ప్రపంచ పరిశీలన
ధనిక-పేద వర్గాల మధ్యగల అంతరం పెరుగుతూంది
గత 30 సంవత్సరాల్లో ధనిక-పేద వర్గాల మధ్యగల అంతరం రెండింతలైందని, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం కొరకు ప్రచురింపబడిన హ్యుమన్ డెవెలప్మెంట్ రిపోర్టు 1992, తెల్పుతుంది. ఆయాదేశాల సరాసరిని ఆధారం చేసుకుని చూస్తే, 1960లో ప్రపంచంలోని 20 శాతం సంపన్న వర్గం, అదే 20 శాతం మందున్న నిరుపేదలకంటె 30 రెట్లు ధనికులై యుండిరి. ఆ సంపన్నులు 1989 నాటికి యింకా 60 రెట్లు అధిక సంపన్నులయ్యారు. ఒక్కొక్కరిగా తీసుకుంటే, ప్రపంచంలో వందకోట్ల సంపన్నులు వందకోట్ల నిరుపేదలకంటె దాదాపు 150 రెట్లు ధనికులై యున్నారు. (g92 11/8)
అతిప్రాచీన బేకరీ?
అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్టు ప్రకారం ఈజిప్ట్ పిరమిడ్స్ దగ్గర పనిచేస్తున్న భూగర్భ శాస్త్రజ్ఞులు కనిపెట్టినదే, ప్రపంచంలోకెల్ల అతి ప్రాచీన బేకరీ కావచ్చునని అనుకుంటున్నారు. పిరమిడ్లను తయారుచేస్తూ వుండిన పనివారికి రొట్టెలందించుట కొరకే నిశ్చయంగా దాన్ని వుపయోగించారు. ఈజిప్ట్ శాస్త్రజ్ఞుడు, త్రవ్వకాల డైరెక్టర్లలో ఒకరైన మార్క్ లెనర్ యిలా అన్నారు: “రోజుకు సులభంగా 30,000 మందికి సరిపడే రొట్టెలను ఇక్కడ తయారు చేయగలిగిన స్థోమత దీనికుండెనని మేమంటున్నాము.” తీవ్రమైన వేడిని, దట్టమైన నల్లని పొగమూలంగా ఆ బేకరీలో పనిచేసే పరిస్థితులు భయంకరంగా ఉండి వుంటాయని లెనర్ అభిప్రాయపడుతున్నాడు. “ఈ గదులు వర్షం కురిసే నిశిరాత్రివలెయుండ వచ్చునని” ఆయన చెబుతున్నారు. “మేము 45 సెంటీమీటర్ల మందంతో పేరుకుపోయివున్న నల్లని బొగ్గుగుండా త్రవ్వాము.” ఆ బేకరీ పిరమిడ్లను నిర్మించిన కాలం నాటిదేనని నమ్ముతున్నారు. (g92 10/22)
నైజీరియా జనాబా లెక్కలు
మార్చి 20, 1992 నైజీరియాలోని దినపత్రికలన్నీ ఒకే సంఖ్యను—88.5 మిలియన్లు అని పెద్ద అక్షరాలలో వేసినవి. ఈ సంఖ్య నిజానికి 8,85,14,501 అని నవంబర్ 1991లో నైజీరియా దేశ జనాబా లెక్కలు తీయగా వచ్చిన మొత్తం జనాబా సంఖ్యయని దేశానికి ప్రకటించారు. జనాబా లెక్కలు రెండు ఆశ్చర్యకర సంగతులను బయల్పరచింది. ఒకటేమంటే, అనేక దేశాలలో వున్న దానికి భిన్నంగా ఇక్కడ స్త్రీల కంటే పురుషుల సంఖ్యే కొంచెం ఎక్కువగా వున్నది. రెండవదేమంటే, 1963 సంవత్సర జనాబా లెక్కల ఆధారంగా ఇప్పుడు 10 కోట్ల నుండి 12 కోట్ల వరకు వుంటుందన్న జనాబాకంటె ఎంతో తక్కువయ్యారు. అయితే, ఊహించిన దానికన్నా 20 శాతం తక్కువే ఉన్నప్పటికీ, నైజీరియా జనాబా మాత్రం ఆఫ్రికా ఖండంలోకెల్ల అత్యంత ఎక్కువ జనాబాగల దేశం. (g92 11/8)
కల్తీమందు హెచ్చరిక
