33 యెహోయాదా
రాజవంశాన్ని కాపాడాడు
యెహోయాదా యెరూషలేము ఆలయంలో ఒక ప్రధానయాజకుడు. ఆయన చాలా ముసలివాడు; అయినా యెహోవా సేవ చేయడంలో ఉరకలేసే ఉత్సాహాన్ని చూపించాడు. సరైనది చేయాలనే కోరిక ఆయనలో బలంగా ఉండేది. ప్రధానయాజకుడిగా ఆయన బాధ్యత ఏంటంటే, యెహోవాను సరైన విధంగా ఆరాధించేలా ప్రజల్ని నడిపించడం. అలా చేయడం చాలా కష్టం. ఎందుకంటే, ఆయన కాలంలో చాలామంది ప్రజలు అబద్ధ దేవుళ్లను ఆరాధిస్తూ, చెడ్డ పనులు చేసేవాళ్లు.
అంత చెడుతనం పెరిగిపోవడానికి కారణం అతల్యా. ఆమె ఇశ్రాయేలు రాజైన అహాబుకు, యెజెబెలు రాణికి పుట్టిన కూతురు. వాళ్లు ఎంత చెడ్డవాళ్లంటే యెహోవా వాళ్లనే కాదు, వాళ్ల పిల్లల్ని కూడా భూమ్మీద లేకుండా చేస్తానని అన్నాడు. అతల్యా యూదా రాజును పెళ్లి చేసుకుంది. ఆమెకు స్వచ్ఛారాధన అంటే అస్సలు నచ్చేది కాదు. కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు. తర్వాత వాళ్ల కొడుకు రాజయ్యాడు. యెహోవా అతన్ని శిక్షించడంతో అతను కూడా చనిపోయాడు. ఇప్పుడు అతల్యా కన్ను సింహాసనం మీద పడింది. కానీ యెహోవాకు అది నచ్చలేదు. ఎందుకంటే తన ప్రజల్ని పరిపాలించడానికి యెహోవా పురుషుల్నే ఎంచుకున్నాడు, అది కూడా దావీదు వంశస్థుల్ని మాత్రమే. అయితే, ఎక్కడ రాకుమారుల్లో ఒకరికి రాజరికాన్ని కట్టబెడతారో అని అతల్యా భయపడింది. అందుకే ఆమె ఒక కుట్ర పన్ని సొంత మనవళ్లనే చంపించింది.
ఒక ప్రధానయాజకుడు, ఆయన భార్య తమ ప్రాణాలకు తెగించి హంతకురాలైన రాణి చేతిలో నుండి పసిపిల్లాడి ప్రాణాల్ని కాపాడారు
కానీ అతల్యాకు తెలియని ఒక విషయం ఏంటంటే, రాకుమారుల్లో ఒకరు ఇంకా బ్రతికే ఉన్నారు! ఆ రాకుమారుడు పుట్టి సంవత్సరం కూడా అవ్వలేదు. అతని ప్రాణాల్ని కాపాడింది ఒక ధైర్యవంతురాలైన స్త్రీ. ఆమె యెహోయాదా భార్య యెహోషెబ. ఆమెకు యెహోషబతు అనే ఇంకో పేరు కూడా ఉంది; ఆమె రాజ కుటుంబానికి చెందింది. దావీదు వంశం అంతరించి పోతుంటే ఆమె, ఆమె భర్త చూస్తూ ఊరుకోలేకపోయారు. ఎందుకంటే, యెహోవా ఇచ్చిన మాట ప్రకారం దావీదు వంశస్థులు ఎప్పటికీ పరిపాలిస్తారనే విషయం వాళ్లకు తెలుసు. (2 సమూ. 7:12, 13) అందుకే యెహోషెబ ధైర్యం కూడగట్టుకుని, ఎవరికీ తెలియకుండా ఆ పసికందును రాజభవనం నుండి బయటికి తీసుకొచ్చింది. ఆ బాబును, అతని దాదిని తన భర్త దగ్గరికి తీసుకొచ్చింది. అప్పుడు యెహోయాదా ఎవరి కంటా పడకుండా వాళ్లను ఆలయంలోని ఒక గదిలో ఉంచాడు.
అలా యెహోయాదా ఆరేళ్ల పాటు ఆ పిల్లాడిని దాచిపెట్టాడు. నిజానికి అది చాలా కష్టమైన పనే. ఎందుకంటే, విషయం అతల్యా చెవిన పడితే ఇంక అంతే సంగతి! ఆమె ఆ బాబునే కాదు, అతన్ని కాపాడిన వాళ్లందర్నీ చంపడానికి క్షణం కూడా ఆలోచించదు. అయితే యెహోయాదా ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన నమ్మకస్థులైన ఐదుగురు శతాధిపతుల్ని పిలిచి ఈ రహస్యాన్ని బయటపెట్టాడు: దావీదు సింహాసనాన్ని అధిష్ఠించడానికి వారసుడు ఒకడు ఇంకా బ్రతికే ఉన్నాడు! అయితే, ఆయన వాళ్లతో 500 మంది సైనికుల్ని పోగుచేయమని, మందిరం లోపల-బయట అలాగే రాజుకు అన్నివైపులా గట్టిగా కాపలా పెట్టమని చెప్పాడు. వాళ్లు ఆయుధాలు, డాళ్లు పట్టుకుని తమతమ స్థానాల్లో నిలబడ్డారు. అప్పుడు యెహోయాదా పిల్లవాడైన యెహోయాషును (లేదా యోవాషును) రాజుగా అభిషేకించాడు. సంతోషంతో వాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. వాళ్ల చప్పట్లు, అరుపులు విని అతల్యా ఏం జరుగుతుందా అని పరుగెత్తుకుంటూ వచ్చింది.
ఆమె ఆలయ ప్రాంగణంలోకి వచ్చి చూసినప్పుడు పరిస్థితి చేయిదాటిపోయిందని అర్థం చేసుకుంది. ఆమె చివరి ప్రయత్నంగా “కుట్ర! కుట్ర!” అని అరవడం మొదలుపెట్టింది. నిజానికి కుట్రలు చేసింది, పన్నాగాలు పన్నింది ఆమె! ఆ సమయంలో ప్రజలు తనవైపు ఉంటారని అతల్యా అనుకొని ఉంటే, ఆమె పొరబడినట్టే. ఆమెను మందిరం నుండి బయటికి తీసుకెళ్లమని యెహోయాదా ధైర్యంగా శతాధిపతులకు చెప్పాడు. దాంతో వాళ్లు ఆమెను బయటికి తీసుకెళ్లి, చంపేశారు. “అహాబు ఇంటివాళ్లందరూ నశించిపోతారు” అని యెహోవా ముందే చెప్పాడు. (2 రాజు. 9:8) అతల్యా మరణంతో ఆ మాటలు నిజమయ్యాయి.
యెహోయాదా అంతటితో ఆగలేదు. ఆయన ప్రజలతో, రాజుతో యెహోవాకు నమ్మకంగా ఉంటామని ప్రమాణం చేయించాడు. తర్వాత అక్కడున్న బయలు గుడిని పడగొట్టించాడు, దాని పూజారిని చంపించాడు. అంతేకాదు, యెహోయాషు ఒక మంచి రాజు అయ్యేలా శిక్షణను ఇచ్చాడు. యెహోయాదా 130 ఏళ్ల వయసులో చనిపోయాడు. యెరూషలేమును పరిపాలించిన రాజులను పాతిపెట్టే చోట ఆయన్ని పాతిపెట్టారు. ఏ ప్రధానయాజకుడికీ దొరకని గొప్ప గౌరవం ఆయనకు దక్కింది.
యెహోయాదా బ్రతికున్నంత కాలం యెహోయాషు యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత దారితప్పాడు. యూదా అధిపతులు చెప్పిన తప్పుడు మాటలు విని, యెహోయాషు దేశంలో అబద్ధ ఆరాధనను ప్రోత్సహించాడు. ఆయన చేస్తుంది తప్పు అని చెప్పి సరిదిద్దడానికి వచ్చిన ప్రవక్తల మాటల్ని పెడచెవిన పెట్టాడు. అలా సరిదిద్దడానికి వచ్చిన ఒక వ్యక్తి యెహోయాదా కొడుకైన జెకర్యా. ఆయన ప్రజలతో ఇలా అన్నాడు: “మీరు యెహోవా ఆజ్ఞల్ని ఎందుకు మీరుతున్నారు?” దానికి యెహోయాషు కోపం తెచ్చుకొని, ఆయన్ని చంపేయమని ఆజ్ఞాపించాడు. కానీ జెకర్యా తన తండ్రిలాగే చివరి శ్వాస వరకు ధైర్యం చూపిస్తూ ఉన్నాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత, యేసుక్రీస్తు జెకర్యాను గుర్తుచేసుకుంటూ ఆయన్ని నీతిమంతుడని పిలిచాడు. యెహోవాలాగే యేసు కూడా నమ్మకమైన స్త్రీపురుషుల్ని, వాళ్లు చూపించిన ధైర్యాన్ని ఎప్పుడూ మర్చిపోడు!
ఈ వచనాలు చదవండి:
ప్రశ్న:
యెహోయాదా ఎలా ధైర్యం చూపించాడు?
ఎక్కువ తెలుసుకోండి
1. అతల్యాను చంపడానికి యెహోయాదాకు సహాయం చేసిన “రాజ అంగరక్షకుల” గురించి కొంతమంది పండితులు ఏం అంటారు? (2 రాజు. 11:4, 19; it “రాజ అంగరక్షకులు”-wcgr)
2. యెహోయాదా “ధర్మశాస్త్ర గ్రంథపు చుట్టను” యెహోయాషు తలమీద ఎందుకు పెట్టాడు? (2 రాజు. 11:12; w91-E 2/1 31 ¶5-6-wcgr) చిత్రం 1
చిత్రం 1
3. యెహోవా మందిరాన్ని బాగుచేయమని యెహోయాషు ఎందుకు ఆజ్ఞాపించాడు? (2 దిన. 24:4-7, 11-14; it “యెహోయాషు” No. 1 ¶5-wcgr)
4. యెహోయాదా కుమారుడు జెకర్యా. మరి యేసు ఎందుకు జెకర్యాని “బరకీయ కుమారుడు” అని అన్నాడు? (మత్త. 23:35 లో “బరకీయ కుమారుడు” అనే మాటకున్న స్టడీ నోట్, nwtsty-wcgr)
మనం నేర్చుకునే పాఠాలు
యెహోయాషును దాచిపెట్టినప్పుడు యెహోయాదాకు బహుశా వంద కంటే ఎక్కువ ఏళ్లు ఉంటాయి. పెద్దవయసు బ్రదర్స్-సిస్టర్స్ ఆయన్ని ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు? (కీర్త. 92:12, 14) చిత్రం 2
చిత్రం 2
యెహోయాషు యెహోయాదా మాట విన్నంతకాలం మంచిగా ఉన్నాడు. దీన్నుండి యౌవనులు ఏం నేర్చుకోవచ్చు?
యెహోయాదా చూపించినట్టే మీరు ఎలా ధైర్యం చూపించవచ్చు?
మనసుపెట్టి ఆలోచించండి
ఈ కథ నుండి యెహోవా గురించి నేను ఏం నేర్చుకున్నాను?
ఈ కథకు, యెహోవా సంకల్పానికి సంబంధం ఏంటి?
కొత్త లోకంలో యెహోయాదాను కలిసినప్పుడు ఆయన్ని నేను ఏం అడగాలనుకుంటున్నాను?
ఇవి కూడా చూడండి
మంచి స్నేహితుల్ని ఎంచుకునే విషయంలో యెహోయాషు నుండి పిల్లలు ఏం నేర్చుకోవచ్చు?
“యోవాషు చెడు సహవాసంవల్ల యెహోవాను విడిచిపెట్టాడు” (w09 10/1 22-23)
యెహోయాదా చేసినట్టే నేడు మన సంస్థ కూడా విరాళాల విషయంలో ఏం చేస్తుంది? మనవంతుగా మనం ఏం చేయవచ్చు?