దైవభక్తిగల ప్రజల కొరకు విడుదల సమీపముగా ఉన్నది!
“భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్నీతిపరులను . . . తీర్పుదినము వరకు కావలిలో ఉంచుటకును యెహోవా సమర్థుడు.”—2 పేతురు 2:9 NW.
1. (ఎ) కృంగదీయు ఎటువంటి పరిస్థితులను ఈనాడు మానవజాతి ఎదుర్కొనుచున్నది? (బి) దీనిదృష్ట్యా, మనమే ప్రశ్నలను విచారించబోవుచున్నాము?
మానవ జాతియంతటి జీవితసమస్యలు పెరుగుచున్నవి. వస్తుదాయక సమృద్ధిగల ప్రాంతము లేక కొదువగల ప్రాంతములో జీవించుటయను భేదము యిక్కడలేదు, ఎక్కడైనను యిది సత్యమైయున్నది. భద్రతలేనితనము ప్రతిచోట నెలకొనియున్నది. చింతించుటకు చాలదన్నట్లు అస్థిరమైన ఆర్ధిక పరిస్థితులే కాకుండా, గంభీరమైన పర్యావరణ సమస్యలు భూమిని పట్టిపీడించుచు, భూమిమీది సమస్త ప్రాణకోటిని బెదిరించుచున్నవి. రోగము ప్రబలమగుచున్నది. అంటువ్యాధులు, హృద్రోగములు, క్యాన్సరు తెగులు పెద్దఎత్తున ప్రాణాలను తీయుచున్నవి. మానవ భావోద్రేకములు, కుటుంబ జీవనములమీద లైంగిక దుర్నీతి నాశనకర పరిణామములకు కారణమగుచున్నది. దీనియంతటికి తోడుగా, లోకము పూర్తిగా దౌర్జన్యముతో నిండిపోయినది. మానవ సమాజము ఎదుర్కొనుచున్న దానిదృష్ట్యా, మనము నిజముగా ఇట్లు ప్రశ్నించవచ్చును: త్వరగా వీటన్నింటినుండి విడుదల లభించునని ఎదురుచూచుటకు నమ్మదగిన ఆధారమేమైనాకలదా? అట్లయిన, అది ఎట్లు వచ్చును, ఎవరికొరకు వచ్చును?—హబక్కూకు 1:2; 2:1-3 పోల్చుము.
2, 3. (ఎ) 2 పేతురు 2:9లో చెప్పబడినది మరలా అభయమిచ్చుచున్నట్లుగా మనమీనాడు ఎందుకు కనుగొందుము? (బి) ప్రోత్సాహమునకొక ఆధారముగా విడుదలను గూర్చిన ఏ ప్రత్యేక అంశములను బైబిలు సూచించుచున్నది?
2 ఏదైతే నేడు జరుగుచున్నదో, అది మానవ చరిత్రలోని బహు ప్రాముఖ్యమైయుండిన కాలములను మనకు గుర్తుచేయుచున్నది. ఆయా సందర్భములలో దేవుడు విడుదలకొరకు చేసిన కార్యముల మీదకు అపొస్తలుడైన పేతురు దృష్టిని మరల్చి, చివరకు: “భక్తులను శోధనలోనుండి తప్పించుటకు . . . యెహోవా సమర్థుడు.” అను అభయపూర్వక ముగింపునకు వచ్చెను. (2 పేతురు 2:9 NW) 2 పేతురు 2:4-10, NWలో చెప్పబడిన ఆ మాటల సందర్భమును గమనింపుము:
3 “దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోకమందలి కటికచీకటిగల బిలము (టార్టారస్) లోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను., మరియు సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి, దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారిమధ్యను కాపురముండి, తాను చూచినవాటినిబట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశకలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడినవారిని తీర్పుదినము వరకు కావలిలో ఉంచుటకును, యెహోవా సమర్థుడు.” ఆ లేఖనములు చూపించునట్లుగా నోవహు దినములలో, లోతు దినములలో జరిగినది మనకొరకు అర్థముతో నిండియున్నది.
