దేవుడు లోకాన్ని నాశనం చేస్తాడా?
పోప్ జాన్ పాల్ II చెప్పిన ప్రకారంగా, మానవులు భవిష్యత్తు కోసం నమ్మకంతో ఎదురు చూడవచ్చు. చరిత్రయందంతటా, “మానవులు పాపాల్ని చేశారు, బహుశా జలప్రళయానికి ముందు వర్ణించబడిన పాపాలకన్నా ఎంతో గంభీరమైన వాటినే చేసివుండొచ్చు” అని ఆయన చెప్పాడు. అయినప్పటికీ, పోప్ ఇలా వివరించాడు: “నోవహుతో దేవుడు చేసిన నిబంధన మాటల నుండి తాను సృష్టించిన ఈ లోకాన్ని నాశనం చేసేందుకు దేవుడ్ని ప్రేరేపించే పాపమేదీ ఇప్పుడు లేదని మనం గ్రహిస్తాం.”
దేవుడు లోకాన్ని ఎన్నడూ నాశనం చేయడనే విషయం వాస్తవమేనా? “నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును; సమస్త శరీరులు ప్రవాహ జలములవలన ఇకను లయపరచబడరు; భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని” జలప్రళయానంతరం దేవుడు నోవహుతో చెప్పాడని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 9:11) ఈ మాటల్నిబట్టి దేవుడు “నాశనాన్నుండి [భూమిని] భద్రపరచేందుకు తనను తానే బద్దునిగా చేసుకున్నాడని” పోప్ చెబుతున్నాడు.
మన గ్రహం నాశనం కావడానికి సృష్టికర్త అనుమతించడని బైబిలు స్పష్టపరుస్తోంది. “భూమియొకటే యెల్లప్పుడును నిలుచునది” అని బైబిలు చెబుతోంది. (ప్రసంగి 1:4) అయితే జలప్రళయం నుండి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది—పోప్ వ్యాఖ్యానించనిదేదో ఉంది.
తన భావి ప్రత్యక్షతా సమయంలో భూమిపై ఉండే పరిస్థితులు, “జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు” ప్రజలు “ఎరుగక పోయి”నప్పటి ‘నోవహు దినాలలోని’ పరిస్థితులవలెనే ఉంటాయని యేసు చెప్పాడు. (మత్తయి 24:37-39) అదే విధంగా, అపొస్తలుడైన పేతురు “అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశిం[చి]”నప్పటిలాగే “భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము” ప్రస్తుత లోకాన్ని భయకంపితం చేస్తోందని వ్రాశాడు.—2 పేతురు 3:5-7.
దేవుడు నోవహుతో చేసిన నిబంధనను యేసూ, పేతురూ మర్చిపోయారా? ఏమాత్రం మర్చిపోలేదు! నోవహుతో చేసిన నిబంధనలో తాను చెప్పినట్లుగానే, ఈ దుష్టవిధానాన్ని నాశనం చేసేందుకు దేవుడు వరదనీటిని ఉపయోగించడు. బదులుగా ఆయన “రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును” అయిన యేసుక్రీస్తు అధికారాన్ని ఉపయోగిస్తాడు. (ప్రకటన [దర్శన గ్రంథము] 19:11-21) కాబట్టి, బైబిలు చెబుతున్న ప్రకారం భూమి నాశనం చేయబడదుగానీ దుష్టమానవ ‘లోకం’ నిశ్చయంగా అంతమౌతుంది. (సామెతలు 2:21, 22; ప్రకటన 11:18) అటు తర్వాత, “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:29.