ప్రపంచ పరిశీలన
చక్కగా చదువగల, వ్రాయగల పిల్లలు
“పిల్లలకు కథలు చదివి వినిపించడం వారి లేఖననైపుణ్యాలను మెరుగుపర్చుతుందని” గ్లోబ్ అండ్ మెయిల్ అనే కెనడా వార్తాపత్రిక నివేదిస్తుంది. కెనడా, ఒంటారియో యొక్క విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఇటీవలి పరీక్షల ఫలితాల ప్రకారం, తమ బాల్య వయస్సులో తమకు కథలు చదివి వినిపించారని చెప్పిన విద్యార్థులు, తమ కొరకు అప్పుడప్పుడు మాత్రమే చదివి వినిపించిన లేక అసలు చదువని విద్యార్థులకంటే చాలా చక్కగా వ్రాశారు. “చదువడంలో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు వ్రాయడంలో కూడా మంచి మార్కులు పొందారు, అయితే పాఠశాల పుస్తకాలే కాక వేరేవి కూడా చదివే వారు అటు వ్రాయడం ఇటు చదువడం కూడా చాలాచక్కగా చేశారు” అని గ్లోబ్ చెప్పింది. ఒంటారియో ఉపాధ్యాయుల సమాఖ్య అధ్యక్షుని ప్రకారం, “14 ఏళ్ల వయస్సు వరకు అసలు చదవని లేక తమకు ఎవరైనా చదివివినిపించే అలవాటు లేని విద్యార్థులు, ఆ వయస్సు దాటిన తర్వాత దాన్ని అసలు చేయరని,” పరీక్షా ఫలితాలు చూపించాయి.
బైబిలుతో ఆటలాడటం
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ ముద్రణాలయం అనూహ్యమైన మార్పులతో బైబిలు యొక్క ఒక క్రొత్త సంచికను సిద్ధం చేసింది. “ఎవరినీ నొప్పించకుండ” ఉండాలన్న ప్రయత్నంలో, ఆ తర్జుమా లింగపర భేదం జాత్యంతర భేదం గలదని ఆరోపించబడగల, లేక యూదులకు విరుద్ధమైనదని రూపమివ్వబడగలదని చెప్పబడే భావోద్రేకాలను నిరాకరిస్తుంది. ఉదాహరణకు, ఈ నూతన తర్జుమా దేవున్ని “తండ్రి-తల్లి” అని సూచిస్తుంది. యేసు “మనుష్య కుమారుడు” కాదుగానీ “మానవునిగా” ఉంటాడు. యూదులు యేసు క్రీస్తును చంపారన్న ప్రస్తావనే ఆ తర్జుమాలో లేదు. దేవుని “కుడి చెయ్యి” ఆయన “గొప్ప చెయ్యి” అయినప్పుడు ఎడమ చేతి వాటం గలవారిపట్ల భేదం ఉందన్న ఆరోపణ కూడా తీసివేయబడుతుందని ద సన్డే టైమ్స్ చెబుతుంది.
చేపలు పట్టడానికి ముప్పువాటిల్లింది
విభిన్న దేశాల చేపలుపట్టే ఓడలగుంపులు క్షేత్ర జలాలు మరియు చేపలుపట్టే హక్కుల విషయమై పోట్లాడుతుండగా, ప్రపంచ చేపల ఉత్పత్తి దాని చివరి దశకు చేరిందని మరి భూమ్మీది అనేక భాగాల్లో వాస్తవానికి తగ్గిపోతుందని వరల్డ్వాచ్ సంస్థ నివేదిక హెచ్చరిస్తుంది. జల జీవుల సంఖ్య భూవ్యాప్తంగా తగ్గడానికి పర్యావరణ కాలుష్యం ఒక కారణమని ఒప్పుకుంటున్నప్పటికీ, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలు మరియు నల్ల, మధ్యదరా సముద్రాల్లోని చేపల సంఖ్య తగ్గడానికి వాణిజ్య మత్స్య పరిశ్రమలు విస్తారంగా అధికంగా చేపలు పట్టడమే ప్రధాన కారణమని నివేదిక చెబుతుంది. వరల్డ్వాచ్ నివేదిక ప్రకారం, కొన్ని ప్రాంతాల్లో చేపల దిగుబడి 30 శాతానికి తగ్గిపోయిందని మరి మహాసముద్ర సంపదను ప్రస్తుతం జరుగుతున్నట్లు సరిగా నిర్వహించకపోవడం కొనసాగితే, అక్షరార్థంగా లక్షలాది మంది మత్స్యకారులు త్వరలోనే నిరుద్యోగులౌతారని అజ్హాంస్ ఫ్రాంజ్-ప్రెస్ వార్తా సర్వీస్ చెబుతుంది.
