శ్రేష్ఠమైన జీవితమార్గాన సమైక్యమై
ప్రపంచ జనాభా ఇలాగే పెరుగుతూ పోతే త్వరలోనే భూమి మీద ఆరు వందల కోట్లమంది ఉంటారు. అందరూ ఒకే పూర్వీకుని నుండి వచ్చినప్పటికీ, తాము ఒకే వసుధైక కుటుంబ సభ్యులమనీ, జ్ఞానవంతుడైన ప్రేమగల సృష్టికర్తకు తాము జవాబుదారులమనీ చాలామంది అంగీకరిస్తున్నట్లు లేదు. దేశాలు, జాతులు, సంస్కృతుల మధ్యనున్న అనైక్యత అసమ్మతులు ఈ విచారకరమైన పరిస్థితికి నిరాశాపూరితమైన నిదర్శనంగా ఉంటున్నాయి.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా, విశ్వవ్యాప్త సమైక్యతన్నది సాధించనశక్యమైన లక్ష్యంగా అనిపించవచ్చు. ది కొలంబియా హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ ఇలా పేర్కొంటుంది: “ఎలా కలిసి జీవించాలి అనే అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నకు సంబంధించి, ప్రస్తుత ప్రపంచం వద్ద ఏ క్రొత్త తలంపూ లేదు, కనీసం ఒక్కటంటే ఒక్క క్రొత్త తలంపు కూడా లేదు.”
అయితే, భూ నివాసులందరి మధ్య సమైక్యతను తీసుకురావడానికి క్రొత్త తలంపేదీ అవసరం లేదు. సమైక్యతకు మార్గం పరిశుద్ధ లేఖనాల్లో పొందుపర్చబడి ఉంది. భూమినీ దానిమీద ఉన్న జీవాన్నంతటినీ సృష్టించినవాని ఆరాధనపై అది కేంద్రీకృతమై ఉంది. దేవుని ప్రజల మధ్య ఇప్పటికే ఆలోచనలో, ఆశయంలో, జీవన విధానంలో నిజమైన సమైక్యత ఉంది. 233 దేశాల్లో యాభై ఐదు లక్షలకు పైగా ఉన్న వీరు, దైవిక జీవిత మార్గమే శ్రేష్ఠమైన మార్గమనే నమ్మకం విషయంలో ఐక్యత కల్గివున్నారు. కీర్తనల గ్రంథకర్తవలె వారిలా ప్రార్థిస్తారు: “యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.”—కీర్తన 86:11.
స్వచ్ఛారాధనలో ప్రజలు ఇలా సంఘటితమవ్వడాన్ని గురించి ప్రవక్తయైన యెషయా ఎంతో కాలం క్రితమే ప్రవచించాడు. ఆయనిలా వ్రాశాడు: “అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి—యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.”—యెషయా 2:2, 3.
యెహోవాసాక్షుల సమైక్యత అనుపమానమైనది. ప్రపంచవ్యాప్తంగా 87,000 కంటే ఎక్కువ సంఘాల్లో, వారం వారం వారు తమ కూటాల్లో ఒకే విధమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకుంటున్నారు. (మత్తయి 24:45-47) అయితే, 1998 మధ్య భాగం నుండి 1999 తొలి భాగం వరకు, సాక్షులు తమ సమైక్యతను మరో విధంగా ప్రదర్శించారు, అంటే ప్రపంచమంతటా జరిగిన “దైవిక జీవిత మార్గము” అనే మూడు రోజుల సమావేశాలకు హాజరవ్వడం ద్వారా వారలా చేశారు. 13 దేశాల్లో, వివిధ దేశాల నుండి వచ్చిన పెద్ద ప్రతినిధి వర్గాలు సమావేశమైన వాటిని అంతర్జాతీయ సమావేశాలని పిలువడం జరిగింది. ఇతర సమావేశాలు జిల్లా సమావేశాలని పిలువబడుతున్నాయి. కాని ఈ సమావేశాలన్నీ ఆధ్యాత్మికంగా మంచి క్షేమాభివృద్ధికరమైన ఒకే కార్యక్రమాన్ని అందజేశాయి.
యెహోవాచే బోధించబడడానికి చక్కని వస్త్రధారణతో సంతోషంగా ఆడిటోరియమ్లలోకి, స్టేడియమ్లలోకి ప్రవాహంలా వస్తున్న ప్రతినిధులను చూడడం ఎంత మనోహరంగా ఉన్నదో కదా! అమెరికాలోని మిచిగన్లో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి వచ్చిన ఒక ప్రతినిధి అభిప్రాయం హాజరైన వారందరి మనోభావాన్ని ప్రతిబింబించింది. ఆమె ఇలా అంది: “ప్రపంచమంతటి నుండి అంటే, చెక్ రిపబ్లిక్, బార్బడోస్, నైజీరియా, హంగేరి, ఇంగ్లాండ్, హోలాండ్, ఇతియోపియా, కెన్యా, మరితర అనేక దేశాల నుండి వచ్చిన మన సహోదరులందరూ ఒకరినొకరు హత్తుకోవడాన్ని చూడడం ఎంత ఆనందకరమైన దృశ్యమో కదా! ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమను బట్టి, తమ గొప్ప దేవుడైన యెహోవాపట్ల ఉన్న ప్రేమను బట్టి ఆనందబాష్పాలు రాలుస్తూ సహోదరులు ఐక్యత కల్గివుండడాన్ని చూడడం ఎంతో చూడముచ్చటగా అనిపించింది.” భూ వ్యాప్తంగా లక్షలాదిమంది ఆనందించిన సమావేశ కార్యక్రమాన్ని తర్వాతి శీర్షిక పరిశీలిస్తుంది.
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.