లెసన్ 101
పౌలును రోముకు పంపించారు
పౌలు ప్రకటనా పని కోసం చేసిన మూడవ యాత్ర యెరూషలేములో ముగిసింది. అక్కడ అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. రాత్రిపూట దర్శనంలో యేసు ఆయనతో ఇలా అన్నాడు: ‘నువ్వు రోముకు వెళ్లి అక్కడ ప్రీచింగ్ చేస్తావు.’ పౌలును యెరూషలేము నుండి కైసరయకు తీసుకెళ్లారు. అక్కడ ఆయన రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అధికారి అయిన ఫేస్తు ముందు పౌలును విచారణ చేసినప్పుడు ఆయన ఇలా చెప్పాడు: ‘రోములో కైసరుతో నాకు తీర్పు ఇప్పించండి.’ ఫేస్తు ఇలా అంటాడు: “కైసరుకు విన్నవించుకుంటానని అన్నావు కదా, కైసరు దగ్గరికే వెళ్తావు.” పౌలును రోముకు వెళ్లే ఓడ ఎక్కించారు. అతనితోపాటు ఇద్దరు క్రైస్తవ సహోదరులు లూకా, అరిస్తార్కు వెళ్లారు.
సముద్రంలో ఉన్నప్పుడు ఒక పెద్ద తుఫాను వచ్చింది, అది చాలా రోజులు ఉంది. అప్పుడు అందరూ చనిపోతామని అనుకున్నారు. కానీ పౌలు ఇలా అన్నాడు: ‘దయచేసి వినండి, ఒక దేవదూత కలలో నాతో “పౌలు భయపడకు. నువ్వు రోము చేరుకుంటావు. నీతోపాటు ఓడలో ఉన్న ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉంటారు” అని అన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. మనం చనిపోం.’
తుఫాను 14 రోజుల పాటు వచ్చింది. చివరకు, తీరం కనిపించింది. అది మాల్త ద్వీపం. ఓడ ఇసుకలో ఇరుక్కుపోయి, ముక్కలుముక్కలు అయిపోయింది. కానీ ఓడలో ఉన్న 276 మంది సురక్షితంగా ఒడ్డు చేరుకున్నారు. కొంతమంది ఈదుకుంటూ వెళ్లారు, మిగతావాళ్లు విరిగిన ఓడ ముక్కల్ని పట్టుకుని ఒడ్డుకు చేరుకున్నారు. మాల్తలో ప్రజలు వాళ్లను బాగా చూసుకున్నారు. వాళ్లకు చలి పుట్టకుండా మంట వెలిగించారు.
మూడు నెలల తర్వాత, సైనికులు ఇంకో ఓడలో పౌలును రోముకు తీసుకెళ్లారు. అక్కడకు చేరుకున్నాక, సహోదరులు ఆయనను కలవడానికి వచ్చారు. వాళ్లను చూడగానే పౌలు యెహోవాకు థ్యాంక్స్ చెప్పాడు. ఆయనకు ధైర్యం వచ్చింది. పౌలు ఖైదీ అయినా అద్దెకు తీసుకున్న ఒక ఇంట్లో ఉండడానికి ఆయనకు అనుమతి దొరికింది. ఆయనకు కాపలాగా ఒక సైనికుడు ఉండేవాడు. అక్కడ ఆయన రెండు సంవత్సరాలు ఉన్నాడు. ఆయనను చూడడానికి చాలామంది వచ్చేవాళ్లు. వాళ్లకు దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు, యేసు గురించి నేర్పించాడు. పౌలు ఆసియా మైనరులో, యూదయలో ఉన్న సంఘాలకు ఉత్తరాలు కూడా రాశాడు. దేశాలన్నిటికి మంచివార్త వ్యాప్తి చేయడానికి యెహోవా నిజంగా పౌలును ఉపయోగించాడు.
“అన్నివిధాలా మమ్మల్ని మేము దేవుని పరిచారకులుగా సిఫారసు చేసుకుంటున్నాం: మేము ఎంతో సహించాం; శ్రమల్ని, ఇబ్బందుల్ని, కష్టాల్ని ఎదుర్కొన్నాం.”—2 కొరింథీయులు 6:4