యెహోవా కొరకైన ప్రేమ సత్యారాధనను పురికొల్పును
“మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట.”—1 యోహాను 5:3.
1, 2. మనమే దృక్పధముతో యెహోవాను సేవించవలెను?
ఎనభై మందిగల జపాను బృందమొకటి, అమెరికా కాలిఫోర్నియాలోని యెహోవాసాక్షుల అసెంబ్లి హాలును సందర్శించెను. నీలిరంగు గువ్వలు, పావురాలు, కిలకిలపక్షులతో పూర్తిగా నిండియున్న ఒక తోటతోసహా, ఆహ్లాదకరమైన పరిసరములు, వారి మహోన్నత సృష్టికర్తయగు, యెహోవా దేవునికి మరింత సన్నిహితముగా ఉండునట్లు వారిని భావింపజేసెను. వారికి అన్నీ చూపించుచున్న గైడు త్వరలోనే వారిలో దాదాపు ప్రతిఒక్కరు పయినీరుగా పూర్తికాలసేవ చేయుచున్న వారని గ్రహించెను. ఆ తర్వాత, తరచూ వేయబడిన ప్రశ్నే ఆ గుంపుకుకూడ వేయబడెను: “జపానులో ఎందుకు అంతమంది పయినీర్లు ఉన్నారు?” క్షణకాలము నిశ్శబ్దము తర్వాత, ఒక యౌవనస్థురాలు ముందుకువచ్చి ఇట్లు జవాబిచ్చెను: “ఎందుకనగా మేము యెహోవాను ప్రేమించుచున్నాము.”
2 యెహోవా కొరకైన ప్రేమ—ఆయన సేవలో ఆసక్తిగా ఉండుటకు అది మనలనెంతగా ఉత్తేజపరచుచున్నది! అవును, ప్రతిఒక్కరు పయినీరుసేవ చేయలేరు. నిజమే, మన నలభైలక్షల మంది రాజ్యప్రచారకులలో అధికులు ఈ ఆధిక్యతకు వీలుకల్పించ లేనివారిగా ఉన్నారు. అయితే పరిస్థితులు అనుమతించు అనేకులు దీనిని చేయగల్గుదురు. మిగిలియున్న మనముకూడ “యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుచూ,” శిష్యులనుచేయు పనిలో కొంతభాగము కలిగియుండుటద్వారా మన ప్రేమను చూపించగలము. (కీర్తన 37:3, 4) యెహోవా దేవుని సమర్పిత సేవకులందరు పయినీరుసేవ చేయువారికి ప్రేమపూర్వక మద్దతునిస్తూ, పయినీరు ఆత్మను పెంపొందించుటలో భాగము వహించవచ్చును.—మత్తయి 24:14; 28:19.
3. అనేకమంది నామకార్థ క్రైస్తవులకు యెహోవాసాక్షులకు మధ్య ఏ భేదమును గమనించవచ్చును?
3 మతము కేవలము తమ జీవితమునకు చేర్చబడిన ఒక అంతర్భాగమని సుళువుగా తలంచు నామకార్థ క్రైస్తవులకు భిన్నముగా, యెహోవాసాక్షులు “ఆయన రాజ్యమును నీతిని” ఎడతెగక వెదకుటకు వారిని కదిలించు దేవుని కొరకైన మిక్కుటమైన ప్రేమను ప్రదర్శించుచున్నారు. దీనికి త్యాగము అవసరము, అయితే ఆ త్యాగమెంత అమూల్యమైనది! (మత్తయి 6:33; 16:24) మొదట మోషేద్వారా ఆ తర్వాత యేసుక్రీస్తుచే తిరిగి చెప్పబడిన, గొప్పదైన ఆ మొదటి ఆజ్ఞకు ఇది పొందికగా యున్నది: “మన దేవుడైన ప్రభువు (యెహోవా NW) అద్వితీయ ప్రభువు. (యెహోవా NW) నీవు పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును (యెహోవాను NW) ప్రేమింపవలెను.”—మార్కు 12:29, 30; ద్వితీయోపదేశకాండము 6:4, 5.
