ప్రశ్నాభాగం
▪ దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలోనూ, సేవాకూటంలోనూ నిర్వహించబడే ప్రతీ భాగం తర్వాత ప్రేక్షకులు ప్రశంసను వ్యక్తపరుస్తూ చప్పట్లు కొట్టడం సముచితమేనా?
సృష్టికర్తయైన యెహోవా భూమికి పునాది వేసినప్పుడు ‘ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడి, దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసి’ తమ ప్రశంసను వ్యక్తం చేశారు. (యోబు 38:7) యెహోవా తన జ్ఞానాన్ని, మంచితనాన్ని, శక్తిని కొత్త పద్ధతిలో అసాధారణ రీతిగా ఉపయోగించి సృష్టిని చేయడంతో వారు ఆయనను స్తుతించాలని కోరుకున్నారు.
మనం కూడా, సహోదరులు ఇచ్చిన ప్రసంగాలకు, వారు చేసిన ప్రయత్నాలకు హృదయపూర్వకంగా మెచ్చుకోవడం మంచిదే. ఉదాహరణకు, మనం సాధారణంగా అసెంబ్లీలు, సమావేశాలు వంటి ప్రత్యేక సందర్భాలకు హాజరైనప్పుడు అక్కడ ఇవ్వబడే ప్రసంగాలు, ప్రదర్శనల తర్వాత చప్పట్లు కొడతాం. ఎందుకంటే వాటికి సిద్ధపడడం కోసం అదనపు సమయం, కృషి అవసరమవుతాయి. చక్కని ప్రసంగాన్నివ్వడానికి కృషి చేసిన ప్రసంగీకునికి మన ప్రశంసను వ్యక్తం చేయడానికి, తన వాక్యం ద్వారా, సంస్థ ద్వారా ఉపదేశాన్ని అందిస్తున్న యెహోవాకు కృతజ్ఞత తెలియజేయడానికి మనం చప్పట్లు కొడతాం.—యెష. 48:17; మత్త. 24:45-47.
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలోనూ, సేవాకూటంలోనూ నిర్వహించబడే ప్రతీ భాగం తర్వాత చప్పట్లు కొట్టడం సముచితమేనా? ఉదాహరణకు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఒక విద్యార్థి తన మొదటి ప్రసంగాన్నిచ్చిన తర్వాత, సహజంగా చప్పట్లు కొట్టడం ద్వారా మన ప్రశంసను వ్యక్తం చేస్తాం, అలా చేయకూడదని చెప్పే నియమమంటూ ఏదీ లేదు. అయితే, ప్రతీ భాగం తర్వాత అలవాటుగా చప్పట్లు కొడితే అది యాంత్రికంగా మారిపోతుందే తప్ప మనస్ఫూర్తిగా మన ప్రశంసను వ్యక్తం చేస్తున్నట్లు ఉండదు. కాబట్టి ప్రతీ భాగం తర్వాత మనం చప్పట్లు కొట్టం.
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలోనూ, సేవాకూటంలోనూ నిర్వహించబడే అనేక భాగాల్లో మనం చప్పట్లు కొట్టకపోయినప్పటికీ ఆయా భాగాల్లో సహోదరులు ఇచ్చిన చక్కని ఉపదేశానికి, వారు చేసిన కృషికి మనం ఇతర విధాలుగా కూడా ప్రశంసను వ్యక్తం చేయవచ్చు. వారు ప్రసంగాలు ఇస్తున్నప్పుడు ఏకాగ్రతతో, జాగ్రత్తగా వినడం ద్వారా మనమలా చేయవచ్చు. కూటం ముగిసిన తర్వాత వారిని కలుసుకొని మన ప్రశంసను వ్యక్తం చేయవచ్చు.—ఎఫె. 1:15, 16.