భాగం 3
విజ్ఞానశాస్త్రం—మానవుని నిరంతర సత్యాన్వేషణ
మతము, విజ్ఞానశాస్త్రం—చెడు కలయిక
వేలకొలది సంవత్సరాలుగా విజ్ఞానశాస్త్రం సత్యాలకొరకు చేస్తున్న అన్వేషణ తరువాతి పరిశోధనకు ఒక దృఢమైన పునాది వేసినట్లు కనబడుతున్నది. నిశ్చయంగా యికముందు కొనసాగే అభివృద్ధిని ఏదీకూడ ఆపలేదు. అయిననూ, ది బుక్ ఆఫ్ పాప్యులర్ సైన్స్ చెబుతున్నట్లుగా, “క్రీ. శ. మూడు, నాలుగు, ఐదు శతాబ్దాలలో విజ్ఞానశాస్త్రం నిజంగా దుస్థితిని అనుభవించింది.”
ఈ పరిస్థితికి ప్రాముఖ్యంగా రెండు సంఘటనలు దోహదం చేశాయి. మొదటి శతాబ్దంలో, యేసుక్రీస్తుతో ఒక నూతన మతసంబంధ యుగం ప్రవేశపెట్టబడింది. దానికి ముందు కొన్ని దశాబ్దాల క్రితమే, సా. శ. పూ. 31లో రోమా సామ్రాజ్య స్థాపనతో ఒక నూతన రాజకీయ యుగం ఉద్భవించింది.
పైన ఉదహరించిన గ్రంథం చెబుతున్నట్లుగా, గ్రీకు వేదాంతుల వలే కాకుండా, వారి తర్వాత వచ్చిన రోమనులు, “గూఢమైన సత్యాలను వెదకుటకంటే, ప్రతిదినజీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుటలో ఎక్కువ ఆసక్తిని చూపించారు.” అయితే న్యాయబద్ధంగాచూస్తే, “నిష్కల్మషమైన విజ్ఞానశాస్త్రానికి వారి తోడ్పాటు చాలాతక్కువ.”
అయినప్పటికి, ఆ కాలంవరకూ కూడబెట్టిన విజ్ఞానశాస్త్ర జ్ఞానంలోకి అడుగుపెట్టుటలో రోమనులు కారకమైరి. ఉదాహరణకు, పెనీ ది ఎల్డర్ అనునతడు మొదటి శతాబ్దంలో నేచురల్ హిస్టరీ అని పిలువబడే ఒక వైజ్ఞానిక సంకలనం తయారుచేశాడు. తప్పులులేకుండా లేకపోయినప్పటికీ, ఇది అనేక రకాల వైజ్ఞానిక సమాచారాన్ని భద్రపరచింది, లేకపోతే అది దాని తర్వాతి తరాలవారికి దొరకకపోయి ఉండేది.
మతపరంగా చూసినట్లైతే, బహుగా విస్తరిస్తున్న క్రైస్తవసంఘం ఆనాటి వైజ్ఞానిక అన్వేషణలో నిమగ్నంకాలేదు. క్రైస్తవులు వైజ్ఞానిక అన్వేషణకు వ్యతిరేకులని కాదు, కాని క్రీస్తు స్వయంగా స్థాపించిన క్రైస్తవ ప్రాధాన్యత ఏమనగా మతసంబంధ సత్యాన్ని సరళంగా అర్థంచేసుకొని, వాటిని వ్యాప్తిచేయడమే.—మత్తయి 6:33; 28:19, 20.
మొదటి శతాబ్దం ముగియక పూర్వమే, వారు వ్యాప్తిచేయవలసిన మతసంబంధ సత్యాన్ని మతభ్రష్టులైన క్రైస్తవులు అప్పటికే కలుషితం చేయడం మొదలుపెట్టారు. ముందుగానే ప్రవచించినట్లుగా, తర్వాత వారు దీనికొక మతభ్రష్టమైన క్రైస్తవత్వాన్ని స్థాపించుటకు దోహదపడింది. (అపొస్తలుల కార్యములు 20:30; 2 థెస్సలొనీకయులు 2:3; 1 తిమోతి 4:1) వారు మతసంబంధ సత్యాన్ని తృణీకరించుటతోపాటు వైజ్ఞానిక సత్యంయెడల వారి అలక్ష్యతను, కొన్ని సందర్భాల్లో శతృత్వాన్నికూడ చూపినట్లు తదనంతర సంఘటనలు రుజువుచేశాయి.