4, 5. విశ్వాసపాత్రులుగా ఎవరిని ఎంచవలెను, మరియు విశ్వాస్యతను ఎట్లు చూపించవచ్చును?
4 యెహోవాసాక్షుల కేంద్రకార్యాలయ సభ్యుడొకరు, వాచ్టవర్ సొసైటి అధ్యక్షుడును, 70 సంవత్సరాలు పూర్తికాలసేవలో గడిపిన 98 ఏళ్ల ఎఫ్. డబ్ల్యు. ఫ్రాంజ్తో, “బ్రదర్ ఫ్రాంజ్, నమ్మకత్వానికి మీరు ఒక చక్కని మాదిరిగా ఉన్నారు” అని అన్నాడు. దానికి సహోదరుడైన ఫ్రాంజ్, “అవును, నీవు తప్పకుండా నమ్మకంగా ఉండాలి!” అని ప్రత్యుత్తరమిచ్చాడు. చెప్పవలసిన దానిని అది క్లుప్తముగా వివరించెను. రాజ్యకార్యమందు మనము ఏ రంగములో ఉన్నను, మనము నమ్మకముగా ఉండగలము.—1 కొరింథీయులు 4:2; గలతీయులు 3:9.
5 నిజమే, అనేకమంది యెహోవా సేవలో ఎంతో ఎక్కువ చేయాలని కోరుకుంటారు, కానీ లేఖనానుసారమైన బాధ్యతలు లేక ఆరోగ్య సమస్యలు వారిని కొంతమేరకు ఆపుజేయవచ్చును. అయితే, పయినీరుసేవ చేయలేని వారిని తక్కువ నమ్మకస్థులుగా ఎంచరాదు. కొందరు బహు విపరీతమైన పరిస్థితులలో, అదీ అనేక సంవత్సరాలు యథార్థముగా నిలిచియుండిరి. అవును, వారు నమ్మకముగా ఉండిరి! వారు యెహోవా యెడల ప్రేమచూపి ఆయన దైవపరిపాలనా ఏర్పాట్లకు మద్దతుగా పూర్ణహృదయంతో పట్టుదలగా సేవచేశారు. వారు పయినీరుసేవా కార్యమందు మిక్కిలి శ్రద్ధవహించి పయినీర్లుగా అగుటకు శక్తిగల, తరచు తమస్వంత పిల్లలకు జీవితములో అన్నింటిని మించిన పయినీరు సేవను ఒక వృత్తిగా చేపట్టునట్లు పనిచేయులాగున ప్రోత్సహించారు.—ద్వితీయోపదేశకాండము 30:19, 20 పోల్చుము.
6, 7. 1 సమూయేలు 30:16-25లో చెప్పబడిన సంగతి ఈనాడు ఎట్లు అన్వయించును?
6 ఈనాటి దేవుని ప్రజలందరి ప్రేమగల సమిష్టి కార్యవిధానమును 1 సమూయేలు 30:16-25 నందలి వృత్తాంతము ద్వారా దృష్టాంతపరచ వచ్చును. అమాలేకీయులకు వ్యతిరేకముగాచేసిన యుద్ధములో, “దావీదు . . . సంథ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రము వరకు వారిని హతముచేసి” ఎంతో దోచుకొనెను. పాళెమునకు తిరిగివచ్చిన తర్వాత, దావీదుతో యుద్ధమునకు వెళ్లిన మనుష్యులలో కొందరు తమతో యుద్ధమునకు రాని వారికి దోపుడుసొమ్ములో ఎంతమాత్రము ఇవ్వకూడదనిరి. అయితే దావీదు వారితో ఇట్లనెను: “మీరు చెప్పినది యెవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయినవాని భాగమెంతో సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట; అందరు సమముగానే పాలుపంచుకొందురు గదా.”