నోవహు దినములలో ప్రబలమైయుండిన ఆత్మ
4. నోవహు దినములలో భూమిని చెడిపోయినదిగా దేవుడెందుకు దృష్టించెను? (కీర్తన 11:5)
4 నోవహు దినములలో భూమి సత్యదేవుని దృష్టిలో బొత్తిగా పాడైపోయివుండెనని ఆదికాండము 6వ అధ్యాయములోని చరిత్రాత్మక వృత్తాంతము మనకు తెలియజేయుచున్నది. ఎందుకు? బలాత్కారము కారణముగా. యిది అక్కడక్కడ నేరప్రవృత్తిగల బలత్కారము జరుగుచుండిన సంగతికాదు. “భూలోకము బలాత్కారముతో నిండియుండెను.” అని ఆదికాండము 6:11 తెల్పుచున్నది.
5. (ఎ) మానవులలోని ఏ దృక్పధము నోవహు దినములలోని బలాత్కారమునకు కారణమైనది? (బి) భక్తిహీనత విషయమై హనోకు ఏమని హెచ్చరించెను?
5 దీనియంతటివెనుక ఉన్నది ఏమిటి? రెండవ పేతురునుండి ఎత్తిచూపించబడిన లేఖనము భక్తిహీనప్రజలను సూచించుచున్నది. అవును, భక్తిహీన ఆత్మ మానవ వ్యవహారములయందు విస్తరించి యుండెను. దీనియందు కేవలము దైవాజ్ఞకొరకైన సాధారణ శ్రద్ధలేనితనము మాత్రమే కాక, దేవునియెడల ధిక్కార దృక్పధమును చేరియున్నది.a మనుష్యులు దేవునియెడలనే ధిక్కారభావమును కలిగియున్నట్లయిన వారు తోటి మానవులతో దయగా వ్యవహరింతురని మనమెట్లు అపేక్షించగలము? నోవహు జన్మించకపూర్వమే, ఈ భక్తిహీనత ఎంత ప్రబలమై యుండెననగా, దాని ఫలితమునుగూర్చి ప్రవచించుటకు యెహోవా హనోకును లేవదీసెను. (యూదా 14, 15) వారి దేవుని ధిక్కారమునకు నిశ్చయముగా వారిమీదకు దైవిక తీర్పురానైయుండెను.
6, 7. దూతలు చేరియున్న ఏ స్థితి జలప్రళయమునకు ముందు పెరిగిన చెడు పరిస్థితులకు ప్రధాన వాస్తవమైయుండెను?
6 ఆ దినములయందలి దౌర్జన్యమునకు కారణమైనది మరియొకటి కూడాకలదు. దానినిగూర్చి ఆదికాండము 6:1, 2 యిలా చెప్పుచున్నది: “నరులు భూమిమీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారనిచూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.” దేవుని ఈ కుమారులెవరు? వారు కేవలము మానవమాత్రులు కారు. మానవులు శతాబ్దములుగా అందముగాయున్న స్త్రీలను చూసిరి మరియు వారిని వివాహమాడుచును యుండిరి. వీరు మానవశరీరము ధరించి వచ్చిన దేవుని కుమారులైన దేవదూతలైయుండిరి. యూదా 6 నందు వీరు “ప్రధానత్వము నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలుగా” వర్ణింపబడిరి.—1 పేతురు 3:19, 20 పోల్చుము.
7 పురుషులుగా శరీరములు ధరించిన ఈ మానవాతీత ప్రాణులు నరుల కుమార్తెలతో సంబంధమేర్పరచుకొనినప్పుడు దానికి ఫలితముగా ఏమికలిగెను? “ఆ దినములలో నెఫీలులను వారు భూమిమీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరుపొందిన శూరులు వీరే.” అవును, ఆ అసహజ కలయిక సంతానము బలముగల నెఫీలులైయుండి, వారికున్న అతీత శక్తినిబట్టి బలహీనులైనవారిపై దౌర్జన్యముచేయువారిగా యుండిరి.—ఆదికాండము 6:4.
8. భూమిమీది చెడు పరిస్థితులకు యెహోవా ఎట్లు ప్రతిస్పందించెను?
8 ఈ పరిస్థితి ఎంతచెడ్డగా తయారయినది? అది ఎంతగాయండెనంటే, “నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయముయొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూసెను.” ఈ విషయమై దేవుడెట్లు ప్రతిస్పందించెను? “తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొంది తన హృదయములో నొచ్చుకొనెను.” అయితే మానవజాతిని సృజించుటలో తానొక తప్పిదముచేసానని దేవుడు భావించెనని దీని భావముకాదు. బదులుగా, తాను మానవులను చేసిన పిదప, తానే మరలా వారిని నాశనము చేయవలసినంతగా వారి దుష్టప్రవర్తన పెరిగిపోవుటనుగూర్చి ఆయన సంతాపమునొందెను.—ఆదికాండము 6:5-7.
