ఒక శ్రేష్ఠమైన లోకం—సమీపంలో ఉంది!
“పరదైసు కొరకైన అపేక్ష మానవుల్ని వేధిస్తున్నట్లుగావున్న అనేక బలమైన అపేక్షలలో ఒకటిగా ఉంది. ఇది అన్నింటిలోకి అత్యంత బలమైనది, పట్టువిడువనిదై యుండవచ్చు. మతపరమైన జీవితంలో ప్రతి స్థాయిలోనూ పరదైసు కొరకైన నిశ్చయమైన అపేక్షను చూడవచ్చు,” అని ది ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్ చెబుతున్నది.
ఇప్పుడు ఉనికిలోలేని ఒక ఆదర్శవంతమైన ఆది తలంపును గురించి ప్రలాపిస్తున్నట్లుగా, శ్రేష్ఠమైన లోకంలో జీవించాలనే కోరిక అన్ని సంస్కృతులలోనూ ఉన్నట్లుంది. మొదటి పరదైసు సాధ్యతను ఇది సూచిస్తుంది, కాని ఎక్కడ? పోగొట్టుకొన్న తల్లి గర్భమందలి భద్రతను తిరిగిపొందాలనే కోరికను ఈ బలమైన అపేక్ష తెలియజేస్తుందని ఒక మానసిక శాస్త్రవేత్త చెప్పవచ్చు. అయినా, మత చరిత్రను పఠించే విద్వాంసులను ఈ వివరణ ఒప్పింపజేయదు.
“పరదైసు కొరకైన అపేక్ష”—ఎందుకు?
కొందరు సూచించే విధంగా, అలాంటి అపేక్ష కేవలం కష్టాలను, మానవ జీవితం అల్పమైనదన్న వాస్తవాన్ని మరింత సహింపగల్గేలా చేయటానికేనా? లేక దానికి మరో వివరణ ఏదైనా ఉందా?
మానవజాతి ఒక శ్రేష్ఠమైన లోకం కొరకు ఎందుకు అపేక్షిస్తున్నది? దానికి బైబిలు, ఎంతో స్పష్టమైన, సరళమైన వివరణను యిస్తుంది: మానవజాతి ఒక శ్రేష్ఠమైన లోకం నుండి వచ్చింది! మొదట్లో పరదైసు నిజంగా ఉనికిలో ఉండెను. మధ్య ప్రాచ్యంలోని ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో “చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షము”తో ఆశీర్వదింపబడిన “ఒక తోట”గా దేవుని వాక్యము దాన్ని వర్ణిస్తుంది. దాని గురించి శ్రద్ధ తీసుకోవల్సిన బాధ్యతను దేవుడు మొదటి మానవ జతకు అప్పగించాడు. (ఆదికాండము 2:7-15) అది, మానవులు నిజంగా ఆనందించగలిగేలాంటి ఆదర్శవంతమైన పరిస్థితిగా ఉండెను.
ఆ పరదైసు పరిస్థితులు ఎందుకు అలా కొనసాగలేదు? ఎందుకంటే, మొదట ఒక ఆత్మీయ ప్రాణి, ఆ తర్వాత మానవ జంట చేసిన తిరుగుబాటు మూలంగా అలా కొనసాగలేదు. (ఆదికాండము 2:16, 17; 3:1-6, 17-19) ఆవిధంగా, మానవుడు పరదైసునే కాకుండా పరిపూర్ణతను, ఆరోగ్యాన్ని, నిరంతర జీవితాన్ని కూడా కోల్పోయాడు. అప్పటి నుండి ప్రబలమౌతున్న పరిస్థితులు మానవ జీవితాన్ని కచ్చితంగా మెరుగుపర్చలేదు. దానికి వ్యతిరేకంగా, ఈనాడు మనం చూస్తున్నట్లు ఇది మునుపెన్నటికంటే మరింత నీచస్థితికి దిగజారిపోయింది.—ప్రసంగి 3:18-20; రోమీయులు 5:12; 2 తిమోతి 3:1-5, 13.
పరదైసు కొరకు అన్వేషణ—ఒక ఆలోచన యొక్క చరిత్ర
ఊహించదగినట్లుగా, “పరదైసు కొరకైన అపేక్షకు” ఓ పెద్ద చరిత్ర ఉంది. విశ్వమంతటిలో ఐక్యత వెల్లివిరుస్తున్న ఒక కాలాన్ని సుమేరీయులు గుర్తుచేసుకున్నారు: “భయం, భీతి లేకుండెను, మనిషికి పోటీగా ఎవరూ లేకుండిరి . . . మొత్తం విశ్వం, ప్రజలంతా ఏకీభావముతో, ఎన్లిల్కు ఒకే భాషలో స్తుతి చెల్లించారు,” అని ఒక ప్రాచీన మెసపొటోమియా పద్యము గుర్తుచేయబడుతుంది. కొంతమంది, ప్రాచీన ఐగుప్తీయులవలెనే, మరణం తరువాత ఒక శ్రేష్ఠమైన లోకాన్ని చేరడానికి నిరీక్షించారు. అమర్త్యమైన ఆత్మ ఆరూ మైదానాలని పిలువబడే స్థలానికి చేరుతుందని వారు నమ్మేవారు. కాని నిజానికి, ఈ నిరీక్షణ కేవలం ఉన్నత వంశీయులకు మాత్రమే పరిమితమైయుండేది; పేదవారు పరమానందకరమైన లోకాన్ని పొందడం గురించి కలలు కనలేరు.
వేరొక మత ప్రాంతంలో, శతాబ్దాలుగా హిందువులు శ్రేష్ఠమైనలోకం (యుగం) వస్తుందని ఎదురుచూశారు. హైందవ బోధల ప్రకారం, ఒక క్రమమైన పద్ధతిలో నాలుగు యుగాలు వస్తుంటాయి, మనం ప్రస్తుతం అతి హీనమైన దానిలో జీవిస్తున్నాము. కొంతమంది చెప్పేదాని ప్రకారం, దురదృష్టకరంగా, ఈ కలియుగం (చీకటియుగం) దాని సమస్త బాధలు, దుష్టత్వంతో దాదాపు 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ఏది ఏమైనా, విశ్వాసంగల హిందువులు స్వర్ణయుగం, అనగా కృతయుగం కొరకు ఎదురుచూస్తున్నారు.
మరోవైపు, గ్రీకులు మరియు రోమన్లు అట్లాంటిక్ మహాసముద్రంలో, పురాణసంబంధ అదృష్ట ద్వీపాలను చేరడాన్ని గురించి కలలు కనేవారు. హేసియోద్, విర్జిల్, ఓవిద్ వంటి రచయితలు ఆనాడున్న అద్భుతమైన స్వర్ణయుగం ఒకనాటికి తప్పకుండా తిరిగి స్థాపించబడుతుందని నిరీక్షిస్తూ, దాని గురించి చెప్పారు. సా.శ.పూ. మొదటి శతాబ్దాంతంలో, లాటిన్ కవియైన విర్జిల్ ఒక క్రొత్త, నిరంతరం ఉండే ఐటాస్ యూరా (స్వర్ణయుగం) త్వరలోనే వస్తుందని ప్రవచించాడు. తరువాతి శతాబ్దాలలో, “పదహారు కంటే ఎక్కువమంది రోమా చక్రవర్తులు తమ పరిపాలనలు స్వర్ణయుగాన్ని పునఃస్థాపించాయని చెప్పుకున్నారు,” అని ది ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్ చెబుతున్నది. కాని ఈనాడు మనకు బాగా తెలిసినట్లుగా, అది కేవలం రాజకీయ ప్రచారం మాత్రమే.
సముద్రము ఆవలివైపున ఎక్కడో ఒక ద్వీపంపై (లేక ఒక ఆర్చిపెలాగో నందు) మహిమాన్విత ప్రదేశం ఉన్నట్లు తాము భావించినదాన్ని గురించి అనేకమంది సెల్టు జాతివారు ఎదురు చూశారు, అక్కడ ప్రజలు పరిపూర్ణ ఆనందంతో జీవించారని వారు విశ్వసించారు. ఒక ఇతిహాసం ప్రకారం, రాజైన ఆర్థరుకు, మరణకరమైన గాయాలైనప్పటికీ, ఆవెలాన్ అని పిలువబడే అద్భుతమైన ద్వీపాన్ని అతడు కనుగొన్న తరువాత చిరకాలం జీవించాడు.
ప్రాచీన కాలాల్లో, మధ్యయుగాల్లో, అక్షరార్థకంగా ఆనందాల తోటయైన, ఏదెను తోట ఇప్పటికీ ఎక్కడో, “అధిరోహించలేని పర్వతంపైనో లేక దాటివెళ్ల లేని సముద్రం అవతలో” ఉందని అనేకమంది భావించారని చరిత్రకారుడైన జాన్ డెలీమో వివరించాడు. ఇటలీదేశ కవియైన డాన్టె పరలోక పరదైసు ఉందని విశ్వసించినప్పటికీ, యెరూషలేము పట్టణం ఎదురుగా, ఆయన పర్గేటరీ పర్వతంపైన భూపరదైసు ఇంకా ఉందని తలంచాడు. కొంతమంది అది ఆసియాలో, మెసపొటోమియాలో, లేక హిమాలయాలలో ఉంటుందని నమ్మారు. ఏదెను సంబంధ పరదైసును గూర్చిన ఇతిహాసాలు మధ్యయుగంలో అనేకముండేవి. ఆ పరదైసుకు సమీపంలో, పరిశుద్ధ ప్రెస్టర్ జాన్ పరిపాలించే ఒక అద్భుతమైన రాజ్యం ఉందని అనేకులు నమ్మేవారు. భూపరదైసు సమీపంలో ఉన్నందుకు కృతజ్ఞతలు, ప్రెస్టర్ జాన్ రాజ్యంలో జీవితం దీర్ఘంగా, పరమానందదాయకంగా ఉండి, సమృద్ధి, సంపదలకు మూలమై ఉండేదట. ప్రాచీన గ్రీకు ఇతిహాసాలతో మనస్సులు నిండిపోయివున్న ఇతరులు, పరదైసు ద్వీపాలను అట్లాంటిక్ మహాసముద్రంలో ఇప్పటికీ కనుగొనవచ్చని అనుకుంటారు. ఏదెను తోట ఉనికిలో ఉందని, దాని నిర్దారిత స్థలాన్ని కూడా సూచిస్తూ అలాంటి నమ్మకం యొక్క కచ్చితత్వాన్ని మధ్యయుగం నాటి పటాలు చూపిస్తున్నాయి.
అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటివచ్చిన నావికులు 15, 16 శతాబ్దాలలో క్రొత్తది, అలాగే ప్రాచీనమైనది కూడా అయిన లోకం కొరకు వెదుకుతూ వచ్చారు. మహాసముద్రానికి మరోవైపు వారు ఇండీస్నే కాకుండా, ఏదెను తోటను కూడా కనుగొంటామని అనుకున్నారు. ఉదాహరణకు, క్రిస్టోఫర్ కొలంబస్ దక్షిణ, మధ్య అమెరికాలలోని సమశీతోష్ణ, ఉష్ణమండల ప్రదేశాల యందలి పర్వతాల్లో దాని కొరకు వెదికాడు. బ్రెజిల్కు వచ్చిన యూరపు అన్వేషకులు అక్కడున్న చల్లని వాతావరణం, ఆహార, వృక్ష సమృద్ధిని బట్టి కోల్పోబడిన పరదైసు తప్పకుండా అక్కడే ఉండి ఉంటుందనుకున్నారు. కాని త్వరలోనే వారు భయంకరమైన వాస్తవాన్ని గుర్తించవలసి వచ్చింది.
ఊహాజనిత లోకాలు—శ్రేష్ఠమైన స్థలాలా?
