కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w02 9/1 పేజీలు 29-31
  • కష్టాలను మనమెలా దృష్టించాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కష్టాలను మనమెలా దృష్టించాలి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అత్యుత్తమమైన మద్దతు
  • కష్టాలనుండి మనం ఏమి నేర్చుకుంటాము?
  • కష్టాల విషయంలో సరైన దృక్కోణాన్ని కలిగివుండండి
  • పాఠకుల ప్రశ్న
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • శోధనలున్నా, మీ విశ్వాసానికి హత్తుకొని ఉండండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఓర్పుకు ప్రతిఫలం లభిస్తుంది
    మన రాజ్య పరిచర్య—2004
  • ‘పరీక్షా సమయంలో సహనం కలవాడు ధన్యుడు’
    మన రాజ్య పరిచర్య—2007
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
w02 9/1 పేజీలు 29-31

కష్టాలను మనమెలా దృష్టించాలి?

పరీక్షలు! కష్టాలు! ప్రతి ఒక్కరూ వాటిని ఎదుర్కోవలసిందే. అవి వ్యక్తిత్వ భేదాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, శోధనలు, తప్పు చేయమని స్నేహితులనుండి వచ్చే ఒత్తిడి, హింస, తటస్థ స్థానాన్ని వహించినందుకు లేదా విగ్రహారాధన చేయనందుకు మనకు ఎదురయ్యే సవాళ్ళు వంటివాటి వలననే గాక ఇంకా మరెన్నో ఇతర విషయాల వలన కూడా కలగవచ్చు. మనం అనుభవిస్తున్న కష్టాలు ఏవైనప్పటికీ, అవి తరచూ విపరీతమైన ఆందోళనను కలిగిస్తాయి. వాటితో మనం విజయవంతంగా ఎలా వ్యవహరించగలము? అవి మనకు ప్రయోజనం చేకూర్చగల మార్గమేదైనా ఉందా?

అత్యుత్తమమైన మద్దతు

ప్రాచీన కాలానికి చెందిన దావీదు రాజు తన జీవితకాలమంతా కష్టాలు అనుభవించాడు, అయినప్పటికీ మరణించేంత వరకు నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఆ కష్టాలను ఎలా సహించగలిగాడు? తన బలానికి మూలాన్ని సూచిస్తూ ఆయన ఇలా అన్నాడు: “యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” ఆయన ఇంకా ఇలా అన్నాడు: “గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును.” (కీర్తన 23:1, 4) అవును, అపారమైన మద్దతుకు మూలం యెహోవాయే. దావీదు కొన్ని తీవ్రమైన ఒత్తిళ్ళను ఎదుర్కొన్నప్పుడు యెహోవా ఆయనకు కాపుదలనిచ్చాడు, అవసరమైనప్పుడు మనకు కూడా అదేవిధంగా కాపుదలనివ్వడానికి యెహోవా సంసిద్ధంగా ఉన్నాడు.

మనం యెహోవా మద్దతును ఎలా పొందగలము? మనం దాన్ని పొందడానికి మార్గాన్ని సూచిస్తూ బైబిలు ఇలా అంటుంది: “యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి.” (కీర్తన 34:8) అది ఎంతో దయాపూరిత ఆహ్వానం, అయితే దానర్థం ఏమిటి? యెహోవాను సేవించమనీ ఆయన చిత్తానికి అనుగుణంగా మన జీవితాలను మలుచుకోమనీ ఇవ్వబడుతున్న ప్రోత్సాహం. ఇలాంటి మార్గంలో పయనించడమంటే మనం కొంత స్వాతంత్ర్యాన్ని వదులుకోవలసి ఉంటుంది, త్యాగాలు చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది హింస, వేదన వంటి కష్టాలకు కూడా దారి తీయగలదు. అయినప్పటికీ ఎవరైతే యెహోవా ఆహ్వానాన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తారో వారు తాము అలా స్వీకరించినందుకు ఎన్నటికీ విచారించరు. యెహోవా వారి మీద అపారమైన దయ చూపిస్తాడు. ఆయన వారికి నడిపింపునిస్తూ వారి ఆధ్యాత్మిక అవసరాల గురించి శ్రద్ధ తీసుకుంటాడు. ఆయన తన వాక్యం ద్వారా తన పరిశుద్ధాత్మ ద్వారా క్రైస్తవ సంఘం ద్వారా కష్టకాలంలో వారికి కాపుదలనిస్తాడు. ఆయన చివరికి వారికి నిత్యజీవాన్ని ప్రతిఫలంగా ఇస్తాడు.​—కీర్తన 23:6; 25:9; యెషయా 30:21; రోమీయులు 15:5, 6.