విడుదలకు నడిపిన క్రియావిధానము
9. (ఎ) నోవహుతో దేవుడెందుకు దయాపూర్వకముగా వ్యవహరించెను? (బి) నోవహుకు దేవుడు ఏ సమాచారమును ముందుగా తెలియజేసెను?
9 నోవహు మాత్రము, “యెహోవా దృష్టియందు కృపపొందినవాడాయెను. . . . నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునైయుండెను. నోవహు దేవునితోకూడ నడిచినవాడు.” (ఆదికాండము 6:8, 9) కాబట్టి, యెహోవా నోవహుకు తాను భౌగోళికముగా ఒక జలప్రళయమును రప్పించుచున్నానని ముందుగానే తెలియపరచి అలాగే ఒక ఓడను నిర్మించుమని ఆజ్ఞాపించెను. నోవహు ఆయన కుటుంబము మినహా మిగతా మానవజాతియంతయు భూమిమీద లేకుండా తుడిచివేయబడును. నోవహు ఓడలోనికి తీసుకువెళ్లిన ప్రతి జాతిదియైన మూల జంతుజాలములు తప్ప మిగతా జంతు సృష్టియావత్తు నాశనము చేయబడును.—ఆదికాండము 6:13, 14, 17.
10. (ఎ) కాపాడబడుటకు ఏమి తయారుచేయవలసియుండెను, ఆపని ఎంత పెద్దదిగా యుండెను? (బి) తనకప్పగింపబడిన పనిని చేయుటలో నోవహు పద్దతినిగూర్చి ఏది గమనార్షమై యున్నది?
10 ముందుగా తెలిసిన విషయజ్ఞానము నోవహుమీద పెద్ద బాధ్యతనుంచెను. ఓడను నిర్మించవలెను. దాదాపు 14,00,000 చదరపు అడుగుల ఘనపరిమాణముగల ఒకపెద్ద పెట్టెవలె దానిని తయారు చేయవలెను. నోవహు దానియందు తగినంత ఆహారమును నిలువజేయవలెను అలాగే నాశనముకాకుండా “సమస్త శరీరముల” జంతుజాలములను, పశుపక్ష్యాదులను సమకూర్చవలెను. యిది అనేక సంవత్సరముల పనిచేరియున్న బృహత్తర పథకమైయుండెను. దీనికి నోవహు ఎట్లు ప్రత్యుత్తరమిచ్చెను? ఆయన “దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తుచేసెను.”—ఆదికాండము 6:14-16, 19-22; హెబ్రీయులు 11:7.
11. తన స్వంతకుటుంబము విషయములో, నోవహుమీద ఏ ప్రాముఖ్యమైన బాధ్యతయుండెను?
11 ఆ పనిచేయుచున్న సమయమందే నోవహు తన కుంటుంబ ఆత్మీయతను కట్టుటకును సమయమును వెచ్చించవలసియుండెను. వారు వారిచుట్టువున్న ప్రజల బలత్కార విధానములను ధిక్కార దృక్పధమును హత్తుకొనకుండా సంరక్షింపబడవలసియుండిరి. మరియు వారు అనుదిన జీవిత వ్యవహారములలో మిక్కిలిగా మునిగిపోకుండా వుండుటయు ప్రాముఖ్యము. చేయుటకు దేవుడు వారికొక పనినిచ్చెను, కాగా వారు దానిచుట్టు తమజీవితములను నిర్మించుకొనుట అవశ్యకమైయుండెను. లేఖనములలో నోవహు, అతని భార్య వారి ముగ్గురు కుమారులు, కుమారుల భార్యలు—మొత్తము ఎనిమిదిమంది—అంగీకరింపబడిరని చెప్పబడినందున, నోవహు ఉపదేశమును ఆయన కుటుంబము అంగీకరించి, ఆయన విశ్వాసమందు భాగము వహించిరని మనకు తెలియుచున్నది.—ఆదికాండము 6:18; 1 పేతురు 3:20.
12. 2 పేతురు 2:5 నందు చూపించబడినట్లుగా, నోవహు ఏ బాధ్యతను నమ్మకముగా నెరవేర్చెను?
12 నోవహుకు మరొక బాధ్యతకూడా యుండెను. అనగా—ఆయన రానైయున్న జలప్రళయమునుగూర్చి హెచ్చరిక చేయుచు అదెందుకు వచ్చుచున్నదోకూడా తెలియజేయవలెను. దేవుని వాక్యమందు ఆయన “నీతిని ప్రకటించినవాడని” చెప్పబడియున్నందున, ఆయన నమ్మకముగా ఆ బాధ్యతను నెరవేర్చెనని రుజువగుచున్నది.—2 పేతురు 2:5.
13. దేవుడు తనకిచ్చిన పనిని చేయుచుండగా నోవహు ఎలాంటి పరిస్థితుల నెదుర్కొనెను?
13 యిప్పుడు ఏ పరిస్థితుల మధ్యను నోవహు తనకివ్వబడిన పనిని నెరవేర్చెనో కొంచెము ఆలోచించుము. నిన్నునీవు ఆయన స్థానమందుంచుకొనుము. నీవు నోవహుగా లేక కుటుంబమందలి ఒక సభ్యునిగా ఉండినట్లయిన, నెఫీలులు మరియు భక్తిహీన ప్రజలద్వారా ప్రబలమైయుండిన దౌర్జన్యము నీచుట్టు అలుముకొనియుండేది. తిరుగుబాటు దూతల ప్రభావము సూటిగా నీపై యుండేది. నీవు ఓడ నిర్మాణపు పనిలోయుండగా నీవు అపహాస్యమునకు గురిగా యుండేవాడివి. గడుచు ప్రతిసంవత్సరము నీవు రానైయున్న జలప్రళయమునుగూర్చి హెచ్చరిక చేయుచున్నను,—ఎంతగా అంటే, “జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొని పోవువరకు”—ప్రజలు తమ అనుదిన జీవిత వ్యవహారములయందు మునిగియుండి విషయమును, “ఎరుగ పోవుటను” నీవు కనుగొనియుందువు—మత్తయి 24:39; లూకా 17:26, 27.
నోవహు అనుభవము మీకే భావమైయున్నది?
14. నోవహు ఆయన కుటుంబసభ్యులు ఎదుర్కొనిన పరిస్థితులను అర్థము చేసుకొనుటకు ఈనాడు మనకెందుకు కష్టముకాదు?
14 అటువంటి పరిస్థితిని ఊహించుట మా పాఠకులలో అధికులకు కష్టముకాదు. ఎందుకు కాదు? ఎందుకనగా, మనకాలమందలి పరిస్థితులు ఎక్కువగా నోవహు దినములలో ఉండిన పరిస్థితులకు పోలియున్నవి. యిలాంటి పరిస్థితిని ఎదురుచూడవచ్చని యేసుక్రీస్తు చెప్పెను. యుగాంతమందలి తన సాన్నిధ్యకాలమునుగూర్చి చెప్పిన మహా ప్రవచనమందు, యేసు ముందుగనే యిట్లు తెలియజేసెను: నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని సాన్నిధ్యమును ఆలాగే ఉండును.”—మత్తయి 24:37 NW.
15, 16. (ఎ) నోవహు దినములలోవలెనే ఈనాడును భూమి బలాత్కారముతో నిండియున్నదనుట ఎట్లు వాస్తవమైయున్నది? (బి) ప్రత్యేకముగా యెహోవా సేవకులెట్లు ఏ విధమైన బలాత్కారమునకు గురియగుచున్నారు?
15 ఆ విధముగానే యిది తయారయినదా? నేడు లోకము బలాత్కారముతో నిండియున్నదా? అవును! ఈ శతాబ్దమందు జరిగిన యుద్ధములలో 10 కోట్లకుపైగా ప్రజలు మరణించిరి. మా పాఠకులలో కొందరు ఈ ప్రభావమును సూటిగా అనుభవించిరి. డబ్బు మరియు యితర వెలగల వస్తువులను దోచుకొనుటకు బెదిరించు నేరస్థుల ప్రభావమునకు అంతకంటే ఎక్కువమందిలోనగుచున్నారు. యౌవనస్థులు పాఠశాలయందలి దౌర్జన్యమునకు గురియగుచున్నారు.