7 అదే సూత్రము ఈనాడును అన్వయించును. పయినీర్లు ఆత్మీయ యుద్ధములో ముందున్నారు. అయితే సంఘములోని ఇతరులందరు నమ్మకమైన పూర్ణహృదయ మద్దతునిత్తురు. వారి సమిష్టి కార్యవిధానముయొక్క గొప్ప ఫలితము 1991వ సేవాసంవత్సర నివేదికలో చూపించబడినది.a
ఒక విశిష్టమైన నివేదిక
8. (ఎ) మొత్తము ప్రచారకులు, వారు యెహోవా సేవలో గడిపిన గంటలనుగూర్చిన ప్రపంచవ్యాప్త నివేదిక ఏమి వెల్లడిచేయుచున్నది?
8 అవును, 1991వ సేవాసంవత్సర నివేదికలో పులకరింపజేయు ప్రపంచవ్యాప్త విస్తరణకు ఆసక్తిగల యెహోవా ఆరాధికులందరి ఐక్యకృషి ఎట్లు దోహదపడినదో చూపించబడినది. 42,78,820 మంది ప్రచారకుల ఉజ్వలమైన క్రొత్త శిఖరాగ్ర సంఖ్య నివేదించబడినది—ఇది 6.5 శాతము అభివృద్ధి. వీరు సేవకొరకు 95,18,70,021 గంటలు (దాదాపు నూరుకోట్లు!) వెచ్చించారు. గతములో నిషేధముల క్రిందనున్న దేశములలో మన సహోదరులు చేసిన విలక్షణమైన కృషిని గమనించుము. ప్రపంచవ్యాప్త నివేదికలో మొదటిసారిగా చోటుచేసికొన్న ఆ దేశముల పేర్లు ఏవనగా—బల్గేరియా, కామెరూన్, జెకొస్లొవాకియా, ఇతియోపియా, మొజాంబిక్, నిగర్వాగా, రువాండ, సోవియట్ రష్యా.
9, 10. (ఎ) కష్టకాలముల సవాలుకు పయినీర్లు ఎట్లు ప్రతిస్పందించిరి? (బి) పయినీరు సేవలో ప్రవేశించుటకు ఏ ప్రోత్సాహము సమకూర్చబడెను?
9 ఇటీవలి సంవత్సరములలో పయినీరు ఆత్మ ప్రపంచవ్యాప్తముగా విస్తరించినది. ఇటీవలనే ఆరాధనా స్వాతంత్ర్యము ఇవ్వబడిన దేశములలో సహితము, పయినీర్ల సంఖ్య అధికమగుచున్నది. యెహోవా ఆరాధన కొరకు తాము కలిగియున్న సమస్తమును వెచ్చించుటకు తీవ్ర ఆర్థికపరిస్థితులు సహితము ధైర్యస్థయిర్యాలుగల ఈ సాక్షులను అడ్డగించుట లేదు. (2 కొరింథీయులు 11:23, 27 పోల్చుము.) రాజ్య ప్రచారకులందరిలో నెలకు సగటున 14 శాతము మంది పయినీరుసేవ చేయుచున్నారు. పయినీర్ల శిఖరాగ్ర సంఖ్య 7,80,202 మంది. కాగా ప్రచారకులందరిలో ఇది అద్భుతమైన 18 శాతము.
10 పయినీర్లు పొందుచున్న ఆనందమును గమనించిన మీదట, ఇతరులును ఈ సేవ చేపట్టుటకు ప్రోత్సహింపబడుచున్నారు. నీవింకను పయినీరుసేవ చేయనట్లయిన, “చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము” అని యెషయా 6:8లో మనము చదువునట్లుగా, నీవు చెప్పుటకు యెహోవాయెడల నీకున్న ప్రేమ నిన్ను పురికొల్పగలదా? లేక పట్టుదలతో నీవు చేయు బైబిలు పఠనము, పయినీరుసేవలో ప్రవేశించుటకు నీవు ఇంకొక్క అడుగు ముందుకు వేయులాగున, దేవునివాక్యము నీలో దహించు కోరికను మండించవచ్చునేమో? పరీక్షగల సమయములో సహితము, అతడు వెనుదీయకుండునట్లు, యెహోవా వాక్యము యిర్మీయాను పురికొల్పెను.—యిర్మీయా 20:9.
మానవజాతికి ప్రేమగల సేవ
11. బైబిలు పఠన కార్యక్రమము ఎట్లు వర్ధిల్లెను?
