ప్రపంచ పరిశీలన
మరిన్ని విపత్తులు వేచియున్నవి
“పర్యావరణం వినాశనమగుచున్నందున, 2000 సంవత్సరము నాటికి పకృతి వైపరీత్యాలు గణనీయంగా పెరుగ గలవు,” అని జర్మన్ వార్తా పత్రిక స్ఫిన్ ఫర్టర్ టేగ్బ్లెట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ఒక వ్యాఖ్యానముపై నివేదిక నిచ్చింది. ఆ సంస్థ తెల్పిన ప్రకారం, “మానవుని మూలంగానే నేడు అనేకానేక పర్యావరణ వైపరీత్యాలు సంభవించుచున్నవి.” భోపాల్ (ఇండియా) నందు, సెవ్సో (ఇటలీ) నందు సంభవించిన రసాయన దుర్ఘటనలు, చెర్నోబెల్ (యు. ఎస్. ఎస్. ఆర్.) నందు జరిగిన అణుశక్తి ఉత్పాదక దుర్ఘటన, అలస్కానందు సముద్రతీరమునకు కొంచెము దూరములో సంభవించిన చమురు దుర్ఘటన; కువైట్ నందు తగులబడుచున్న చమురు బావులు దృష్టాంతముగా పేర్కొనబడినవి. ఆ శీర్షిక యింకా యిట్లనుచున్నది, “గాలి, నీరు, నేలసారం కలుషితమగుట, ఓజోను పొర పలుచబడడం, సుకుమారమగు మొక్కలను పెంచే ప్రదేశాలు ప్రభావితమగుట, యివన్నీ పారిశ్రామికాభివృద్ధి నాశనకరమైనదని చూపుచున్నవి. ఈ శతాబ్ద ప్రారంభమునుండి ప్రకృతి వైపరీత్యాలవలన 5 కోట్లమంది ప్రజలకంటె ఎక్కువమంది తమ గృహాలను కోల్పోయారు.” (g91 9/22)
సజీవంగానున్న తరాలు
ఒకవేళ మీరు 1800 సంవత్సరం మధ్య కాలమునుండి 1920 సంవత్సరము వరకు జీవించిన అమెరికా వారిని మూడు తరాలుగా విభజించాలంటే ప్రతి ఒక్క తరమునుండి నేడు అమెరికాలో ఎంతమంది సజీవులైయుండవచ్చును? అట్లాంటా కాన్స్టిట్యూషన్ ప్రకారం మొత్తం 3 కోట్లమంది ఉంటారు. అది ఈ విధంగా ప్రచురించింది: అందులో 1860 నుండి 1882 సం.ల మధ్య జన్మించిన వారు నేడు 3,000 మంది జీవిస్తున్నారు. మరి 1883 నుండి 1900 సం.ల మధ్య జన్మించిన వారు నేడు 11,00,000 మంది సజీవులై యున్నారు. మరియు 1901 నుండి 1924 సం.లలో జన్మించినవారు 2,90,00,000 మంది నేడు సజీవంగా ఉన్నారు. (g91 10/8)
ఉపగ్రహం ద్వారా వాహనమును తిరిగి సంపాదించుట
దక్షిణాఫ్రికాలో వాహనముల అపహరణ తీవ్రరూపం దాల్చినందున, దారి మళ్లింపుదారులు, అపహరించిన వాహనములను తిరిగి సంపాదించుటకు కనిపెట్టబడిన ఆధునిక పద్ధతి, ఉపగ్రహ అన్వేషణా విధానము. జోహన్నాస్బర్గ్ వార్తాపత్రిక ది స్టార్ వివరించిందేమంటే డ్రైవరు ఒక్కసారి ఆ సిస్టమ్ను ఏర్పాటుచేసుకుంటే, ఆ వాహనం దారి మళ్ళించబడిందో లేక అపహరించబడిందో తెలుసుకోవడానికి అతడు కేవలం ట్రాన్స్మిట్టరును నొక్కితే చాలు. పిమ్మట ఆ వాహన మెక్కడుందో ఒక ఉపగ్రహం కనుగొంటాది. అది ఉన్న ప్రదేశము “ఒక కంట్రోల్ రూమ్నందు ఒక మేప్పై ‘సంకేత ధ్వనితో’ కంఫ్యూటర్ తెరమీద ప్రదర్శించబడును. అప్పుడు ఆ వాహనాన్ని వెంటాడుటకు ఆ కంట్రోల్ రూమ్ హెలికాప్టర్ లేదా భూతల భద్రతా దళాలను అప్రమత్తము చేయును. ఆ నివేదిక యింకను చెప్పునదేమంటే: “ఒక వాహనాన్ని 15 నిమిషములలో కనుగొనవచ్చునని పైలెట్ పరిశోధనలు నేటివరకు నిరూపించాయి. అలా తిరిగి సంపాదించిన వాటి రేటు 95 శాతం ఉంది.
