బైబిలు చరిత్ర ఎంత ప్రామాణికమైంది?
యువకుడైన తన స్నేహితునితో, “నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు” అని ఒక బైబిలు రచయిత అన్నాడు. (1 తిమోతి 2:7) పౌలు లేఖల్లోని అలాంటి మాటలు బైబిలు విమర్శకులకు సవాలు విసురుచున్నవి.a పౌలు ఆ లేఖలు వ్రాసి దాదాపు 1,900 సంవత్సరాలకు పైగా అయ్యింది. ఈ కాలమంతటిలో, ఆయన లేఖల్లో ఫలాని అంశం అప్రామాణికమని ఏ ఒక్కరూ ముందుకువచ్చి నిరూపించలేకపోయారు.
ప్రామాణికంగా వ్రాయడం విషయంలో బైబిలు రచయితయగు లూకా కూడ శ్రద్ధ కనబర్చాడు. యేసు జీవితాన్ని, ఆయన పరిచర్య వృత్తాంతాన్ని, దీని తర్వాతి పుస్తకమగు అపొస్తలుల కార్యములను ఆయన వ్రాశాడు. “మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న . . . వాటినిగూర్చి వరుసగా” రచించితినని లూకా వ్రాశాడు.—లూకా 1:3.
ప్రామాణికత్వపు రుజువులు
పందొమ్మిదవ శతాబ్దపు తొలిభాగమందలి బైబిలు విమర్శకులు చరిత్రకారునిగా లూకా ప్రామాణికత్వాన్ని సవాలు చేశారు. అంతేకాదు, అపొస్తలుల కార్యములందలి చరిత్ర సా.శ. రెండవ శతాబ్దపు అర్ధభాగంలో కల్పించబడిందని కూడ వారు ఆరోపించారు. ఇలా నమ్మిన వారిలో బ్రిటీషు పురావస్తు శాస్త్రజ్ఞుడైన సర్ విలియమ్ మిచెల్ రామ్సె ఒకరు. అయితే లూకా వ్రాసిన పేర్లను, స్థలాలను పరిశోధించిన తర్వాత, ఆయనిలా అంగీకరించాడు: “వివిధ వివరములందు ఆ వృత్తాంతము అత్యద్భుతమైన సత్యాన్ని చూపిందని నేను క్రమేపి గ్రహించగల్గాను.”
రామ్సె పైవాక్యాన్ని వ్రాసేప్పటికి, లూకా ప్రామాణికత్వాన్ని గూర్చిన ఒక వివాదము ఇంకనూ అపరిష్కృతంగా ఉండెను. అది దగ్గర సంబంధమున్న పట్టణములగు ఈకొనియ, లుస్త్ర, దెర్బేలకు సంబంధించినదై యుండెను. లుస్త్ర, దెర్బేలకు ఈకొనియ ప్రత్యేకంగా ఉందనే భావాన్నిస్తూ, ఆ రెండు పట్టణాలు “లుకయొనియలోని పట్టణములు” అని లూకా వర్ణించాడు. (అపొస్తలుల కార్యములు 14:6) అయిననూ, ఇందలి చిత్రం చూపినట్లు, దెర్బేకంటే లుస్త్ర ఈకొనియకు దగ్గరగా ఉండెను. కొంతమంది ప్రాచీనకాల చరిత్రకారులు ఈకొనియ లుకయొనియలో భాగమై యుండెనని వివరించారు; కాబట్టి, అలా వ్రాయనందుకు కూడ విమర్శకులు లూకాను దుయ్యబట్టారు.
ఆ పిమ్మట, 1910లో రామ్సె ఈకొనియ పట్టణ శిధిలాల్లో లుకయొనియన్ భాషలో కాదుగాని ఫ్రిజియన్ భాషలో వ్రాయబడిన ఒక శిలాఫలకాన్ని కనుగొన్నాడు. ఆర్కియాలజీ అండ్ ది న్యూ టెస్ట్మెంట్ అనే తన పుస్తకంలో డా. మెరిల్ ఎనెర్ యిలా అంటున్నాడు: “ఈకొనియ దాని చుట్టుపట్ల ప్రాంతమందు లభించిన లిఖిత శిలాఫలకాల్లో అనేకం ఆ పట్టణాన్ని జాతిపరంగా ఫ్రిజియన్ అని వర్ణించవచ్చుననే వాస్తవాన్ని బలపరుస్తున్నవి.” నిజమే, పౌలు కాలమందలి ఈకొనియ ఫ్రిజియన్ సంస్కృతిని కలిగియుండి “లుకయొనియ భాషలో” మాట్లాడే ప్రజలుగల “లుకయొనియ పట్టణములకు” ప్రత్యేకంగా యుండెను.—అపొస్తలుల కార్యములు 14:6, 11.
లూకా థెస్సలొనీక పట్టణ పాలకులనుద్దేశించి “అధికారుల”నే పదాన్ని ఉపయోగించడాన్ని కూడ బైబిలు విమర్శకులు ప్రశ్నించారు. (అపొస్తలుల కార్యములు 17:6, అథస్సూచి NW) ఈ పదం గ్రీకు సాహిత్యమందు కనబడదు. పిమ్మట ఆ ప్రాచీన పట్టణమందు కనుగొనబడిన కమాను మీద “పొలిటార్చెస్”—కచ్చితంగా లూకా వ్రాసిన పదాన్నే—వర్ణిస్తూ ఆ పట్టణ పాలకుల పేర్లు వ్రాయబడియుండెను. “ఆ పద ప్రయోగము ద్వారా లూకా వృత్తాంత ప్రామాణికత్వము ఘనపర్చబడింది” అని డబ్ల్యు. ఇ. వైన్ తన గ్రంథమగు ఎక్స్పొజిటరీ డిక్షనరీ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్ వర్డ్స్లో వివరించాడు.
లూకా సముద్ర ప్రయాణం
అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయంలో ఓడ బ్రద్దలగుటను గూర్చి వర్ణించబడిన వివరాలను నౌకా నిపుణులు పరిశీలించారు. లూకా వ్రాసిన ప్రకారం, తాను, పౌలు ప్రయాణించిన ఆ పెద్ద ఓడ కౌద అనబడిన చిన్న ద్వీపం సమీపాన ఈశాన్య దిక్కుగావచ్చిన పెనుగాలిలో చిక్కుకుపోయింది, అందువలన నావికులు అది ఆఫ్రికా ఉత్తర తీరానగల విపత్కర ఇసుకతిప్పలవైపు వెళ్లిపోవునేమోనని భయపడ్డారు. (అపొస్తలుల కార్యములు 27:14, 17, అథస్సూచి NW) కాని తమ నౌకాయాన నైపుణ్యంతో వారా నౌకను ఆఫ్రికా నుండి పశ్చిమ దిశగా మళ్లించగల్గారు. కాని ఆ పెనుగాలి అలానే కొనసాగినందున, ఆ ఓడ దాదాపు 870 కిలోమీటర్లు కొట్టుకొనిపోయి మెలితే ద్వీప తీరమందలి ఇసుకలో కూరుకుపోయింది. పెనుగాలిలో 13 కంటే ఎక్కువ రోజులు చిక్కుకొన్న పెద్ద ఓడ అంతదూరం కొట్టుకొనిపోగలదని నావికా నిపుణులు లెక్కగడుతున్నారు. ఆ ఓడ బ్రద్దలగుట పదునాల్గవ రోజున జరిగిందని చెప్పిన లూకా వృత్తాంతముతో వారి అంచనాలు ఏకీభవిస్తున్నవి. (అపొస్తలుల కార్యములు 27:27, 33, 39, 41) లూకా సముద్ర ప్రయాణాన్ని గూర్చిన అన్ని వివరాలను పరిశోధించిన తర్వాత, నావికుడైన జేమ్స్ స్మిత్ ఇలా తేల్చిచెప్పాడు: “ఈ వృత్తాంతం వ్యక్తిగత అనుభవం కలిగియున్న ఒక వ్యక్తి వ్రాసిన నిజసంఘటనలై యున్నవి . . . నావికుడు కాని ఏ వ్యక్తి తాను ప్రత్యక్ష సాక్షియై యుండకుండా సముద్ర ప్రయాణాన్ని గూర్చిన ఆ వివరాలన్నింటిని అంత పొందికగా వ్రాయలేడు.”
అటువంటి పరిశోధనాత్మక ఫలితాలను బట్టి, క్రైస్తవ గ్రీకు లేఖనాలు ప్రామాణిక చరిత్రయని వాదించుటకు కొంతమంది వేదాంతులు ఇష్టపడ్డారు. అయితే హెబ్రీ లేఖనాల్లో కనుగొనబడు తొలిచరిత్ర విషయమేమి? అనేకమంది మతనాయకులు ఆధునిక తత్వానికి దాసోహమై, అది కేవలం పుక్కిటి పురాణమని అంటారు. ఏమైనప్పటికిని, విమర్శకులు విస్మయం చెందేటట్లు బైబిలు తొలి చరిత్రలోని అనేక వివరాలు కూడ పరిశీలించబడ్డాయి. ఉదాహరణకు, ఒకప్పుడు మరువబడిన అష్షూరీయుల సామ్రాజ్యాన్ని పరిశీలించి చూడండి.
[అధస్సూచీలు]
a రోమీయులు 9:1; 2 కొరింథీయులు 11:31; గలతీయులు 1:20 కూడా చూడండి.
[3వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
ఫ్రిజియ
లుకయొనియ
ఈకొనియ
లుస్త్ర
దెర్బే
మధ్యధరా సముద్రము
కుప్ర