కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w07 4/1 పేజీలు 17-20
  • దేవునికి ఇష్టమైన బలులు అర్పించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవునికి ఇష్టమైన బలులు అర్పించడం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సత్యారాధనలో అర్పణలు, బలులు
  • “నేనాజ్ఞాపించని క్రియ”
  • క్రీస్తుయేసు విమోచన క్రయధన బలి
  • ఆధ్యాత్మిక బలులు, అర్పణలు
  • ధర్మశాస్త్రంలోని ప్రాథమిక సత్యాల నుండి నేర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • యెహోవాకు ప్రీతిపాత్రమైన స్తుతియాగాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • దేవునికి ప్రీతిపాత్రమైన బలులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • మీరు రాజ్యం కోసం త్యాగాలు చేస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
w07 4/1 పేజీలు 17-20

దేవునికి ఇష్టమైన బలులు అర్పించడం

“మరణం నుండి జీవం ఆవిర్భవించింది​—అని నమ్మేవారు అజ్టెక్‌లు, వీరు మెసోమెరికాలో ముందెప్పుడూ లేనంతగా నరబలులు అర్పించేవారు” అని ద మైటీ అజ్టెక్స్‌ అనే పుస్తకం చెబుతోంది. అదింకా ఇలా చెబుతోంది: “సామ్రాజ్యం విస్తరిస్తుండగా సామ్రాజ్యంలో నమ్మకాన్ని పెంచడానికి మరిన్ని నరబలులు అర్పించబడేవి.” మరో సర్వసంగ్రహ నిఘంటువు చెబుతున్నట్లుగా, అజ్టెక్‌లు సంవత్సరానికి 20,000 నరబలులు అర్పించేవారు.

భయంతో, అనిశ్చయతతో లేక అపరాధ భావాలతో, పరితాపంతో పురికొల్పబడి ప్రజలు చరిత్రంతటిలోనూ తమతమ దేవతలకు ఏదో విధమైన బలులు అర్పించారు. మరోవైపు, కొన్ని రకాల బలులను అర్పించడం సర్వశక్తిగల దేవుడైన యెహోవాయే ప్రారంభించాడని బైబిలు చూపిస్తోంది. కాబట్టి, ఇలా అడగడం సముచితంగా ఉంటుంది: ఏ విధమైన బలులు దేవునికి ఇష్టమైనవి? నేడు అర్పణలు, బలులు ఆరాధనలో ఒక భాగమై ఉండాలా?

సత్యారాధనలో అర్పణలు, బలులు

ఇశ్రాయేలు జనాంగం ఏర్పడినప్పుడు, ఇశ్రాయేలీయులు తనను ఏ విధంగా ఆరాధించాలనేదాని గురించి యెహోవా సవివరమైన సూచనలిచ్చాడు, వాటిలో అర్పణలు, బలులు కూడా ఉన్నాయి. (సంఖ్యాకాండము, 28, 29 అధ్యాయాలు) వాటిలో కొన్ని భూఫలాన్ని అర్పించడానికి సంబంధించినవి; అలాగే ఎద్దులు, గొర్రెలు, మేకలు, పావురాలు, తెల్లగువ్వలు వంటి జంతుబలులు కూడా అర్పించబడేవి. (లేవీయకాండము 1:3, 5, 10, 14; 23:10-18; సంఖ్యాకాండము 15:1-7; 28:7) అగ్నిలో పూర్తిగా దహించబడవలసిన దహన బలులు కూడా ఉండేవి. (నిర్గమకాండము 29:38-42) సమాధాన బలులు కూడా అర్పించబడేవి, అర్పించినవారు తాము దేవునికి అర్పించిన దానిలో నుండి తినడం ద్వారా వాటిలో పాల్గొనేవారు.​—లేవీయకాండము 19:5-8.

మోషే ధర్మశాస్త్రం క్రింద దేవునికి అర్పించబడిన అర్పణలు, బలులు దేవుణ్ణి ఆరాధించడంలో, ఆయనను విశ్వసర్వాధిపతిగా గుర్తించడంలో భాగంగా ఉన్నాయి. అలాంటి బలుల ద్వారా ఇశ్రాయేలీయులు, యెహోవా తమను ఆశీర్వదించినందుకు, కాపాడినందుకు కృతజ్ఞతను వ్యక్తం చేసి, అలాగే తమ పాపాలకు క్షమాపణ పొందారు. ఆరాధన విషయంలో యెహోవా కోరేవాటిని నమ్మకంగా అనుసరించినంతవరకు, వారు ఎంతగానో ఆశీర్వదించబడ్డారు.​—సామెతలు 3:9, 10.

బలులు అర్పించిన వారి దృక్పథమే యెహోవాకు అత్యంత ప్రాముఖ్యమైనది. యెహోవా తన ప్రవక్తయైన హోషేయ ద్వారా ఇలా చెప్పాడు: “నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహనబలులకంటె దేవునిగూర్చిన జ్ఞానము నాకిష్టమైనది.” (హోషేయ 6:6) కాబట్టి, ప్రజలు సత్యారాధన నుండి తొలగిపోయి, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ నిరపరాధుల రక్తాన్ని చిందించినప్పుడు, వారు యెహోవా బలిపీఠంపై అర్పిస్తున్న బలులకు విలువలేకుండా పోయింది. అందుకే యెషయా ద్వారా యెహోవా ఇశ్రాయేలు జనాంగానికి ఇలా చెప్పాడు: “విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకిష్టములేదు.”​—యెషయా 1:11.

