2 నోవహు
ఈ లోకం నాశనానికి తగినదని చూపించాడు
హనోకు చనిపోయిన కొంతకాలానికి పరలోకంలో కొంతమంది దేవదూతలు దేవునికి ఎదురుతిరిగారు. ఈ చెడ్డదూతలు భూమ్మీద ఉన్న అందమైన స్త్రీలను చూసి మోజుపడ్డారు. అందుకే, వాళ్లు మనుషుల రూపంలో కిందికి వచ్చి తమకు నచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. మనుషులు, దేవదూతలు కలవడం వల్ల పుట్టిన పిల్లలు చాలా బలంగా, క్రూరంగా ఉండేవాళ్లు; వాళ్లను నెఫీలీయులు అని పిలిచేవాళ్లు. వాళ్లను చూసి మిగతా మనుషులు కూడా వాళ్లలాగే దౌర్జన్యంగా, కరుడుగట్టిన వాళ్లలా తయారయ్యారు. దేవుడు మనుషుల్ని సృష్టించినప్పుడు వాళ్లకు ఒక అందమైన జీవితాన్ని ఇచ్చాడు. కానీ, ఇప్పుడు అలా లేదు; పరిస్థితి అంతా తారుమారైంది. ఎందుకంటే వాళ్లు చాలా చెడుగా, క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్లందరి మధ్య మట్టిలో మాణిక్యం లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే నోవహు; ఈయన హనోకు మునిమనవడు.
నోవహు కూడా హనోకులాగే నీతిమంతుడు. అందుకే, బైబిల్లో ఆయన గురించి ఇలా ఉంది: “నోవహు సత్యదేవునితో నడిచాడు.” తర్వాత ఆయనకు పెళ్లయింది, ముగ్గురు కొడుకులు పుట్టారు. నోవహు, ఆయన భార్య తమ పిల్లలకు చిన్నప్పటి నుండే యెహోవా మాట వినడం నేర్పించారు. అందుకే చుట్టూ ఉన్నవాళ్లకు, నోవహు కుటుంబానికి చాలా తేడా ఉండేది.
ఒకరోజు యెహోవా జలప్రళయాన్ని రప్పించి, ఈ భూమ్మీద ఉన్న చెడ్డ ప్రజలందర్నీ తుడిచిపెట్టేస్తానని నోవహుతో చెప్పాడు. కానీ, మంచి వాళ్లందర్నీ కాపాడతానని మాటిచ్చాడు. దానికోసం నోవహు ఒక పెద్ద ఓడ కట్టాలి. భూమ్మీదకు జలప్రళయం తెస్తానని యెహోవా చెప్పాడు గానీ, అది ఎలా ఉంటుందో నోవహుకు తెలీదు. అంత పెద్ద ఓడను కట్టే పనిని కూడా ఆయన ఎప్పుడూ చేయలేదు. అయినా, యెహోవా మాట మీద నమ్మకం ఉంది కాబట్టే నోవహు పని మొదలుపెట్టాడు.
నోవహు, ఆయన కుటుంబం చెప్పేవి-చేసేవి చుట్టూ ఉన్న భయంకరమైన శత్రువులకు నచ్చలేదు
ఈ పని చేయాలంటే నోవహుకు, ఆయన కుటుంబానికి చాలా ధైర్యం అవసరం. వాళ్లను చూసి చాలామంది నవ్వుకుని ఉంటారు, కొంతమందైతే వాళ్ల పనిని ఆపాలని కూడా ప్రయత్నించి ఉంటారు. అక్కడున్న చెడ్డదూతల్ని చూస్తే ఎవ్వరికైనా గుండె జారిపోవాల్సిందే. ఇంక వాళ్ల పిల్లల గురించైతే వేరే చెప్పనక్కర్లేదు, వాళ్లు రాక్షసుల్లా ప్రవర్తించేవాళ్లు. కానీ నోవహు, ఆయన భార్య, ముగ్గురు కొడుకులు-కోడళ్లు ఎవ్వరికీ భయపడలేదు, వాళ్ల పనిని ఆపలేదు. బహుశా దాదాపు 50 సంవత్సరాల పాటు, ఆ ఎనిమిది మంది ప్రతీరోజు కష్టపడి ఓడను కడుతూ వచ్చారు.
నోవహు ఒకవైపు ఓడ కడుతూనే, ప్రకటించే పని కూడా చేశాడు. బైబిలు ఆయన్ని, “నీతిని ప్రకటించిన నోవహు” అని పిలుస్తుంది. జరగబోయే నాశనం గురించి ప్రజలందర్నీ హెచ్చరించే పనిలో కుటుంబ పెద్దగా నోవహు మంచి ఆదర్శం ఉంచాడు. ఆయన కుటుంబం కూడా అదే చేసింది. కానీ, ఎవ్వరూ ఆయన చెప్పినదాన్ని లెక్కచేయలేదు. ఆఖరికి బంధువులు కూడా ఆయన మాట వినలేదు. ప్రజలు చెడ్డ పనులు చేయడం మానేయలేదు. చుట్టూ ఉన్నవాళ్లకు, విశ్వాసం చూపించిన నోవహుకు భూమికి-ఆకాశానికి మధ్య ఉన్నంత తేడా ఉంది. అందుకే, బైబిలు నోవహు గురించి ఇలా చెప్పింది: “ఆ విశ్వాసం ద్వారానే అతను ఈ లోకం నాశనానికి తగినదని చూపించాడు.”
ఎట్టకేలకు, ఓడ కట్టడం పూర్తయింది. ఇక మిగిలిందల్లా, నోవహు కుటుంబం వాళ్లకోసం అలాగే వాళ్లు ఓడలోకి ఎక్కించబోయే జంతువుల కోసం ఆహారాన్ని, నీళ్లను, కావాల్సిన వస్తువుల్ని సమకూర్చుకోవడమే. వర్షం పడడానికి ఇంకా ఏడు రోజులు ఉందనగా, తన కుటుంబాన్ని తీసుకుని ఓడలోకి వెళ్లమని దేవుడు నోవహుకు చెప్పాడు. ఇంతలో, ఒక అద్భుతమైన విషయం జరిగింది. అన్నిరకాల జంతువులు గుంపులు గుంపులుగా రావడం మొదలుపెట్టాయి! వాటంతట అవే “రెండేసి చొప్పున మగవి, ఆడవి ఓడలో ఉన్న నోవహు దగ్గరికి” వచ్చాయి.
నోవహు కుటుంబం మిగిలిన చిన్నాచితకా పనులు పూర్తి చేయడంలో, ఓడలోకి ఎక్కించిన వాటిని సర్దడంలో బిజీగా ఉండడాన్ని మనం ఊహించుకోవచ్చు. ఇదంతా చూసి, ప్రజలు వాళ్లను ఇంకా ఎగతాళి చేసి ఉంటారు. అయితే, ఓడలోకి కావాల్సినవన్నీ తెచ్చిపెట్టుకున్నాక యెహోవాయే ఓడ తలుపును మూసేశాడు. దాంతో ఇప్పటివరకు నవ్వుకున్న వాళ్ల నోళ్లు మూతపడి ఉంటాయి. కుండపోతగా వర్షం కురవడం మొదలైంది. 40 రోజుల పాటు ఆగకుండా వర్షం పడేసరికి, రోజురోజుకు నీళ్లు పెరుగుతూ వచ్చాయి. ఆఖరికి, పెద్దపెద్ద పర్వతాలు కూడా మునిగిపోయాయి. అలా యెహోవా భూమ్మీద ఉన్న చెడుతనాన్ని కడిగిపారేశాడు.
ఒక సంవత్సరం కంటే ఎక్కువకాలం నోవహు, ఆయన కుటుంబం ఓడలోనే క్షేమంగా ఉన్నారు. ఈలోగా నీళ్లు మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చాయి. చివరికి, ఓడ ఒక పర్వతం మీదికి వచ్చి ఆగింది. తర్వాత కొన్ని రోజులకు, ఇక బయటికి వెళ్లొచ్చని యెహోవా నోవహుతో చెప్పాడు. వాళ్లంతా ఓడ నుండి బయటికి వచ్చాక, యెహోవా తమను కాపాడినందుకు కృతజ్ఞతగా ఒక బలిపీఠం కట్టి ఆయనకు బలులు అర్పించారు. మళ్లీ ఇలాంటి జలప్రళయాన్ని ఇంకెప్పుడూ తీసుకురానని యెహోవా మాటిస్తూ, దానికి గుర్తుగా ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపించేలా చేశాడు.
ఈరోజు భూమ్మీద ఉన్న ప్రతీఒక్కరు ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే. ఆ చెడ్డ లోకంలో, వాళ్లు అందరిలా ఉండకుండా ధైర్యంగా నిలబడినందుకు మనం ఎంత రుణపడి ఉండాలో కదా!
ఈ వచనాలు చదవండి:
ప్రశ్న:
నోవహు ఎలా ధైర్యం చూపించాడు?
ఎక్కువ తెలుసుకోండి
1. జలప్రళయానికి ముందు లోకం ఎలా ఉండేది? (w02 3/1 5 ¶3–6 ¶4)
2. ఓడ కట్టమని దేవుడు నోవహుకు ఎప్పుడు చెప్పాడు? జలప్రళయం ఎప్పుడు మొదలౌతుంది అనే విషయం నోవహుకు సరిగ్గా ఎన్ని రోజులు ముందు తెలిసింది? (w12 4/15 23 ¶5-8)
3. జలప్రళయం నిజంగా వచ్చిందని మనం ఎందుకు నమ్మవచ్చు? (ijwbq ఆర్టికల్ 156 ¶2-5, బాక్సు) చిత్రం 1
Historic Collection/Alamy Stock Photo
చిత్రం 1: భూమంతటా వచ్చిన జలప్రళయాన్ని తప్పించుకోడానికి ఒకతను పడవను తయారుచేశాడని, ప్రళయం ఆగిపోయాక అతను బలి అర్పించాడని, ఆ తర్వాతి మనుషులందరూ అతని నుండే వచ్చారని ఒక హిందూ పురాణం చెప్తుంది
4. జలప్రళయం వచ్చిన వంద కంటే ఎక్కువ ఏళ్ల తర్వాత ఏం జరిగింది? అది చూసినప్పుడు ముసలితనంలో ఉన్న నోవహుకు ఎలా అనిపించి ఉంటుంది? (it “నోవహు” No. 1 ¶12-wcgr) చిత్రం 2
చిత్రం 2
మనం నేర్చుకునే పాఠాలు
మనం జీవిస్తున్న రోజులు కూడా నోవహు రోజుల్లాగే ఉన్నాయని ఎలా చెప్పవచ్చు? (మత్త. 24:36-39)
ఈ విషయాల్లో నోవహు నుండి మీరేం నేర్చుకోవచ్చు?
ప్రతీది చక్కగా ప్లాన్ చేసుకోవడం . . . చిత్రం 3
చిత్రం 3
కష్టపడి పనిచేయడం . . . చిత్రం 4
చిత్రం 4
ఓపిగ్గా ఉండడం . . . చిత్రం 5
చిత్రం 5
నోవహులాగే మీరు ఎలా ధైర్యం చూపించవచ్చు?
మనసుపెట్టి ఆలోచించండి
ఈ కథ నుండి యెహోవా గురించి నేను ఏం నేర్చుకున్నాను?
ఈ కథకు, యెహోవా సంకల్పానికి సంబంధం ఏంటి?
కొత్త లోకంలో నోవహును కలిసినప్పుడు ఆయన్ని నేను ఏం అడగాలనుకుంటున్నాను?
ఇవి కూడా చూడండి
నోవహులా ఉండడానికి ఒక తండ్రి ఎలా కృషిచేశాడో చూడండి.
నోవహులా ఎలా ఉండవచ్చో మీ పిల్లలకు నేర్పించండి.