షయి వేరు,” ‘దావీదు వేరు’ ఎలా అవుతాడో అర్థంచేసుకోవడానికి కీలకమైంది.
భౌతికంగా, యెష్షయి, దావీదు యేసు పితరులు; వారు వేర్లు, ఆయన కొమ్మ లేక చిన్న కొమ్మ. యెషయా 11:1 ఆయన రాకడను గూర్చి యిలా చెప్పింది: “యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును.” అదే విధంగా, ప్రకటన 22:16లో యేసు తనను గూర్చి తాను “దావీదు . . . సంతానము” అని చెప్పుకున్నాడు. అయితే ఆయన తాను ‘దావీదు వేరు చిగురును’ అని కూడా పేర్కొన్నాడు. ఎందుకు?
ఒక విధంగా యేసు యెష్షయి, దావీదుల “వేరు” అంటే తన ద్వారా వారి వంశ క్రమం సహజంగా నిలుస్తుందని దాని భావం. నేడు ఏ మానవుడూ తాను లేవీ, దాను, లేక యూదా వంశస్థుడని నిరూపించుకోలేడు, కానీ యెష్షయి, దావీదుల వంశం నిలిచి ఉందని చెప్పవచ్చు దానికి కారణం, యేసు పరలోకంలో యింకా జీవించే ఉన్నాడు.—మత్తయి 1:1-16; రోమీయులు 6:9.
యేసు పరలోక రాజుగా కూడా అధికారాన్ని పొందాడు. (లూకా 1:32, 33; 19:12, 15; 1 కొరింథీయులు 15:25) అది ఆయన పితరులకు కూడా వర్తిస్తుంది. ప్రవచనార్థకంగా, దావీదు యేసును తన ప్రభువు అని పిలిచాడు.—కీర్తన 110:1; అపొస్తలుల కార్యములు 2:34-36.
చివరిగా, యేసుక్రీస్తు ఓ న్యాయాధిపతి అధికారాన్ని పొందాడు. రాబోయే వెయ్యేండ్ల పరిపాలనలో యేసు విమోచన క్రయధన ప్రయోజనాలు యెష్షయికి దావీదుకు కూడా అందించబడతాయి. అప్పుడు భూమిపై వారి జీవితం యేసుపై ఆధారపడి ఉంటుంది, ఆయన “నిత్యుడగు తండ్రిగా” ఉంటాడు.—యెషయా 9:6.
కాబట్టి యేసు, యెష్షయి దావీదుల వంశం నుండి వచ్చినప్పటికీ, ఆయన యిప్పుడు ఏమైయున్నాడు, భవిష్యత్తులో ఆయన ఏమి చేయబోతున్నాడు అన్నవి, ఆయనను “యెష్షయి వేరు,” ‘దావీదు వేరు’ అని పిలువడానికి అర్హుణ్ణి చేస్తాయి.
[అధస్సూచీలు]
a ఒక పురాతన ఫోనీసియా ప్రాంతంలో సమాధిపై రాసే రాతల్లో కూడా యిలాంటి భాషయే ఉపయోగించబడింది. సమాధి స్థలాన్ని తెరిచే వారిని గూర్చి అది యిలా చెబుతుంది: “క్రింద వేర్లుగానీ పైన ఫలాలుగానీ వారికి ఉండకుండుగాక!”—వెస్టస్ టెస్టమెన్టమ్, ఏప్రిల్ 1961.
[31వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.