16 ఏమైనను, యెహోవా సేవకులు యుద్ధము, మరియు సాధారణ నేరదౌర్జన్యముల నాశనకర ప్రభావములకంటే మరి ఎక్కువను అనుభవించుచున్నారు. లోకసంబంధులు కాకుండాయుండి అదే సమయములో దైవభక్తిగల ప్రజలుగా వుండుటకు ప్రయత్నించుచున్నందుకు వారిమీద దౌర్జన్యము చేయబడుచున్నది. (2 తిమోతి 3:10-12) కొన్నిసార్లు ఆ దౌర్జన్యము కేవలము త్రోసివేయుట, చెంపదెబ్బలు కొట్టుటగా; మరికొన్నిసార్లు ఆస్థిని నష్టపరచుట, కౄరముగా కొట్టుట, చివరకు చంపుటవంటి రూపములను ధరించుచున్నది.—మత్తయి 24:9.
17. భక్తిహీనత ఈనాడు ప్రబలమైయున్నదా? వివరింపుము.
17 అటువంటి దౌర్జన్యమందు కొన్నిసార్లు ఆ భక్తిహీనులు దేవునియెడల తమధిక్కారమును తుచ్ఛమైనరీతిలో వెల్లడిచేసిరి. ఆఫ్రికానందలి ఒకానొక ప్రాంతమందు పోలీసువారు యిలా అనిరి: “ప్రభుత్వము మాది. మీరు మీ దేవునియొద్దకే పొండి, ఒకవేళ అలాంటి వ్యక్తేవుంటే, వచ్చి మీకు సహాయముచేయుమని ఆయననే అడగండి.” జర్మని సాక్సన్హాసెన్లోని బారనోవస్కీవంటి వ్యక్తులు చెరసాలలలో, కాన్సెంట్రేషన్ క్యాంపులలో యెహోవా సాక్షులకు ఎదురుపడిరి. ఆ వ్యక్తి యిట్లు నిందించి మాటొడెను: “యెహోవాతోనే నా పోరాటము. నేనా లేక యెహోవాయా, ఎవరు బలముగలవారో నేను చూస్తాను.” ఆ తర్వాతకొద్ది దినములకే బారనోవస్కీ జబ్బుపడి మరణించెను; అయితే యితరులు యింకను అటువంటి దృక్పధమునే ప్రదర్శించుచున్నారు. హింసను తెచ్చుటలో భాగమువహించు అధికారులు మాత్రమే దేవునియెడల ధిక్కారముచూపిన వారుకారు. ప్రపంచవ్యాప్తముగా, అలాంటి కృత్యములు చేయువారికి వారి హృదయములయందు భక్తిలేదని రుజువుచేయు సంగతులను యెహోవా సేవకులు వినుచున్నారు మరియు చూచుచున్నారు.
18. మానవజాతి కొల్లల స్థితికి దుష్టాత్మలు ఎట్లు కారణమగుచున్నారు?
18 ఎంతగానో నోవహు దినములను పోలియున్న మన దినములలో కూడ దుష్టాత్మల ప్రమేయమును మనము గాంచుచున్నాము. (ప్రకటన 12:7-9) నోవహు దినములలో మానవ శరీరములు ధరించి నరులకుమార్తెలను వివాహమాడిన ఆ దూతలే ఈ దయ్యములైయున్నారు. జలప్రళయమువచ్చి వారి భార్యలు, పిల్లలు నాశనమైనప్పుడు, ఈ అవిధేయ దూతలు మరలా ఆత్మీయ సామ్రాజ్యములోనికి వెళ్లుటకు బలవంతపెట్టబడిరి. వారిక యెహోవా పరిశుద్ధ సంస్థయందు స్థానములేనివారై, అగాధమందు అనగా, దైవికవెలుగునుండి తొలగింపబడిన వారిగా కటికచీకటి బిలమందు బంధింపబడిరి. (2 పేతురు 2:4, 5) సాతాను నడిపింపుక్రింద పనిచేయుచు మరలా మానవశరీరములను ధరించశక్తిలేని వారైనను, వారు మానవులతో దగ్గర సంబంధము కలిగియుండి, స్త్రీపురుషులను పిల్లలను అదుపులోయుంచుకొనుటకు ప్రయత్నించుచున్నారు. దీనిలో కొంతమేరకు మంత్రతంత్ర అభ్యాసములద్వారా జరిగింపబడుచున్నది. మానవ తర్కమును సహితము అవమానపరచు మార్గములయందు ఒకరినొకరు చంపుకొనుటకు వారు మానవజాతిని రేపుచున్నారు. అంతటితో అది అయిపోలేదు.