11 ఆ వార్షిక నివేదికలోని ఒక విశిష్టమైన అంశమేమనగా, పెరిగిన ఉచిత గృహ బైబిలు పఠనముల సంఖ్య. ప్రపంచవ్యాప్తముగా ప్రతినెల క్రమముగా 39,47,261 బైబిలు పఠనములు నిర్వహించబడుచున్నవి. ఇది ప్రేమగల ఏర్పాటైయున్నది, దీని మూలముగా యెహోవాసాక్షులు ఇంటింటి సేవలో తాము కనుగొనిన ఆసక్తిపరులకు మరింత సహాయము చేయుదురు. అపొస్తలుడైన పౌలు చూపిన అదే చిత్తశుద్ధితో పనిచేయుచు, అన్నిదేశముల మరియు జాతుల వారితో బైబిలు పఠనములు నిర్వహించుటకు మనము సంతోషింతుము. సత్యమును బోధించుటకు నిస్సందేహముగా ఆయన అనేక గంటలు వెచ్చించి ‘యూదులకును గ్రీసుదేశస్థులకును బహుగా సాక్ష్యమిచ్చెను.’ (అపొ. కార్యములు 20:20, 21) అది నేడును నిజమైయున్నది. ‘మనుష్యులందరు రక్షణపొందుటకు మరియు సత్యమునుగూర్చిన ఖచ్ఛితమైన జ్ఞానమును సంపాదించుటకు’ యెహోవాసాక్షులు సహాయము చేయుచున్నారు.—1 తిమోతి 2:4.
12-14. యూరపులోనుండి సంతోషదాయకమైన ఏ నివేదికలు వచ్చుచున్నవి?
12 తూర్పు యూరపులో పెరిగిన బైబిలు పఠన కార్యక్రమమును గూర్చిన నివేదికలు ఎంత ఉత్తేజకరముగా ఉన్నవి! దశాబ్దములుగా అక్కడి మన సహోదరులు చిన్నగుంపులుగా కూడుకొనిరి, బహుశః ఆ గుంపులోని వారందరి కొరకు స్టెన్సిల్ తీసిన పాత వాచ్టవర్ నలిగిన ప్రతి ఒకటి మాత్రమే ఉండెడిది. అయితే ఇప్పుడు బైబిళ్లు మరియు బైబిలు సాహిత్యములు ఆ దేశములలోనికి సమృద్ధిగా సరఫరా చేయబడుచున్నవి. అది సొలొమోనుయొక్క పరమగీతము 2:4ను గుర్తుచేయుచున్నది, కింగ్జేమ్సు వర్షన్: “అతడు [క్రీస్తుయేసు] నన్ను [ఆత్మీయ] విందుశాలకు తోడుకొనివచ్చెను, ఒక ధ్వజముగా అతని ప్రేమ నామీద కప్పబడెను.” తమ స్వంత పత్రిక ప్రతులను కలిగియుండుటద్వారా, అనేకమంది దేవుని “సత్యవాక్యమును” సరిగా ఉపయోగించుటకు సంసిద్ధులగుచున్నారు.—2 తిమోతి 2:15.
13 రష్యా, సెయింట్ పీటర్స్బర్గ్లోని ఒక సంఘమందలి 103 మంది ప్రచారకులు, ఇటీవలనే 300 గృహబైబిలు పఠనములు రిపోర్టుచేశారు. బైబిలు పఠనముయొక్క ఈ కృషి ఫలితముగా, కేవలము ఎనిమిది నెలలలోనే 53 మంది క్రొత్త సాక్షులు బాప్తిస్మము తీసికొన్నారు. సంఘములో సగముకంటే ఎక్కువమంది ఎనిమిది నెలలు లేక అంతకంటే తక్కువ కాలమునుండి సత్యమందున్న వారిగాయున్నారు. వారికి పెద్దలు లేరు—కేవలము ఒక్క పరిచారకుడు మాత్రమే వారి ఆత్మీయ పురోగభివృద్ధియెడల శ్రద్ధచూపవలెను.