పక్షి-గూటి పులుసు యొక్క పెరుగుతున్న ధర
హాంగ్కాంగ్ మరియు ఇతర ఆసియా పట్టణాల్లోని రెస్టారెంటుల్లో, అందరి అభిమాన వంటకం ఒక పక్షి యొక్క తినగల గూడు, దాన్ని తరచూ పులుసు (సూప్) చేస్తారు. ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ ప్రకారం, చాలామంది చైనీయులు వండిన గూటిని ఒక రుచికరమైన ఆహారంగా మాత్రమే కాక ఒక ఆరోగ్య టానిక్గా కూడా దృష్టిస్తారు. హాంగ్కాంగ్ మాత్రమే 1992లో 1 కోటి 70 లక్షల స్విఫట్లెట్ గూళ్లను ఉపయోగించుకున్నదని పరిరక్షించే గుంపులు అంచనావేశాయి. అయితే, వాటి అధిక వినియోగం, ఒక కిలోగ్రాము గూళ్ల పెద్ద మొత్తం ధరను 500 డాలర్లకు పెంచింది, మరి మంచి నాణ్యతగల గూళ్లు, పైన సూచింపబడిన ధరకు ఎనిమిదంతలు ఎక్కువ ఖరీదు చేయగలవు. ఆ గూళ్లను ఉత్పత్తి చేసే స్విఫట్లెట్ల ధర అంతకంటే ఎంతో ఎక్కువ ఉంది. గూళ్లను తీసేటప్పుడు గ్రుడ్లు మరియు పిల్లలు నాశనమవ్వడం స్విఫట్లెట్ల జనాబాలో కొన్ని తగ్గడానికి మరికొన్ని అంతరించడానికి దారి తీసింది.
క్షయకు సంబంధించిన పోరాటాన్ని ఓడిపోవడం
పారిస్నందలి లా పిట్యే-సాల్పెట్రైరీలోని బ్యాక్టీర్యాలజీ-వైరాలజీ విభాగం అధ్యక్షుడైన ప్రొఫెసర్ జాక్ గ్రాసే ప్రకారం, వ్యాధి నిర్మూలనా యుద్ధంలో, క్షయతో పోరాడటం “ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒక సంపూర్ణ విఫలంగా ఉంది.” రోగులకు చికిత్స చేయకపోతే, క్షయరోగులు 50 శాతంమంది మరణిస్తారు. ప్రపంచంలోని క్షయ వ్యాధిగ్రస్తుల్లో సగంమందికి రోగ నిర్ధారణ మరియు చికిత్స కాకుండా ఉంటే, సాంకేతికాభివృద్ధి చెందిన దేశాల్లోనే అసలు ప్రమాదం ఉంది, ఎందుకంటే అక్కడే యాంటీబయాటిక్లు ఉచితంగా లభిస్తాయి, అయితే వ్యాధి ఉన్నవారిలో సగం మంది మాత్రమే తమకు పూర్తిగా నయమయ్యే వరకు వాటిని వాడతారని ప్రొఫెసర్ గ్రాసే సూచించాడు. “మిగతా సగం చికిత్స చేయించుకోరు, లేక క్రమరహితంగా చేయించుకుంటారు, అదే ఎక్కువమంది, అంటే (చికిత్స చేయబడిన వారిలో 25 శాతం) మంది మరణించేలా చేస్తుంది, మరి యాంటీబయాటిక్లను తట్టుకొనగల ట్యూబర్కుల్ బాసిలస్ యొక్క సూక్ష్మజీవిని ఉత్పన్నం చేస్తుంది.”
మెచ్చుకోవడం ఒత్తిడిని తగ్గిస్తుంది
ప్రతి సంవత్సరం జర్మనీలో గుండెపోటువలన 2,00,000 మంది మరణిస్తున్నారు. ముఖ్య కారణమేంటి? జర్మనీలో పని చేయాలంటే “పూర్తిగా సమర్పించుకుని, అనుక్షణం ఒత్తిడిని సహించాల్సి ఉంటుంది గనుక ఒత్తిడే” కారణమని సూడెయిస్టి జెయిటంగ్ అనే వార్తాపత్రిక నివేదిస్తుంది. పని స్థలంలోని ఒత్తిడి వలన, అనారోగ్యం కారణంగా పనికి హాజరు కాలేకపోయేవారి సంఖ్య పెరుగుతుంది, అది పూర్తిగా అలసిపోవడానికి కూడా దారి తీస్తుంది. నర్సుల్లో సగంమందికి ఒత్తిడిననుభవిస్తున్న సూచనలు ఉన్నాయి, ముగ్గురు టీచర్లలో ఒకరు ముందే ఉద్యోగవిరమణ చేస్తున్నారు, వారిలో చాలామంది “నరాల బలహీనత” వల్లనే అలా చేస్తున్నారు. ఆరోగ్య భీమా కంపెనీలు పనివద్ద ఒత్తిడిని ఎలా తగ్గించాలన్న విషయాన్ని గురించి అధ్యయనం చేస్తున్నాయి. అనేక మధ్యతరహా కంపెనీల్లో నిర్వహించబడిన ఒక అధ్యయనం, ఒత్తిడికేది కారకమని అనిపిస్తుందో దాన్ని చూపిస్తుంది: సర్వే చేయబడిన పని వారిలో, 44 శాతం మంది తమ పనివద్ద ఎప్పుడూ మెచ్చుకోబడలేదు.
త్వరగా వయస్సుమళ్లకుండా నిరోధించడం
“ప్రజలు పిల్లలకు తగినట్లు ఇళ్లను రూపొందించుకుంటారు. మరి వాటిని పెద్దవాళ్లకు తగినట్లు ఎందుకు రూపొందించుకోకూడదు?” అని సావో పౌలో విశ్వవిద్యాలయం యొక్క గెరాంటాలజిస్ట్ విల్సన్ జేకబ్ ఫెల్యో అడుగుతున్నాడు. పెద్ద వాళ్లకు సురక్షితమైన ఇళ్లతోపాటు, వాళ్లు పడిపోయె ప్రమాదాన్ని తగ్గించేందుకు వారి నరాల వ్యవస్థను పటిష్టం చేసుకోడానికి వాళ్లు వ్యాయామం చేయాలని ఆయన సలహా ఇస్తున్నాడు. దీర్ఘాయువుకున్న అతిగొప్ప శత్రువులు ఏవి? సావో పౌలో విశ్వవిద్యాలయానికి చెందిన ప్లాస్టిక్ సర్జన్ రొజారియో ఇజార్ నీవ్స్ ప్రకారం, శత్రువులేవంటే “మందకొడియైన జీవిత విధానం, అసమతుల్యమైన ఆహారనియమం (ప్రత్యేకంగా క్రొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం), ధూమపానం, మత్తుపానీయాలను అధికంగా సేవించడం, ఒత్తిడి, నిద్రలేమి.” అత్యధిక ఒత్తిడి వ్యాధినిరోధక వ్యవస్థను బలహీనం చేస్తుంది, “బలహీనమైన వ్యవస్థ వేర్వేరు వ్యాధులతో అలాగే తుదకు వృద్ధాప్యం రావడంతో అతి సన్నిహిత సంబంధాన్ని కలిగి వుందని” జోర్నల్ డా టార్డే వివరిస్తుంది. డా. నీవ్స్ ఇంకా ఇలా చెబుతున్నారు: “జీవితంపట్ల నిరాసక్తత త్వరగా వయస్సు మళ్లడానికి ముఖ్య కారణం.”
శరీరాన్ని-కుట్టించుకోవడంలోని ఆరోగ్య ప్రమాదాలు
“ప్రజలు కొన్ని సంవత్సరాల క్రితం కుట్టించుకోని శరీర భాగాలను ఇప్పుడు కుట్టించుకుంటున్నారని” కెనడాలోని కెల్గరీ ఆరోగ్య సేవల కొరకు పర్యావరణ ఆరోగ్య నిర్దేశకుడైన జాన్ పెల్టన్ చెబుతున్నాడు. ద వాంకోవర్ సన్లోని ఒక నివేదిక ప్రకారం అందులో కనురెప్పలు, పెదవులు, నాలుకలు, నాభులు కూడా ఇమిడి ఉన్నాయి. ప్రభలమౌతున్న ఈ వెర్రిఅలవాట్లు ఎయిడ్స్ మరియు హెపిటైటిస్స్ బి, సిలను వ్యాపింపజేస్తాయన్న భయాలు, ఆల్బెర్టా హెల్త్నందలి పర్యావరణ ఆరోగ్య సేవలు శరీరాన్ని కుట్టుకునే విషయాన్ని నియంత్రించే సూచనలను ప్రవేశపెట్టడానికి ప్రోద్బలం చేశాయి. “బ్రాండ్ గుర్తులు వేయించుకోవడం, వాక్స్ ద్వారా శరీర భాగాల వెంట్రుకలను తీయించుకోవడం, పచ్చబొట్లు పొడిపించుకోవడం, ఎలెక్ట్రాలసిస్ మరియు ఇంద్రియ విప్లీనత వంటి వ్యక్తిగత సేవల క్రమరహితమైన, విభిన్నమైన శ్రేణిపై నూతన ప్రమాణాలలో తుదకు చేరుతాయని” మరి ఆ ప్రమాణాల మొదటి ప్రతి ప్రజా ఆరోగ్య అధికారులు, పరిశ్రమ ద్వారా పరిశీలించబడుతుందని కూడా నివేదిక చెబుతుంది. అయితే, చెవులను కుట్టే పరికరంతోనే శరీరాన్ని కుట్టడం విషయానికొస్తే, ఆ పనిని చేసే వారే ఇలా అంగీకరిస్తున్నారు: “ప్రజలు అంటురోగంతో ఆసుపత్రులకు వెళ్లడం మేం చూశాము. అది నిజానికి చాలా భయంగొలిపే విషయం.”
