28వ అధ్యాయం
యేసు శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు?
మత్తయి 9:14-17 మార్కు 2:18-22 లూకా 5:33-39
యోహాను శిష్యులు యేసును ఉపవాసం గురించి అడిగారు
బాప్తిస్మమిచ్చే యోహాను చెరసాలలో వేయబడి చాలా నెలలు గడిచాయి. సా.శ. 30 పస్కా అయిపోయిన కొంతకాలానికి అతను చెరసాలలో వేయబడ్డాడు. తన శిష్యులు యేసు అనుచరులవ్వాలని యోహాను కోరుకున్నాడు. కానీ, వాళ్లలో అందరూ ఇంకా యేసు శిష్యులు అవ్వలేదు.
సా.శ. 31 పస్కా దగ్గరపడుతుండగా, యోహాను శిష్యుల్లో కొందరు యేసు దగ్గరికి వచ్చి, “మేము, పరిసయ్యులు ఉపవాసం ఉంటాం, మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు?” అని అడిగారు. (మత్తయి 9:14) పరిసయ్యులు ఉపవాసాన్ని ఒక మతాచారంలా పాటించేవాళ్లు. తర్వాత యేసు ఒక ఉదాహరణలో స్వనీతిపరుడైన పరిసయ్యుడు ఇలా ప్రార్థించాడని చెప్పాడు: “దేవా, నేను మిగతావాళ్లలా లేనందుకు . . . నీకు కృతజ్ఞతలు. నేను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను.” (లూకా 18:11, 12) యోహాను శిష్యులు కూడా ఉపవాసాన్ని ఒక ఆచారంలా పాటించివుంటారు. లేదా యోహాను చెరసాలలో ఉన్నాడనే దుఃఖంతో వాళ్లు ఉపవాసం ఉండివుంటారు. కనీసం యోహాను చెరసాలలో ఉన్నాడనే దుఃఖంతోనైనా యేసు శిష్యులు ఉపవాసం ఉండొచ్చు కదా, ఎందుకు ఉండట్లేదు అని వాళ్లకు సందేహం వచ్చింది.
యేసు ఒక ఉదాహరణ ఉపయోగిస్తూ వాళ్లకు ఇలా జవాబిచ్చాడు: “పెళ్లికుమారుడు తమతో ఉన్నంతకాలం, అతని స్నేహితులు దుఃఖపడాల్సిన అవసరం ఉంటుందా? అయితే పెళ్లికుమారుణ్ణి వాళ్ల దగ్గర నుండి తీసుకెళ్లిపోయే రోజులు వస్తాయి, అప్పుడు వాళ్లు ఉపవాసం ఉంటారు.”—మత్తయి 9:15.
యేసు పెళ్లికుమారుడని స్వయంగా యోహానే ఒకసారి అన్నాడు. (యోహాను 3:28, 29) కాబట్టి, యేసు తమతో ఉన్నంతకాలం ఆయన శిష్యులు ఉపవాసం ఉండరు. కానీ ఆయన చనిపోయినప్పుడు వాళ్లు ఎంతో దుఃఖిస్తారు, వాళ్లకు తినాలని కూడా అనిపించదు. అయితే, యేసు పునరుత్థానం అయినప్పుడు పరిస్థితి మారుతుంది! అప్పుడిక వాళ్లు దుఃఖంతో ఉపవాసం ఉండాల్సిన అవసరం ఉండదు.
తర్వాత యేసు ఈ రెండు ఉదాహరణలు చెప్పాడు: “పాత వస్త్రానికి ఎవ్వరూ కొత్త గుడ్డముక్కతో అతుకు వేయరు. అలా వేస్తే, కొత్త గుడ్డముక్క ముడుచుకుపోయి చిరుగు ఇంకా పెద్దదౌతుంది. అలాగే, ప్రజలు కొత్త ద్రాక్షారసాన్ని పాత ద్రాక్షతిత్తుల్లో పోయరు. ఒకవేళ పోస్తే, ద్రాక్షతిత్తులు పిగిలిపోయి ద్రాక్షారసం కారిపోతుంది; ద్రాక్షతిత్తులు కూడా పాడౌతాయి. అందుకే కొత్త ద్రాక్షారసాన్ని కొత్త ద్రాక్షతిత్తుల్లోనే పోస్తారు.” (మత్తయి 9:16, 17) యేసు ఏం చెప్పాలనుకున్నాడు?
ఉపవాసం ఉండడం లాంటి పాత యూదామత ఆచారాల్ని తన శిష్యులు పాటించాల్సిన అవసరంలేదని యేసు యోహాను శిష్యులకు చెప్తున్నాడు. ఎందుకంటే యేసు, పాతబడి చీకిపోయిన ఆరాధనా విధానానికి ‘అతుకువేసి’ దాన్ని కొనసాగింపజేయడానికి రాలేదు. నిజానికి, ఆ పాత ఆరాధనా విధానమంతా త్వరలోనే తీసేయబడుతుంది. అయితే, యేసు ప్రోత్సహిస్తున్న కొత్త ఆరాధనా విధానం, మనుషుల ఆచారాలతో నిండివున్న అప్పటి యూదా మతం లాంటిది కాదు. కాబట్టి, యేసు పాత వస్త్రానికి కొత్త గుడ్డముక్కను అతుకు వేయడానికో, లేదా గట్టిపడిన పాత ద్రాక్షతిత్తిలో కొత్త ద్రాక్షారసాన్ని పోయడానికో రాలేదు.