ప్రతి సంవత్సరం దొంగ వ్యాపారస్థులు కల్తీ మందుల అమ్మకాల ద్వారా కోట్లాది డాలర్లు సంపాదిస్తున్నారు. అయితే ఇతర కల్తీ సరుకుల మాదిరి కాకుండా, “యీ కల్తీ మందులు ఆరోగ్యాన్ని తీవ్రంగా పాడుచేసి, చంపగలవని” ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. వాటిలో అనేక మందులకు వైద్యపరమైన విలువ, లేక ప్రయోజనం లేనందున, మలేరియా లేదా చక్కెర వ్యాధులతో తీవ్రంగా బాధపడే రోగులకు అవి ఏ మాత్రం ప్రయోజనం చేయలేక పోతున్నవి. వాటిలో కొన్నింటిలో అనధికార లేక విషపూరిత పదార్థాలుంటున్నవి. “దగ్గు కొరకు తీసుకున్న మందు మూలంగా నైజీరియాలో చనిపోయిన పిల్లల కథనం వింటే, యీ కల్తీమందుల తీవ్రత ఎంత అపాయకరమైనదో తెలుస్తుందని” ఆ నివేదిక అంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పేదవారి పరిస్థితి మరీ దారుణం, ఎందుకంటే ఓ ప్రసిద్ధిచెందిన కంపెనీ తయారుచేసే మంచి మందు తక్కువ ధరకే కొంటున్నామని వారనుకుంటున్నారు. ఆ మందు అసలైందని దాని ప్యాకింగ్ గాని, దానిమీదనున్న లేబుల్ గాని గ్యారంటీ ఇవ్వదు. మందు మాదిరే అవికూడ పైకి ఆకర్షణతో కూడిన కల్తీ సరుకే అయివుండవచ్చును. (g92 11/8)
ఆధునిక కళ ఒక పరీక్షలో తప్పింది
ఇప్పటి కళాకారులువేసే అనేక చిత్రలేఖనాలు ఎదుర్కొనే ఆశ్చర్యకరమగు సమస్యవల్ల కళా ప్రపంచం కంపించిపోతుంది—అవి అతలాకుతలమౌతున్నవి. డేవిడ్ హాక్ని, జాక్సన్ పోలాక్ మరియు మార్క్ రోత్కోవంటి కళాకారులు వేసిన చితలేఖనాలు రంగు వెలిసిపోతున్నవి లేదా పగుళ్లుపడుతున్నవి, మరి ఇతరుల చిత్రకళ క్యాన్వాస్నుండి పెచ్చులుగా లేచి పడిపోతుందని లండన్ లోని ది సన్డే టైమ్స్ తెల్పుతుంది. 1960లో వాడబడిన యాక్రిలిక్ పెయింట్ దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు వాడుకలోవున్న రసాయన మూలక పదార్థాలు 1962లో మొదట మార్కెట్టులోనికి వచ్చినప్పుడు వాటిని బహుగా మెచ్చుకున్నప్పటికి, న్యూయార్క్ సిటిలోని ఆధునిక కళాఖండములున్న మ్యూజియం అసోసియేట్ కన్సర్వేటర్, కెరోల్ స్ట్రింజారి యిలా అన్నది: “యాక్రిలిక్ పెయింటింగ్ నుండి కొంచెం మురికిని తీసివేద్దామని మొదట ఎవరో ప్రయత్నించారు గాని, అది అలా రాదని వారు గ్రహించారు. అదెలా చేయాలో మాకింకా తెలియదు.” (g92 11/8)
క్షయరోగం పునరాగమనం
ప్రపంచ ఆరోగ్య సంస్థ తెల్పేదేమంటే, పూర్వపు క్షయవ్యాధి ఇప్పుడు సంవత్సరానికి ముప్పైలక్షల మంది ప్రాణాలను బలిగొంటుంది. కెనడాలోని టొరొంటో యొక్క ది గ్లోబ్ అండ్ మెయిల్ దినపత్రిక ఇంకను వివరించేదేమంటే, చికిత్స మందుల, కొరత మూలంగా సంవత్సరానికి ఎనభై లక్షల మంది యీ క్రొత్త రోగానికి గురైన వారిలో 96 శాతం మంది అభివృద్ధి చెందుచున్న దేశాలలోని రోగులే. “క్షయరోగం, సాంఘీక—ఆర్థికపరంగా పేదవారైన అభాగ్యులనే కఠినంగా