పాఠశాలల్లో మాదక ద్రవ్యాలు
పాఠశాలల్లో యువత మాదక ద్రవ్యాలకు ఎలా పరిచయం చేయబడతారు? రియో గ్రాండ్ డొ సుల్, బ్రెజిల్నందలి పోలీస్ అధికారి, ఎబీల్యు పెరీరె యిట్లనుచున్నాడు, “పాఠశాలలోనికి మాదక ద్రవ్యాలు అజ్ఞాత వ్యక్తుల ద్వారా కాదుగాని, విద్యార్థుల ద్వారానే వస్తాయి. తనకు పరిచయములేని వ్యక్తి నుండి మాదక ద్రవ్యాలను ఎవడును అంగీకరించడు.” అతడింకా యిట్లంటున్నాడు: “పదిహేడు సంవత్సరముల బాలుడు మారివానా తీసుకొనడం చూచేవాడిని. ఇప్పుడు 12, 10 సంవత్సరముల బాలురతో కూడ మాకు సమస్య వచ్చిపడింది. మొదట్లో, మంచి ఉల్లాసంగా ఉన్న సమయమందు మాదక ద్రవ్యాలను ఉచితంగా అందిస్తారు. ఎప్పుడైతే వారు దానికి బానిసలౌతారో దాని పంపిణీదారులు దానికి ద్రవ్యాన్ని వసూలు చేస్తారు. “మాదక ద్రవ్యాలు ప్రవేశించని పాఠశాల లేదు,” అని సావ్ పౌలో నందలి జిల్లా పోలీసు అధికారి ఆల్బర్ట్ కొరాజా చెప్పుచున్నాడు. వేజా పత్రిక యిలా అంటున్నది. “పాఠశాలల్లో మాదక ద్రవ్యాలను కొనడం యిప్పుడున్నంత సులభంగా మునుపెన్నడూ లేదు. విద్యార్థుల మధ్య పంపిణీ దారుల పథకము యింత బహుళ వ్యాప్తంగా ఎన్నడూ లేదు. యిటువంటి వ్యాపారమును అదుపుచేయుట మునుపెన్నడు యింత కష్టతరము కాలేదు.”
చికిత్సా విధానములు పోల్చబడినవి
సాంప్రదాయ సిద్ధమైన చికిత్సాలయములలో చికిత్సను పొందే చివరి దశలోనున్న క్యాన్సరు రోగులు, వైద్య వైదికాచార సిద్ధమైన చికిత్సను చేసిన వారికన్నా మెరుగుగానూలేరు, హీనంగాను లేరు అని ది న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసన్ నందు ప్రచురించబడిన అధ్యయనము చెప్పుచున్నది. సగటున ఒక సంవత్సరము లేదా అంతకన్నా తక్కువ కాలం జీవిస్తారని ఎంచబడిన 150 మంది క్యాన్సరు రోగులను ఈ అధ్యయనములో తీసుకున్నారు. వీరిలో సగం మంది రసాయన చికిత్స, రేడియేషన్ వంటి సాంప్రదాయ చికిత్స పొందగా, మిగిలిన సగంమంది శాఖాహార భోజనము, విరేచనము సాఫీగా అవడానికి కాఫీ, రోగ నిరోధక శక్తిని పటిష్టపర్చే టీకాలతో చికిత్స పొందారు. రోగులకు తీవ్రరూపం దాల్చిన ఊపిరి తిత్తుల క్యాన్సరు, పురీష స్థానములో క్యాన్సరు, నల్లని వ్రణము లేదా జఠర రస గ్రంథికి వచ్చే క్యాన్సర్లు ఉన్నవి. ఒక సంవత్సరం తరువాత, ఒక్కొక్క గుంపులోను సగం కంటె కొంచెము ఎక్కువమంది రోగులు సజీవంగా ఉన్నారు, రెండు సంవత్సరాల అంతంలో 15 శాతం మంది ఉండగల్గారు. “క్యాన్సరు ముదిరిపోయిన రోగులకు మనము చేసే చికిత్సలు, వారి జీవితమును బహుశా కొనసాగింపజాలవని ఫలితాలు బహు తేటగా చూపుచున్నవి,” అని ఆ పత్రిక సంపాదకుడు డా. బేరికాస్లెత్ పేర్కొన్నాడు. “ఈ వ్యక్తులను ఎక్కువ ఊరడించుట ఎట్లో, కొంతమంది విషయములో అసలు చికిత్స లేకుండానే సౌఖ్యంగా ఉండేటట్లు ఎలా చేయవచ్చునో మనం అడగాలి.”
మరింత పరిశుభ్రతా?
ఎగ్జాన్ వాల్డెజ్ అనే చమురు నౌక అలస్కా తీరాన నేలను ఢీకొన్నప్పుడు, తత్ఫలితంగా విరజిమ్మబడిన చమురు అనేక జంతుజాలములను—యిటీవల లెక్కించబడిన దాని ఆధారంగా 5,80,000 పిట్టలు, 5,500 సముద్ర ముంగిసలు, 22 తిమింగిలాలను హతమార్చింది. శాశ్వత నాశనమయ్యే ప్రమాదముందని చెప్పుకొంటున్నారు, కాని అది నిజం కాదు. ఐదు సంవత్సరాల కాలంలో అనేక జీవరాసులు తిరిగి పూర్తి స్థాయికి వస్తాయి, అని నేషనల్ ఓషియానిక్ అండ్ ఎట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్పుచున్నది. “ప్రజల ఆవేదనను అణచివేసేందుకు కొన్ని తీరాలలో వేడి నీళ్ల జెట్లను పేల్చకపోతే, పునరుద్ధరణ మరింత వేగంగా సాగియుండేది,” అని ఫార్చ్యూన్ పత్రిక నివేదించుచున్నది. “చిన్నచిన్న జీవరాసులు చమురు వలన కంటే వేడినీళ్ల వలననే అనేకము చనిపోతన్నవని ఏజెన్సీ అధ్యయనములు చూపుచున్నవి.” “పర్యావరణ వైపరీత్యాలు సంభవించినప్పుడు చేయవలసింది, కొన్నిసార్లు శ్రేష్ఠమైనది, వ్యతిరేకార్థములో అత్యంత క్లిష్టమైనది ఏమంటే ఏమిచేయకుండా ఉండడమే” అని ప్రధాన విజ్ఞాన శాస్త్రవేత్త సిల్వియా ఎరెల్ తెల్పుచున్నది. (g91 9/22)
విచారణచేయకుండా పొరపాటున చంపుట
ముగ్గురు దొంగలను “కోపోద్రేకులైన గుంపు వీధిలో చితకబాది కాల్చి చంపిన దృశ్యాన్ని వీడియో టేప్ చేయగా” విచారణ చేయకనే శిక్షవిధించిన ఈ సంఘటనను మాటోగ్రోస్సో నందలి బ్రెజిల్ అధికారులు పరిశీలిస్తున్నారు. వేజా అను పత్రిక యిలా వ్యాఖ్యానించింది: “ఒక చిన్న పట్టణములో విచారణచేయకయే శిక్షవిధించి హత్యకు పాల్పడిన వారిలో మంచి కుటుంబ యజమానులు, రాజకీయ వేత్తలు, పేరుగాంచిన వ్యాపార వేత్తలు ఉన్నారు. వారు ఆదివారమున ఆరాధనకు వెళ్తారు, పన్నులు సరియైన సమయానికి చెల్లిస్తారు, ఖండితమైన నియమాలను బట్టి తమ పిల్లలను విద్యావంతులను చేస్తారు.” అయితే, ఒక గుంపు చట్టాన్ని తమ చేతుల్లోనికి తీసుకుంటే భయంకరమైన అనర్థాలు సంభవించ వచ్చును. యు ఎస్టాడొ డి యస్. పౌలో అనే వార్తాపత్రిక యిలా నివేదించింది: “20 మంది వ్యక్తులు ఎవరినో కొడుతు వానితో పాటు 15 సం.ల బాలుడైన జోజి నాషెస్ మాన్టు సిల్వేను పొరపాటున చంపారు.” మరో సంఘటనలో విచారణ చేయకుండా శిక్ష విధించే వారు వచ్చే సమయానికి అనుమానితునితో మాట్లాడుచున్నందున నిరపరాధియైన 13 సం.ల బాలుడు చంపబడ్డాడు!
ఒక యథార్థ ప్రకటన
ఊహించని స్థలములో—ఒక సిగరెట్ పెట్టె మీద యథార్థమైన ఒక చిన్న వ్యాపార ప్రకటన ఈ మధ్య తారసిల్లింది. ఈ సంవత్సర తొలిభాగంలో లాస్ ఏంజిల్స్ కాలిఫోర్నియా, అమెరికా నందు పూర్తిగా నల్లరంగులోనున్న పెట్టెపై తెల్లని రంగులో పుర్రె, ఎముకలను చిత్రీకరించిన ఒక క్రొత్త తరహా సిగరెట్టులు మార్కెట్టులో వెలసినవి. మరణము అని తెల్లని పెద్ద అక్షరములతో ఆ పెట్టె ప్రక్క భాగమున ముద్రించబడెను. ఈ ఉత్పాదనకు అసాధారణమైన—అయితే కచ్చితమైన లేబిల్ యివ్వడం తప్ప మరేవిధమైన వ్యాపార ప్రకటన చేయకపోయినను, యిప్పటికే 25,000 ప్యాకెట్లు అమ్ముడైనవని దాని ఉత్పాదకులు చెప్పుకొనుచున్నారని న్యూస్ వీక్ పత్రిక తెల్పుచున్నది. యువకులైన లేదా మరణానికి భయపడుటలో ఏ మాత్రం చాతుర్యములేక పొగత్రాగువారిని ఆకట్టుకొని తన అమ్మకాలను దేశమంతటా వ్యాప్తిచేయాలని అతని ఆశయం. అట్టి వినియోగదారులు మరణం సిగరెట్ ప్యాకెట్ ప్రతిదాని మీదనున్న ఈ హెచ్చరికను అలక్ష్యం చేయవచ్చును: “నీవు పొగత్రాగనివాడవైతే, ప్రారంభించవద్దు. నీవు పొగత్రాగుచుంటే విడిచిపెట్టు.” (g91 10/8)
తత్తరపరచు కాలనిర్ణయ దోషం
దక్షిణాఫ్రికా వృద్ధురాలైన ఒక కళా సంపన్నురాలు, జోన్ అరెన్స్ 11 సంవత్సరాల క్రితం సాంప్రదాయ బోయవాని కళను అనుసరించి రాళ్ళపై చక్కని చిత్రములను వేసింది. అటుపిమ్మట పిటర్ మారిట్జ్బర్గ్ నగరంలోనున్న ఆమె పాతయింటికి సమీపాన ఉన్న మైదానములో ఆమె వర్ణచిత్రము గీసిన ఒక రాయి దొరికింది. తుదకు అది నగర వస్తు ప్రదర్శన శాల అధికారి చేతికి వెళ్ళింది. ఆ రాతి వర్ణచిత్రకళయొక్క మూలము నెరుగక ఆ యధికారి ఇంగ్లాండులో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ రేడియో కార్బన్ కాలనిర్ణయ విభాగము వారిచే దాని కాలాన్ని అంచనా వేయించెను. ఆ వర్ణచిత్రము 1,200 సంవత్సరముల ప్రాచీన మైనదని నిపుణులు అంచనా వేశారు. ఎందుకు అంతటి తత్తరపరచు దోషం? “అది ఎందుకలా జరిగిందని నిర్ధారణ అయ్యిందంటే,” దక్షిణాఫ్రికా సన్డే టైమ్స్ నందలి ఒక నివేదిక ప్రకారం “శ్రీమతి ఆరెన్స్ వాడిన తైలవర్ణ రంగులందు కర్బనము ఉన్న సహజ తైలములున్నవి—ఆక్స్ఫర్డ్ కాలనిర్ణయాన్ని చేయడానికి అదే ఏకైక మూలము.
జేబులోపట్టే ఎలక్ట్రానిక్ బైబిళ్లు
“ఎలక్ట్రానిక్ రంగంలో, నేడు ఎంత చిన్నదైతే అంత బాగుంటుంది,” అని న్యూస్ వీక్ నివేదించింది. వీటిలో అత్యాధునికమైన చేతిలో పట్టే పరికరము 4,000 డాలర్లు ఖరీదుచేసే మూడు తర్జుమాలు కల్గిన బైబిలు, దీనిలో రివైజ్డ్ స్టాండర్డ్ మరియు కింగ్ జేమ్సు వర్షన్లు ఉన్నవి. దీనిని అమెరికాలో న్యూ జెర్సీనందలి ఒక సంస్థ తయారుచేసింది. “ఒక్క బైబిలు కొరకే 400 డాలర్లు ఎందుకు ఖర్చుపెట్టాలి?” అని న్యూస్ వీక్ పత్రిక ప్రశ్నించింది. “ఎందుకంటే టైప్ రైటర్ పద్ధతిలోనే కీబోర్డు ఉంది, కొంత సూక్ష్మబుద్ధి కూడ ఉంది.” మనము జ్ఞాపకముంచుకోగల కీలకమైన మాటలను కేవలం టైపు చేస్తే మనం మరచిపోయిన లేఖన భాగములను కనుగొనవచ్చును. “మతిమరుపు మతనాయకులకు దీనిని అమ్మవచ్చునని” ఆ సంస్థ తలంచి యుండవచ్చునని ఆ శీర్షిక పేర్కొన్నది. “ఆరు నెలల్లోనే 50,000 ఎలాక్ట్రానిక్ బైబిళ్లను అది యిప్పటికే అమ్మింది.” (g91 9/22)