14 ఈస్తోనియాలో ఒక బైబిలు విద్యార్థి, పఠనమునకు తన స్నేహితులను ఆహ్వానించవలెనాయని రాజ్యపరిచారకురాలిని అడిగినది. ఆ మరుసటి వారము ఆ సాక్షి వచ్చినప్పుడు, ఆమె అక్కడ 50 మంది వ్యక్తులు సమకూడియుండుటను కనుగొనెను! అలా శ్రద్ధగల వారందరి కొరకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు ఆ తర్వాత చేయబడ్డాయనుకోండి.
15. జ్ఞాపకార్థ దినమునకు హాజరైన వారినిగూర్చి, బాప్తిస్మము తీసికొనినవారిని గూర్చి ఏమిచెప్పవచ్చును?
15 పఠనముచేయు అనేకులు యేసు మరణ జ్ఞాపకార్థ దినమునకు హాజరగుటద్వారా మొదటిసారిగా క్రైస్తవ సహవాసమును చవిచూస్తారు. గత సంవత్సరము, మొదటిసారిగా హాజరైన వారి సంఖ్య 1,00,00,000కి మించిపోయినది, ఈ సంతోషదాయకమైన ఆచరణకు ప్రపంచవ్యాప్తముగా 66,207 సంఘములలో 1,06,50,158 మంది సమకూడారు. అనేక లాటీను-అమెరికా, ఆఫ్రికా, తూర్పు యూరపు దేశాలలో రాజ్యప్రచారకులకంటే హాజరైన వారిసంఖ్య మూడు లేక నాలిగింతలు ఎక్కువగా ఉన్నది. మనమిప్పుడు ఈ సంవత్సరము ఏప్రిల్ 17న జరుగు జ్ఞాపకార్థ దినమునకు సిద్ధపడుటకు ఆరంభించవలెను. జ్ఞాపకార్థ దినమునకు హజరగు అధిక సంఖ్యలోగల క్రొత్త బైబిలు విద్యార్థులు బాప్తిస్మమువైపు పురోగమించుటకు కొనసాగుదురని ఆశించుచున్నాము. బాప్తిస్మముల విషయానికొస్తే, 1991లో ఒక క్రొత్త శిఖరాగ్ర సంఖ్యలో 3,00,000 మంది నీటి బాప్తిస్మము తీసికొని తాము యెహోవా దేవునికి సమర్పించుకున్నామని చూపించిరి.
దైవిక స్వాతంత్ర్యమును ప్రేమించువారు
16. “స్వాతంత్ర్యమును ప్రేమించువారు” అను జిల్లా సమావేశములనుండి పులకరింపజేయు ఏ నివేదికలు వచ్చుచున్నవి?
16 “స్వాతంత్ర్యమును ప్రేమించువారు” అను జిల్లా సమావేశములు 1991వ సేవాసంవత్సరములో ఒక ప్రత్యేక అంశమైయుండెను. ఇప్పుడివి ఉత్తరగోళములో పూర్తికాగా, 1992లో ప్రవేశించి అవి దక్షిణగోళములో ఇంకను జరిగింపబడుచున్నవి. మొదటిసారిగా, అనేక తూర్పు యూరపు దేశాలలో సమావేశ కార్యక్రమము పూర్తిస్థాయిలో అందింపబడెను. అక్కడ మన సహోదరులు తమకు లభించిన క్రొత్త స్వాతంత్ర్యమును యెహోవా స్తుతి కొరకు ఉపయోగించుటకు సంతోషించుచున్నారు. 1991 అక్టోబరులో, 54 దేశములలో జరిగిన మొదటి 705 సమావేశములకు మొత్తము 47,74,937 మంది హాజరైరి.
17, 18. (ఎ) ఎటువంటి స్వాతంత్ర్యములను యెహోవా ఆరాధికులు అనుభవించుచున్నారు, ఆశతో ఎదురుచూచుచున్నారు? (బి) దైవిక స్వాతంత్ర్యము ఎట్లు లౌకిక స్వాతంత్ర్యమునకు భిన్నమై యున్నది?