“నేనాజ్ఞాపించని క్రియ”

ఇశ్రాయేలీయులకు పూర్తి భిన్నంగా, కనాను దేశస్థులు మొలెకు అని కూడా పిలువబడే అమ్మోనీయుల దేవుడైన మోలెకుతో సహా తమ దేవుళ్ళకు తమ పిల్లల్ని బలి అర్పించేవారు. (1 రాజులు 11:5, 7, 33; అపొస్తలుల కార్యములు 7:43) హెలీస్‌ బైబిల్‌ హ్యాండ్‌బుక్‌ ఇలా చెబుతోంది: “కనానీయులు ఒక మతాచారంలా తమ దేవుళ్ళ సమక్షంలో లైంగిక దుర్నీతిలో పాల్గొనడం ద్వారా వారిని ఆరాధించేవారు; ఆ దేవుళ్ళకే తమ మొదటి సంతానాన్ని చంపి బలి అర్పించేవారు.”

అలాంటి ఆచారాలు యెహోవా దేవునికి ఇష్టమైనవా? ఎంతమాత్రం కాదు. ఇశ్రాయేలీయులు కనాను దేశంలోకి ప్రవేశించబోతుండగా, యెహోవా వారికి లేవీయకాండము 20:2, 3 లో వ్రాయబడివున్న ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “ఇశ్రాయేలీయులలోనేగాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనేగాని యొకడు ఏమాత్రమును తన సంతానమును మోలెకుకు ఇచ్చినయెడల వానికి మరణశిక్ష విధింపవలెను; మీ దేశప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను. ఆ మనుష్యుడు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధనామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టివేతును.”

ఎంతో నమ్మశక్యం కానట్లు అనిపించినా, సత్యారాధన నుండి వైదొలగిన కొంతమంది ఇశ్రాయేలీయులు అబద్ధ దేవుళ్ళకు తమ పిల్లల్ని బలి అర్పించడమనే ఈ దయ్యాల ఆచారాన్ని అనుసరించారు. దీని గురించి కీర్తన 106:35-38 ఇలా చెబుతోంది: “అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజచేసిరి అవి వారికి ఉరి ఆయెను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము, అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి, కనానుదేశపువారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి; ఆ రక్తమువలన దేశము అపవిత్రమాయెను.”

ఇలాంటి పని అంటే తనకున్న ఏహ్యతను వ్యక్తం చేస్తూ, యెహోవా యూదా కుమారుల గురించి తన ప్రవక్తయైన యిర్మీయా ద్వారా ఇలా అన్నాడు: “నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడునట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచియున్నారు. నేనాజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసియున్నారు, అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్‌హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు.”​—యిర్మీయా 7:30, 31.

అలాంటి హేయమైన ఆచారాల్లో పాల్గొనడం ద్వారా ఇశ్రాయేలు జనాంగం చివరకు దేవుని అనుగ్రహాన్ని కోల్పోయింది. దాని రాజధాని నగరమైన యెరూషలేము చివరకు నాశనం చేయబడింది, ప్రజలు బబులోనుకు బంధీలుగా తీసుకువెళ్ళబడ్డారు. (యిర్మీయా 7:32-34) స్పష్టంగా, నర బలి అర్పించడం సత్యదేవుడు చెప్పింది కాదు, అది సత్యారాధనలో భాగమూ కాదు. ఏ విధంగా అర్పించినా నరబలి దయ్యాల సంబంధమైనది, అలాంటి ఆచారంతో సంబంధమున్న దేనికైనా దేవుని సత్యారాధకులు దూరంగా ఉంటారు.

క్రీస్తుయేసు విమోచన క్రయధన బలి

అయితే కొందరిలా ప్రశ్నించవచ్చు, ‘మరి యెహోవా ఇశ్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం జంతు బలులు ఎందుకు అర్పించాలి?’ అపొస్తలుడైన పౌలు ఇదే ప్రశ్న గురించి ఆలోచించి, ఈ సమాధానం ఇచ్చాడు: “ఆలాగైతే ధర్మశాస్త్రమెందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతిక్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను . . . క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను.” (గలతీయులు 3:19-24) మోషే ధర్మశాస్త్రం క్రింద అర్పించబడే జంతు బలులు, మానవజాతి కోసం యెహోవా దేవుడు ఏర్పాటు చేసిన అతిగొప్ప బలికి అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు అర్పించే బలికి సూచనార్థకంగా ఉన్నాయి. యేసు ఇలా చెప్పినప్పుడు ఆ ప్రేమపూర్వక పని గురించే ప్రస్తావించాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”​—యోహాను 3:16.