పీడిస్తుందని”, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ హిరోషి నాకాజిమ వివరిస్తున్నారు. సంపన్న దేశాలలో అది ముఖ్యంగా వృద్ధులు, అల్ప సంఖ్యాకులు మరియు వలసవచ్చిన వారి మీద విరుచుకు పడుతుంది. ఉదాహరణకు, అమెరికాలో, మత్తు పదార్థాలు లేక ఎయిడ్స్ రోగంవల్ల బలహీనపడి శరీర రోగనిరోధక శక్తి క్షీణించిన రోగులలో అనేకులకు యిది సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి ఒకరన్నారు. (g92 11/8)
ఉద్యోగ స్థలాల్లో స్త్రీలు
ప్రపంచ బ్యాంక్ మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రచురించే ఫైనాన్స్ & డెవెలప్మెంట్ అనే పత్రిక ప్రకారం, ప్రపంచంలో చాలామంది స్త్రీలు “ఆర్థికంగా చలనం” కల్గియున్నారు లేదా, జీతాల కొరకు ఉద్యోగాలు చేస్తున్నారు గాని వారింకా ఎన్నో ఆటంకాల నెదుర్కొంటున్నారు. ఆ పత్రిక అంచనా ప్రకారం ప్రపంచమంతా 83 కోట్లమంది స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారని, అందులో 70 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్నారు. ఆఫ్రికాలోను ఆసియాలోని కొన్ని దేశాల్లో, అబ్బాయిలకంటె చాలా తక్కువ మంది అమ్మాయిలు మాధ్యమిక పాఠశాలకు వెళ్తున్నారు గనుక, 25 సంవత్సరాలు అంతకుపైబడి వయస్సున్న స్త్రీలలో 75 మంది నిరక్ష్యరాసులనుటలో ఆశ్చర్యంలేదు మరి అట్టివారికి మంచి ఉద్యోగం దొరకడం అతికష్టం. పురుషులతో పోల్చితే స్త్రీలలో అతితక్కువ మంది ఆర్థికంగా మెరుగై వున్నప్పటికి, గణాంకముల ప్రకారం ఉద్యోగం చేసే స్త్రీలే లెక్కలోనికి వస్తున్నారు గాని, కుటుంబంలో, ఇంట్లోచేసే పనులను పరిగణలోనికి తీసుకుంటున్నారో లేదోననే విషయం తెలియడం లేదు. ఆసియా, ఆఫ్రికా మరియు ఫసిఫిక్ దేశాల్లోని సగటు స్త్రీ వారంలో సగటు పురుషునికంటే 12 లేక 13 గంటల కంటే ఎక్కువే పనిచేస్తున్నట్లు అధ్యయనాలు తెల్పుచున్నవి. (g92 10/22)
లైంగిక దుష్ప్రవర్తనకు కారణం హాస్యకథా పుస్తకాలే
జపాను నందు టోక్యోలోని పోలీస్వారు ఇటీవల 16 సంవత్సరాల హైస్కూల్ విద్యార్థిని 25 మందిని అఘాయిత్యం చేశాడన్న నేరంమీద పట్టుకున్నారు. ఆ కుర్రాడు తానుచేసిన దానికిగల కారణం హాస్యకథా పుస్తకాలన్నాడు. ఓసారి అతడు అలాంటి పుస్తకాలమ్మే షాపులో కామ హాస్యకథారస పుస్తకాన్ని తెచ్చుకొని, ఓ పదేండ్ల అమ్మాయిని గదిలోనికి పిలిచి ఆ పుస్తకంలో ఉన్నటువంటి అసభ్యకర దృశ్యాల మాదిరిగానే ప్రవర్తించవలెనని బలవంతం చేశాడట. అలా 24 అఘాయిత్యాలు చేశాడని, యీ హాస్యరస బూతు సాహిత్యాలవల్లనే అనేకసార్లు అలాచేశాడని పోలీసులతో తాను ఒప్పేసుకున్నాడు. ది డైలీ యో మూరీ యిలా వ్రాస్తుంది: “పోయిన సంవత్సరం యిటువంటి హాస్యరస బూతు పుస్తకాల మూలంగా ఉద్రేకులై బాలికల మీద చేసిన 86 లైగింకపరమైన అత్యాచారములు టోక్యోలో జరిగినట్లు నివేదికలందినవి.” (g92 10/22)
ధాన్యం కొరత
దక్షిణాఫ్రికా వచ్చే సంవత్సరాంతానికల్లా కోటి టన్నుల ధాన్యమును దిగుమతి చేసుకోవలసి వుంటుందని ఒక స్థానిక హెచ్చరిక సంస్థ అంటే, సదరన్ ఆఫ్రికా డెవెలప్మెంట్ కో-ఆర్డినేషన్ కాన్ఫరెన్స్ తెల్పుతుంది. దాని అధికార ప్రకటన యిలా తెల్పుతుంది: “దిగుమతి కాబోయే సరుకు విషయంలో ఓడరేవు, రైలు, రోడ్డు ఈ నిల్వచేసే స్థలాలను గూర్చి చాలా తీవ్రమైన సమస్య తలెత్తే అవకాశమున్నది.” గత సంవత్సరపు ఉత్పత్తి సరాసరి తగ్గింది, యీ సంవత్సరం జొన్నపంట దిగుబడి, పోయిన సంవత్సరం కంటే యింకా 40 శాతం తగ్గిపోవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ శతాబ్దములోను దక్షిణాఫ్రికాలో బహుశ మహాగొప్ప అనావృష్ఠి సంభవింప వచ్చును. (g92 11/8)
మత్తుపానీయాలు, క్రొవ్వు?
అధికంగా మత్తుపానీయాలు సేవించేవారు క్రొవ్వెక్కిపోతారనేది క్రొత్తవార్తేమీ కాదు. ఎందుకు? స్విట్జర్లాండులోని జూరిక్ యూనివర్శిటీ నందు ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం అలా జరగడం సాధ్యమేనని తేలింది. మత్తుపానీయాలలోవున్న కాలరీలు మాత్రమే అంత క్రొవ్వు పట్టించడం లేదుగాని క్రొవ్వును శరీరం వుపయోగించుకునే శక్తిమీద మత్తుపానీయం చూపే ప్రభావం కూడ అందుకు దోహదం చేస్తుంది. శరీరం చక్కెర పదార్థాలను, కార్బోహైడ్రేట్స్ను వినియోగించుకున్నందున, త్వరగా క్రొవ్వును వినియోగించుకొనక ఆలస్యం చేస్తుందని పోషకాహార శాస్త్రజ్ఞులకు అనాదినుండే తెలుసు. అయితే, మత్తుపానీయాలు యీ క్రొవ్వును శరీరం యింకా నెమ్మదిగా వినియోగించుటకే దోహదపడుతున్నవి. ఒక ప్రయోగం చేసినప్పుడు, పురుషులకు షుమారు ఆరు బీరుసీసాలకు సమానమైన 90 మిల్లీలీటర్ల మత్తు పానీయాన్ని రోజుకు యిస్తూ ఆహార నియంత్రణలో వుంచారు. ఈ ఆహార నియంత్రణా కాలంలో పురుషుల శరీరం అందులోని క్రొవ్వును ఒకింట మూడవ వంతు మాత్రమే వినియోగించింది. ఆహారంలో క్రొవ్వు అధికంగా వుంటే యిటువంటి ప్రభావమే వుంటుంది. (g92 10/22)
పరులు విడిచిన పొగపై దావా
ఓ 64 సంవత్సరాల స్త్రీ తాను దాదాపు 12 సంవత్సరాలు పొగతోనిండిన వాతావరణంలో పనిచేసినందున తన ఆరోగ్యం దెబ్బ తిన్నదని తన యాజమాన్యము మీద కోర్టులో దావా వేయగా, ఆమెకు పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని ఇటీవల ఆస్ట్రేలియాలోని న్యూసౌత్వేల్స్ జిల్లా కోర్టు ఆ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఇంతకుముందు అటువంటి కేసులు కోర్టులో కాకుండ బయటనే తీర్చబడినవి. గాని, అసాధారణ తీర్పులో ఆ కోర్టు ఆమెకు 85,000 ఆస్ట్రేలియా డాలర్లు