129వ అధ్యాయం
“ఇదిగో! ఈ మనిషి!” అని పిలాతు అన్నాడు
మత్తయి 27:15-17, 20-30 మార్కు 15:6-19 లూకా 23:18-25 యోహాను 18:39–19:5
యేసును విడుదల చేయడానికి పిలాతు ప్రయత్నించాడు
బరబ్బను విడుదల చేయమని యూదులు అడిగారు
యేసును ఎగతాళి చేశారు, హింసించారు
యేసును చంపాలని చూస్తున్న వాళ్లతో పిలాతు ఇలా అన్నాడు: “ఇతని మీద మీరు మోపుతున్న నేరాల విషయంలో నాకు ఏ ఆధారం కనిపించలేదు. నిజానికి హేరోదుకు కూడా ఏ ఆధారం కనిపించలేదు.” (లూకా 23:14, 15) ఇప్పుడు యేసును విడుదల చేయడానికి పిలాతు ఇంకో విధంగా ప్రయత్నిస్తూ, ప్రజలతో ఇలా అన్నాడు: “పస్కా పండుగప్పుడు మీకోసం నేను ఒకర్ని విడుదల చేసే ఆచారం మీకు ఉంది కదా. మరి మీకోసం యూదుల రాజును విడుదల చేయమంటారా?”—యోహాను 18:39.
బరబ్బ అనే బందిపోటు దొంగ, రాజద్రోహి, హంతకుడు చెరసాలలో ఉన్నాడని పిలాతుకు తెలుసు. అందుకే పిలాతు వాళ్లను, “మీ కోసం ఎవర్ని విడుదల చేయమంటారు? బరబ్బనా? క్రీస్తు అని పిలవబడే యేసునా?” అని అడిగాడు. కానీ ముఖ్య యాజకులు రెచ్చగొట్టడంతో, ప్రజలు యేసుకు బదులు బరబ్బను విడుదల చేయమని అడిగారు. “ఈ ఇద్దరిలో ఎవర్ని విడుదల చేయమంటారు?” అని పిలాతు మళ్లీ అడిగాడు. అప్పుడు వాళ్లు, “బరబ్బను విడుదల చేయి” అని కేకలు వేశారు.—మత్తయి 27:17, 21.
ఏం చేయాలో అర్థంకాక పిలాతు “మరి క్రీస్తు అని పిలవబడే ఈ యేసును ఏమి చేయాలి?” అని అడిగాడు. దానికి ప్రజలు, “అతనికి కొయ్యపై శిక్ష వేయండి!” అని అరిచారు. (మత్తయి 27:22) ఒక నిర్దోషిని చంపమని వాళ్లు సిగ్గులేకుండా అడుగుతున్నారు. పిలాతు ఇలా అన్నాడు: “ఎందుకు? అతను ఏం తప్పు చేశాడు? మరణశిక్ష వేసేంత తప్పేదీ అతనిలో నాకు కనిపించలేదు. కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేస్తాను.”—లూకా 23:22.
యేసును విడుదల చేయడానికి పిలాతు ఎంత ప్రయత్నించినా, కోపంతో రగిలిపోతున్న ఆ జనమంతా, “అతనికి కొయ్యపై శిక్ష వేయండి!” అని వెర్రి ఆవేశంతో అరిచారు. (మత్తయి 27:23) ఒకవ్యక్తిని చంపమని పట్టుబట్టేంతగా మతనాయకులు ఆ ప్రజల్ని రెచ్చగొట్టారు. ఆ వ్యక్తి ఒక నేరస్తుడో, హంతకుడో కాదు. ఆయన ఒక నిర్దోషి, ఐదు రోజుల క్రితం రాజుగా యెరూషలేములోకి ఆహ్వానించబడిన వ్యక్తి. ఒకవేళ అక్కడ యేసు శిష్యులు ఉన్నా, వాళ్లు మౌనంగా, ఎవరి కంటా పడకుండా ఉండేవాళ్లు.
పిలాతు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకపోయింది. పైగా ప్రజల్లో అలజడి ఇంకా పెరిగిపోతోంది. అందుకే అతను కొన్ని నీళ్లు తీసుకుని, వాళ్లందరి ముందు చేతులు కడుక్కొని ఇలా అన్నాడు: “ఇతని రక్తం విషయంలో నేను నిర్దోషిని. దీనికి మీరే బాధ్యులు.” అయినాసరే ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. “అతని రక్తం మా మీదికి, మా పిల్లల మీదికి రానివ్వు” అని వాళ్లు జవాబిచ్చారు.—మత్తయి 27:24, 25.
సరైనది చేయడం కన్నా ప్రజల కోరిక తీర్చడమే మంచిదని పిలాతు అనుకున్నాడు. అందుకే వాళ్ల కోరిక ప్రకారం బరబ్బను విడుదల చేశాడు. అతను యేసు బట్టలు తీయించేసి, కొరడాలతో కొట్టించాడు.
యేసును క్రూరంగా కొట్టిన తర్వాత, సైనికులు ఆయన్ని పిలాతు భవనంలోకి తీసుకెళ్లారు. సైనికులందరూ చేరి ఆయన్ని ఇంకా హింసించారు. వాళ్లు ముళ్లతో ఒక కిరీటం అల్లి, దాన్ని ఆయన తలమీద పెట్టి గట్టిగా నొక్కారు. అంతేకాదు, వాళ్లు ఆయన కుడిచేతిలో ఒక కర్రను పెట్టి, రాజరికానికి గుర్తుగా ఉన్న ఊదారంగు వస్త్రాన్ని తొడిగారు. “యూదుల రాజా, నమస్కారం!” అంటూ హేళన చేశారు. (మత్తయి 27:28, 29) అంతటితో ఆగకుండా, ఆయన మీద ఉమ్మేసి చెంప మీద కొడుతూ ఉన్నారు. ఆయన చేతిలో ఉన్న కర్రను తీసుకుని, కిరీటంలో ఉన్న ముళ్లు ఆయన తలలో ఇంకా లోతుకు దిగబడేలా దానితో కొట్టారు.
ఇంత జరిగినా యేసు నిబ్బరంగా, ధైర్యంగా, ఆత్మనిగ్రహంతో ఉండడం చూసి పిలాతు ముగ్ధుడయ్యాడు. అందుకే, యేసు రక్తాపరాధం తన మీదికి రాకుండా ఉండడానికి పిలాతు మరో ప్రయత్నం చేశాడు. అతను ఇలా అన్నాడు: “ఇదిగో! ఇతనిలో నాకు ఏ తప్పూ కనబడలేదని మీరు తెలుసుకోవడం కోసం నేను ఇతన్ని బయటికి తీసుకొస్తున్నాను.” గాయాలతో, రక్తంతో ఉన్న యేసును చూసైనా ప్రజల మనసు కరుగుతుందని పిలాతు అనుకుని ఉంటాడా? దయాదాక్షిణ్యాలు లేని ఆ ప్రజల ముందు యేసు నిలబడినప్పుడు, పిలాతు ఇలా అన్నాడు: “ఇదిగో! ఈ మనిషి!”—యోహాను 19:4, 5.
తనను దారుణంగా కొట్టి, గాయపర్చినా యేసు మౌనంగా, నిబ్బరంగా ఉన్నాడు. అది చూసి పిలాతు గౌరవంతో, జాలితో ఆ మాటలు అనివుంటాడు.