17 యేసు తన శిష్యులకు ఇట్లు చెప్పెను: “సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.” (యోహాను 8:32) ఈనాడు, బైబిలు సత్యము లక్షలాది మందిని క్రీస్తుమత సామ్రాజ్యపు పిడివాదాలనుండి స్వతంత్రులను చేసినది. యెహోవా ఏర్పాటైన యేసుయొక్క విమోచన క్రయధన బలి, మానవజాతి “నాశనమునకు లోనైయిన దాస్యములోనుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము” పొందుటను సాధ్యపరచినదని ఈ లక్షలాదిమంది నేర్చుకొనిరి. (రోమీయులు 8:19-21) ఆ స్వాతంత్ర్యము ఎంత ఘనమైనది—యెహోవా ప్రేమతో నియమించిన సరియైన హద్దులలో భూపరదైసునందు నిత్యము జీవించుట!—యెషయా 25:6-8; అపొ. కార్యములు 17:24-26.
18 ఇప్పుడు యెహోవాసాక్షులు అనుభవించుచున్న మరియు దేవుని నూతన విధానములో మరింత విస్తారముగా అనుభవించుటకు ఎదురుచూచు ఆ స్వాతంత్ర్యములు దేవుడైన యెహోవానుండి కలిగినవైయున్నవి. (2 కొరింథీయులు 3:17) అవి ఏ రాజకీయ లేక విప్లవ ఉద్యమములపై ఆధారపడినవి కావు. (యాకోబు 1:17) ఈ విషయమై ఎటువంటి అపార్థమునైనను తొలగించుటకు, కొన్ని తూర్పు యూరపు దేశములలో యెహోవాసాక్షులు ధరించిన 1991 సమావేశ బ్యాడ్జిలు ఈ మాటలను కలిగియుండెను: “దైవిక స్వాతంత్ర్యమును ప్రేమించువారు అను జిల్లాసమావేశము.”
యెహోవా కొరకు మిక్కుటమైన ప్రేమ
19. యెహోవాతో ప్రార్థనాపూర్వక సన్నిహితత్వము మనలనెట్లు పోషించగలదు?
19 యెహోవా కొరకైన మన ప్రేమ మరియు ఆయన యందలి మన నమ్మకము ప్రార్థనయందు మనమాయనకు సమీపముగా ఉండుటకు కారణమగును. యెహోవాతో వారికున్న ఈ సన్నిహితత్వమే మన సహోదరులు కష్టములను, హింసలను సహించుటకు సహాయము చేసెను. (కీర్తన 25:14, 15) బహుగా పరీక్షింపబడిన గడియలో, యేసు ప్రార్థనద్వారా తన తండ్రితో సన్నిహితత్వమును కాపాడుకొనెను. (లూకా 22:39-46) యెహోవాతో అటువంటి ప్రార్థనా సన్నిహితత్వమే తన ప్రాణసమర్పణయొక్క వేదనలో స్తెఫనును కాపాడెను. రాళ్లతో కొట్టబడుటకు ముందు ఆయన పరలోకమువైపు తేరిచూచి, “ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచుచున్నానని చెప్పెను.”—అపొ. కార్యములు 7:56.
20-22. దేవుడు మన ప్రార్థనలను ఆలకించునని ఒక అనుభవము ఎట్లు దృష్టాంతపరచుచున్నది?
20 యెహోవాసాక్షులు తరచు అటువంటివాటినే అనుభవించుచుండగా, ఆయన చిత్తమునకు అనుగుణ్యముగా ఉన్న ప్రార్థనలకు యెహోవా ప్రత్యుత్తరమిచ్చుచున్నాడు. ఉదాహరణకు, మనపని నిషేధింపబడిన ఒక ఆఫ్రికా దేశములో, పెద్ద బస్తాసంచిలో రాజ్య సాహిత్యములను, బట్వాడా చేయవలసిన కవర్లను పెట్టుకొని ఒక స్పెషలు పయినీరు బస్సులో ఉత్తరవైపుగా ప్రయాణించుచుండెను. “ఆ బస్తాలో ఏమున్నది?” అని బస్సులో సామాను వేయు కూలీ సహోదరుని అడిగాడు. దానికి ఆ సహోదరుడు తన మనస్సుకు వచ్చిన మొదటిమాటను అనగా, “మెయిలు” (టపా) అని సమాధానమిచ్చాడు.