యెహోవాను సేవించాలని తమ జీవితాలనే మార్చివేసేంతటి నిర్ణయం తీసుకునేవారు, ఆ నిర్ణయానికి కట్టుబడివుండేవారు యెహోవా తన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తాడని గ్రహిస్తారు. యెహోషువను అనుసరించి వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన ఇశ్రాయేలీయులు అలాంటి నెరవేర్పును అనుభవించారు. వారు యొర్దాను నదిని దాటిన తర్వాత, కష్టాలు అనుభవించవలసి వచ్చింది, యుద్ధాలు చేయవలసి వచ్చింది, అత్యంత బాధాకరమైన పాఠాలు నేర్చుకోవలసి వచ్చింది. కానీ ఆ తరంవారు, ఐగుప్తునుండి బయటకు వచ్చి అరణ్యప్రాంతంలో మరణించిన తమ తండ్రుల తరం కంటే ఎక్కువ నమ్మకంగా ఉన్నారు. కాబట్టి యెహోవా అలా నమ్మకంగా ఉన్నవారికి మద్దతునిచ్చాడు, యెహోషువ జీవితపు చివరి భాగంలో వారి పరిస్థితి ఎలా ఉందో బైబిలు నివేదిక ఇలా చెబుతుంది: “యెహోవా వారి పితరులతో ప్రమాణముచేసిన వాటన్నిటి ప్రకారము అన్నిదిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను . . . యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను.” (యెహోషువ 21:44) మనం కష్టాలు అనుభవిస్తున్నప్పుడూ అలాగే ఇతర సమయాలన్నింటిలోనూ యెహోవా మీద పూర్తిగా ఆధారపడితే మన అనుభవం కూడా అదేవిధంగా ఉండగలదు.

యెహోవాపై మన దృఢనమ్మకాన్ని ఏది బలహీనపర్చగలదు? “ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు . . . మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు” అని యేసు చెప్పినప్పుడు ఆయన ఒక విషయాన్ని సూచించాడు. (మత్తయి 6:24) మనకు యెహోవాపై సంపూర్ణ విశ్వాసం ఉంటే లోకంలో చాలామంది ఆధారపడుతున్నట్లుగా భద్రత కోసం వస్తుసంపదలపై ఆధారపడము. యేసు తన అనుచరులకు ‘మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నీ [అవసరమైన వస్తుసంబంధమైనవన్నీ] మీకనుగ్రహింపబడును’ అని ఉపదేశించాడు. (మత్తయి 6:33) వస్తుసంపదల గురించి సమతుల్యమైన దృక్కోణాన్ని కలిగివుండి తన జీవితంలో దేవుని రాజ్యానికి మొదటి స్థానాన్నిచ్చే క్రైస్తవుడు సరైన ఎంపికను చేసుకుంటాడు. (ప్రసంగి 7:12) అలా చేయడానికి బహుశా ఆయన కొంత మూల్యం చెల్లించాల్సి ఉండవచ్చు. వస్తుసంబంధంగా ఆయన త్యాగాలు చేయవలసి రావచ్చు. అయినప్పటికీ ఆయన అనేక ప్రతిఫలాలను పొందుతాడు. యెహోవా ఆయనకు మద్దతునిస్తాడు.​—యెషయా 48:17, 18.

కష్టాలనుండి మనం ఏమి నేర్చుకుంటాము?