“క్రైస్తవ” ఐరోపా దాని నాయకత్వాన్ని పోగొట్టుకొనుట
ది వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా వివరించునదేమనగా, మధ్యయుగంలో (5 నుండి 15వ శతాబ్దం వరకు), “ఐరోపాలో, విద్యావంతులు ఎక్కువగా ప్రకృతిని గూర్చి అధ్యయనం చేయుటకంటే, వేదాంతంలో లేదా మతాన్ని గూర్చి అధ్యయనం చేయుటలో ఆసక్తి కల్గియుండిరి.” కొల్లియర్స్ ఎన్సైక్లోపీడియా గమనిస్తున్నట్లుగా, ఇది “ప్రకృతి అన్వేషణను నొక్కిపలుకుటకు బదులుగా, రక్షణను ఎక్కువ నొక్కిచెప్పినందున విజ్ఞానశాస్త్రాన్ని పురికొల్పుటకు బదులు దాన్ని ఎక్కువ ఆటంకపరచింది.”
అలా ఆటంకముగా పనిచేయుట క్రీస్తు బోధల ఉద్దేశము కాదు. అయినప్పటికి, క్రైస్తవ మతసామ్రాజ్యం అమర్త్యమైన ఆత్మయొక్క రక్షణను గూర్చి ఎక్కువగా నొక్కిచెప్పడంతోపాటు దాని అబద్ధ మతభావనల వ్యూహలు ఈ అభివృద్ధిని ప్రోత్సహించినవి. ముఖ్యంగా సన్యాసిమఠాలలో చర్చి ఆధ్వర్యం క్రింద ఉపదేశం జరిగేది. ఈ మతసంబంధ వైఖరి వైజ్ఞానిక అన్వేషణ వేగాన్ని తగ్గించింది.
సామాన్య శకారంభంనుండి కూడ వైజ్ఞానిక విషయాలు వేదాంతశాస్త్రంతో పోల్చితే, రెండవ స్థానాన్ని మాత్రమే పొందినవి. ప్రాముఖ్యంగా కేవలం వైద్యరంగంలో మాత్రమే వైజ్ఞానిక అభివృద్ధి అనేది నోచుకుందని చెప్పవచ్చును. ఉదాహరణకు, సా. శ. మొదటి శతాబ్దంలో “హిప్పోక్రేటిస్ ఆఫ్ రోమన్స్” అని పిలువబడిన, రోమనుల వైద్య రచయిత ఆలస్ కెల్సస్, ప్రస్తుత వైద్య ఆదర్శగ్రంథము అని గుర్తించబడిన దానిని వ్రాశాడు. గ్రీకు ఔషధవిజ్ఞానవేత్త మరియు నీరో రోమను సైన్యంలో శస్త్రవైద్యుడైన పెడానియస్ డియోస్కొరిడెస్ ఔషధవిజ్ఞాన సంబంధ పుస్తకాన్ని పూర్తిచేశాడు, అది చాలా శతాబ్దాలు విస్తృతంగా ఉపయోగించబడింది. గేలన్ అనే రెండవ శతాబ్దపు గ్రీకు దేశస్థుడొకడు, ప్రయోగాత్మక శరీర ధర్మశాస్త్రాన్ని కనుగొనడంద్వారా వైద్యసిద్ధాంతాలపై, ఆచారాలపై, తనకాలం మొదలుకొని మధ్యయుగం వరకూ ప్రభావం చూపించాడు.
