alfa27/stock.adobe.com
యేసు నేరాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడు
నేరం, అన్యాయం ఎంత బాధను మిగిలిస్తుందో యేసుకు బాగా తెలుసు. ఆయన మీద అబద్ధ ఆరోపణలు వేశారు, కారణం లేకుండా కొట్టారు, అన్యాయంగా విచారణ చేశారు, తప్పుగా తీర్పు తీర్చారు, ఘోరంగా చంపేశారు. అయితే యేసు ఏ తప్పు చేయకపోయినా ఇష్టంగా, స్వార్థం లేకుండా ‘ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించాడు.’ (మత్తయి 20:28; యోహాను 15:13) దేవుని రాజ్యానికి రాజుగా ఆయన త్వరలో భూమంతటి మీద న్యాయం జరిగేలా చేసి, నేరాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడు.—యెషయా 42:3.
యేసు చర్య తీసుకున్న తర్వాత లోకం ఎలా మారిపోతుందో బైబిలు చెప్తుంది:
“దుష్టులు ఇక ఉండరు; ఒకప్పుడు వాళ్లు ఉన్న స్థలాన్ని నువ్వు వెదికినా వాళ్లు కనిపించరు. అయితే సాత్వికులు భూమిని స్వాధీనం చేసుకుంటారు, వాళ్లు ఎంతో శాంతిని అనుభవిస్తూ చాలా సంతోషంగా ఉంటారు.”—కీర్తన 37:10, 11.
యేసు ఇప్పటివరకు మన కోసం చేసినవాటికి, ఇకపై చేయబోయే వాటికి మనమెలా కృతజ్ఞత చూపించవచ్చు? ఒక మార్గం ఏంటంటే, ఆయన ప్రకటించిన “దేవుని రాజ్యం గురించిన మంచివార్త” గురించి ఇంకా తెలుసుకోవడం. (లూకా 4:43) “దేవుని ప్రభుత్వం అంటే ఏమిటి?” అనే ఆర్టికల్ చదవండి.