మానవుని నడిపింపు విఫలమైందా?
అన్నిటినీ ఎవరు సృజించారు? మీ జవాబు “దేవుడు” అనైతే, అప్పుడు బైబిలు నందలి దేవుడైన సృష్టికర్తను విశ్వసించే వేలాది మంది ప్రజలతో మీరూ ఏకీభవిస్తున్నారన్న మాట.
అయినప్పటికీ, మానవజాతి సమస్యలను పరిష్కరించడంలో దేవుడు చురుకుగా పనిచేస్తున్నాడని అంగీకరించడానికి ఆయనను విశ్వసించే అనేకులకు, కష్టంగా ఉంటుంది. మానవజాతికి విడుదల తీసుకురాగల ఓ కార్యక్రమాన్ని దేవుడు నిర్వహిస్తున్నాడని తలంచడం సమంజసమేనా? ఇది వాస్తవమనడానికి సహేతుకమైన రుజువులను అనేకులు కనుగొనలేకపోతున్నారు.
వేల సంవత్సరాలుగా, మానవులు దేవున్ని విడిచిపెట్టి, పరిష్కారాలను వెదుకుతూ లెక్కలేనన్ని స్వయం సహాయక మార్గాలను ప్రయోగించి చూశారు. అయితే మానవులు పరిష్కారాలను కనుగొన్నారా? లేక సమస్యలు మరింత గంభీరమౌతూ వాటిని పరిష్కరించడం కష్టమౌతోందా? ఈనాడు ప్రపంచంలోని సత్వర సమస్యలతో మానవుడు ఎలా వ్యవహరిస్తున్నాడు?
ఓ నిపుణుడు దీనిని ఈ విధంగా చెప్పాడు: “పారిశ్రామిక విప్లవం ప్రారంభమైనప్పటి నుండి, వర్థమాన దేశాలు భౌగోళిక వాతావరణానికి ముప్పుతెస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాలకు హానికరమయ్యేలా ఉత్పత్తి, వినియోగాల నాశనకరమైన పద్ధతులతో ప్రపంచ సహజ వనరులను విపరీతంగా దోచుకున్నాయి.”
మానవుడు భూమిని నాశనం చేస్తూనే ఉన్నాడు. అర్జెంటీనా వార్తాపత్రిక క్లారెన్ యిలా వ్యాఖ్యానించింది: “ఈ శతాబ్దపు రెండో అర్థ భాగంలో, ఆర్థిక దురాశ, ముందు జాగ్రత్త లేకపోవడం, అశ్రద్ధ అనేవి గొప్ప విపత్తులకు కారణాలయ్యాయి. అవి మానవులను పొట్టనబెట్టుకోవడమేకాక తరచూ లెక్కకు మించిన పరిమితుల్లో పర్యావరణాన్ని మట్టుపెట్టాయి.”
ఆధునిక సమాజంలో మితిమీరిన పేదరికం ప్రస్తుతం శాశ్వత స్థాపిత విషయంగా అనిపిస్తోంది. ప్రపంచ ధనిక దేశాలనబడేవి సహితం, పేదరికపు అధిక భారం మోయలేక తొట్రిల్లుతున్నాయి. కెనడా, టొరెంటొలోని ది గ్లోబ్ ఆండ్ మెయిల్ వార్తాపత్రిక ప్రకారం, “కెనడా దేశీయులందరిలో మూడవ వంతు ప్రజలు తాము ఉద్యోగాన్ని పొందదగిన వయస్సులో వారు పేదరికాన్ని అనుభవిస్తారని” అంచనావేయబడింది. “పేదరికానికి గల ముఖ్య కారణాల్లో కుటుంబ విచ్ఛిన్నాలు ఒకటి, ఈ ధోరణి యిటీవలి సంవత్సరాల్లో మరింత పెరిగిందని” కూడా ఆ వార్తాపత్రిక చెప్పింది.
దిగజారుతున్న సమాజానికి మరో సూచన మాదక ద్రవ్యాల దుర్వినియోగం. దీన్ని గూర్చి మానవజాతి ఏం చేయగలదు? మొత్తానికి, చాలా తక్కువ అన్నది విశదమే. మాదక ద్రవ్యాలను వినియోగించిన ఫలితంగా లక్షలాది మంది శారీరకంగాను, మానసికంగాను, నైతికంగాను దిగజారిపోతున్నారు. ఈ సమస్య ఓ ఘోరాగ్నిలా వ్యాపిస్తోంది.
వ్యాధులతో వైజ్ఞానికులు జరిపే యుద్ధంలో వారు ఓడిపోతున్నారనిపిస్తోంది. నిజమే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనేక పోరాటాలను జయించింది. అయినా, వాటిలోని కొన్ని వైజ్ఞానిక పద్ధతులు ఔషధాలకు తట్టుకోగల హానికరమైన సూక్ష్మజీవులు క్రొత్తగా అవతరించడానికి సహాయపడ్డాయి.
సర్వవ్యాప్తంగా మానవ హక్కులను అతిక్రమించడాన్ని మానవ ప్రభుత్వాలు ఆపలేవు. ఉదాహరణకు, దాస్యాన్ని నివారిచేందుకు అనేక ప్రతిజ్ఞలూ చట్టాలు రూపొందించబడినా, ప్రపంచంలో పది కోట్ల కంటే ఎక్కువమంది ప్రజలు నిరీక్షణలేని దాస్యంలో బలవంతంగా పనిచేస్తున్నారని అంచనా వేయబడింది.
అయితే మానవ నడిపింపు ఎందుకు విఫలమైంది? ఈ అంశాలను పరిశీలించండి. తీవ్రమైన పరిమితులున్న ప్రజలనుండే మానవ నడిపింపు అనేది వస్తుంది. వారి జీవితానుభవం చాలా తక్కువగా వుండి, ఏదో ఒక నాగరికతకూ లేదా వాతావరణాలకు పరిమితమై ఉంటుంది. వారి జ్ఞానం కూడా పరిమితమైనదే. వారిచ్చే ఏ నడిపింపైనా ఆ పరిమితులకు అద్దం పడుతుంది. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, “అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.”—రోమీయులు 3:23.
వాస్తవానికి మానవజాతిలో అధిక భాగం అనుభవించే సమస్యలు గానీ, కష్టాలు గానీ, నేరుగా లేక పరోక్షంగా దేవుని నడిపింపును అలక్ష్యం చేయడం వల్ల వచ్చిన ఫలితమే. అయితే, అలాంటి నడిపింపు ఎక్కడ దొరుకుతుంది? ఈనాడు ఆ నడిపింపును దేవుడు మనకు ఎలా అందిస్తాడు? తదుపరి శీర్షిక వీటి జవాబులను పరిశీలిస్తుంది.