లెసన్ 97
కొర్నేలి పవిత్రశక్తిని పొందాడు
కైసరయలో కొర్నేలి అనే ముఖ్యమైన రోమా సైనికాధికారి ఉండేవాడు. అతను యూదుడు కాకపోయినా యూదులు అతన్ని గౌరవించే వాళ్లు. అతను పేదవాళ్లకు, అవసరంలో ఉన్నవాళ్లకు ఉదారంగా సహాయం చేసేవాడు. కొర్నేలి యెహోవాను నమ్మి ఎప్పుడూ ఆయనకు ప్రార్థన చేసేవాడు. ఒకరోజు ఒక దేవదూత కొర్నేలికి కనిపించి ఇలా చెప్పాడు: ‘దేవుడు నీ ప్రార్థనలు విన్నాడు. యొప్పే పట్టణానికి మనుషులను పంపించు, అక్కడ పేతురు ఉన్నాడు. అతనిని నీ దగ్గరకు రమ్మని చెప్పు.’ వెంటనే కొర్నేలి దక్షిణాన దాదాపు 50 కి.మీ. దూరంలో ఉన్న యొప్పేకు ముగ్గురు మనుషులను పంపించాడు.
ఈలోపు యొప్పేలో పేతురుకు ఒక దర్శనం వచ్చింది. యూదులు తినకూడని కొన్ని జంతువులను ఆయన చూశాడు, వాటిని తినమని ఒక స్వరం చెప్పడం విన్నాడు. పేతురు తినకుండా ఇలా అంటాడు: ‘కానీ నేను ఎప్పుడూ నా జీవితంలో అపవిత్రమైన జంతువులను తినలేదు.’ ఆ స్వరం ఆయనతో ఇలా చెప్పింది: ‘ఈ జంతువులను అపవిత్రమైనవి అని అనొద్దు. దేవుడు వాటిని పవిత్రం చేశాడు.’ పవిత్రశక్తి పేతురుకు ఇలా తెలియజేసింది: ‘నీ తలుపు దగ్గర ముగ్గురు మనుషులు ఉన్నారు. వాళ్లతో వెళ్లు.’ పేతురు తలుపు దగ్గరకు వెళ్లి, వాళ్లు ఎందుకు వచ్చారో అడుగుతాడు. వాళ్లు ఇలా చెప్పారు: ‘రోమా సైనికాధికారి అయిన కొర్నేలి మమ్మల్ని పంపించాడు. కైసరయలో ఉన్న ఆయన ఇంటికి రండి.’ పేతురు ఆ మనుషులను ఆ రాత్రికి అతని ఇంట్లో అతిథులుగా ఉండమని చెప్పాడు. తర్వాత రోజు యొప్పేలో ఉన్న కొంతమంది సహోదరులతో కలిసి కైసరయకు వెళ్లాడు.
చివరికి కొర్నేలి పేతురును చూడగానే మోకరిస్తాడు. కానీ పేతురు ఇలా చెప్పాడు: ‘లేచి నిలబడు! నేనూ నీలాగే మనిషిని. యూదులు అన్యుల ఇంటికి వెళ్లరు. కానీ దేవుడు నన్ను మీ ఇంటికి వెళ్లమని చెప్పాడు. దయచేసి నన్ను ఇక్కడకు ఎందుకు రమ్మన్నావో చెప్పు.’
కొర్నేలి పేతురుతో ఇలా చెప్పాడు: ‘నాలుగు రోజుల క్రితం నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, అప్పుడు ఒక దేవదూత నిన్ను పిలిపించమని నాకు చెప్పాడు. దయచేసి యెహోవా మాటలు మాకు నేర్పించు.’ పేతురు ఇలా అన్నాడు: ‘దేవుడు పక్షపాతి కాడని నేను తెలుసుకున్నాను. తనను ఆరాధించాలని అనుకునే వాళ్లని ఎవర్నైనా ఆయన అంగీకరిస్తాడు.’ పేతురు వాళ్లకు యేసు గురించి ఎన్నో విషయాలు నేర్పించాడు. అప్పుడు పవిత్రశక్తి కొర్నేలి మీదకు, అతనితో ఉన్న వాళ్ల మీదకు వచ్చింది, వాళ్లందరూ బాప్తిస్మం పొందారు.
“ప్రతీ జనంలో, తనకు భయపడి సరైనది చేసేవాళ్లను [దేవుడు] అంగీకరిస్తాడు.”—అపొస్తలుల కార్యాలు 10:35