మీరు పరలోకమునకు కొనిపోబడుదురా?
చాలా మంది ప్రజలు తాము మరణించిన తరువాత పరలోకమునకు వెళ్తామని నమ్ముతారు. కాని కొందరు రాప్చర్ (పైకెత్తబడుట) అని పిలువబడే సమయంలో తాము పరలోకమునకు వెళ్తామని అనుకుంటున్నారు. నీ నిరీక్షణా అదేనా?
రాప్చర్ అనగా “కోట్లకొలది ప్రజలు ఎక్కడికి వెళ్లారన్న లేశమాత్రం ఆచూకియైనా తెలియకుండా అకస్మాత్తుగా అదృశ్యమగుట!” అని ఒక ప్రొటెస్టెంట్ సువార్త ప్రచారకుడు చెప్పాడు. ఎవాంజలికల్ డిక్షనరీ ఆఫ్ థియాలజీ ప్రకారం, “రాప్చర్” అను పదం “క్రీస్తు రెండవ రాకడయందు సంఘమంతా ఆయనతో ఐక్యమగుట”ను సూచిస్తుంది.
యేసుక్రీస్తును ఎదుర్కొనుటకు స్నేహితులను మరియు కుటుంబ సభ్యులను వదిలివెళ్లాలనే ఆలోచనే కొందరికి కలవరపరచేదిగా ఉంటుంది. అయినను రాప్చర్ తప్పకుండా సంభవించాలని అనేకులు విశ్వసిస్తున్నారు. అది జరుగుతుందా? అట్లైతే, ఎప్పుడు?
రాప్చర్ను గూర్చిన విభిన్న అభిప్రాయాలు
క్రీస్తు వాగ్దానం చేసిన వెయ్యేండ్ల పరిపాలన మొదలుకాక ముందు, “మహాశ్రమ” అని పిలువబడే ఒక కాలం ఉందని బైబిలు చెప్తుంది. “అప్పుడు మహాశ్రమ కలుగును . . . లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు” అని యేసు చెప్పాడు. (మత్తయి 24:20, 21; ప్రకటన 20:6) రాప్చర్ మహాశ్రమలకంటే ముందే జరుగుతుందని కొందరంటారు. మహాశ్రమ సమయంలో జరుగుతుందని ఇతరులంటారు. ఆ అసమాన విపత్తు తరువాత రాప్చర్ జరుగుతుందని మరికొందరు భావిస్తారు.
మహాశ్రమ తరువాత రాప్చర్ (పైకెత్తబడుట) జరుగుతుందను అభిప్రాయం 19వ శతాబ్దం ప్రారంభంవరకు ప్రబలంగా ఉండేది. తరువాత, ఐర్లాండ్ చర్చి మాజీ మతాధికారి అయిన జాన్ నెల్సన్ డార్బె నాయకత్వమున ఒక ఉద్యమం ఇంగ్లాండులో ప్రారంభమైంది. అతను మరియు అతనితో ఏకీభవించిన ఆంగ్లికన్లు బ్రదరెన్ అని పిలువబడ్డారు. డార్బె తన చర్చి స్థాపించబడిన పెమౌత్నుండి, ప్రకటించుటకు స్విట్జ్ర్లాండ్కు మరియు యూరపులో మరో చోటుకు ప్రయాణించాడు. క్రీస్తు రావడం రెండు దశలుగా ఉంటుందని ఆయన దృఢంగా చెప్పాడు. భూమిని ఏడేళ్ల శ్రమలకాలం చిన్నాభిన్నముచేయక ముందు, “పరిశుద్ధులు” రహస్యంగా పైకెత్తబడటంతో (రాప్చర్తో) అది మొదలౌతుంది. తరువాత క్రీస్తు “పరిశుద్ధుల”తో కూడావచ్చి దృశ్యంగా కనిపిస్తాడు, మరియు వాళ్లంతా కలిసి భూమిపై వెయ్యేండ్లు పరిపాలిస్తారని ఆయనన్నాడు.
డార్బె, లోకానికి వేరైయుండాల్సిన అవసరతను గూర్చి నొక్కి చెప్పాడు. అతని అభిప్రాయాలతో ఏకీభవించిన వారు తుదకు ప్రత్యేకంగా బ్రదరెన్ అని పిలువబడ్డారు. పైకెత్తబడుట అను సిద్ధాంతాన్ని విశ్వసించు బి. డబ్ల్యు. న్యూటన్ అను మరోవ్యక్తి ఈ అభిప్రాయాన్ని విశ్వసించే ఒక శాఖకు నాయకత్వం వహించాడు. వీరు ఇది మహాశ్రమకు ముందు జరుగుతుందని నమ్మరు. మహాశ్రమ తరువాత రాప్చర్ జరుగుతుందను అభిప్రాయాన్ని ప్రచురించిన అలెక్జాండర్ రెస్, “రహస్యంగా పైకెత్తబడుటను గూర్చిన సిద్ధాంతాలు, క్రీస్తు రాకడను గూర్చిన నిరీక్షణకు ఆటంకంగా ఉన్నాయని” అన్నాడు.
మహాశ్రమకు ముందు జరుగుతుందని విశ్వసించే వారి అభిప్రాయాలలో ఉన్న ఈ తేడా “క్రీస్తు రాకడను గూర్చిన వారి నిరీక్షణ భావాన్ని” ప్రభావితం చేసేంత గంభీరమైనదని వారు విశ్వసిస్తున్నారు. ఇతరులు, క్రీస్తుకు ఎక్కువ విశ్వాసపాత్రులుగా ఉన్నవారు మొదట పైకెత్తబడిన తరువాత ఎక్కువ లోకసంబంధంగా ఉన్నవారు తీసుకొనబడతారని విశ్వసిస్తూ, “పాక్షికంగా పైకెత్తబడు సిద్ధాంతం”లో నమ్మకముంచుతున్నారు.
నమ్మకమైన క్రైస్తవులు పైకెత్తబడుట ఆసన్నమైనదని అనేక సువార్త ప్రచార గుంపులు ప్రకటిస్తున్నాయి. ఈ విభిన్న అభిప్రాయాల దృష్ట్యా, బ్రిటన్స్ యొక్క ఎలిమ్ పెంటెకోస్టల్ చర్చిచే ప్రచురింపబడిన చిన్నపుస్తకం ఇలా చెప్తుంది: “ప్రభువైన యేసు యొక్క రాకడకు సంబంధించిన అనేక సంఘటనలను మేము నమ్మినను . . . , ప్రవచనాలను వ్యక్తిగత విశ్వాసం ప్రకారం వివరించు స్వాతంత్ర్యం ఇవ్వబడింది. చాలామంది సహేతుకమైన స్థానంవహిస్తూ, సంఘటనలు తామె ప్రవచనార్థక కార్యక్రమాన్ని సువ్యక్తం చేసేంతవరకు సంఘటనల కొరకు సహనంతో వేచి ఉంటారు”.
ఈ విశ్వాసాలన్నింటి సత్యవాదిత్వాన్ని తెలుసుకొనుటకు, దేవుని ప్రేరేపిత వాక్యమైన, బైబిలే, ప్రమాణికము. (2 తిమోతి 1:13; 3:16, 17) అందువల్ల, పైకెత్తబడుటను గూర్చి అదేమి చెప్పుచున్నది?