ప్రపంచ పరిశీలన
అధిక ఉష్ణోగ్రతగల తేనెటీగలు
జపాన్కు చెందిన తేనెటీగలు తమ శరీరాల వేడితో అతిపెద్ద కందిరీగను చంపడం ద్వారా దాని నుండి తమనుతాము కాపాడుకుంటాయని సైన్స్ న్యూస్ నివేదిస్తుంది. కందిరీగ ఉన్నట్లు కనుగొన్న తర్వాత, తేనెటీగలు శత్రువును గూడు లోపలికి ఆకర్షించి, అక్కడ వందలాది కూలీ ఈగలు దాన్ని చుట్టుముట్టి, దాని చుట్టూ బంతిలా గుంపుకూడుతాయి. తర్వాత, “తేనెటీగలు కదులుతూ దాదాపు 20 నిమిషాల పాటు బంతిలా చుట్టుకొనివున్న తమనుండి మరణకరమైన 47 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతను పెంచుతాయి” అని ఆ పత్రిక తెలియజేస్తుంది. జపాన్ తేనెటీగలు 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలవు గనుక, ఈ పన్నాగం వాటికి హానిచేయదు. అయితే, తేనెటీగల వలలో అన్ని కందిరీగలూ చిక్కుకోవు. “30,000 తేనెటీగలుండే కాలనీని 3 గంటల్లో, 20 నుండి 30 కందిరీగలు చంపగలవు” గనుక, అతిపెద్ద కందిరీగలు సామూహికంగా దాడి చేయడం ద్వారా తేనెటీగలను ఎదుర్కోగలవు. “ఈ సందర్భాల్లో, అవి గూటిని ఆక్రమించి, తేనెటీగల డింభకాలను, ప్యూపాలను తీసుకుంటాయి” అని న్యూస్ తెలియజేస్తుంది.
“అపాయకరమైన టైమ్ బాంబు”
ప్రపంచ జనాభాలోని దాదాపు 45 శాతం ప్రస్తుతం నగరాల్లో నివసిస్తున్నారు, మరియు 2000వ సంవత్సరం నాటికి జనాభాలో సగం మంది నగరాల్లోనే ఉంటారని అంచనా వేయబడినట్లు ఫోకస్ పత్రిక తెలియజేస్తుంది. ఉత్తర యూరప్లోని అధిక భాగం, ఇటలీ, తూర్పు అమెరికాలలో అత్యధిక జనసాంద్రత ఉంది, చైనాలోని కొంతభాగం, ఈజిప్టు, ఇండియా, దక్షిణ అమెరికాలలోని గ్రామీణ ప్రాంతం మధ్యన అధిక జనాభాగల నగరాలు ఉన్నాయి. అయితే, భూమి 3 నుండి 4 శాతం మాత్రమే నగరాలుగా మార్చబడిందని శాటిలైట్ ఇమేజింగ్ ఇప్పుడు తెలియజేస్తుంది. కాని ప్రాముఖ్యంగా వర్ధమాన దేశాల్లో, ప్రతి సంవత్సరం 6.1 కోటి ప్రజలు నగరాలకు తరలి వెళుతున్నందున, ఈ నగర ప్రాంతాల్లో జనాభా పెరుగుతోంది, ఎందుకంటే “నగరాల్లోని జనాభా పెరిగినంత త్వరితంగా నగరాలు పెరగలేవు, పరిస్థితి అపాయకరమైన టైమ్ బాంబులా ఉంది” అని ఫోకస్ తెలియజేస్తుంది.
కనిపించకుండాపోతున్న మోరీ మూతలు
1994లో, 200 కంటే ఎక్కువమంది బీజింగ్ నివాసులు మూతలు తెరచివున్న మోరీలలో పడిపోయినట్లు ఎకనామిక్ డైలీ అనే వార్తా పత్రిక నివేదించింది. కారణం? ఆ సంవత్సరంలో, చైనా ముఖ్య పట్టణ వీధుల్లో నుండి 2,000 కంటే ఎక్కువగా మోరీ మూతలను దొంగలు దొంగిలించారు. వీటిలో అధిక భాగం, చైనాలోని సంచార జనాభా అని పిలువబడే సంచారకులే దొంగిలించివుంటారని చెప్పబడుతోంది. నగరంలోని సంచార జనాభా పెరగడంతోపాటు గత దశాబ్దంలో మూతల దొంగతనం కూడా పెరిగింది. 60 కిలోల బరువుండే మూతలు 100 యువాన్ల (12 అమెరికా డాలర్లు) కంటే ఎక్కువకు అమ్మవచ్చు. గాయపడిన నివాసులలో పాదచారులు, సైకిళ్లపై వెళ్లేవారూ ఉన్నారు.
