ఒక నూతన లోకము మనకు అవసరము
ఆగండి మీ చుట్టూవున్న పరిస్థితులను ఒక్కసారి పరికించండి. మీరు చూస్తున్నవాటిని మీరు ఇష్టపడుచున్నారా?
బహుశ మీకు ఒక ఉల్లాసవంతమైన, చక్కగా కాపాడబడుచున్న ప్రాంతములో మంచి ఇల్లు ఉండవచ్చును. మీకు నచ్చిన ఉద్యోగము, మంచి జీతమునుకూడ మీరు కలిగియుండవచ్చును. అదనంగా, మీరు మీ ప్రియులు మంచి ఆరోగ్యమును అనుభవిస్తూ ఉండవచ్చును. అన్నింటిలోను మీరు యించుమించు సురక్షితంగా ఉన్నట్లు భావించుచుండవచ్చును.
కాని పొరుగు ప్రాంతమందున్న, మీరు నివసిస్తున్న దేశమునకు ఆవలి భాగమున, యితర భూభాగములందున్న యితరులను గూర్చి ఆలోచించండి. ప్రపంచమునంతటిని ఒక్కసారి చూడండి. మీరు చూచుచున్నది అందమైన చిత్రమేనా? అది నిజంగా, సంతృప్తి, సమాధానము, సౌభాగ్యములతో నిండియున్నదా?
ఈ శతాబ్ద తొలిభాగమందు కొందరు జోస్యము చెప్పిన దానినిబట్టి, విజ్ఞానశాస్త్రము ఈనాటికెల్లా, ముఖ్యమైన అన్ని రోగములను పూర్తిగా నిర్మూలించి, అందరికి సమృద్ధియైన ఆహారమును అందజేసి, పర్యావరణమును స్థిరపరచి, అభివృద్ధిచేసి, శాంతియుగమును ప్రవేశపెట్టియుండాల్సింది. అయితే నిజంగా జరిగిందేమిటి?
మన గ్రహంపై శాంతిలోపించిందని తెలిసికొనుటకు ఎక్కువ పరిశోధించనవసరము లేదు. “ఖడ్గములను నాగటినక్కులుగా సాగగొట్టుటకు బైబిలు కాలమునుండికూడ ప్రజలు హెచ్చరించబడుచున్నారు,” అని మైఖెల్ రెన్నర్ స్టేట్ ఆఫ్ది వరల్డ్ 1990 నందు వ్రాసియున్నాడు. “అట్టి సలహా మునుపెన్నడు అంత తగినదైయుండలేదు. నిర్దయాత్మక మిలటరీ పోరాటములు మానవులను సమూల నాశనపుటంచులకు తీసికొనివచ్చియున్నవి.”
భూగోళమందంతటా అనేక దేశములను చీల్చివేయుచున్న పౌర పోరాటములు, యుద్ధములనుగూర్చి నివేదికలు పెరుగుచునేయున్నవి. ఒక మూలాధారమునుబట్టి, 1988లో 22 యుద్ధములు యింకను జరుగుచునేయున్నవి.a ఆ యుద్ధములలో ఎంతమంది చనిపోయి ఉండవచ్చు? ఆ సంవత్సరముతో కలుపుకొని అంతవరకు “1988లో జరిగిన యుద్ధముల మూలముగా చనిపోయిన ప్రజల మొత్తం సంఖ్య 46,45,000. చనిపోయిన వారిలో 76 శాతము మంది పౌరులే,” అని ది సెయింట్ లూయిస్ పోస్ట్- డిస్పేచ్ తెల్పుచున్నది.