జైలుశిక్ష శాతం పెరుగుతోంది
నేరం ప్రపంచవ్యాప్తంగా పెరిగే కొలది, జైలుకు వెళ్లేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. రష్యాలో ప్రతి 1,00,000 మంది ప్రజల్లో 558 మంది ఖైదు చేయబడుతున్నారు, దాని తర్వాత అమెరికాలోని ప్రతి 1,00,000 మందిలో 519 మంది ఖైదు చేయబడుతున్నారు. తర్వాత 368 మందితో దక్షిణాఫ్రికా, 229 మందితో సింగపూర్, 116 మందితో కెనడా వరుసలో ఉన్నాయి. మునుపటి సోవియట్ గణరాజ్యం విచ్ఛినమైనప్పటినుండి, రష్యాలో హత్యలు ఇతర నేరాలు అత్యధికంగా పెరిగిపోయాయి, మరి నేరాల శాతంలో పూర్వం అగ్రస్థానంలో ఉన్న అమెరికాకంటే ఖైదు చేయబడటం అక్కడ పెరిగిపోయింది. మరి ఐరోపా దేశాలు అమెరికాకంటే ఆరింట ఒకవంతు మంది ప్రజలను మాత్రమే ఎందుకు ఖైదు చేస్తాయి? “ఒక వివరణేమంటే, అన్ని విధాలైన నేరాలు దేశాలన్నింటిలో స్వల్ప తేడాను కలిగి ఉన్నప్పటికీ, అమెరికా, రష్యా మరియు దక్షిణాఫ్రికాలో దౌర్జన్యం ఎక్కువగా ఉంది. అయితే కారణాలేమైనప్పటికీ, ఖైదు చేయబడే విషయంలోని తేడా పెరుగుతూపోయేలా ఉందని” యు.ఎస్. న్యూస్ & వరల్డ్ రిపోర్ట్ చెబుతుంది.
ఇబ్బందుల్లో ఉన్న విశ్వవిద్యాలయాలు
“ఆఫ్రికాలోని అలక్ష్యం చేయబడిన విశ్వవిద్యాలయాలు పతనమయ్యే స్థితిలో ఉన్నాయని” జొహానస్బర్గ్లోని వీకెండ్స్టార్ పత్రిక నివేదిస్తుంది. ధనసహాయ లోపం కారణంగా కొన్ని కంప్యూటర్లు మాత్రమే ఉన్నాయి, కొన్ని విద్యాలయాల్లో టెలిఫోన్లు తీసివేయబడ్డాయి. ఒక విశ్వవిద్యాలయంలో 35,000 మంది రిజిస్టర్ చేయబడిన విద్యార్థులు ఉన్నారు, అయితే అది మొదట కేవలం 5,000 మంది కొరకే నిర్మించబడింది. ఉగాండాలోని ఒకప్పటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో సగం లెక్చరర్ సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ క్యాంపస్లో లెక్చరర్ జీతం నెలకు 19 డాలర్లు మాత్రమే. కొన్ని విశ్వవిద్యాలయాలు లెక్చరర్లు లేక విద్యార్థుల సమ్మె ఫలితంగా కొన్ని నెలలుగా మూతబడి ఉన్నాయి. కెన్యాకు చెందిన ఒక ప్రొఫెసర్ ఇలా చెప్పారు: “ఆఫ్రికాలో విద్యాసంబంధ స్వనాశనం మరీ క్షీణిస్తుంది.”