దేవునిపట్ల, మానవజాతిపట్ల ఉన్న ప్రేమ మూలంగా యేసు తన పరిపూర్ణ మానవ జీవితాన్ని ఆదాము సంతానానికి విమోచన క్రయధనంగా ఇష్టపూర్వకంగా అర్పించాడు. (రోమీయులు 5:12, 15) యేసు ఇలా అన్నాడు: “మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను.” (మత్తయి 20:28) ఆదాము మానవులను అమ్మేసిన పాపమరణాల బానిసత్వం నుండి వారిని మరింకెవరూ విడిపించలేరు. (కీర్తన 49:7, 8) అందుకే, యేసు “మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను” అని పౌలు వివరించాడు. (హెబ్రీయులు 9:12) యేసు బలి రక్తాన్ని అంగీకరించడం ద్వారా, దేవుడు ‘మనకు విరోధముగా నుండిన చేవ్రాతను తుడిచివేసెను.’ అంటే, యెహోవా అర్పణలు, బలులతో సహా ధర్మశాస్త్ర నిబంధనను తొలగించి, ‘నిత్యజీవమను కృపావరము’ అనుగ్రహించాడు.​—కొలొస్సయులు 2:13; రోమీయులు 6:23.

ఆధ్యాత్మిక బలులు, అర్పణలు

జంతు బలులు, అర్పణలు సత్యారాధనలో ఇక ఎంతమాత్రం భాగం కాదు కాబట్టి, నేడు మనం వేరే ఏవైనా బలులు అర్పించవలసి ఉందా? ఉంది. యేసుక్రీస్తు, దేవునికి చేసిన సేవలో బలిపూర్వక జీవితం గడిపి, చివరకు మానవజాతి కోసం తననుతాను అర్పించుకున్నాడు. అందుకే ఆయనిలా ప్రకటించాడు: “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.” (మత్తయి 16:24) అంటే యేసు అనుచరులు కావాలనుకునే వారెవరైనా కొన్ని త్యాగాలు చేయవలసి ఉంటుంది. అవేమిటి?

ఒక విషయమేమిటంటే, నిజమైన క్రీస్తు అనుచరుడు తన కోసం తాను జీవించడు గానీ దేవుని చిత్తం చేయడానికే జీవిస్తాడు. ఆయన తన వ్యక్తిగత చిత్తాన్ని, కోరికలను దేవుని చిత్తానికి, ఆయన కోరేవాటికి అనుగుణంగా మలచుకుంటాడు. అపొస్తలుడైన పౌలు దాన్నెలా చెప్పాడో గమనించండి: “సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.”​—రోమీయులు 12:1, 2.

అంతేగాక, మనం చెల్లించే స్తుతులు యెహోవాకు అర్పించే బలిగా దృష్టించబడతాయని బైబిలు సూచిస్తోంది. దేవుడు మన పెదవుల స్తుతిని అత్యంత శ్రేష్ఠమైన బలిగా పరిగణిస్తాడని చూపిస్తూ హోషేయ ప్రవక్త “ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము” అనే పదబంధాన్ని ఉపయోగించాడు. (హోషేయ 14:2) అపొస్తలుడైన పౌలు హెబ్రీ క్రైస్తవులకు ఇలా ఉద్బోధించాడు: “దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.” (హెబ్రీయులు 13:15) నేడు, యెహోవాసాక్షులు సువార్త ప్రకటిస్తూ, అన్ని దేశాల ప్రజలను శిష్యులుగా చేసేపనిలో నిమగ్నమై ఉన్నారు. (మత్తయి 24:14; 28:19, 20) వారు భూవ్యాప్తంగా రాత్రి పగలు దేవునికి స్తుతియాగాలు అర్పిస్తున్నారు.​—ప్రకటన 7:15.

ప్రకటనాపనితోపాటు, ఇతరులకు మంచి చేయడం కూడా దేవునికి ఇష్టమైన బలుల్లో భాగమే. “ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికిష్టమైనవి” అని పౌలు ఉద్బోధించాడు. (హెబ్రీయులు 13:16) వాస్తవానికి, స్తుతియాగాలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలంటే, వాటిని అర్పించేవారు మంచి ప్రవర్తన కలిగివుండాలి. పౌలు ఇలా హెచ్చరించాడు: “క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి.”​—ఫిలిప్పీయులు 1:27; యెషయా 52:11.

గతంలోలాగే, సత్యారాధనకు మద్దతుగా చేయబడే త్యాగాలన్నీ గొప్ప సంతోషాన్ని, యెహోవా ఆశీర్వాదాలను తీసుకువస్తాయి. కాబట్టి, దేవునికి నిజంగా ఇష్టమైన బలులు అర్పించేందుకు మనం చేయగలిగినంతా చేద్దాం!

[18వ పేజీలోని చిత్రం]

“వారు తమ కుమారులను తమ కుమార్తెలను . . . కనానుదేశపువారి బొమ్మలకు బలిగా అర్పించిరి”

[20వ పేజీలోని చిత్రాలు]

సువార్త ప్రకటించడం ద్వారా, ఇతర విధాల్లో సహాయం చేయడం ద్వారా నిజక్రైస్తవులు దేవునికి ఇష్టమైన బలులు అర్పిస్తారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి