నాష్ పేపరస్ విలువ
ఒక పాత హెబ్రీ బైబిలు చేవ్రాత ప్రతి కాలాన్ని నీవెలా కచ్చితంగా నిర్ణయించగలవు? డా. జాన్. కె. టెవర్ 1948 లో యెషయా గ్రంథముయొక్క మృత సముద్రపు చుట్టను మొట్టమొదటిసారి చూచినప్పుడు అతడు యిదే సమస్యను ఎదుర్కొన్నాడు. హెబ్రీ అక్షరములు వ్రాయబడిన తీరు అతనిని ముగ్ధున్ని చేసినవి. వాటి కాలాన్ని నిర్ణయించడానికి అక్షరాలే కీలకమని అతనికి తెలుసు. అయితే అతడు వాటిని దేనితో పోల్చగలడు? అతడిలా అనడం సమంజసమే: కేవలం నాష్ పేపరస్ ప్రతితోనే పోల్చగలం. ఎందుకు? ఈ చేవ్రాత ప్రతి ఏమిటి? దాని మూలమేమిటి?
నాష్ పేపరస్ కేవలం 24 వరుసల హెబ్రీ పాఠ్య భాగం కల్గిన 3x5 అంగుళాల నాలుగు కాగితపు తునకలు. దానిని 1902లో ఒక ఐగుప్తు పంపిణీదారుని నుండి సొసైటి ఆఫ్ బిబ్లికల్ ఆర్కియాలజి కార్యదర్శి డబ్ల్యు. ఎల్. నాష్ సంపాదించాడు గనుక దానికి అతని పేరు పెట్టారు. ఆ తదుపరి సంవత్సరములో సొసైటీస్ ప్రోసీడింగ్స్ అనుదానిలో ఎస్. ఎ. కూక్ దాన్ని ప్రచురించాడు. ఇంగ్లండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లైబ్రరీకి దాన్ని బహుకరించాడు. నేటికి అది అక్కడే ఉన్నది. ఈ పేపరస్ తునకయొక్క విలువ దాని వయస్సుపై ఆధారపడియుంది. అది సా.శ.పూ. రెండవ లేక మొదటి శతాబ్దమునకు చెందినదని పండితులు నిర్ణయించారు. కావున లభించిన హెబ్రీ చేవ్రాత ప్రతి పత్రాలలోకెల్లా అది అతి ప్రాచీనమైంది.
డా. ట్రెవర్ తన యెదుటగల గ్రంథపు చుట్టతో నాష్ పేపరస్ కలర్ స్లైడును పోల్చిచూచినపుడు ఒక్కొక్క అక్షరపురీతి, ఆకృతులను అతి జాగ్రత్తగా పరిశీలించాడు. నిస్సంశయంగా అవి ఒకే విధంగా ఉన్నాయి. ఆలాగే అతి పెద్దవిగా ఉండని, క్రొత్తగా కనుగొనబడిన చేవ్రాత ప్రతులు నాష్ పేపరస్ కాలంనాటివేనని కనుగొనడం అతనికి విభ్రాంతి కల్గించింది. అయితే అతని ఊహ అనతికాలంలో నిజమని నిరూపించబడింది. మృత సముద్రపు యెషయా గ్రంథపు చుట్ట సా.శ.పూ. రెండవ శతాబ్దానికి చెందినదే.
నాష్ పేపరస్ నందలి విషయాలు
నాష్ పేపరస్ నందలి 24 వరుసలు యిరుప్రక్కల ఒక పదము లేక అక్షరము అదృశ్యమై అసంపూర్ణంగా ఉన్నాయని విశ్లేషణలో బయల్పడింది. ద్వితీయోపదేశకాండము 5, 6 అధ్యాయము నందలి పది ఆజ్ఞలలో కొన్ని భాగాలను అది కల్గియుంది, కావున అది అసాధారణ బైబిలు చేవ్రాతప్రతి కాదుగాని ఒక ప్రత్యేక సంకల్పముకొరకు తయారుచేయబడిన మిశ్రిత పాఠ్యభాగము. అది నిశ్చయంగా, దేవునియెడల తన విధి ఏమిటో ఒక యూదునికి జ్ఞాపకముచేసే ఉపదేశక సమీకరణలో భాగమైయున్నది. ద్వితీయోపదేశకాండము 6:4తో ప్రారంభమయ్యే షేమ అని పిలువబడిన లేఖనభాగము తరచు కన్పిస్తుంది. ఆ వచనమిలా చదువబడుతుంది: “ఇశ్రాయేలూ వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా.”
ఈ వచనమందలి YHWH “యెహోవా” అనే నాలుగు అక్షరాలు పేపరస్లోని ఆఖరి వరుసలో రెండుసార్లు కన్పిస్తాయి. మరితర ఐదు స్థలాల్లో అది ఉంది, మరోచోట కూడా అందలి మొదటి అక్షరం లేకుండ అది కన్పిస్తుంది.
నిర్దిష్టంగా “దేవుని అద్వితీయ వ్వక్తిత్వాన్ని” నొక్కి తెల్పడానికే షేమా నిర్దేశించబడింది. యూదయ టాల్మాడ్ (బెరాకోట్ 19వ) ప్రకారం ఎ-ఖాద్ (“ఒక్కడే”) అను ముగింపుమాటను “ఒక్కొక్క గుణితాక్షరముతో (సిలబల్) ఉచ్చరించేటప్పుడు ప్రత్యేకంగా ఉన్నతపర్చబడాలి.” (డబ్ల్యు. ఒ. ఇ. ఓస్టర్లీ మరియు జి. హెచ్. బాక్స్) దేవునికి సంబోధించేటప్పుడు ఈ దీర్ఘ ఉచ్చారణ ఎ-ఖాద్ ఆయన సాటిలేనితనాన్ని కూడ ప్రచురిస్తుంది.
నేడు నాష్ పేపరస్కు సమకాలికమైనవి అనేకమున్నవి. మరి ముఖ్యంగా కుమ్రాన్కు సమీపంగా మృత సముద్రపు తీరమందున్న గుహలందు కనుగొనబడిన గ్రంథపు చుట్టలో కొన్ని ఉన్నవి. ఈ చేవ్రాత ప్రతులలో అనేకము సా.శ.పూ. మొదటి మరియు రెండవ శతాబ్దమునకు చెందినవని వివరణాత్మక పరిశీలన స్థిరపర్చింది.a కనుగొన్నవాటిలో నాష్ పేపరస్ ప్రాచీన హెబ్రీ చేవ్రాత ప్రతిగా ఉండక పోయినను, అది యింకను ప్రాముఖ్యతను కల్గియున్నది. ఐగుప్తులో కనుగొనబడిన వాటిలో అది ఒక్కటే అంతటి పురాతన హెబ్రీ బైబిలు చేవ్రాత ప్రతిగా మిగిలిపోయింది.
[అధస్సూచీలు]
a ది వాచ్టవర్ ఏప్రిల్ 15, 1991, 10-13 పేజీలు చూడుము.