21 దారిలో, బస్సు మామూలుగా రోజువారి తనిఖీచేయు కార్యాలయము దగ్గర ఆగకుండా వెళ్లగా, అది నిషేధసరుకును తీసుకువెళ్లుచున్నదనే అనుమానంతో ట్రాఫిక్ పోలీసులు వెంబడించి దానిని ఆపారు. అందరి సామాన్లు తనిఖీచేయాలి కాబట్టి ప్రయాణికులందరు బస్సు దిగాలని వారు ఆజ్ఞాపించారు. పెద్దచిక్కే! ఆ సహోదరుడు సణుగుకొనుచున్న గుంపుకు దూరంగా కొంతదూరం నడిచివెళ్లి, మోకాళ్లూని యెహోవాకు ప్రార్థించాడు. ఆయన తిరిగి ఆ గుంపు దగ్గరకు తిరిగివచ్చినప్పుడు, ప్రతి ప్రయాణికుడి సామాన్లను వారు తెరిచి బహుజాగ్రత్తగా పరిశీలించుచున్నారు. సహోదరుని బస్తా తెరవవలసి వచ్చినప్పుడు, సహాయము కొరకు ఆయన మౌనముగా యెహోవాకు ప్రార్థించాడు.
22 “ఈ బస్తా ఎవరిది, దీనిలో ఏముంది?” అని ఆ పోలీసు అడిగాడు. సహోదరుడు నోరు తెరవకముందే, బస్సుకు సంబంధించిన ఆ కూలివాడు దానికి జవాబిస్తూ, “అది మెయిలు — తపాలా కార్యాలయమునుండి — తపాలా కార్యాలయమునకు వెళ్లుచున్నది” అని చెప్పాడు. “మంచిది” అని అంటూ ఆ అధికారి, ఆ బస్తాను ఎత్తి అతనికిచ్చి “ప్రయాణంలో దానిని చాలా జాగ్రత్తగా తీసికెళ్లమని” అతని కాజ్ఞాపించాడు. ఆ స్పెషలు పయినీరు మరలా మోకాళ్లూని ప్రార్థన ఆలకించువానికి కృతజ్ఞతలు తెలియజేశాడు.—కీర్తన 65:2; సామెతలు 15:29.
23. యెహోవా ఏమి ప్రదర్శించెను, అయినను కొన్నిసార్లు హింస కొనసాగునట్లు ఆయన ఎందుకు అనుమతించును?
23 అయితే, యెహోవా ఆరాధికులకు విపత్కర పరిస్థితులు అసలు సంభవింపవని దీని భావము కాదు. కొన్ని పరిస్థితులయందు, అటు బైబిలు కాలములలోను ఇటు మనకాలమందును, తన ప్రజలను తాను తప్పించగలడని యెహోవా ప్రదర్శించెను. అయితే యథార్థతా వివాదమును పరిష్కరించుట కనుగుణ్యముగా, కొన్ని సమయములలో హింస పూర్తిస్థాయిలో కొనసాగులాగున ఆయన అనుమతించునట్లు కన్పించుచున్నది. (మత్తయి 26:39 పోల్చుము.) ఇంకనూ, ప్రమాదములనుండి, పౌర పోరాటాలనుండి, లేక నేరమునుండి యాంత్రికముగా యెహోవా తన ప్రజలను కాపాడడు, అయితే అటువంటి సమయములలో బైబిలుపై ఆధారపడిన అభ్యాససిద్ధమైన జ్ఞానము విలువకరముగా యుండగలదు. (సామెతలు 22:3; ప్రసంగి 9:11) క్లిష్టసమయములలో మనము కాపాడబడిననూ లేక కాపాడబడక పోయిననూ, అవసరమైతే పునరుత్థానము ద్వారా మన విశ్వాస్యతకు ప్రతిఫలము లభించునను దృఢనమ్మకమును మనము కలిగియుండగలము.—మత్తయి 10:21, 22; 24:13.
24. ప్రేమపూర్వకమైన ఏ ఈవులను యెహోవా దయచేసెను, ఆయన చూపిన ప్రేమకు మనమెట్లు ప్రతిస్పందించవచ్చును?
24 యెహోవా ప్రేమపూర్వక ఈవులు ఎంత అద్భుతకరము! మానవజాతికి బహుమతిగా ఆయనిచ్చిన ఈ భూమి, దానియందలి సమస్తము వ్యక్తపరచబడిన ఆయన ప్రేమకు ఒక విశిష్టమైన ఉదాహరణ. (కీర్తన 104:1, 13-16; 115:16) మానవజాతిని పాపమరణముల నుండి విమోచించుటకు కనికరముతో దేవుడిచ్చిన బహుమానమగు ఆయన కుమారుడైన, యేసుక్రీస్తు, క్రితమెన్నడూ ఇవ్వనంత అత్యంత ప్రేమపూర్వక బహుమానమై యున్నాడు. “మనము ఆయనద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.” (1 యోహాను 4:9, 10) ఆ ప్రేమకు ప్రత్యుత్తరముగా, “మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మనప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవని” మనము ఒప్పింపజేయబడుదుము గాక.—రోమీయులు 8:38, 39. (w92 1/1)
[అధస్సూచీలు]
a ఆ నివేదిక ఆంగ్లపత్రికయగు జనవరి 1, 1992 ది వాచ్టవర్ పుటలు 10-13లలో ఇవ్వబడినది.
ఈ శీర్షికను పునఃసమీక్షించుట
◻ విశ్వాసపాత్రులుగా ఉండుట అనగానేమి?
◻ మనమే కార్యరంగములలో యెహోవా కొరకైన మన ప్రేమను ప్రదర్శించవచ్చును?
◻ యెహోవా ప్రేమపూర్వక ఈవులయెడల మనమెట్లు మెప్పును చూపవచ్చును?
[13వ పేజీలోని బాక్సు]
ఎందుకు అంతమంది పయినీర్లు?
నివేదికల ప్రకారము, జపానీయులు 2,600 సంవత్సరములు శ్రద్ధతో తమ చక్రవర్తులను ఆరాధించిరి. కేవలము ఈ 20వ శతాబ్దపు యుద్ధములలోనే, 30 లక్షలకు పైగా జపాను యుద్ధవీరులు తమ ప్రాణాల్ని త్యాగం చేశారు, ఎందుకనగా తమ చక్రవర్తి-దేవుని కొరకు చనిపోవుటకంటే గొప్పదైన గౌరవము మరొకటి లేదని వారు తలంచారు. అయితే బౌద్ధ-షింటో సైనికవాదము రెండవ ప్రపంచ యుద్ధములో విఫలముకాగా, అప్పటినుండి చక్రవర్తి తన దైవత్వమును త్యజించెను. ఈ మత ఖాళీని ఏది నింపగలదు? సంతోషదాయకముగా, యెహోవాసాక్షుల మిషనరీలు, ఆ తర్వాత స్థానిక సాక్షులు నిర్వహించిన కుటుంబ బైబిలు పఠనములు, వారు సత్యదేవుడగు యెహోవాను కనుగొని, తమ జీవితములను ఆయనకు సమర్పించుకొనులాగున అనేకులకు సహాయపడెను. జపాను సాక్షులకు ఈ సమర్పణయనగా అది ఎంతో భావమును కలిగియున్నది. గత కాలములలో అయితే ఒక చక్రవర్తి-దేవుని కొరకు తమ ప్రాణములను అర్పించెడివారు, కానీ ఇప్పుడు సజీవుడైన దేవుడు మరియు విశ్వసృష్టికర్తయగు—సార్వభౌమాధిపతియైన యెహోవాను ఆరాధించుటలో పయినీర్లుగా వారు గొప్ప ఆసక్తితో తమ శక్తిని ధారపోయుచున్నారు!
[14వ పేజీలోని చిత్రం]
దైవిక స్వాతంత్ర్యమును ప్రేమించువారు—ప్రాగునందు యెహోవా ఆరాధికుల సమావేశము, ఆగష్టు 9-11, 1991.