వైజ్ఞానిక స్తబ్ధత 15వ శతాబ్దం తరువాత కూడ కొనసాగింది. ఈ కాలంలో ఐరోపాలోని శాస్త్రవేత్తలు అన్వేషణలు చేశారనుట వాస్తవమే, కాని వీటిలో ఎక్కువ భాగం, అసలైనవి కావు. టైమ్ పత్రిక యిలా తెల్పుతున్నది: “[చైనీయులు] ప్రపంచంలో మొట్టమొదటి విజ్ఞానశాస్త్ర ప్రవీణులైయుండిరి. ఐరోపావారికంటే చాలాకాలం క్రితమే, దిక్సూచిని ఎలా ఉపయోగించాలో, కాగితము, తుపాకిమందు ఎలా తయారుచేయాలో, [మరియు] చలించే టైపు మిషన్తో ఎలా ముద్రించాలో వారికి తెలుసు.”
ఆవిధంగా, క్రైస్తవ ఐరోపాలో వైజ్ఞానిక ఆలోచన యెడలగల సాధారణ శూన్యత కారణంగా, క్రైస్తవేతర సాంప్రదాయాలు ముందంజవేశాయి.
వైజ్ఞానిక ఉన్నతి
తొమ్మిదవ శతాబ్దంనాటికల్లా, విజ్ఞానశాస్త్ర విషయాలలో అరబ్బీ శాస్త్రవేత్తలు త్వరితగతిలో నాయకులయ్యారు. ప్రాముఖ్యంగా 10, 11వ శతాబ్దాలలో, క్రైస్తవ మతసామ్రాజ్యం నిష్ఫలంగానున్న సమయంలో, వారు అన్వేషణల స్వర్ణయుగాన్ని అనుభవించారు. వైద్యం, రసాయనశాస్త్రం, వృక్షశాస్త్రం, భౌతికశాస్త్రం, ఖగోళశాస్త్రంలోను, వాటన్నింటికంటే గణితశాస్త్రంలోను వారు ప్రాముఖ్యమైన పాత్రను వహించారు. (ఇరవైయవ పేజీలోని బాక్స్ చూడండి.) కొలంబియా విశ్వవిద్యాలయంలో సహాయక ప్రొఫెసర్ అయిన మయాన్ జెడ్. మదీనా చెబుతున్నదేమనగా, “ఆధునిక త్రికోణశాస్త్రం, అలాగే బీజగణితం, క్షేత్రగణితంతోసహా, చెప్పుకోదగినంతగా అవి అరబ్బీవారు సృష్టించినవే.”
ఈ వైజ్ఞానిక జ్ఞానం చాలామట్టుకు అసలుసిసలైందే, కాని దీనిలో కొంతభాగం విస్తారమైన గ్రీకు వేదాంతంపై ఆధారపడి, మతమౌఢ్యంతో వచ్చిందనుటలో ఆశ్చర్యంలేదు.
సాపేక్షంగా చూసినట్లైతే సామాన్య శకారంభంలో, క్రైస్తవ మతసామ్రాజ్యం పర్షియాకు, ఆతర్వాత అరేబియా, ఇండియాలకు వ్యాప్తిచెందింది. ఐదవ శతాబ్దకాలంలో, కాన్స్టాంటినోపిల్కు మూలపురుషుడైన నెస్టోరియస్, ఒక వివాదంలో చిక్కుకున్నాడు, అది తూర్పుప్రాంతపు చర్చిలో అంతఃకలహానికి నడిపి, నెస్టోరియన్ అనే ఒక గుంపు దానిలోనుండి ఏర్పడటానికి దారితీసింది.