19. (ఎ) ప్రత్యేకముగా ఎవరిమీదకు దయ్యములు తమ ద్వేషమును మళ్లించుచున్నారు? (బి) మనమేమి చేయుటకు బలవంతముచేయ దయ్యములు ప్రయత్నించుచున్నారు?
19 దయ్యములు “దేవుని ఆజ్ఞలుగైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచున్న” వారికి వ్యతిరేకముగా యుద్ధము చేయుచున్నారని బైబిలు వెల్లడిచేయుచున్నది. (ప్రకటన 12:12, 17) యెహోవా సేవకులమీదకు హింసను తీసుకువచ్చుటకు ఆ దుష్టాత్మలే ప్రముఖ ప్రేరకులైయున్నారు. (ఎఫెసీయులు 6:10-13) నమ్మకమైన మానవులు యెహోవాయెడల యథార్థతను పోగొట్టుకొనుటకు, మెస్సీయా రాజుగా యేసుతోయున్న యెహోవా రాజ్యమును ప్రకటించకుండా, ఆగిపోవునట్లు లోబర్చుకొనుటకు లేక అడ్డగించుటకు వారు ప్రతిఅవకాశమును ఉపయోగించుచున్నారు.
20. తమ ఆధీనమునుండి ప్రజలు తెంచుకొని బయటపడుటను అడ్డగించ దయ్యములు ఎట్లు ప్రయత్నించుచున్నారు? (యాకోబు 4:7)
20 తమ కౄర ప్రభావమునుండి బయటపడవలెనని కోరుకొను ప్రజలను దయ్యములు అడ్డగించుటకు ప్రయత్నించును. బ్రెజిల్నందు అంతకుముందు అభిచారమును అభ్యసించుచుండిన ఒక స్త్రీ యింటితలుపును సాక్షులు తట్టినప్పుడు, తలుపుతీయవద్దని దయ్యముల స్వరములు ఆమెను ఆజ్ఞాపించెను. అయినప్పటికిని ఆమె తలుపుతీసినది; కాగా, ఆమె సత్యమును నేర్చుకొనెను. అనేక ప్రాంతములలో యెహోవా సాక్షుల పనిని ఆపుజేయుటకు దయ్యములు ప్రత్యక్షముగా చేతబడినభ్యసించు వారిని ఉపయోగించుచున్నారు. ఉదాహరణకు, సురినామ్లో యెహోవా సాక్షుల వ్యతిరేకులు, కేవలము తన మంత్రదండముచూపి వ్యక్తులను చంపగలడని పేరుగాంచిన అభిచారమును అభ్యసించు ఒకనిని సంప్రదించిరి. తన నాట్యకారులు మరియు బాజాభజంత్రీలు వాయించు వారితో కలిసి యితడు దయ్యముపట్టినవాడై యెహోవా సాక్షులను ఎదుర్కొనబోయెను. అతడు మంత్రములు వల్లించుచు తన మంత్రదండమును వారివైపు చూపించెను. గ్రామస్థులు యిక సాక్షులు కుప్పకూలుదురని ఎదురుచూచుచుండగా, వారికి బదులు ఆ మరుక్షణమందే ఈ మంత్రగాడు భళ్లున తెలివితప్పి నేలకూలగా, నిస్పృహతో కలవర పడిన అతని అనుయాయులు వెంటనే అతనిని అవతలికి మోసుకొనిపోయిరి.
21. నోవహు దినములలో వలెనే అనేకులైన ప్రజలు మన ప్రచారపు పనికి ఎట్లు ప్రత్యుత్తరమిచ్చుచున్నారు, ఎందుకు?
21 చేతబడి, మంత్రోచ్ఛారణ బహిరంగముగా అభ్యసించని ప్రాంతములలో సహితము, దేనినీ పట్టించుకోనంతగా తమ ప్రతిదిన జీవితవ్యవహారములలో ఎంతగానో మునిగిపోయిన ప్రజలకు ప్రకటించుటకు ప్రయత్నించుట ఏమిటో ప్రతి యెహోవాసాక్షియు అనుభవించియున్నాడు. నోవహు దినములలోవలెనే, అనేకులు “ఎరుగక” యున్నారు. (మత్తయి 24:37-39) కొందరు మన ఐక్యత మరియు మనము సాధించిన సంగతుల విషయమై ఆశ్చర్యపడుదురు. అయితే—ఎన్నోగంటల వ్యక్తిగత పఠనము, క్రమముగా కూటములకు హాజరగుట, యింటింటిసేవకు వెళ్లుట చేరియున్న—మన ఆత్మీయ నిర్మాణపుపని వారికి బుద్ధిహీనతగా యున్నది. వారి జీవితములు ప్రస్తుతము కలిగియుండగల వస్తుదాయక ఆస్థి, సుఖభోగముల మీదనే కేంద్రీకృతమైయున్నందున, దేవునివాక్య వాగ్ధానముమీద మనకున్న నమ్మకమును వారు అపహసింతురు.
22, 23. భక్తులను శోధనలోనుండి యెహోవా విడుదల గావించునని నోవహు దినములలోని సంఘటనలు ఎట్లు నమ్మకమైన అభయమునిచ్చుచున్నవి?
22 ఎల్లకాలము యెహోవా యథార్థసేవకులు దేవునియెడల ప్రేమలేని వారి దౌర్జన్యమునకు గురికావల్సిందేనా? ఎంతమాత్రము కాదు! నోవహు దినములలో ఏమి జరిగినది? దేవుని నడిపింపుక్రింద నోవహు అతని కుటుంబసభ్యులు పూర్తిచేయబడిన ఓడలోనికి ప్రవేశించిరి. ఆ తర్వాత దేవుని నిర్ణయ ఘడియయందు “మహాగాధ జలముల ఊటలన్నియు . . . విడువబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.” పర్వతములు సహితము మునిగిపోవు పర్యంతము జలప్రళయము కొనసాగెను. (ఆదికాండము 7:11, 17-20) తమ నివాస స్థానములను విడిచివచ్చిన దూతలు గతిలేక మానవశరీరములను విడిచి ఆత్మీయ సామ్రాజ్యమునకు మరలివెళ్లిరి. కాగా నెఫీలులు, నోవహు హెచ్చరికకు భిన్నముగా ప్రవర్తించిన వారితోసహా మిగతా భక్తిహీన ప్రజల ప్రపంచమంతయు నాశనము చేయబడెను. మరొకవైపున, నోవహు, అతని భార్య, ముగ్గురు కుమారులు, వారి భార్యలు రక్షింపబడిరి, ఆ విధముగా, ఎన్నో సంవత్సరములుగా యథార్థతతో సహించిన పరీక్షనుండి యెహోవా నోవహును అతని కుటుంబమును విడుదలచేసెను.
23 మరి ఈనాటి దైవభక్తిగల ప్రజలకు యెహోవా అదేరీతిన చేయునా? ఖచ్ఛితముగా దానికి సందేహమేమియు లేదు. ఆయన వాగ్ధానముచేసెను, ఆయన అబద్ధమాడనేరడు.—తీతు 1:2; 2 పేతురు 3:5-7. (w90 4/15)
[అధస్సూచీలు]
a “ఎనోమియా దేవుని నియమములయెడల అలక్ష్యము, లేక ధిక్కారస్వభావమను భావము కలదైయున్నది; ఎసేబియా [‘భక్తిహీన ప్రజలని’ భాషాంతరము చేయబడిన పదముయొక్క నామవాచక రూపమైయున్నది] అనగా కూడ దేవుని వ్యక్తియెడల అదే దృక్పధమని భావమైయున్నది.”—వైన్స్ ఎక్స్పోజిటరీ డిక్షనరీ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూటెస్ట్మెంట్ వర్డ్స్, సంపుటి 4, పుట 170.
మీకు జ్ఞాపకమున్నవా?
◻ భక్తులను శోధనలోనుండి విడిపించుటను యెహోవా ఎరిగియున్నాడని పేతురు ఎట్లు చూపించెను?
◻ నోవహు దినములలోని బలాత్కారమునకు కారణమైన వాస్తవిక విషయములు ఏమైయున్నవి?
◻ రానైయున్న భౌగోళిక జలప్రళయము దృష్ట్యా, నోవహు ఎటువంటి బాధ్యతను కలిగియుండెను?
◻ నోవహు దినములకు మన కాలమునకు ఏ సమాంతరములను మనము చూచుచున్నాము?
[14వ పేజీలోని చిత్రాలు]
ఓడను నిర్మించుటయందు అనేక సంవత్సరములు కష్టపడి పనిచేయుట యిమిడియుండెను
[15వ పేజీలోని చిత్రాలు]
తన కుటుంబ ఆత్మీయతను వృద్ధిచేయుటకు నోవహు సమయమును కేటాయించెను