39వ అధ్యాయం
స్పందించని తరంవాళ్లకు శ్రమ
యేసు కొన్ని నగరాల్ని నిందించాడు
ఆయన ఉపశమనం, సేదదీర్పు ఇస్తానన్నాడు
బాప్తిస్మమిచ్చే యోహాను మీద యేసుకు ఎంతో గౌరవం ఉంది. అయితే, చాలామంది ప్రజలు యోహానును ఎలా చూశారు? యేసు తన “తరంవాళ్ల” గురించి ఇలా చెప్పాడు: “వాళ్లు సంతల్లో కూర్చొని తోటిపిల్లలతో ఇలా అనే చిన్నపిల్లల్లా ఉన్నారు: ‘మేము మీ కోసం పిల్లనగ్రోవి ఊదాం, కానీ మీరు నాట్యం చేయలేదు; మేము ఏడ్పుపాట పాడాం, కానీ మీరు దుఃఖంతో గుండెలు బాదుకోలేదు.’”—మత్తయి 11:16, 17.
యేసు మాటలకు అర్థం ఏంటి? ఆయన ఇలా వివరించాడు: “బాప్తిస్మమిచ్చే యోహాను అందరిలా తింటూ తాగుతూ జీవించలేదు, అయినా ప్రజలు ‘అతనికి చెడ్డదూత పట్టాడు’ అని అంటున్నారు. మానవ కుమారుడు అందరిలాగే తింటూ తాగుతూ ఉన్నాడు, అయినా ప్రజలు ‘ఇదిగో! ఈయన తిండిబోతు, తాగుబోతు, పన్ను వసూలుచేసే వాళ్లకూ పాపులకూ స్నేహితుడు!’ అని అంటున్నారు.” (మత్తయి 11:18, 19) యోహాను ఒక నాజీరుగా సాదాసీదాగా జీవించాడు, ద్రాక్షారసాన్ని కూడా ముట్టుకోలేదు. అయినా అతనికి చెడ్డదూత పట్టాడని ఆ తరంవాళ్లు అన్నారు. (సంఖ్యాకాండం 6:2, 3; లూకా 1:15) అయితే, యేసు అందరిలాగే జీవించాడు, ఆయన మితంగా తిన్నాడు, తాగాడు. అయినా ఆయన్ని తిండిబోతు, తాగుబోతు అని నిందించారు. కాబట్టి ప్రజల్ని సంతోషపెట్టడం అసాధ్యం.
యేసు ఆ తరంవాళ్లను, సంతల్లో ఉన్న చిన్నపిల్లలతో పోల్చాడు. వాళ్లు తోటి పిల్లలు పిల్లనగ్రోవి ఊదినప్పుడు నాట్యం చేయరు, తోటి పిల్లలు ఏడ్చినప్పుడు వాళ్లు దుఃఖించరు. అంటే ఏమాత్రం స్పందించరు. “అయితే ఒక వ్యక్తి చేసే నీతి పనులే అతను తెలివిగలవాడని చూపిస్తాయి” అని యేసు అన్నాడు. (మత్తయి 11:16, 19) అవును, యోహాను, యేసు చేసిన “పనులే” వాళ్లమీద వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపిస్తాయి.
స్పందించని ఆ తరం వాళ్లందర్నీ నిందించిన తర్వాత యేసు కొరాజీను, బేత్సయిదా, కపెర్నహూము నగరాల్ని ఒక్కొక్కటిగా నిందించడం మొదలుపెట్టాడు. ఆ నగరాల్లో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒకవేళ వాటిని ఫేనీకే నగరాలైన తూరులో, సీదోనులో చేసివుంటే ఆ ప్రజలు పశ్చాత్తాపపడేవాళ్లని ఆయన చెప్పాడు. కొంతకాలంగా ఆయన పరిచర్యకు కేంద్రంగా ఉన్న కపెర్నహూములో కూడా చాలామంది స్పందించలేదు. అందుకే ఆయన ఆ నగరాన్ని ఉద్దేశించి ఇలా అన్నాడు: “తీర్పు రోజున నీ పరిస్థితి సొదొమ పరిస్థితి కన్నా ఘోరంగా ఉంటుంది.”—మత్తయి 11:24.
తర్వాత, ఆధ్యాత్మిక సత్యాల్ని “తెలివిగలవాళ్లకు, మేధావులకు” తెలియజేయకుండా, చిన్నపిల్లల్లాంటి వినయస్థులకు తెలియజేస్తున్నందుకు యేసు తన తండ్రిని స్తుతించాడు. (మత్తయి 11:25) అలాంటి వినయస్థులకు యేసు ఈ చక్కని ఆహ్వానం ఇచ్చాడు: “భారం మోస్తూ అలసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి, నేను మీకు సేదదీర్పును ఇస్తాను. నేను సౌమ్యుడిని, వినయస్థుడిని కాబట్టి నా కాడిని మీ మీద ఎత్తుకుని, నా దగ్గర నేర్చుకోండి; అప్పుడు మీరు సేదదీర్పు పొందుతారు. ఎందుకంటే నా కాడి మోయడానికి సులభంగా ఉంటుంది, నేను ఇచ్చే బరువు తేలిగ్గా ఉంటుంది.”—మత్తయి 11:28-30.
యేసు ఎలా సేదదీర్పునిస్తాడు? విశ్రాంతి రోజు విషయంలో, వేరే ఆచారాల విషయంలో కఠినమైన నియమాలు పెడుతూ మతనాయకులు ప్రజల మీద భారం మోపారు. యేసు అలాంటి నియమాలేవీ పెట్టలేదు గానీ, దేవుని గురించిన సత్యాన్ని బోధించడం ద్వారా వాళ్లకు సేదదీర్పునిచ్చాడు. అంతేకాదు, పరిపాలకుల అణచివేత వల్ల నలిగిపోయినవాళ్లకు, తాము చేసిన పాపాల వల్ల కృంగిపోయినవాళ్లకు ఉపశమనం పొందే మార్గాన్ని చూపించాడు. అవును, పాపక్షమాపణ ఎలా పొందవచ్చో, దేవునితో మంచి సంబంధం ఎలా కలిగివుండవచ్చో యేసు వాళ్లకు తెలియజేశాడు.
యేసు కాడి మోయడానికి సులభంగా ఉంటుంది. దాన్ని స్వీకరించే వాళ్లందరూ దేవునికి సమర్పించుకొని కనికరం, కరుణగల మన పరలోక తండ్రిని సేవించవచ్చు. అలా చేయడం భారంగా అనిపించదు, ఎందుకంటే దేవుని ఆజ్ఞలు ఏ మాత్రం భారమైనవి కావు.—1 యోహాను 5:3.