ఏడవ శతాబ్దంలో, ఇస్లాం అనే ఒక నూతన మతం హఠాత్తుగా ప్రపంచ రంగంలోకి దిగి, వ్యాపింపసాగింది, ఈ నెస్టోరియన్లు వారి అరబ్బీ విజేతలకు తమ జ్ఞానాన్ని వెంటనే అందించారు. ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలిజియన్ ప్రకారంగా, “గ్రీకు పాఠ్యపుస్తకాలను మొదట సిరియా, ఆతర్వాత అరబ్బీ భాషలలోకి అనువదించడం ద్వారా గ్రీకు విజ్ఞానశాస్త్రాన్ని, వేదాంతాన్ని వృద్ధిచేయుటలో మొట్టమొదటివారు నెస్టోరియన్లే.” “గ్రీకు ఔషధాలను బాగ్దాద్లోకి మొట్టమొదట ప్రవేశపెట్టింది” కూడ వీరే. అరబ్బీ శాస్త్రవేత్తలు నెస్టోరియన్ల నుండి నేర్చుకున్న విషయాలపై ఆధారపడి ప్రగతిని సాధించడం మొదలుపెట్టారు. అరబ్ సామ్రాజ్యంలో సిరియాకు బదులు అరబ్బీభాషను వైజ్ఞానిక భాషగా పెట్టారు, అది వైజ్ఞానిక రచనలలో తగిన భాషగా నిరూపించబడింది.
కాని అరబ్బీయులు జ్ఞానాన్ని స్వీకరించడమే కాకుండా దానిని తృణీకరించారు. సిద్దీ అను పేరుగల ఆఫ్రికా దేశస్థులు—700 సంవత్సరాలు నివసించడానికి—స్పెయిన్ద్వారా ఐరోపాలోకి తరలి వెళ్లినపుడు, జ్ఞానవృద్ధి పొందిన ముస్లిం సంస్కృతిని వారితోపాటు తెచ్చారు. ఎనిమిదవ శతాబ్దంలోని క్రైస్తవమత దండయాత్రలు చేసినవారు, 1096-1272 మధ్యకాలంలో పాశ్చాత్య దండయాత్రల్లో పాల్గొన్నవారు, అభివృద్ధి సాధించిన ఇస్లాం నాగరికతతో పరిచయులై, ప్రభావితులైరి. ఒక రచయిత వివరించినట్లుగా, వారు “ఒక నూతన ముద్రలుగల అతిథితో” తిరిగి వచ్చారు.
అరబ్బీ గణితశాస్త్ర సూక్ష్మీకరణ
రోమనులు ఉపయోగించే అక్షరాలకు బదులుగా అరబ్బీ అంకెలను పరిచయం చేయడమనేది అరబ్బీయులు ఐరోపాకు చేసిన ప్రాముఖ్యమైన ఒక తోడ్పాటు. వాస్తవానికి, “అరబ్బీ అంకెలు” అని పిలువడం తప్పు, “హిందూ అరాబిక్ అంకెలు” అని అనడమే అత్యంత ఖచ్చితమైన పదప్రయోగమౌతుంది. నిజమే, 9వ శతాబ్దపు అరబ్బీ గణితశాస్త్రవేత్త, ఖగోళశాస్త్రవేత్తయైన ఆల్ క్వారిజ్మి ఈ పద్ధతి గురించి వ్రాశాడు, కాని ఒక వెయ్యి సంవత్సరాల పూర్వమే, అనగా సా. శ. పూ. మూడవ శతాబ్దంలోనే దీనిని ప్రతిపాదించిన ఇండియాలోని హిందూ గణితశాస్త్రవేత్తలనుండి దీనిని సంగ్రహించాడు.
ప్రఖ్యాతిగాంచిన గణితశాస్త్రజ్ఞుడైన లెనార్డ్ ఫెబినాట్చె (లెనార్డ్ పిసా అనికూడ పిలుస్తారు) 1202లో లెబర్ అబాకెలో (అబాకస్ పుస్తకంలో) పరిచయం చేయకముందే ఈ పద్ధతి ఐరోపాలో కొద్ది వాడుకలోనే వుండెను. ఈ పద్ధతియొక్క ప్రయోజనాన్ని ప్రదర్శిస్తూ, ఆయన యిలా వివరించాడు: “ఇండియా అంకెలు తొమ్మిది: 9 8 7 6 5 4 3 2 1. ఈ తొమ్మిది అంకెలతోను, 0 అనే గుర్తుతో . . . ఏ సంఖ్యనైనా వ్రాయవచ్చును.” ప్రథమంగా ఐరోపావారు చురుకుగా ప్రతిస్పందించలేదు. కాని మధ్యయుగాంతానికి, వారు క్రొత్త గణనపద్ధతిని స్వీకరించారు, మరి దాని సరళత వైజ్ఞానాభివృద్ధికి దోహదపడింది.
ముందుగా ఉపయోగించిన రోమను అంకెలకంటే హిందూ అరాబిక్ అంకెలు సరళత కల్గినవని, ఒకవేళ మీరు అనుమానిస్తే, MCMXCIII నుండి LXXIXను తీసివేయడానికి ప్రయత్నించండి. చిక్కుగా వుందా? బహుశా 1,993నుండి 79 తీసివేయుట మీకు కొంత సులభంగా ఉండవచ్చును.
ఐరోపాలో నేర్చుకొనుటకు అభిరుచిని మరలా రేకెత్తించుట
ముస్లిం ప్రపంచంలో నేర్చుకోవాలనే అభిరుచి జ్వాల 12వ శతాబ్దం ఆరంభంలో కాంతిహీనమగుటకు ప్రారంభమయ్యింది. అయినప్పటికి, ఐరోపాలో గుంపులుగా విద్యావంతులైనవారు ఆధునిక విశ్వవిద్యాలయ అగ్రగాములుగా తయారగుటకు ఆరంభించుటతో, అది తిరిగి ప్రకాశించింది. పన్నెండవ శతాబ్ద మధ్యకాలంలో, పారిస్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలు జీవం పోసుకున్నాయి. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం 13వ శతాబ్దారంభంలోనూ, ప్రాగ్, హీడల్బర్గ్ విశ్వవిద్యాలయాలు 14వ శతాబ్దంలోనూ క్రియాశీలమయ్యాయి. పందొమ్మిదవ శతాబ్దంనాటికల్లా, వైజ్ఞానిక పరిశోధనలో విశ్వవిద్యాలయాలు ప్రముఖ కేంద్రాలుగా మారాయి.
తొలుత ఈ పాఠశాలలన్నీ మతం ద్వారా బహుగా ప్రభావంపొంది, ఎక్కువ అధ్యయనాలు వేదాంతంపై లేదా వేదాంతంవైపు కేంద్రీకృతమయ్యాయి. కాని అదే సమయంలో, ఈ పాఠశాలలు గ్రీకు తత్వశాస్త్రాన్ని, ప్రాముఖ్యంగా అరిస్టాటిల్ రచనలను స్వీకరించాయి. ది ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలిజియన్ ప్రకారంగా, “విద్యాపరమైన బోధనా పద్ధతి . . . మధ్యకాలమంతటిలోనూ . . . నిర్వచించడం, విభాగించడం, వ్యాఖ్యానాలను ప్రతిపాదించడం, కష్టమైన విషయాలను తీర్మానించండం అంతా అరిస్టాటిల్ పద్ధతిలోనే తర్కించి, రూపొందించబడింది.”
పదమూడవ శతాబ్దపు విద్యావేత్త థామస్ అక్వినాస్ అరిస్టాటిల్ బోధనాపద్ధతిని క్రైస్తవ వేదాంతంతో మిళితం చేయాలని ఉద్దేశించాడు, తరువాత “క్రిష్టియన్ అరిస్టాటిల్” అని పిలువబడ్డాడు. కాని కొన్ని విషయాల్లో ఆయనకు అరిస్టాటిల్కు తేడావుంది. ఉదాహరణకు, లేఖనాలతో ఏకీభవిస్తూ భూమి సృష్టించబడిందని చెప్పి, అది ఎల్లప్పుడూ ఉనికిలో ఉండేదనే సిద్ధాంతాన్ని అక్వినాస్ తృణీకరించాడు. ది బుక్ ఆఫ్ పాప్యులర్ సైన్స్ చెబుతున్నట్లుగా, ఆయన “మన విశ్వం ఒక క్రమబద్ధమైనదని దానిని హేతువుచేత గ్రహించగలమనే విశ్వాసాన్ని దృఢంగా పట్టుకొంటూ ఆయన ఆధునిక విజ్ఞానశాస్త్ర అభివృద్ధికి విలువైన సహాయాన్నందించాడు.”
అయినప్పటికీ, చాలావరకూ, అరిస్టాటిల్, టోలమీ, గేలన్ల బోధలు అమోఘమైన సత్యాలుగా చర్చి సభ్యులద్వారా కూడ అంగీకరించబడ్డాయి. ముందుగా తెలియజేసిన పుస్తకం యిలా వివరిస్తున్నది: “మధ్యకాలంలో, వైజ్ఞానిక ప్రయోగాలు, ప్రత్యక్ష పరిశీలన అనేవి క్షీణదశలోనున్నపుడు, అరిస్టాటిల్ మాటయే సూత్రంగావుంది. మధ్యకాలంనాటి ఉపాధ్యాయులు అనేక సత్యాలను ఒక ‘వైజ్ఞానిక’ పరిశీలనయని నిరూపించడానికి ఇప్సె డిక్సిట్ (‘తనంతట తానే ఇది చెప్పాడు’) అనే వాదనను ఉపయోగించారు. ఈ పరిస్థితులలో అరిస్టాటిల్ యొక్క దోషాలు, ప్రాముఖ్యంగా భౌతిక, ఖగోళశాస్త్రాలలో, వైజ్ఞానిక ఉన్నతిని చాలా శతాబ్దాలవరకూ నిలిపివేశాయి.”
గత దృక్పథాలకు యిలా గ్రుడ్డిగా హత్తుకొనియుండటాన్ని, 13వ శతాబ్దపు ఆక్స్ఫర్డ్ ప్రైయర్ రోజర్ బేకన్ అనేవ్యక్తి సవాలుచేశాడు. “మధ్యయుగంలో విజ్ఞానపు మహాజ్ఞాని” అని పిలువబడిన బేకన్ ఒక్కడే చాలామట్టుకు ప్రయోగించడం ద్వారానే వైజ్ఞానిక సత్యాలను నేర్చుకోగలమని వాదించాడు. స్పష్టంగా 1269కు పూర్వమే, యీ సత్యాలను ఇతరులు గ్రహించుటకు పూర్వం చాలా శతాబ్దాల క్రితమే, మోటారు వాహనాలు, విమానాలు, మోటారుతో కూడిన నౌకలనుగూర్చి ఆయన ముందుగానే ప్రవచించాడని చెప్పబడింది.
అయినప్పటికి, ముందు చూపు, సూక్ష్మబుద్ధిగల మేథస్సు ఉన్నప్పటికి, సత్యాలను గూర్చి బేకన్కు మితమైన జ్ఞానమే ఉండెను. ఆయన ఖగోళశాస్త్రం, ఇంద్రజాలం, రసాయన శాస్త్రాన్ని దృఢంగా విశ్వసించాడు. నిజంగా విజ్ఞానశాస్త్రం అనేది సత్యాన్ని అన్వేషించుటలో కొనసాగిస్తున్న పరిశోధనయని, ఎల్లప్పుడూ పునర్విమర్శకు గురియౌతుందని ఇది ప్రదర్శిస్తున్నది.
వైజ్ఞానిక పరిశోధనయనేది 14వ శతాబ్దంలో నిష్క్రియయైనట్లుగా కన్పించినప్పటికి, 15వ శతాబ్దం దాని చివరిస్థాయికి చేరుకుంటుండగా, వైజ్ఞానిక సత్యాల కొరకు మానవజాతి అన్వేషణ ముగింపుకు రానేలేదు. నిజానికి, వాటి తర్వాత సంభవించిన వాటిని అన్వేషించడానికి రాబోయే 500 సంవత్సరాలు కూడ సరిపోవు. వైజ్ఞానిక విప్లవంయొక్క ద్వారం వద్దనే ప్రపంచం నిలబడివుంది. ప్రతీ విప్లవం వలెనే, ఇదికూడ హీరోలు, ప్రతినాయకులు, వీరందరికంటే, బాధితులను కల్గివుంటుంది. మా తదుపరి సంచికలో “విజ్ఞానశాస్త్రం—మానవజాతి సత్యం కొరకు కొనసాగిస్తున్న అన్వేషణ” యొక్క 4వ భాగంలో మరెక్కువ నేర్చుకోండి. (g93 5/8)
[18వ పేజీలోని బాక్సు]
అరబ్బీ విజ్ఞానశాస్త్ర స్వర్ణయుగం
అల్ క్వారిజ్మి (ఎనిమిది, తొమ్మిదవ శతాబ్దం), ఇరాకీ గణితశాస్త్రవేత్త, ఖగోళశాస్త్రవేత్త; అరబ్బీ భాషలో “విరిగిన భాగాల సంయోగం” అని అర్థమిచ్చే ఆల్జెబ్రె నుండి పుట్టిన “ఆల్జీబ్రా” అనే పదాన్ని గుర్తించినవాడు.
అబు మూసా జాబిర్ ఇబెన్హియాన్ (ఎనిమిది, తొమ్మిదవ శతాబ్దం), రసాయన శాస్త్రజ్ఞుడు; అరబ్ రసాయనశాస్త్ర పితామహుడుగా పిలువబడ్డాడు.
అల్ బట్టాని (తొమ్మిది, పదవ శతాబ్దం), ఖగోళశాస్త్రవేత్త, గణితశాస్త్రవేత్త; టోలమీ ఖగోళశాస్త్ర సంబంధ లెక్కలను మెరుగుపర్చాడు, తద్వారా మరింత ఖచ్చితంగా సంవత్సరం, ఋతువుల గడువులాంటి విషయాలను గుర్తించగల్గడం జరిగింది.
అరాజి (రాజెజ్) (తొమ్మిది, పదవ శతాబ్దం), ప్రముఖులలో ఒకడై, పుట్టుకతోనే పారశీక వైద్యుడు; మశూచికానికి, పొంగుకు మధ్య తేడాను, జంతువులు, కాయగూరలు, లేదా ఖనిజాలవంటి అన్నిరకాల పదార్థాలను వర్గీకరించుటలో మొట్టమొదటివాడు.
బస్రాకు చెందిన ఎబు ఆలే ఎల్హాసన్ ఇబెనెల్హిథెమ్ (10నుండి 11వ శతాబ్దం), గణితశాస్త్రవేత్త, భౌతికవిజ్ఞానవేత్త; వక్రీకరణం, పరావర్తనం, బైనాక్యులర్ దృశ్యం, వాతావరణ సంబంధ వక్రీకరణంతో సహా దృక్శాస్త్ర సిద్ధాంతానికి ప్రాముఖ్యమైన సహాయాన్నందించాడు; దృశ్యం అనేది ఒక వస్తువునుండి కంటికి వచ్చే కాంతి ప్రభావమేనని మొట్టమొదట ఖచ్ఛితంగా వివరించాడు.
ఓమర్ ఖయ్యామ్ (11 నుండి 12వ శతాబ్దం), ప్రఖ్యాతిగాంచిన పారశీక గణితశాస్త్రవేత్త, భౌతికవిజ్ఞానవేత్త, ఖగోళశాస్త్రవేత్త, వైద్యుడు, తత్వవేత్త; పశ్చిమప్రాంతంలో ఈయన పద్యాలకు పేరుగాంచాడు.
[16వ పేజీలోని చిత్రాలు]
శతాబ్దాల తరబడి అరిస్టాటిల్ (పైన), ప్లాటో (క్రింద) వైజ్ఞానిక విషయాల్లో దృఢంగా ప్రభావం చూపించారు
[Credit Lines]
National Archaeological Museum of Athens
Musei Capitolini, Roma