46వ అధ్యాయం
ఒక స్త్రీ యేసు వస్త్రాన్ని ముట్టుకొని బాగైంది
మత్తయి 9:18-22 మార్కు 5:21-34 లూకా 8:40-48
ఒక స్త్రీ యేసు వస్త్రాన్ని ముట్టుకొని బాగైంది
యేసు దెకపొలి నుండి తిరిగొచ్చాడని గలిలయ సముద్రానికి వాయవ్య తీరాన నివసిస్తున్న యూదులు తెలుసుకున్నారు. తుఫాను వచ్చినప్పుడు యేసు గాలిని, సముద్రాన్ని నిమ్మళింపజేశాడనే విషయం చాలామంది వినుంటారు. అంతేకాదు, చెడ్డదూతలు పట్టిన ఇద్దరు వ్యక్తుల్ని యేసు బాగుచేశాడనే విషయం కూడా కొంతమందికి తెలిసుంటుంది. అందుకే, యేసుకు స్వాగతం పలకడానికి సముద్ర తీరాన “చాలామంది” పోగయ్యారు, బహుశా అది కపెర్నహూము ప్రాంతం అయ్యుంటుంది. (మార్కు 5:21) ఆయన పడవ దిగేసరికి వాళ్లు ఉత్సాహంగా, ఆశగా ఎదురుచూస్తున్నారు.
అలా ఎదురుచూస్తున్న వాళ్లలో సమాజమందిర అధికారి అయిన యాయీరు కూడా ఉన్నాడు. అతను బహుశా కపెర్నహూము సమాజమందిరంలో అధికారి అయ్యుంటాడు. అతను యేసు కాళ్లమీద పడి, “మా పాపకి బాగా జబ్బు చేసింది. దయచేసి నువ్వు వచ్చి ఆమె మీద చేతులు ఉంచు, ఆమె బాగౌతుంది, బ్రతుకుతుంది” అని ఎంతో బ్రతిమాలాడు. (మార్కు 5:23) ఆమెకు ఇంకా 12 ఏళ్లే. తన ఒక్కగానొక్క ముద్దుల కూతుర్ని బాగుచేయమని యాయీరు అంతగా బ్రతిమాలినప్పుడు యేసు ఏం చేశాడు?—లూకా 8:42.
యేసు యాయీరు ఇంటికి వెళ్తున్నప్పుడు, ఆయన హృదయాన్ని కదిలించే మరో సంఘటన జరిగింది. యేసు వెంట వస్తున్న చాలామంది ఆయన మరో అద్భుతం చేస్తే చూడాలని ఉత్సాహంగా ఉన్నారు. అయితే, వాళ్లలో ఒక స్త్రీ మాత్రం తనకున్న తీవ్రమైన అనారోగ్యం గురించే ఆలోచిస్తోంది.
యూదురాలైన ఆ స్త్రీ 12 ఏళ్లుగా రక్తస్రావంతో బాధపడుతోంది. ఆమె చికిత్స కోసం ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్లింది, వాళ్లు చెప్పిన చికిత్సల కోసం డబ్బంతా ఖర్చు చేసింది. అయినా ఆమె జబ్బు నయం కాలేదు, “ఇంకా ముదిరింది.”—మార్కు 5:26.
ఆ జబ్బు వల్ల ఆమె బలహీనం అవ్వడంతో పాటు ఎన్ని ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొని ఉంటుందో మీరు ఊహించవచ్చు. అది నలుగురికి చెప్పుకునే సమస్య కాదు. పైగా, మోషే ధర్మశాస్త్రం ప్రకారం రక్తస్రావం ఉన్న స్త్రీ ఆచారబద్ధంగా అపవిత్రురాలు. ఆమెను గానీ, రక్తపు మరకలు అంటిన ఆమె బట్టల్ని గానీ ముట్టుకున్నవాళ్లు తమ బట్టలు ఉతుక్కోవాలి, స్నానం చేయాలి. వాళ్లు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.—లేవీయకాండం 15:25-27.
ఆమె “యేసు గురించి విని,” ఇప్పుడు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది. ఆమె అపవిత్రురాలు కాబట్టి, సాధ్యమైనంతవరకు ఎవరి కంటపడకుండా జనం మధ్యలోకి వెళ్లింది. “నేను ఆయన పైవస్త్రాల్ని ముట్టుకుంటే చాలు, నాకు బాగౌతుంది” అని తనలో తాను అనుకుంది. ఆయన వస్త్రపు అంచును ముట్టుకున్న మరుక్షణమే తన రక్తస్రావం ఆగిపోవడం ఆమె గుర్తించింది! ఆమెను “ఎంతో బాధపెట్టిన ఆ రోగం నయమైపోయింది.”—మార్కు 5:27-29.
అప్పుడు యేసు, “నన్ను ముట్టుకుంది ఎవరు?” అని అడిగాడు. ఆ మాట విన్నప్పుడు ఆమెకు ఎలా అనిపించివుంటుంది? పేతురు యేసు మాటలకు అభ్యంతరం చెప్తూ, “బోధకుడా, ప్రజలు తోసుకుంటూ నీ మీద పడుతున్నారు” అన్నాడు. ఇంతకీ, “నన్ను ముట్టుకుంది ఎవరు” అని యేసు ఎందుకు అడిగాడు? ఆయన ఇలా వివరించాడు: “ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి శక్తి బయటికి వెళ్లింది.”—లూకా 8:45, 46.
తన సంగతి తెలిసిపోయిందని అర్థమై, ఆ స్త్రీ భయంతో వణుకుతూ యేసు దగ్గరికి వచ్చి ఆయన కాళ్ల మీద పడింది. అందరిముందు తన జబ్బు గురించి, తాను అప్పుడే బాగవ్వడం గురించి ఆమె చెప్పింది. యేసు దయతో ఆమెను ఇలా ఓదార్చాడు: “అమ్మా, నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది. మనశ్శాంతితో వెళ్లు, ఇక ఈ రోగం నిన్ను బాధపెట్టదు.”—మార్కు 5:34.
అవును, భూమిని పరిపాలించడానికి దేవుడు ఎంతో ప్రేమ, కనికరం గల వ్యక్తిని ఎంచుకున్నాడు. ఆ వ్యక్తికి ప్రజల మీద శ్రద్ధతోపాటు, వాళ్లకు సహాయం చేసే శక్తి కూడా ఉంది!