భూమి యొక్క మారుమూల ప్రాంతాల్లో శ్రేష్ఠమైన లోకాన్ని కనుగొనుటకు ప్రయత్నించే బదులు, ఇతరులు దాన్ని తయారు చేయుటకు ప్రయత్నించారు. అలా, 1516లో ఆంగ్ల మానవతావాది థామస్ మోర్ ఊహాకల్పిత ద్వీపాన్ని ఒక అద్భుతమైన, శాంతియుతమైన, సమత, సహనంగల స్థలం అని, ఆయన ఎరిగియున్న దిగజారిపోయిన లోకం నుండి అది ఎంతో వేరైనదని వర్ణించాడు. సా.శ.పూ ఆరవ శతాబ్దంలో ప్లాటో తన రిపబ్లిక్ ద్వారా; 1602లో ఇటలీ ఫ్రెర్ టామోసో కాంపనెల్లా అత్యంత క్రమమైన తన సూర్య నగరం ద్వారా; కేవలం కొన్ని సంవత్సరాల తరువాత, ఇంగ్లీషు తత్వవేత్త ఫ్రాన్సిస్ బెకాన్ తన క్రొత్త అట్లాంటిస్ యొక్క “సంతోషదాయకమైన, వర్ధిల్లుతున్న ఎస్టేటు”ను వర్ణించడంలో, ఇలా ఇతరులు కూడా శ్రేష్ఠమైన లోకాలను, సంతోషదాయకమైన లోకాలను తయారు చేయాలని ప్రయత్నించారు. శతాబ్దాలు గడుస్తుండగా, అన్ని రకాల ఆలోచనాపరులు (విశ్వాసులైనా, కాకపోయినా) డజన్ల కొలది ఊహాకల్పిత ద్వీపాలను వర్ణించారు. అయితే ఒకవేళ ఉన్నా, కేవలం కొన్నిటినే నమ్మారు.
తమ స్వంత ఊహాకల్పిత ద్వీపాలను తయారు చేసుకోవటానికి ప్రయత్నించిన వారు కూడా ఉన్నారు. ఉదాహరణకు, 1824లో ఒక ఐశ్వర్యవంతుడైన ఆంగ్లేయుడు, రాబర్ట్ ఓవెన్, తాను న్యూ హార్మనీ అని పేరు పెట్టిన గ్రామంలో తన ఊహాకల్పిత ద్వీప ఆలోచనలను వాస్తవం చేసుకోవడానికి, అమెరికా నందలి ఇండియానాకు వలసవెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. మంచి పరిస్థితుల్లో ప్రజలు మెరుగుపడగలరనే నమ్మకంతో, తాను నూతన నైతిక లోకం అని దృశ్యీకరించుకొనిన దాన్ని స్థాపించటానికి దాదాపు తనకున్నదంతా ఖర్చు పెట్టేశాడు. కాని నూతన జీవన పరిస్థితులు మాత్రమే నూతన మనుష్యులను రూపొందించడానికి సరిపోవని ఫలితాలు చూపించాయి.
మనిషి తన స్వంత జ్ఞానానుసారంగా, తాను కలలుగనే పరదైసు భూమిని తీసుకురావటానికి ఏది అవసరమో పథకం వేసుకోవాలని దాదాపు అన్ని రాజకీయ సిద్ధాంతాలు చెబుతున్నాయి. అయినా, దానికి ప్రతికూలంగా, అలాంటి అపేక్షలను వాస్తవం చేయాలనే ప్రయత్నాలు 1789లో ఫ్రెంచి విప్లవం, 1917లో బోల్శెవిక్ విప్లవం వంటి యుద్ధాలు, విప్లవాలకు దారితీసాయి. పరదైసు పరిస్థితులను తీసుకురావటానికి బదులు, ఈ ప్రయత్నాలు తరచూ అధికమైన బాధ, వేదనలకు కారణమయ్యాయి.
