మీరు భూమ్మీద నిరంతరం జీవించవచ్చు
ఎంత అద్భుతమైన అవకాశం! ఈ భూమ్మీదే నిరంతర జీవితాన్ని ఇస్తానని మన సృష్టికర్త మాటిచ్చాడు. కానీ చాలామందికి దాన్ని నమ్మడం కష్టంగా ఉంటుంది. వాళ్లు ‘ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే, జీవమరణాల జీవిత చక్రంలో మరణం ఒక భాగం’ అని చెప్తారు. ఇంకొంతమంది నిరంతరం జీవించడం సాధ్యమే, కానీ ఈ భూమ్మీద కాదు అంటారు. నిరంతర జీవితం అనేది మనం చనిపోయి పరలోకానికి వెళ్లిన తర్వాత మాత్రమే సాధ్యమౌతుందని వాళ్లు చెప్తారు. మీరు ఏమి అనుకుంటున్నారు?
దీని గురించి ఒక అభిప్రాయానికి వచ్చే ముందు, ఈ మూడు ప్రశ్నల గురించి బైబిలు చెప్తున్న సమాధానాలను ఎందుకు పరిశీలించకూడదు: మనిషి ఎంతకాలం జీవించడానికి తయారు చేయబడ్డాడని అతను తయారు చేయబడిన విధానాన్ని బట్టి తెలుస్తుంది? భూమి విషయంలో, మనుషుల విషయంలో దేవుని అసలు ఉద్దేశం ఏమిటి? మనుషులు అందరికీ మరణం ఎలా వచ్చింది?
మనిషి చాలా ప్రత్యేకం
దేవుడు భూమ్మీద చేసిన ప్రాణులు అన్నిటిలో మనిషి నిజంగా ప్రత్యేకమైన వాడు. ఎలా? మనుషులు మాత్రమే దేవుని “స్వరూపమందు,” దేవుని “పోలికె చొప్పున” సృష్టించబడ్డారని బైబిలు చెప్తుంది. (ఆదికాండము 1:26, 27) దానర్థం ఏమిటి? దేవునికున్న ప్రేమ, న్యాయం వంటి లక్షణాలతో, స్వభావంతో మనుషులు సృష్టించబడ్డారని అర్థం.
అంతేకాదు, మనుషులు మంచి చెడులను తెలుసుకోగలిగే తెలివితో పాటు, దేవుని గురించి తెలుసుకుని ఆయనతో స్నేహం చేయాలనే కోరికతో సృష్టించబడ్డారు. అందుకే మనం విశ్వానికి ఉన్న గొప్పతనాన్ని, ప్రకృతిలో ఉన్న అద్భుతాల్ని, కళలను, సంగీతాన్ని, కవిత్వాన్ని చూసి ఆనందిస్తున్నాం. వీటన్నిటికి మించి, మనుషులు దేవుణ్ణి ఆరాధించే ప్రత్యేకమైన సామర్థ్యంతో సృష్టించబడ్డారు. ఆ లక్షణాలు మనుషులను భూమ్మీద ఉన్న మిగతా ప్రాణుల కన్నా చాలా ప్రత్యేకమైన వాళ్లని చూపిస్తాయి.
దీన్ని పరిశీలించండి: మనం కొన్ని సంవత్సరాలు మాత్రమే బ్రతికి తర్వాత చనిపోవాలని అనుకుంటే దేవుడు మనుషులకు ఇలాంటి ప్రత్యేకమైన లక్షణాలను, వాటిని మెరుగుపర్చుకుని పెంచుకునే అనంతమైన సామర్థ్యాన్ని ఇచ్చేవాడా? నిజం ఏమిటంటే, మనం ఇదే భూమ్మీద నిరంతర జీవితాన్ని ఆనందించడానికే దేవుడు మనుషులకు ఇలాంటి ప్రత్యేకమైన లక్షణాలను, సామర్థ్యాలను ఇచ్చాడు.
దేవుని అసలు ఉద్దేశం
మనుషులు భూమ్మీద నిరంతరం జీవించాలని దేవుడు ఎప్పుడూ అనుకోలేదని కొంతమంది చెప్తారు. భూమి మనుషులకు ఒక తాత్కాలిక ఇల్లుగా మాత్రమే ఉంది అని వాళ్ల అభిప్రాయం. మనుషుల్లో ఎవరు పరలోకానికి వెళ్లి, దేవుని దగ్గర నిరంతరం జీవించడానికి అర్హులో పరీక్షించడానికే దేవుడు భూమిని చేశాడని వాళ్లు చెప్తారు. ఒకవేళ అదే నిజమైతే భూమ్మీద ఉన్న చెడుతనానికి, దుష్టత్వానికి దేవుడే కారణం అయినట్లు అనిపించదా? కానీ అది అసలు దేవుని స్వభావమే కాదు. ఆయన గురించి బైబిలు ఇలా చెప్తుంది: “ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.”—ద్వితీయోపదేశకాండము 32:4.
భూమి పట్ల దేవుని అసలు ఉద్దేశం గురించి బైబిలు స్పష్టంగా ఇలా చెప్తుంది: “ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.” (కీర్తన 115:16) అవును దేవుడు భూమిని అందంగా, శాశ్వతంగా ఉండేలా మనుషుల కోసం చేశాడు. మనం ఈ భూమ్మీద అర్థవంతంగా, శాశ్వతంగా జీవించడానికి కావాల్సిన ప్రతీది ఆయన ఈ భూమ్మీద పెట్టాడు.—ఆదికాండము 2:8, 9.
“ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.”—కీర్తన 115:16
మనుషుల గురించి దేవుని ఉద్దేశం ఏమిటో కూడా బైబిలు స్పష్టంగా చెప్తుంది. దేవుడు మొదటి మానవ జంటకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు, “భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; . . . భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.” (ఆదికాండము 1:28) ఆ భూ పరదైసును కాపాడుకుంటూ, విస్తరింపజేసే ఎంతో గొప్ప అవకాశం వాళ్లకు ఉంది! నిజంగా ఆదాము, హవ్వకు ఆ తర్వాత వాళ్లకు పుట్టే సంతానానికి, ఈ భూమ్మీద నిరంతరం జీవించే అవకాశం ఉంది కానీ పరలోకంలో కాదు.
మనం ఎందుకు చనిపోతున్నాం?
మరి మనం ఎందుకు చనిపోతున్నాం? దేవుడు చేసిన ఆత్మ ప్రాణుల్లో ఒకరు ఏదెనులో దేవుని ఏర్పాట్లను పాడుచేశాడు. అతన్నే తర్వాత తిరుగుబాటుదారుడైన అపవాదిగా, సాతానుగా గుర్తించారు. సాతాను ఏమి చేశాడు?
సాతాను మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము, హవ్వను తనతోపాటు దేవునికి ఎదురు తిరిగేలా ప్రేరేపించాడు. దేవుడు వాళ్లకు అవసరమైన మంచేదో చేయడం లేదని సాతాను చెప్పాడు. అంటే వాళ్లకు వాళ్లే మంచిచెడు నిర్ణయించుకునే స్వేచ్ఛను దేవుడు వాళ్లకు ఇవ్వడం లేదని చెప్పాడు. అప్పుడు వాళ్లు సాతానుని నమ్మి దేవునికి ఎదురు తిరిగారు. ఫలితం? కొంతకాలానికి, దేవుడు హెచ్చరించినట్లే వాళ్లు చనిపోయారు. వాళ్లు పరదైసు భూమ్మీద నిరంతరం జీవించే అవకాశాన్ని పోగొట్టుకున్నారు.—ఆదికాండము 2:17; 3:1-6; 5:5.
ఆదాము, హవ్వ తిరుగుబాటు వల్ల వచ్చిన ప్రభావాన్ని ఇప్పటి వరకు మనుషులందరూ అనుభవిస్తూనే ఉన్నారు. దేవుని వాక్యం ఇలా చెప్తుంది: “ఒక మనిషి [ఆదాము] ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి. అదే విధంగా, అందరూ పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ వ్యాపించింది.” (రోమీయులు 5:12) మన మొదటి తల్లిదండ్రుల నుండి మనకు పాపం, మరణం వచ్చింది కాబట్టే మనం చనిపోతున్నాం. అంతేకాని, ముందే నిర్ణయించబడిన విధి లేదా అదృష్టం వల్ల, మనం అర్థం చేసుకోలేని దేవుని ‘నిర్ణయం’ వల్ల కాదు.
మీరు భూమ్మీద నిరంతరం జీవించగలరు
ఏదెనులో జరిగిన తిరుగుబాటు మనుషుల విషయంలో, భూమి విషయంలో దేవుని అసలు ఉద్దేశానికి అడ్డు కాలేదు. దేవుని పరిపూర్ణ ప్రేమ, న్యాయం మనల్ని పాపం, మరణం అనే బంధకాల నుండి విడిపించేలా ఆయనను కదిలించాయి. అపొస్తలుడైన పౌలు ఇలా వివరించాడు: “పాపంవల్ల వచ్చే జీతం మరణం, కానీ దేవుడు ఇచ్చే బహుమానం మన ప్రభువైన క్రీస్తుయేసు ద్వారా శాశ్వత జీవితం.” (రోమీయులు 6:23) దేవుడు ప్రేమతో, “తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయనమీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.” (యోహాను 3:16) యేసు తనను తాను ఇష్టపూర్వకంగా విమోచన క్రయధనంగా ఇవ్వడం వల్ల ఆదాము ద్వారా పోయిన వాటన్నిటిని యేసు తీసుకురాగలిగాడు.a
త్వరలోనే, పరదైసు భూమి గురించి దేవుడు చేసిన వాగ్దానం నిజమౌతుంది. యేసు చెప్పిన ఈ మాటలను మీరు హృదయంలోకి తీసుకుంటే ఆ అద్భుతమైన భవిష్యత్తు మీ సొంతం అవుతుంది: “ఇరుకు ద్వారం గుండా వెళ్లండి; ఎందుకంటే నాశనానికి నడిపించే ద్వారం వెడల్పుగా, ఆ దారి విశాలంగా ఉంది; చాలామంది దాని గుండా వెళ్తున్నారు. అయితే జీవానికి నడిపించే ద్వారం ఇరుకుగా, ఆ దారి కష్టంగా ఉంది; కొంతమందే దాన్ని కనుక్కుంటున్నారు.” (మత్తయి 7:13, 14) అవును, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మరి మీరు ఏమి చేస్తారు?
a విమోచన క్రయధనం వల్ల మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ప్రచురించిన ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే పుస్తకంలో 27వ పాఠం చూడండి. ఈ పుస్తకాన్ని www.jw.org వెబ్సైట్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.