వారి తలలను ఉపయోగించడం
“ఆఫ్రికా స్త్రీలు తమ తలలపై బరువైన నీటి బిందెలను లేక ఆహారమున్న కుండలను పెట్టుకొని, అసలు తాము ఏమీ మోయడం లేదన్నట్లుగా మైళ్ల దూరం నడుస్తారు” అని డిస్కవర్ అనే పత్రిక చెబుతుంది. “మరే అదనపు శక్తిని ఉపయోగించకుండానే స్త్రీలు విపరీతమైన బరువులను మోయగలరని పరిశోధకులు కనుగొన్నారు.” కెన్యా దేశానికి చెందిన కొంతమంది స్త్రీలు అదనపు ప్రయత్నం లేకుండానే తమ బరువులో 20 శాతం వరకు మోయగలరు. వారు అదెలా చేయగలరు? “వీపు మీద భారమైన బరువులను మోసే ప్రజలకంటే లేక బరువులు మోయడానికి తమ తలలను ఉపయోగించేందుకు తర్ఫీదివ్వబడని ప్రజలకంటే మరింత సమర్థవంతంగా తమ బరువులను” మోయడం ద్వారా వారలా చేయగలుగుతున్నారని న్యూ సైంటిస్ట్ సమాధానమిస్తుంది. “స్త్రీల యొక్క లోలకం వంటి కదలికలోనే ఆ రహస్యం ఉందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.” మనం నడిచేటప్పుడు, కొంత శక్తిని తరువాతి అడుగులోకి తీసుకువెళుతూ మనం ఊగుతున్న లోలకంలా ఉంటాము. యూరప్ వాసులకు, బరువు పెరుగుతున్న కొలది ఇలా శక్తిని మార్చే సామర్థ్యం తగ్గుతుంది. కాని తమ తలలపై బరువును మోసే ఆఫ్రికా స్త్రీలకు, వారి కండరాలు ఏ అదనపు పనిని చేయవలసిన అవసరం లేకుండానే వాస్తవికంగా ఆ సామర్థ్యం పెరుగుతుంది. అయితే, ఆ నైపుణ్యం రావాలంటే సంవత్సరాలు పడుతుంది.
“యెరూషలేము రోగలక్షణం”
“నగరం యొక్క తీవ్రమైన ఆత్మీయ భావోద్రేకాలతో ఉక్కిరిబిక్కిరి కావడం మూలంగా, తాము రక్షకులమని లేదా బైబిలులో ప్రస్తావించబడిన మరితర వ్యక్తులమని, లేదా దేవుడు తమకు ప్రత్యేకమైన వర్తమానాన్ని లేక ఆజ్ఞను ఇచ్చాడని నమ్మిన యాత్రికులకు వచ్చే బాధే” అది అని టైమ్ పత్రిక చెబుతుంది. “అనేకులకు మానసిక సమస్యల చరిత్ర ఉంది.” ఒక ఇటలీ దేశస్థుడు గోనెపట్ట ధరించి, గెడ్డం పెంచుకుని బేత్లెహేము వద్ద పర్వతాల్లో తిరుగుతూ, తాను యేసును అని చెప్పుకుంటున్నాడు. దిగంబరుడై, ఖడ్గం ధరించి పాత నగరంలో తిరిగే ఒక వ్యక్తి, అంధులను స్వస్థపర్చే పని తనకు అప్పగింపబడిందని చెబుతున్నాడు. దృఢంగా ఉండే కెనడా దేశస్థుడు తాను సమ్సోనును అని చెప్పుకుంటూ, తాను ఉంటున్న ఆసుపత్రి కిటికీ చువ్వలను పీకేసి పారిపోవడం ద్వారా “నిరూపించుకుంటున్నాడు.” ఆ రోగలక్షణమున్న వారిని సాధారణంగా జెరూసలేమ్లోని క్పార్ షాల్ అనే మానసిక చికిత్సాలయానికి తీసుకువెళతారు, అంటే వారిని స్వస్థపర్చడానికి కాదుగాని వారు చికిత్స కొరకు ఇంటికి వెళ్లగలిగేలా వారిని శాంతపర్చడానికే అక్కడికి తీసుకువెళతారు. ఆ ఆసుపత్రికి సంవత్సరానికి అలాంటి వారు దాదాపు 50 మంది దాకా వస్తారు, వారిలో ప్రాముఖ్యంగా పశ్చిమ యూరప్ మరియు అమెరికాల నుండి వచ్చినవారు ఉంటారు.