బహుకరించింది. పొగతో నిండిన గాలిని పీల్చుకున్న వారిని అనగా, పొగత్రాగనివారిని ఆరోగ్యాన్ని పొగత్రాగేవారు పాడుచేయగలరని న్యాయస్థానం తీర్పుచెప్పుట యిదే మొదటిసారియని ది ఆస్ట్రేలియన్ అనే వార్తాపత్రిక తెలిపింది. ఈ తీర్పు రెస్టారెంట్స్, హోటల్స్, నైట్ క్లబ్స్ మరియు ఇతర పనిచేసే స్థలాల మీద గట్టి ప్రభావం కల్గివుంటుందని, ఎందుకంటే, పొగత్రాగని ఉద్యోగస్థులు వారికి పొగలేని స్థలాలను ఏర్పాటుచేయకపోతే వారు గొప్ప నష్టపరిహారం కొరకు దావా వేయవచ్చునని కొందరనుకుంటున్నారు. (g92 10/22)
లేతప్రాయ లైంగికానుభూతి, మానసిక అలజడి
యౌవనస్థులు పొందే లైంగికానుభూతి సుఖరోగాలతోపాటు అనేక సమస్యలను తేగలదు. లా స్టాంపా అనే ఇటాలియన్ వార్తాపత్రిక ప్రకారం, “మెచ్చుకోతగని ఓ చిక్కేమిటంటే లేతప్రాయపు లైంగికానుభూతి మూలంగా యౌవనస్థుల మనస్సులలో, వ్యక్తిగత బంధాలలోను భావోద్రేకపూరిత మానసిక అలజడి పెరగవచ్చును. అందుమూలంగా వారి ప్రవర్తనా సరళి మారి, మత్తుపానీయాలకు, మత్తుపదార్థాలకు, నేరాలకు దారితీయవచ్చును.” మానసిక అధ్యయన కేంద్రం, ఇటాలియన్ న్యాయ మంత్రిత్వశాఖ నిర్వహించిన ఒక సదస్సునందు యౌవనులు మరీ లేతప్రాయము నుండే లైంగికానుభూతి పొందుట కారంభిస్తున్నారని గట్టిగా చెప్పబడింది. ఓ కన్సల్టెంట్ ప్రకారం అటువంటి వారి సరాసరి వయస్సు 17 సంవత్సరాలే. (g92 10/22)
కుటుంబీకుల రక్తం చంపగలదు
“రక్తం తీసుకునే వ్యక్తియొక్క తలిదండ్రులు గాని పిల్లలుగాని రక్తాన్ని దానంచేస్తే, అలా కుటింబీకుల రక్తం ఎక్కించకుండ ఉండాలని డాక్టర్లకు పిలుపుని,” జపాన్ రెడ్క్రాస్ సొసైటి ఇస్తుందని ఆసాహి షెంబున్ అనే దినపత్రిక తెల్పుతుంది. కుటింబీకులిచ్చే రక్తాన్ని ఉపయోగించుట వల్ల జి.వి.హెచ్.డి (గ్రాఫ్ట్-వర్షన్-హోస్ట్ డిసీజ్,) అంటే ఎక్కించిన రక్తంలోని శ్వేతకణములు దాన్ని ఎక్కించుకున్న వ్యక్తి యొక్క ఎముకల్లోని మూలుగు, కాలేయం, మరియు చర్మం మీద పనిచేయగా వచ్చే రోగం రావచ్చునని రెడ్ క్రాస్ నివేదిక తెలియజేస్తుంది. శరీర నిరోధక శక్తి తగ్గి మరణాల సంఖ్య పెరుగుతుంది. అదియునుగాక, రక్తం దానం చేసిన 72 గంటల్లో ఉపయోగించే రక్తం కూడ జి.వి.హెచ్.డిని కల్గిస్తుందని కనిపెట్టినందువల్ల తాజా రక్తాన్ని ఉపయోగించకూడదనే గట్టి హెచ్చరిక ఆ నివేదికలో చేర్చబడింది. రెండు సంవత్సరాల పాటు జి.వి.హెచ్.డివున్న రోగులను, 14,083 మంది డాక్టర్లను విస్తృత రీతిలో చేసిన సర్వే మూలంగా తేలిన ఫలితార్థమే యీ నివేదిక. డాక్టర్లలో సగంమంది యీ జి.వి.హెచ్.డి అనేది శరీర రోగ నిరోధక శక్తి క్షీణించినప్పుడు వస్తుందని, గనుక దీనికి రక్త మార్పిడులకు సంబంధం లేదని నమ్మారు—గానీ వారు పొరపాటుబడ్డారు. (g92 11/8)