మానవ బాధలు—అవి ఎప్పటికైనా అంతమౌతాయా?
సెరజేవోలోని క్రిక్కిరిసి ఉన్న ఒక బజారులో బాంబు ప్రేలిన తర్వాతి ఘోరమైన దృశ్యాలు; ర్వాండాలో జనసంహారం, దురాగతం; సొమాలియాలోని ఆకలితో అలమటిస్తున్న పిల్లలు ఆహారం కొరకు పెద్దబొబ్బలు పెడుతుండడం; లాస్ ఆంజిలిస్లో భూకంపం వచ్చిన తర్వాత అలసిపోయిన కుటుంబాలు తామెంత నష్టపోయామో లెక్కించుకోడం; వరదలచేత అల్లకల్లోలమైన బంగ్లాదేశ్లోని నిస్సహాయ బాధితులు. మానవ బాధలను గురించిన అటువంటి దృశ్యాలు దూరదర్శినిపై లేక పత్రికల్లో, వార్తాపత్రికల్లో ప్రతిదినం మనకు కనిపిస్తాయి.
మానవ బాధల దుఃఖకరమైన ప్రభావమేమంటే కొంతమంది ప్రజలు దేవునియందు విశ్వాసం కోల్పోయేలా అది చేస్తుంది. అమెరికాలోని యూదామతానికి సంబంధించిన ఒక గుంపుచేత ప్రచురించబడిన వ్యాఖ్యానం ప్రకారం, “చెడు యొక్క ఉనికి, విశ్వాసానికి ఎల్లప్పుడు కూడా ఎంతో గంభీరమైన అవరోధాన్ని కలిగించింది.” ఆస్క్విట్జ్వంటి నాజీ కాన్సంట్రేషన్ క్యాంపులలో, హిరోషిమాపై పేల్చబడిన బాంబులవంటి వాటితో సంభవించిన మరణాలను రచయితలు సూచిస్తారు. “న్యాయవంతుడు, శక్తిమంతుడునైన దేవుడు ఎన్నో అమాయకమైన ప్రాణాలు నాశనమవ్వడాన్ని ఎలా అనుమతించగలడనే ప్రశ్న ఆలోచించే మతపరమైన వ్యక్తులను వేధిస్తుందని, ఊహను కలచి వేస్తుందని,” రచయితలు చెబుతున్నారు.
దుఃఖకరంగా, యిటువంటి దుర్ఘటనలను గూర్చిన వార్తలెన్నో రావడం మానవ భావోద్రేకాలపై మొద్దుబారిన ప్రభావాన్ని చూపగలదు. స్నేహితులు, బంధువులకు సంభవించనంత వరకు అనేకులు యితరుల బాధలనుబట్టి కదిలింపబడరు.
అయిననూ, కనీసం మన స్వంత ప్రియమైనవారి పట్ల ఆప్యాయతా భావాలను కలిగుండగల సామర్థ్యం మనకు ఉందన్న వాస్తవం మన నిర్మాణకుని గురించి మనకు కొంత తెలియజేయాలి. మానవుడు దేవుని “స్వరూపమందు” మరియు “[ఆయన] పోలికె చొప్పున” సృష్టింపబడ్డాడని బైబిలు చెబుతుంది. (ఆదికాండము 1:26, 27) దీని అర్థం మానవులు రూపంలో దేవునిపోలి ఉన్నారనికాదు. లేదు. ఎందుకంటే “దేవుడు ఆత్మ” యని, “యెముకలును మాంసమును భూతమున [ఆత్మ NW] కుండవని” యేసుక్రీస్తు వివరించాడు. (యోహాను 4:24; లూకా 24:39) దేవునిపోలిక చొప్పున నిర్మింపబడటం, దేవునివంటి లక్షణాలను కనపర్చగల మన సామర్థ్యాన్ని సూచిస్తుంది. కాబట్టి, మామూలు మానవులు బాధపడుతున్న వారిపట్ల కనికరాన్ని కలిగి ఉంటారు గనుక, మానవుని సృష్టికర్త అయిన కనికరంగల యెహోవా దేవుడు, బాధపడుతున్న తన మానవ సృష్టిపట్ల ఎంతో కనికరాన్ని కలిగి ఉంటాడని మనం తేల్చి చెప్పవచ్చు.—లూకా 11:12, 13 పోల్చండి.
దేవుడు తన కనికరాన్ని కనపర్చిన ఒక మార్గమేమంటే, బాధలన్నిటికీ కారణమేమిటో వ్రాతపూర్వకంగా మానవజాతికి తెలియజేయడమే. దీన్ని ఆయన తన వాక్యమైన బైబిలులో కనపర్చాడు. బాధపడడానికి కాదుగాని జీవితంలోని ఆనందాన్ని అనుభవించడానికే దేవుడు మానవున్ని సృష్టించాడని బైబిలు స్పష్టంగా చూపిస్తుంది. (ఆదికాండము 2:7-9) మొదటి మానవులు, దేవుని నీతియుక్తమైన పరిపాలనను నిరాకరించడం ద్వారా తమపైకి తామే బాధలను తెచ్చుకున్నారని కూడా అది తెలియజేస్తుంది.—ద్వితీయోపదేశకాండము 32:4, 5; రోమీయులు 5:12.
ఇంత జరిగినప్పటికీ, బాధపడుతున్న మానవజాతిపట్ల దేవుడు యింకా కనికరాన్ని కలిగి ఉన్నాడు. మానవుల బాధలను అంతమొందిస్తానన్న ఆయన వాగ్దానంలో అది స్పష్టంగా కనపర్చబడింది. “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి” పోయెను.—ప్రకటన 21:3, 4; యెషయా 25:8; 65:17-25; రోమీయులు 8:19-21 కూడా చూడండి.
మానవులు బాధపడటాన్నిబట్టి దేవుడు చింతిస్తున్నాడని, దాన్ని అంతమొందించడానికి ఆయన దృఢ నిశ్చయత కలిగి ఉన్నాడని ఈ అద్భుతమైన వాగ్దానాలు నిరూపిస్తున్నాయి. కానీ అసలు మానవులు మొదట ఎందుకు బాధలను అనుభవించాల్సి వచ్చింది, మరి అది మన దినం వరకు కొనసాగేలా దేవుడు ఎందుకు అనుమతించాడు?
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
Cover and page 32: Alexandra Boulat/Sipa Press
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
Kevin Frayer/Sipa Press