రాజ్య ప్రచారకుల నివేదిక
“సువార్తికుని పనిచేయుము”
సువార్తికునిగా ఉండటమంటే దాని అర్థమేమిటి? అది యూ·ఆగ్·గె·లి·స్ట్సʹ అనే గ్రీకు పదం యొక్క అనువాదం, ఆ గ్రీకు పదం “సువార్త” అనే అర్థాన్నిచ్చే యూ·ఆ·గెʹలి·యాన్ అనే పదానికి దగ్గరి సంబంధం కలిగివుంది. కాబట్టి, ఒక సువార్తికుడు సువార్తను గూర్చి ప్రకటించేవాడు లేదా వర్తమానమిచ్చేవాడు.
నిజ క్రైస్తవులందరూ దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్తను ప్రకటిస్తారు గనుక వారు సువార్తికులు. సరియైన విధంగానే, అపొస్తలుడైన పౌలు “సువార్తికుని పనిచేయుము” అని తిమోతికి సలహా ఇచ్చాడు. తిమోతి ఈ పనిని గంభీరంగా తీసుకోవాలి. అతను ‘అన్ని విషయములలో మితముగా ఉండి,’ తన ‘పరిచర్యను సంపూర్ణముగా జరిగించాలని’ పౌలు అతన్ని ప్రోద్భలం చేశాడు.—2 తిమోతి 4:5.
సువార్తికులంగా మనం కూడా మన పరిచర్యను గంభీరంగా తీసుకుంటాం మరి ‘అన్ని విషయములలో మితముగా ఉంటాము,’ లేక అవకాశం లభించిన ప్రతిసారి సువార్తను ఇతరులతో పంచుకుంటాము. యెహోవాసాక్షులు వారిని అనియత పద్ధతిలో కలిసినప్పుడు, అనేకులు యెహోవాను గురించి, ఆయన వాగ్దానాలను గురించి అలా తెలుసుకోగల్గారు. బార్బడోస్ నందలి సేమోర్ అనే వ్యక్తికి అదే సంభవించింది.
సేమోర్ పబ్లిక్ పాఠశాల ఉపాధ్యాయుడు. అదే పాఠశాలలో పార్ట్ టైమ్ ఉపాధ్యాయుడైన, యెహోవాసాక్షుల్లో ఒకరైన చార్ల్స్ చురుకైన సువార్తీకుడు. అతను పూర్తికాల సేవకుడు లేక పయినీరు, మరి ప్రతి అవకాశాన్ని ఇతరులతో సువార్తను పంచుకునేందుకు ఉపయోగించుకునేవాడు. చార్ల్స్ అనియత సాక్ష్యం ద్వారా సేమోర్ రాజ్యవర్తమానాన్ని మొదటిసారి విన్నాడు.
త్వరలో సేమోర్ కూడా బైబిలు సత్యాలను ఎంతమందితో వీలైతే అంతమందితో పంచుకోవాలని తీర్మానించుకున్నాడు. కాబట్టి అతను తన ఉద్యోగ స్థలంలోని ప్రజలతో, ప్రాముఖ్యంగా తన విద్యార్థులతో అనియత సంభాషణలను ప్రారంభించాడు. కొన్ని దేశాల్లో మతాన్ని పబ్లిక్ పాఠశాలల వెలుపల ఉంచుతున్నప్పటికీ, ఈ వ్యక్తి మత, నైతిక విలువలను బోధించడానికే నియమింపబడ్డాడు. అయితే ఇప్పుడు విషయాలపై సేమోర్ పాత దృక్పథాల స్థానంలో, అతను క్రొత్తగా ఆర్జించిన బైబిలు జ్ఞానం ఉంది. విరామ సమయాల్లో, నూతన లోకాన్ని గూర్చిన దేవుని వాగ్దానాన్ని, నిత్యజీవం యొక్క ఉత్తరాపేక్షను గురించి అతను తన విద్యార్థులతో మాట్లాడేవాడు.
పిల్లలెలా ప్రతిస్పందించారు? అనేకులు యెహోవా రాజ్యాన్ని గూర్చిన సువార్తలో యథార్థమైన ఆసక్తిని ప్రదర్శించారు. క్రమేణా, సేమోర్ తన విద్యార్థుల్లో 13 మందితో బైబిలు పఠనాలను నిర్వహించడం ప్రారంభించాడు. వారి ఆసక్తి ఎంతగా ఉండేదంటే వారు వారానికి రెండుసార్లు బైబిలు పఠించడానికి ఏర్పాటు చేసుకున్నారు. తుదకు వారిలో చాలామంది, యెహోవాసాక్షుల ప్రాంతీయ రాజ్యమందిరంలో జరిగే క్రైస్తవ కూటాలకు హాజరవ్వడం ప్రారంభించారు. ఇంతవరకు వారిలో తొమ్మిదిమంది యెహోవా యొక్క సమర్పిత, బాప్తిస్మం తీసుకున్న సాక్షులయ్యారు. సేమోర్ విషయానికొస్తే, అతనిప్పుడు బార్బడోస్ నందలి యెహోవాసాక్షుల సంఘాల్లోని ఒకదానిలో పెద్దగా, క్రమ పయినీర్గా తన పరిచర్యను పూర్తిగా నెరవేర్చుతున్నాడు.
యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా ‘సువార్తికుల పనిని,’ అందులో కొంతభాగాన్ని అనియత సాక్ష్యం ద్వారా ఎలా చేస్తున్నారో దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. “సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి,” అని చెబుతున్న, కొలొస్సయులు 4:5, 6 నందు కనుగొనబడే బైబిలు సలహాను వారు అనుసరిస్తున్నారు.