సామాన్య వ్యర్థపదార్ధం కాదు
మార్చి 24, 1989 శుక్రవారం నాడు ఎక్సాన్ వాల్డేజ్ టాంకరు అలాస్కాలోని ప్రిన్స్ విలియమ్ సౌండ్లో ఒక రాత్రి శిలను ఢీకొన్నది. దాని ఫలితంగా, 42 కోట్ల లీటర్ల ముడినూనె నీటిలోకి చిమ్మబడింది. ఈ హఠత్సంఘటన స్థానిక జాలర్ల జీవనాధారానికి ముప్పువాటిల్లి, వందల కిలోమీటర్ల తీరాన్ని కలుషితం చేసి, వేలకొలది పక్షులను, సముద్ర జీవులను నాశనంచేసింది.
ఎక్సాన్ వాల్డేజ్ ఘటన పర్యావరణాన్ని గూర్చి చింతించే ప్రజలను కలవరపెడుతూనేవుంది. అయిననూ ప్రతిరోజు కపటమైన రీతిలో “నూనె చిందించబడుతుంది.” అలాగే ఇది మీ చుట్టుపట్ల ప్రాంతాల్లోనూ జరుగుతూనే వుండవచ్చును.
కన్స్యూమర్ రిపోర్ట్స్ ప్రకారం తమ వాహనం యొక్క ఇంజన్ ఆయిల్ తామే మార్చుకునేవారు ప్రతి సంవత్సరం 75 కోట్ల లీటర్లనుండి 150 కోట్ల లీటర్ల వరకు అటువంటి వ్యర్థ నూనెను పారబోస్తున్నారు. నివేదికానుసారంగా, “దానిలో కేవలం 10 నుండి 14 శాతం నూనె మాత్రమే సరైన విధంగా వినియోగించబడుతున్నది.” ఈ కొద్దిశాతం వ్యర్థనూనె, ఇతర ప్రయోజనకరమైన వస్తువులు దానినుండి తయారుచేయులాగున తిరిగి ఉపయోగించబడుతుంది. కాని మిగిలినది ఏమౌతున్నది? కారున్నవారు మామూలు చెత్తలాగే దాన్ని ఊరకనే వృధాగా పారబోస్తున్నారు.
ప్రతి సంవత్సరం లక్షల లీటర్ల వ్యర్థనూనె నేలలో, నీటి ప్రవాహాలలో లేక మురికి నీటి కాలువలలో కలిసి పోతున్నది. అంత నూనె ఉత్పత్తి చేయాలంటే ప్రమాదానికి గురైన 25 ఎక్సాన్ వాల్డేజ్ వంటి టాంకర్లు అవసరమవుతాయి. కాని ఉపయోగించిన నూనెను, నీటిని గడ్డకట్టకుండ నిరోధించే ద్రావకం, బ్రేకు ఆయిలు మరియు ఇంజను ఆయిలువంటి ఇతర వాహన వ్యర్థ పదార్థాలు మామూలు వ్యర్థపదార్థాలు కావు. మరీ అపాయకరమైనవి.
కన్స్యూమర్ రిపోర్ట్స్ చెప్పేదేమంటే, ఒకవేళ యీ నూనె త్రాగే నీటిలో కలిసినట్లైతే అప్పుడు తీవ్ర పరిణామాలు ఉండవచ్చును! ఉపయోగించిన ఒక లీటరు నూనె 10 లక్షల లీటర్ల తాజా నీటిని త్రాగటానికి వీలులేకుండ చేయవచ్చు, మరియు అరలీటరు నూనె ఒక ఎకరం నీటిపై వ్యాపించేంతవరకు చమురు తెట్టను ఉత్పత్తి చేస్తుంది. (g92 9⁄22)