‘యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికోవడాన్ని’ ఎంపిక చేసుకోవడం, జీవితంలో జరిగే అనుకోని సంఘటనల నుండి రక్షణ కల్పించదు; లేక సాతాను, అతని మానవ ప్రతినిధులు చేసే దాడులనుండి మనల్ని పూర్తిగా రక్షించదు. (ప్రసంగి 9:11) తత్ఫలితంగా ఒక క్రైస్తవుని చిత్తశుద్ధి, తీర్మానం పరీక్షించబడవచ్చు. ఇలాంటి కష్టాలను అనుభవించడానికి యెహోవా తన ఆరాధకులను ఎందుకు అనుమతిస్తాడు? ‘అవసరమునుబట్టి నానావిధములైన శోధనలచేత [“కష్టాలచేత,” NW], ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత [“కష్టాలచేత,” NW] పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును’ అని వ్రాసినప్పుడు అపొస్తలుడైన పేతురు ఒక కారణాన్ని తెలియజేశాడు. (1 పేతురు 1:6, 7) అవును, పరీక్షలు మనం మన విశ్వాసపు నాణ్యతనూ యెహోవా అంటే మనకున్న ప్రేమనూ ప్రదర్శించడానికి అవకాశమిస్తాయి. అపవాదియైన సాతాను చేసే ఆరోపణలకూ వేసే నిందలకూ జవాబిచ్చేలా అవి మనకు సహాయపడతాయి.​—సామెతలు 27:11; ప్రకటన 12:10.

ఇతర క్రైస్తవ లక్షణాలను పెంపొందించుకోవడానికి కూడా కష్టాలు మనకు సహాయపడతాయి. ఉదాహరణకు కీర్తనకర్త మాటలను గమనించండి: “యెహోవా . . . దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరమునుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును.” (కీర్తన 138:6) మనలో చాలామంది సహజంగా దీనులము కాదుగానీ అవసరమైన ఆ లక్షణాన్ని మనం పెంపొందించుకోవడానికి కష్టాలు మనకు సహాయపడగలవు. మోషే కాలంలోని ఇశ్రాయేలీయులలో కొందరు వారాల తరబడి, నెలల తరబడి మన్నాను తినడం విసుగును తెప్పించేదిగా ఉందనుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకోండి. మన్నా అద్భుతరీతిలో అందజేయబడినప్పటికీ అది వారికి ఒక కష్టంలా ఉండిందన్నది స్పష్టమవుతోంది. ఆ పరీక్ష సంకల్పం ఏమిటి? మోషే వారికి ఇలా చెప్పాడు: ‘[యెహోవా] నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను.’​—ద్వితీయోపదేశకాండము 8:16.

మన వినయం కూడా అదేవిధంగా పరీక్షించబడగలదు. ఎలా? మనం సంస్థాపరమైన సవరింపులకు ఎలా ప్రతిస్పందిస్తాము? (యెషయా 60:17) ప్రకటనా పనికి, బోధనా పనికి మనం మన హృదయపూర్వక మద్దతునిస్తామా? (మత్తయి 24:14; 28:19, 20) ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అందజేసిన బైబిలు సత్యపు వివరణలను మనం ఆతురతతో అంగీకరిస్తామా? (మత్తయి 24:45-47; సామెతలు 4:18) అధునాతన యంత్రసాధనాలు, క్రొత్త ఫ్యాషన్‌ వస్త్రాలు, లేదా సరిక్రొత్త మోడల్‌ వాహనం కావాలని కలిగే ఒత్తిడిని మనం నిరోధిస్తామా? వినయమనస్కుడు ఇలాంటి ప్రశ్నలకు అవును అని జవాబు చెప్పగలుగుతాడు.​—1 పేతురు 1:14-16; 2 పేతురు 3:11, 12.

