ఇజ్రాయెల్లో దేవునినామము ఉచ్చరించబడుతోంది
సాంప్రదాయబద్ధమైన యూదా మతం తన మతావలంబికులు దేవుని నామమైన యెహోవాను ఉచ్చరించడాన్ని శతాబ్దాల పాటు కచ్చితంగా నిషేధించింది. మిష్నా చెప్తున్నదాని ప్రకారం, దేవుని నామమును ఉచ్చరించే ఎవరికైనా “రానైయున్న లోకంలో స్థానం ఉండదు.”—సన్హెడ్రిన్ 10:1.a
1995, జనవరి 30న, ఇజ్రాయెల్ సెపార్డిమ్ల మాజీ ప్రధాన రబ్బీ దేవుని నామాన్ని ఉద్దేశపూర్వకంగా ఉచ్చరించాడు. కాబాలిస్ట్ల దిద్దుబాటు ప్రార్థన అయిన టీకూన్ను వల్లిస్తున్నప్పుడు ఆయనలా చేశాడు. దేవుడు విశ్వంలో కాస్త సామరస్యాన్ని పునఃస్థాపించాలని ఈ ప్రార్థన చేయడం జరుగుతుంది, దుష్ట శక్తుల మూలంగా ఈ సామరస్యత చెదిరిపోయిందని ఆరాధకులు విశ్వసిస్తారు. యెడియోత్ అహరొనొత్ అనే వార్తాపత్రిక 1995, ఫిబ్రవరి 6 నాటి సంచిక ఇలా తెలియజేసింది: “ఈ ప్రార్థన ఎంతో ఆశ్చర్యకరమైన శక్తివున్న ఆరాధనా క్రమం, అందుకే దానిలోని పదాలు కేవలం ఒక ప్రత్యేకమైన చిన్న పుస్తకంలో మాత్రమే కనిపిస్తాయి, ఈ చిన్న పుస్తకం బయటి ప్రజలకు అమ్మబడదు.” ఈ సందర్భంలో దేవుని నామాన్ని ఉచ్చరించడం విన్నపానికి ప్రత్యేకమైన శక్తిని ఇస్తుందని తలంచబడుతోంది.
దేవుని నామమైన యెహోవాను ఉపయోగించమని బైబిలు దేవుని సేవకులకు ఆజ్ఞాపిస్తోందన్న విషయం గమనించదగినది. (నిర్గమకాండము 3:15; సామెతలు 18:10; యెషయా 12:4; జెఫన్యా 3:9) బైబిలు యొక్క హెబ్రీ మూల పాఠంలో, ఆ నామము దాదాపు 7,000 సార్లు కనిపిస్తుంది. అయితే, దేవుని నామమును దురుపయోగం చేయడాన్ని గురించి బైబిలు హెచ్చరిస్తుంది. పది ఆజ్ఞల్లో మూడవది ఇలా చెప్తుంది: “నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు.” (నిర్గమకాండము 20:7) దేవుని నామమును వ్యర్థముగా ఎలా ఉచ్చరించబడగలదు? జ్యూయిష్ పబ్లికేషన్ సొసైటీ చేసిన ఒక వ్యాఖ్యానం, “వ్యర్థముగా” అని అనువదించబడిన హెబ్రీ పదంలో, దేవుని నామమును “నిరర్థకంగా ఉపయోగించడం” మాత్రమే గాక “అనవసరమైన ఆశీర్వాదాన్ని వల్లించడం” కూడా ఇమిడి ఉందని పేర్కొంటుంది.
అయితే మరి మనం కాబాలిస్ట్ల టీకూన్ దిద్దుబాటు ప్రార్థనను ఎలా దృష్టించాలి? దాని మూలమేమిటి? సా.శ. 12వ, 13వ శతాబ్దాల్లో, కాబాల అని పిలువబడే ఒక మర్మమైన యూదామత రూపం ప్రజాదరణ పొందనారంభించింది. 16వ శతాబ్దంలో, ఐసాక్ లూర్య అనే రబ్బీ, “టీకూనీమ్”ను కాబాలిస్ట్ ఆరాధనా క్రమంలోకి ప్రవేశపెట్టాడు. దేవుని నామము ప్రత్యేకమైన శక్తులున్న మర్మగర్భమైన మంత్రంగా ఉపయోగించబడింది, అది కాబాలిస్ట్ మతాచరణలో ఒక భాగమైంది. ఇది దేవుని నామమును ఉపయోగించే సరైన పద్ధతని మీరు భావిస్తారా?—ద్వితీయోపదేశకాండము 18:10-12.
మీరు ఆ ప్రశ్నకు ఎలా సమాధానమిచ్చినప్పటికీ, ఆధునిక ఇజ్రాయెల్లో దేవుని నామమును బహిరంగంగా ఉచ్చరించడం దాదాపు అసాధారణమైన సంఘటనని ఒప్పుకుంటారు. అయినప్పటికీ, దేవుడే స్వయంగా ఇలా చెప్పాడు: “ఆ దినమున మీరీలాగందురు—యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవానుగూర్చి కీర్తన పాడుడి. ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను, భూమియందంతటను ఇది తెలియబడును.”—యెషయా 12:4, 5.
సంతోషకరంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 230 కన్నా ఎక్కువ దేశాల్లోలాగే ఇజ్రాయెల్లో యెహోవాసాక్షులు తమ పొరుగువారు యెహోవాను గురించిన కచ్చితమైన జ్ఞానాన్ని పొందటానికి సహాయం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. “అతడు [యెహోవానైన] నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను” అని చెప్తున్న కీర్తన 91:14 వంటి లేఖనాల భావాన్ని ఇంకా అనేకులు గుణగ్రహిస్తారన్నది వారి నిరీక్షణ.
[అధస్సూచీలు]
a టాన్నైమ్లు (బోధకులు) అని పిలువబడే రబ్బీలు ఇచ్చిన వివరణల ఆధారంగా లేఖనాధార ధర్మశాస్త్రానికి అనుబంధంగా వ్రాయబడిన వ్యాఖ్యానాల సముదాయమే మిష్నా. సా.శ. రెండవ శతాబ్దం చివరి భాగంలోనూ, మూడవ శతాబ్దం తొలి భాగంలోనూ దీనికి లిఖిత రూపం ఇవ్వబడింది.
[28వ పేజీలోని చిత్రం]
ఇక్కడ నెగెబులో, యెహోవా నామము, ఆయన వాక్యము, ఆయన ప్రజలచే ప్రచురం చేయబడుతున్నాయి
[29వ పేజీలోని చిత్రం]
దేవుని నామమును చూపిస్తున్న పోస్టర్