మానవజాతికి నిజంగా మెస్సీయ అవసరమా?
“లోకానికి ఒక మెస్సీయ అవసరం, అని ఒక అధికారి అంటున్నారు”
ఆ వార్త 1980లో కెనడా, టొరొంటోలో ది ఫైనాన్సియల్ పోస్ట్ నందు ప్రముఖంగా ప్రచురింపబడింది. ఆ యధికారి ఎవరనగా, క్లబ్ ఆఫ్ రోమ్ అని పేరుగాంచిన ఒక మేధావుల సమితి వ్యవస్థాపకుడును, అధ్యక్షుడునైన ఆరెల్యో పెక్కా. ఆ పోస్ట్ చెప్పిన ప్రకారము పెక్కా నమ్మకమేమనగా, “విజ్ఞాన, రాజకీయ లేదా మతపరంగా సమ్మోహనా శక్తిగల నాయకుడు మాత్రమే, నాగరికతనే నాశనం చేయజూస్తున్న సామాజిక ఆర్థిక సంక్షోభముల నుండి లోకాన్ని రక్షించగలడు.” నీవేమనుకుంటున్నావు? మానవజాతికి నిజంగా ఒక మెస్సీయ అవసరమైనంత తీవ్ర కష్టాలలో ఈ లోకం వుందా? ఈ లోకం ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో కేవలం ఒకేఒక దానిని—ఆకలిని గూర్చి ఆలోచించుము.
ఒక వార్తాపత్రిక లేదా పత్రికలోగల చిత్రంలో రెండు పెద్దకళ్లు నీవైపే చూస్తున్నాయి. అవి ఐదు సంవత్సరాలైనా నిండని ఒక పసిపాప కళ్లు. ఆ కళ్లు నీకు నవ్వు రప్పించవు. ఆ కళ్లలో పసిపిల్లల ఆనందం గాని, వింతగా చూసే సంతోష ఛాయలు గాని, ఉట్టిపడే అమాయకత్వం గాని లేవు. బదులుగా ఆ కళ్లు భయంకరమైన ఆవేదనతో, బాధతో, తీరని ఆకలితో నిండివున్నాయి. ఆ పసిపాప ఆకలితో అలమటిస్తోంది. ఆమెకు తెలిసిందల్లా కేవలం బాధ, ఆకలి మాత్రమే.
అనేకుల వలెనే నీవును బహుశ అటువంటి చిత్రాలను ఎక్కువసేపు చూడడానికి ఇష్టపడకపోవచ్చు, కాబట్టి వెంటనే ఆ పేజీ త్రిప్పివేస్తావు. అదంటే నీకు లెక్కలేదని కాదుగాని, ఆ అమ్మాయి విషయంలో అప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయిందనే నిరాశాభావం నీలో చోటుచేసుకుంది. ఎండిన పెదాలు, లోతుగా పీక్కుపోయిన కడుపు ఆమె శరీరం తనకుతానే పీక్కుతినే దశకు చేరుకుందని సూచిస్తున్నాయి. నీవామె చిత్రంచూసే సమయానికి బహుశ ఆమె చనిపోయి వుంటుంది. అంతకంటె నికృష్టమైన సంగతేమంటే, కేవలం ఆమె ఒక్క దాని విషయంలోనే అలా జరగడం లేదు.
సమస్య ఎంత పెద్దగా వుంది? ఒక కోటి నలభై లక్షలమంది పిల్లలు అట్టి స్థితిలో ఉన్నారనుటను నీవూహించ గలవా? మనలో ఎక్కువమంది అలా ఊహించలేము; ఎందుకంటే ఆ సంఖ్యను ఊహించుట కష్టమేమరి. కాబట్టి, 40,000 మంది కూర్చొన వీలగు ఒక స్టేడియాన్ని, దానిలో వరుస మీద వరుసగా అన్ని మెట్లమీద క్రిక్కిరిసి అన్నీ ముఖాలే కన్పించునట్లు కూర్చొన్న పిల్లలను ఊహించుము. ఇలా ఊహించడం కూడా కష్టమే. అయినను, అలా ఒక కోటి నలభై లక్షలమంది పిల్లలు కూర్చోడానికి దాదాపు అటువంటి స్టేడియాలు 350 కావల్సివుంటాయి. ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి (యూనిసెఫ్), చెప్పిన ప్రకారం వర్థమాన దేశాల్లో, ఐదు సంవత్సరాలు కూడా నిండకుండానే అంతమంది పిల్లలు ప్రతి సంవత్సరం కుపోషణ, సులభంగా నిరోధించగల వ్యాధుల మూలంగా చనిపోతున్నారు. అంటే ప్రతిదినం రమారమి ఒక స్టేడియంలో కూర్చునేంత మంది పిల్లలు చనిపోతున్నారు! ఈ సంఖ్యకు తోడుగా ఆకలితో అలమటిస్తున్న పెద్దవాళ్లూ వున్నారు, వారినికూడా లెక్కలోకి తీసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా దీర్ఘకాల కుపోషణకు గురౌతున్న ప్రజల సంఖ్య వందకోట్లకు పైగానే వుంటుంది.
ఈ ఆకలంతటికి కారణమేమి?
ఇప్పుడున్న మానవులు తినగలిగిన దానికంటే ఎక్కువ ఆహారాన్ని ప్రస్తుతం ఈ గ్రహం ఉత్పత్తిచేస్తుంది. అంతేకాదు, ఇంకా ఎక్కువ ఉత్పత్తిచేసే సామర్థ్యం దీనికి ఉన్నది. అయినను, కుపోషణ, వ్యాధుల ద్వారా నిమిషానికి 26 మంది పిల్లలు చనిపోవుచున్నారు. అదే నిమిషంలో ప్రపంచం, యుద్ధ తయారీకి దాదాపు 20,00,000 డాలర్లు ఖర్చు చేస్తున్నది. ఆ డబ్బంతా లేదా దానిలో కేవలం కొద్దిమొత్తం ఆ 26 మంది పిల్లల కొరకు ఏమేమి చేయగలదో నీవూహించ గలవా?
స్పష్టముగా, ప్రపంచంలో ఆకలికి కేవలం ఆహార కొరత లేదా డబ్బు కొరత కారణమని నిందవేయలేము. ఆ సమస్యకు మరెంతో కారణం ఉంది. అర్జెంటీనాలో ఒక ప్రొఫెసరగు హోర్హా ఇ. హార్డోయ్ వ్యక్తపరిచినట్లు, “వీటి అవసరత అధికంగా ఉన్న వారితో సుఖాన్ని, శక్తిని, సమయాన్ని, వనరులను, జ్ఞానాన్ని పంచుకొనే దీర్ఘకాల అసమర్థత యీ ప్రపంచమంతా వుంది.” అవును, సమస్య మానవునికున్న వనరులలో లేదుగాని, మనిషిలోనే ఉంది. పేరాశ, స్వార్థం మానవ సమాజంలో పెత్తనం చెలాయిస్తున్న శక్తులుగా కన్పిస్తున్నవి. ప్రపంచ జనాబాలో 1/5 వంతు సంపన్నులు, 1/5 వంతు బీదలకంటె 60 రెట్లు అధికంగా మేలైన వస్తువులను, సేవలను అనుభవిస్తున్నారు.
నిజమే, కొంతమంది చిత్తశుద్ధితో ఆకలిగొన్న వారికి ఆహారాన్ని అందించుటకు ప్రయత్నిస్తున్నారు, అయితే వారి అధీనములోలేని ముష్కరమైనవేవో వారి ప్రయత్నాలను అడ్డగిస్తున్నవి. తిరుగుబాటు లేదా అంతర్యుద్ధాలతో అట్టుడికిపోతున్న దేశాల్లో తరచు కరవు ప్రబలుతుంది, అయితే ఒకదానినొకటి వ్యతిరేకించుకొను బలగాలు అవసరమున్న వారికి సహాయ కార్యక్రమాల నడ్డగించుట సర్వసామాన్యమే. శత్రుదేశంలో ఆకలితో అలమటిస్తున్న పౌరులకు ఆహారం అందజేయుటకు అనుమతించడమనేది, తమ శత్రువులను పోషించుటేనని భావించి ఇరుపక్షాల దేశాలు అలా సరఫరా చేయుటకు భయపడతాయి. ప్రభుత్వాలు సహితం యీ ఆకలి బాధను రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తున్నాయి.
పరిష్కారమే లేదా?
దురదృష్టవశాత్తు, లక్షలాదిమంది ఆకలితో అలమటించు సంక్షోభం మాత్రమే ఆధునిక మానవున్ని పట్టిపీడించుటలేదు. పర్యావరణాన్ని విస్తారంగా విషపూరితం చేయడం, లక్షలాదిమంది ప్రాణాల్ని పొట్టనపెట్టుకుంటూ తదేకంగా జరుగుచున్న యుద్ధతెగులు, ప్రతిచోట భయాన్ని, అపనమ్మకాన్ని పుట్టిస్తున్న హింసా ప్రవృత్తిగల నేరాల జాడ్యములు, ఇటువంటి అనేక రుగ్మతలకు మూలకారణంగా కనబడుతూ, అంతకంతకు ప్రమాదకారిగా పరిణమిస్తున్న నైతిక వాతావరణం—ఈ సంక్షోభాలన్నీ కలిసి—ఒకే సత్యాన్ని అనగా మానవుడు తనకుతాను దిగ్విజయంగా పరిపాలించుకొనలేడని నిర్థారిస్తున్నవి.
అందుకే లోక సమస్యలకొక పరిష్కారాన్ని చూడలేమని చాలామంది ప్రజలు నిరాశానిస్పృహలకు లోనయ్యారనుటలో సందేహం లేదు. ఇంతకు ముందు ప్రస్తావించిన ఇటలీ దేశపు విద్వాంసుడైన ఆరెల్యో పెక్కావలెనే భావిస్తున్నారు. ఒకవేళ ఏదైనా పరిష్కారమున్నట్లయితే, అది ఒక అసాధారణమైన—బహుశ మానవాతీత—మూలము నుండే రావాలని వారు తర్కిస్తారు. ఆ విధముగా మెస్సీయను గూర్చిన తలంపు శక్తివంతమైన ఆకర్షణగా ఉన్నది. అయితే మెస్సీయయందు నిరీక్షించుట వాస్తవికమేనా? లేక అటువంటి నిరీక్షణ కేవలము ఆశాభావమేనా?
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
Cover photos: Top: U.S. Naval Observatory photo; Bottom: NASA photo
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
WHO photo by P. Almasy
[4వ పేజీలోని చిత్రసౌజన్యం]
WHO photo by P. Almasy
U.S. Navy photo