కష్టాలు మనం ఇంకొక ప్రధానమైన లక్షణాన్ని పెంపొందించుకోవడానికి కూడా సహాయపడతాయి, అదే ఓర్పు. శిష్యుడైన యాకోబు ఇలా చెప్పాడు: ‘నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు [“కష్టాలను ఎదుర్కొన్నప్పుడు,” NW], అది మహానందమని యెంచుకొనుడి.’ (యాకోబు 1:2, 3) యెహోవా మీద పూర్తిగా ఆధారపడి ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే పరీక్షలను విజయవంతంగా సహించడం మనలో స్థిరత్వాన్నీ దృఢత్వాన్నీ యథార్థతనూ పెంపొందిస్తుంది. ఆగ్రహంతోవున్న, ఈ లోకానికి దేవుడైన సాతాను భవిష్యత్తులో చేయబోయే దాడులను ప్రతిరోధించడానికి అది మనలను బలపరుస్తుంది.​—1 పేతురు 5:8-10; 1 యోహాను 5:19; ప్రకటన 12:12.

కష్టాల విషయంలో సరైన దృక్కోణాన్ని కలిగివుండండి

దేవుని పరిపూర్ణ కుమారుడైన యేసుక్రీస్తు భూమిమీద ఉన్నప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించాడు, వాటిని సహించడం వల్ల గొప్ప ప్రయోజనాలను అనుభవించాడు. యేసు ‘తాను అనుభవించిన కష్టాలవలన విధేయతను నేర్చుకొన్నాడు’ అని పౌలు వ్రాశాడు. (హెబ్రీయులు 5:8, NW) మరణంవరకు ఆయన చూపిన విశ్వసనీయత యెహోవా నామానికి ఘనతను తెచ్చింది, యేసు మానవజాతి కోసం విమోచన క్రయధనంగా తన పరిపూర్ణ మానవ జీవిత విలువను అర్పించడాన్ని సాధ్యం చేసింది. యేసు మీద విశ్వాసముంచిన వారు నిత్యజీవ నిరీక్షణ కలిగివుండేలా అది మార్గాన్ని తెరిచింది. (యోహాను 3:16) కష్టాలు ఎదురైనప్పుడు యేసు నమ్మకంగా ఉన్నాడు కాబట్టే ఇప్పుడు ఆయన మన ప్రధాన యాజకుడు, సింహాసనాసీనుడైన రాజు.​—హెబ్రీయులు 7:26-28; 12:2.

మరి మన విషయమేమిటి? కష్టాలనుభవిస్తున్నప్పుడు మనం మన విశ్వసనీయతను కాపాడుకోవడం గొప్ప ఆశీర్వాదాలను తెస్తుంది. పరలోక నిరీక్షణ గలవారి గురించి బైబిలు ఇలా చెబుతుంది: ‘శోధన [“కష్టాన్ని,” NW] సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు [“కష్టానికి,” NW] నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.’ (యాకోబు 1:12) భూనిరీక్షణ గలవారు తాము నమ్మకంగా సహిస్తే భూ పరదైసులో నిత్యజీవాన్ని పొందుతామన్న హామీని కలిగివుంటారు. (ప్రకటన 21:3-6) మరి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, వారు నమ్మకంగా సహిస్తే అది యెహోవా నామానికి ఘనతను తెస్తుంది.

మనం యేసు అడుగుజాడలను అనుసరిస్తుండగా ఈ విధానంలో మనం ఎదుర్కొనే పరీక్షలన్నింటినీ విజయవంతంగా తాళుకోవడం సాధ్యమేనని మనం దృఢనమ్మకం కలిగి ఉండవచ్చు. (1 కొరింథీయులు 10:13; 1 పేతురు 2:21) ఎలా? తనపై ఆధారపడే వారికి “బలాధిక్యము” ఇచ్చే యెహోవా మీద ఆధారపడడం ద్వారా మనమలా తాళుకోవచ్చు. (2 కొరింథీయులు 4:7) మనం యోబుకున్నటువంటి నిశ్చయతను కలిగి ఉందాము, ఆయన తీవ్రమైన కష్టాలు అనుభవిస్తూ కూడా దృఢనమ్మకంతో ఇలా అన్నాడు: “ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.”​—యోబు 23:10.

[31వ పేజీలోని చిత్రం]

యేసు పరీక్షల సమయంలో చూపించిన విశ్వసనీయత యెహోవా నామానికి ఘనతను తెచ్చింది. మన విశ్వసనీయత కూడా అలాగే తీసుకురాగలదు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి