ప్రశ్నాభాగం
◼ కూటాల్లో పేరాలను చదవడాన్ని గూర్చిన ఏ విషయాన్ని మనం మనస్సులో ఉంచుకోవాలి?
కావలికోట పఠనానికి, సంఘ పుస్తక పఠనానికి కేటాయించబడిన సమయంలో అధిక సమయం పేరాలను చదవడానికే ఉపయోగించబడుతుంది. దీనర్థం చదవడానికి నియమించబడిన సహోదరుడు ఒక ఉపాధ్యాయునిగా పెద్ద బాధ్యతను మోస్తున్నాడన్నమాట. శ్రోతలు అర్థం చేసుకోవడమే కాక, చర్యను గైకొనేందుకు కూడా పురికొల్పే విధంగా సమాచారం యొక్క ‘భావం అర్థమయ్యేలా’ ఆయన చదవాలి. (నెహె. 8:8) కనుక, చదువరి తన నియామకము కొరకు బాగా సిద్ధపడవలసిన అవసరముంది. (1 తిమో. 4:13; పాఠశాల నిర్దేశక పుస్తకము (ఆంగ్లం)లోని 6వ పాఠ్య భాగాన్ని చూడండి.) బహిరంగంగా భావగర్భితంగా చదివేందుకు ఇవిగో ఇక్కడ కొన్ని ప్రాథమిక విషయాలు.
భావాన్ని సరైన విధంగా నొక్కి పలకండి: సరైన అవగాహనను ఇచ్చేందకు ఏ పదాలను లేదా పదసముదాయాలను నొక్కి పలకాలి అని ముందుగానే తీర్మానించుకోండి.
పదాలను సరైన విధంగా ఉచ్చరించండి: ప్రచురణలో కనిపించే వ్యక్తీకరణలను ప్రేక్షకులు గ్రహించాలంటే సరైన ఉచ్చారణ, స్పష్టంగా పలకడం అనేవి అవసరం. పరిచయంలేని లేదా అరుదుగా ఉపయోగించే పదాలను నిఘంటువులో చూడండి.
గట్టిగా ఉత్సాహంగా మాట్లాడండి: స్పష్టంగా వినిపించేలా ఉత్సాహంగా మాట్లాడడం ఆసక్తిని కలుగజేసి, భావోద్రేకాలను పురికొల్పి, శ్రోతను ప్రేరేపిస్తుంది.
ఆప్యాయతతోను సంభాషించేవారిగాను ఉండండి: సహజత్వం అనేది అనర్గళత నుండి వస్తుంది. సిద్ధపాటు అభ్యాసాల వల్ల చదువరి విశ్రాంతిగా ఉండగలడు, దాని ఫలితంగా ఆ చదువు విసుగు పుట్టించేదిగాను, చిరాకు పుట్టించేదిగాను ఉండక వినసొంపుగాను ఉంటుంది.—హబ. 2:2.
సమాచారం ముద్రించబడిన విధంగా చదవండి: అధఃసూచులు అలాగే కుండలీకరణాల్లోను లేదా బ్రాకెట్లలోను ఉన్న సమాచారమూ ముద్రిత సమాచారాన్ని స్పష్టం చేస్తున్నట్లైతే సాధారణంగా బిగ్గరగా చదవబడుతుంది. కేవలం సమాచార మూలాన్ని సూచించే రిఫరెన్సులు మాత్రమే మినహాయించబడుతాయి. పేరాలో అధఃసూచి చిహ్నం ఇవ్వబడిన చోట, “అధఃసూచి ఇలా చెబుతుంది . . .” అని చెప్పి దానిని చదవాలి. దాన్ని చదివిన తరువాత, పేరాలోని మిగిలిన భాగాన్ని చదవడం కొనసాగించాలి.
బహిరంగంగా చదవడాన్ని చక్కగా చేయడం అనేది మన గొప్ప బోధకుడు ‘ఆజ్ఞాపించిన వాటినన్నిటిని గైకొనవలెనని ఇతరులకు’ మనం ‘బోధించ’ గల మార్గాల్లో ఒకటి.—మత్త. 28:20.