అపేక్షలు, పథకాలు, ఊహాకల్పిత ద్వీపాలు, వాటిని వాస్తవం చేయాలనే ప్రయత్నాలు—అది ఒక దాని తరువాత మరొకటి వచ్చిన నిరాశ యొక్క గాథ. ప్రస్తుత కాలంలో, కొంతమంది మనల్ని “ఊహాకల్పిత ద్వీపాలు లేకుండా జీవించుటను” నేర్చుకొనుటకు ఆహ్వానిస్తూ, “చెరిగిపోయిన కల,” “ఊహాకల్పిత ద్వీపాల శకానికి ముగింపు” గురించి మాట్లాడతారు. ఒక శ్రేష్ఠమైన లోకాన్ని చూసే నిరీక్షణ ఏమైనా ఉందా, లేక అది కేవలం ఒక కలగా మిగిలిపోవలసిందేనా?
క్రైస్తవులు, ఒక శ్రేష్ఠమైన లోకం
నూతన లోకం ఎంతమాత్రం ఒక కల కాదు—అది కచ్చితమైన నిరీక్షణ! సాధ్యమైన లోకాలన్నిటిలోకి ప్రస్తుతమున్న లోకం శ్రేష్ఠమైంది కాదని క్రైస్తవత్వ సంస్థాపకుడైన యేసుక్రీస్తుకు తెలుసు. సాత్వికులైన వారితో భూమి నింపబడుతుందని, దేవుని చిత్తం అక్కడ నెరవేరుతుందని ఆయన బోధించాడు. (మత్తయి 5:5; 6:9, 10) ఈ లోకం దేవుని శత్రువైన, అపవాదియగు సాతానుచే అదుపు చేయబడుతుందని, మానవజాతి యొక్క అనేక బాధలకు అదే ప్రధాన కారణమని ఆయనకు, ఆయన శిష్యులకు కూడా తెలుసు. (యోహాను 12:31; 2 కొరింథీయులు 4:4; 1 యోహాను 5:19; ప్రకటన 12:12) భూమిపై శాంతిని, న్యాయాన్ని ప్రేమించేవారు ఉండేలా, దేవుడు యుద్ధాలు, బాధ, అనారోగ్యాలను దానిలో నుండి ఎన్నటికీ ఉండకుండా తీసివేసే దినం కొరకు విశ్వాసులైన యూదులు ఎదురుచూశారు. అదేవిధంగా, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఈ ప్రస్తుత లోకం తీసివేయబడి నూతన విధానమైన ‘క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి’ కొరకు నమ్మకంగా ఎదురుచూశారు.—2 పేతురు 3:13; కీర్తన 37:11; 46:8, 9; యెషయా 25:8; 33:24; 45:18; ప్రకటన 21:1.
యేసుక్రీస్తు హింసా కొయ్యపై వ్రేలాడుతున్నప్పుడు, ఆయన యందు కొంత విశ్వాసం చూపిన దొంగతో శ్రేష్ఠమైన లోకాన్ని గూర్చి ఆయన మళ్లీ వాగ్దానం చేశాడు. “[యేసు] వానితో—నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నేడు నీతో చెప్పుచున్నాననెను.” (లూకా 23:40-43, NW) ఆ మాటల భావాన్నుండి ఆ దొంగ ఏమి అర్థం చేసుకున్నాడు? కొన్ని కాథలిక్ మరియు ప్రొటస్టెంట్ బైబిలు తర్జుమాలు అన్వయించినట్లు, ఆ దొంగ అదే రోజున ‘ఆయనతోపాటు పరలోకానికి’ వెళ్తాడని యేసు సూచిస్తున్నాడా? యేసు ఉద్దేశం అది కాదు, ఎందువల్లనంటే ఆయన పునరుత్థానమైన తరువాత, యేసు మగ్దలేనే మరియకు తాను ‘ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదని’ చెప్పాడు. (యోహాను 20:11-18) సా.శ. 33 పెంతెకొస్తుకు ముందు వారు యేసుచే మూడున్నర సంవత్సరాలు బోధింపబడినప్పటికీ, ఆయన అపొస్తలులు కూడా పరలోక పరదైసు గురించి ఆలోచించలేదు. (అపొస్తలుల కార్యములు 1:6-11) ఆ కాలంలో జీవిస్తున్న అనేకమంది యూదులు అర్థం చేసుకొనివుండేదాన్నే ఆ దొంగ కూడా అర్థం చేసుకున్నాడు: పరదైసు భూమిపై ఒక శ్రేష్ఠమైన లోకం వస్తుందని యేసు వాగ్దానం చేస్తుండెను. ఒక జర్మన్ విద్వాంసుడు ఇలా అంగీకరించాడు: “జీవనం తరువాత పొందే ప్రతిఫలాన్ని గూర్చిన బోధ పాత నిబంధనలో ఎక్కడా కనిపించదు.”
అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన తన పత్రికలో మన భూమిపై ఒక పరదైసు ఉంటుందని సాక్ష్యమిచ్చాడు. తన తోటి విశ్వాసులను ‘ప్రభువు బోధించుటచేత ఆరంభమైన ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయవద్దని’ ప్రోత్సహించేటప్పుడు, “రాబోవు లోకముపై [గ్రీకు, ఒయ్కౌమెనె]” యెహోవా దేవుడు యేసుకు అధికారమిచ్చాడని పౌలు దృఢపర్చాడు. (హెబ్రీయులు 2:3, 5) క్రైస్తవ గ్రీకు లేఖనాలలో, ఒయ్కౌమెనె అనే పదం ఎల్లప్పుడూ మానవులతో నిండివున్న మన భూమిని సూచిస్తుంది కాని, పరలోక సంబంధ లోకాన్ని కాదు. (మత్తయి 24:14; లూకా 2:1; 21:26; అపొస్తలుల కార్యములు 17:31 పోల్చండి.) యేసుక్రీస్తుచే పరిపాలింపబడే దేవుని రాజ్యం ప్రజలతో నిండిన భూమిపై ఆధిపత్యం వహిస్తుంది. అది జీవించడానికి నిజంగా సరైన స్థలమై ఉంటుంది!
రాజ్యం పరలోక సంబంధమైనదే అయినా, అది భూవిషయాల్లో తప్పకుండా చర్య తీసుకుంటుంది. ఏ ఫలితాలతో? అనారోగ్యాలు, బాధలు, పేదరికం, మరణం గత స్మృతులై వుంటాయి. వేదన, అసంతృప్తి కూడా గతించిపోతాయి. (ప్రకటన 21:3-5) ‘దేవుడు తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తాడని’ బైబిలు చెబుతున్నది. (కీర్తన 145:16) నిరుద్యోగం మరియు కాలుష్యం వంటి సమస్యలకు ఆచరణయోగ్యమైన, నిత్యము నిలిచే పరిష్కారం లభిస్తుంది. (యెషయా 65:21-23; ప్రకటన 11:18) అన్నిటి కంటే ముఖ్యంగా, దేవుని దీవెన కొరకు వందనాలు, దాదాపు అంతరించిపోయినట్లుగా ఉన్న లక్షణాలైన సత్యం, న్యాయం, సమాధానాలకు అక్కడ విజయం ఉంటుంది!—కీర్తన 85:7-13; గలతీయులు 5:22, 23.
ఇదంతా ఒక స్వప్నమేనా, ఒక ఊహాకల్పితమేనా? కాదు, అన్ని సమయాల కంటే కష్టతరసమయమైన మనం జీవిస్తున్న ఈ కాలం మనం “అంత్య దినాల్లో” ఉన్నామని, నూతన లోకం సమీపంలో ఉందని చూపిస్తుంది. (2 తిమోతి 3:1-5) అక్కడ జీవించటానికి మీరు ఇష్టపడతారా? యెహోవాసాక్షులతో బైబిలు పఠించడం ద్వారా ఇదెలా సాధ్యమో నేర్చుకోండి. ఒక శ్రేష్ఠమైన లోకం సమీపంలో ఉంది, మనం కలలు గనే దానికంటే ఎంతో మేలైనది. అది ఊహాకల్పితం కాదు—అది ఒక వాస్తవము!
[7వ పేజీలోని చిత్రం]
ఒక శ్రేష్ఠమైన లోకం—త్వరలోనే నిజమౌతుంది