ఒక శాంతియుత లోకము ముందున్నదని ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు చూపుచున్నవా? అమెరికాలోని కాలిఫోర్నియా నందలి సేన్ జోషి మెర్క్యూరీ న్యూస్ నందు ఒక శీర్షిక యిట్లనుచున్నది: “ప్రచ్ఛన్నయుద్ధము సమసిపోయి శాంతికి అవకాశమియ్యబడెనని చెప్పబడుచున్నది. అయితే ఒకసారి చూడండి, తృతీయ ప్రపంచ దేశాలలో పరిష్కారమగుననే కొద్దిపాటి నిరీక్షణతోనే యుద్ధతుపాను చెలరేగుచున్నది. ఇవి ప్రపంచముయొక్క దాగియున్న పోరాటములు. వాటిలో అధికభాగము తమయొక్క ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వములుచేయు పోరాటములే. భూభాగము, మతము, జాతి మరియు తెగలకు సంబంధించిన వ్యత్యాసములు, రాజకీయ అధికారము, మాదక ద్రవ్యముల విషయములోకూడ జరుగు రక్తసిక్త పౌరపోరాటములు. . . . ఆఫ్రికానుండి ఆగ్నేయాసియావరకు లక్షలాదిమంది యుద్ధముల మూలంగా తమ యిండ్లను వదలి పోరిపోవలసివచ్చెను పంటచేలలో నాట్లు వేయబడలేదు, ఆరోగ్య కేంద్రములు దాడిచేయబడినవి, పశువులు నాశనమైనవి, తమ పిల్లలయెదుటనే తలిదండ్రులు క్రూరంగా చంపబడ్డారు. 10 సంవత్సరముల బాలురు కూలీలుగా చేయబడి, ఆ పిమ్మట సైనికులుగా మార్చబడుచున్నారు, యౌవన బాలికలు మానభంగము చేయబడ్డారు. ఎక్కువగా మరువబడిన ఈ దేశములలో, ఈ సమాజములన్నీ మరిక ఎన్నటికీ పూర్తిగా కోలుకోజాలని సామాజిక అస్తవ్యస్థత, చిన్నాభిన్నమైనవాటి గురుతులను యుద్ధము విడిచిపెట్టెను. . . . చరిత్రలో మరి ఏ దశాబ్దము చూడనన్ని యుద్ధములను 1980వ దశాబ్దము చూచెనని పరిశోధన చూపుచున్నది.”
అభివృద్ధి చెందిన దేశములకు పారిపోయిన అనేకులు తాము వెదకిన శాంతి అతిక్రూరమైన నేరముల భీతిమూలంగా పటాపంచలైనట్లు కనుగొన్నారు. “[యునైటెడ్ స్టేట్స్] నందలి నేరములు తగ్గగలవని చెప్పబడినప్పటికిని వాటి ముట్టడి 1980 దశాబ్దమందు కూడా కొనసాగినది,” అని యు.ఎస్. న్యూస్ & వరల్డ్ రిపోర్ట్ నివేదించుచున్నది. “అటువంటి ఒక సంవత్సరములో హత్య, దౌర్జన్యము మరియు దొంగతనమువంటి తీవ్రమైన నేరములు 81 లక్షలు సంభవించినవి. . . . రక్తపాతము వ్యాప్తిచెంది, ఊహించని విధంగా జరగడం చూస్తే అన్నింటికన్నా అది ఘోరంగా ఉన్నది. వంచించబడడం దీర్ఘవ్యాధివంటిది. ప్రస్తుతము జరుగుచున్న విధంగా నేరము కొనసాగితే ఇప్పుడు 12 సంవత్సరముల ప్రాయముగల పిల్లలలో 83 శాతము మంది దానికి గురియగుటగాని లేదా అట్టి దాడికి ప్రయత్నము జరుగుటగాని సంభవించునని యు.ఎస్ బ్యూరో ఆఫ్ జస్టీస్ స్టేటిస్టిక్స్ అంచనా వేసినది. . . . సమాజములో నేరస్థులకు శిక్షవిధించడం నిశ్చయము కాదు లేక వెంటనేకూడ జరుగదు. దేశవ్యాప్తంగా చూస్తే 5 ప్రధాన నేరములలో కేవలము ఒక్కదానిని మాత్రమే పోలీసువారు పరిష్కరించగల్గిరి.” అటువంటి పరిస్థితులే ప్రపంచవ్యాప్తముగా ఉన్నవి. “ప్రపంచములోని అనేక భాగములందు నేరముల సంభవించుట మరియు వాటి తీవ్రత రెండు వృద్ధియగుచున్నవని” యుఎన్ సర్వసభ్య సమావేశము నివేదించుచున్నది.
అయితే భూమిమీదనుండి అన్నిరకముల యుద్ధములు, ఆయుధములు మరియు నేరములు అదృశ్యమైపోయినను, జీవితమునకు ఇంకను భయమున్నది. “అభివృద్ధి చెందుతున్న దేశములలో కోట్లాది ప్రజల జీవితములందు అణగార్చుచున్న పేదరికము, తాండవచూడుచున్న రోగము, అధిక నిరక్షరాస్యత చోటుచేసికొనుచున్నవి,” అని వరల్డ్ వాచ్ ఇన్సిటిట్యూట్ స్టేట్ ఆఫ్ది వరల్డ్ 1990 నందు తమ నివేదికలో పేర్కొన్నది. “మానవాళి అంతా—ధనికులైనా పేదవారైనా, సైనికపరంగా బలంగా ఉన్నా లేక బలహీనంగా ఉన్నా—పరిసరములు విపరీతంగా నాశనమగుచున్నటువంటి భూతమును ఎదుర్కొనుచున్నారు.”
అవును, మానవాళి అంతా ఆధారపడియున్న జీవనాధార విధానములే అణగార్చబడుచున్నవి. డిస్కవర్ పత్రికలో సంపాదకుడైన పాల్ హాఫ్మాన్ ఇట్లు వ్రాయుచున్నాడు, “[1970 నాటికంటే] భూమియంతా ఇప్పుడు హీనస్థితిలో ఉన్నది. గ్రీన్హౌస్ గ్యాస్లు (భూమిపై బొగ్గుపులుసువాయువు వంటి వాయువులు) వాతావరణమును వేడెక్కించుచున్నవి. మన గ్రహముయొక్క ఓజోన్ కవచము పల్చబడుచున్నది. ఎడారులు విస్తరిస్తున్నవి, వర్షపాతమునిచ్చు అడవులు, అంతరించుచున్నవి. గంటకు 17 చొప్పున వృక్షములు మరియు జంతుప్రాణులు నశించిపోవుచున్నవి.”
దానికితోడు భూమి, నీరు కలుషితమగు ప్రభావము కొనసాగుచున్నది. ప్రపంచ జనాబా క్రమేపి పెరుగుచున్న సంఖ్యనుబట్టి మరియెక్కువ భూమిని సారవంతము చేయుటకు లేదా అందుకు సన్నాహములు చేయుట జరుగుచున్నది, తద్వారా జంతువుల, మొక్కల వినాశనము వృద్ధియగుచున్నది. తాజా నీటి సరఫరా లేకపోవడం, ఆమ్లవర్షాలు కురవడంవంటి సమస్యను పరిగణించండి. బహుగా కలుషితమైన గాలి మరియు ప్రాణాంతకమైన వ్యర్థ పదార్థముల సమస్యల మూలంగా తలెత్తిన ఆరోగ్య-సమస్యలను జతచేయండి. ఇవన్నీ కలిసి మానవజాతికి వినాశనమును తెచ్చును. మనమెవరిమైనను లేదా మనమెచ్చట ఉన్నను, మనందరికి జీవించడానికి గాలి, ఆహారము, నీరు, మూలపదార్థములు అవసరము. కలుషితము చేయబడక సమృద్ధిగా అవి మనకు అవసరము. స్టేట్ ఆఫ్ది వరల్డ్ 1990 ఇట్లనుచున్నది, ఇప్పటికే “80వ దశాబ్దము పేదవారి పాలిట తగ్గించజాలని వినాశనము, హీనమైన భోజనము, మరియు మరణాల సంఖ్య పెరుగుచున్న కాలమైయుండెను.”
మానవ జనాంగము యిన్ని విధములుగా బాధింపబడుచుండగా, ఒక నూతన లోకము నిశ్చయముగా కావాలి అను దానిని ఎవరైనా కాదనగలరా? అయితే నిజముగా ఆలాంటి సాధ్యత ఉన్నదా? అట్టి లోకము ఏ మూలమునుండి వచ్చును? మన భూగ్రహము నిజంగా భద్రమైనదిగా వర్ధిల్లే దానిగా ఉండేందుకు ముందు ఏ ఆటంకములను ఎదుర్కొనవలసి యున్నది? పరిశీలించుదము. (w90 10/1)
[అధస్సూచీలు]
a కనీసం ఒక ప్రభుత్వము యిమిడియున్న పోరాటము మరియు ఒక సంవత్సరములో కనీసము 1,000 మంది చంపబడినటువంటి వాటితోకూడిన పోరాటములు “యుద్ధము” అని నిర్వచించబడెను.
[4వ పేజీలోని చిత్రసౌజన్యం]
WHO photo by P. Almasy