10వ అధ్యాయం
యేసు కుటుంబం యెరూషలేముకు వెళ్లడం
యేసు పన్నెండేళ్ల వయసులో బోధకుల్ని ప్రశ్నలు అడిగాడు
యేసు యెహోవాను “నా తండ్రి” అని పిలిచాడు
అది వసంత కాలం. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా యోసేపు కుటుంబం స్నేహితులతో, బంధువులతో కలిసి యెరూషలేముకు వెళ్లడానికి సిద్ధమౌతోంది. ధర్మశాస్త్రం చెప్పినట్లు, వాళ్లు పస్కా పండుగ ఆచరించడానికి అక్కడికి వెళ్తున్నారు. (ద్వితీయోపదేశకాండం 16:16) నజరేతు నుండి యెరూషలేముకు వెళ్లాలంటే దాదాపు 120 కిలోమీటర్లు ప్రయాణించాలి. అందరూ ప్రయాణం కోసం సిద్ధపడుతూ, ఉత్సాహంగా ఉన్నారు. యేసుకు ఇప్పుడు 12 ఏళ్లు. ఆయన ఈ పండుగ కోసం, మళ్లీ ఆలయానికి వెళ్లడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.
పస్కా పండుగ అంటే ఒక రోజుతో అయిపోయేది కాదు. పస్కా తర్వాతి రోజు “పులవని రొట్టెల పండుగ” మొదలయ్యేది. అది ఏడు రోజులపాటు జరుగుతుంది. (మార్కు 14:1) ఆ ఏడు రోజుల్ని కూడా పస్కా పండుగలో భాగంగానే చూసేవాళ్లు. యేసు, ఆయన కుటుంబం నజరేతులోని తమ ఇంటి నుండి యెరూషలేముకు వెళ్లడానికి, అక్కడ పండుగ జరుపుకోవడానికి, ఇంటికి తిరిగిరావడానికి దాదాపు రెండు వారాలు పట్టేది. కానీ ఈ సంవత్సరం, ఒక సంఘటన వల్ల ఇంకాస్త ఎక్కువ సమయం పట్టింది. ఆ సంఘటన, వాళ్లు యెరూషలేము నుండి తిరిగి వెళ్తున్నప్పుడు జరిగింది.
యోసేపు మరియలు వాళ్ల బంధువులతో, స్నేహితులతో కలిసి తిరుగు ప్రయాణం చేస్తున్నారు. యేసు ఆ గుంపులోనే ఉండివుంటాడని యోసేపు మరియలు అనుకున్నారు. కానీ, రాత్రిపూట ఒక చోట ఆగినప్పుడు వాళ్లకు యేసు కనిపించలేదు. దాంతో వాళ్లు తమ స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర ఆయన్ని వెతికారు. కానీ యేసు ఎక్కడా కనిపించకపోవడంతో, వాళ్లు ఆయన్ని వెతుక్కుంటూ తిరిగి యెరూషలేముకు వచ్చారు.
వాళ్లు ఒక రోజంతా వెతికినా యేసు కనిపించలేదు. రెండో రోజూ కనిపించలేదు. చివరికి మూడో రోజు, వాళ్లు ఆలయంలోని గదుల్లో వెతుకుతుండగా యేసు కనిపించాడు. ఆయన కొంతమంది యూదా బోధకుల మధ్య కూర్చొని, వాళ్లు చెప్పేది వింటూ, వాళ్లను ప్రశ్నలు అడుగుతున్నాడు. యేసుకున్న అవగాహన చూసి ఆ బోధకులు ఎంతో ఆశ్చర్యపోయారు.
మరియ ఆయన్ని చూడగానే “బాబూ, నువ్వెందుకు ఇలా చేశావు? ఇదిగో నేను, మీ నాన్న ఎంతో ఆందోళనతో నీ కోసం వెతుకుతూ ఉన్నాం” అంది.—లూకా 2:48.
తాను ఎక్కడ ఉంటాడో వాళ్లు అర్థం చేసుకోలేకపోయినందుకు, యేసు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు: “మీరెందుకు నా కోసం వెతుకుతున్నారు? నేను నా తండ్రి మందిరంలో ఉండాలని మీకు తెలీదా?”—లూకా 2:49.
యేసు ఆ తర్వాత యోసేపు మరియలతో నజరేతుకు తిరిగొచ్చి, అన్నివేళలా వాళ్లకు లోబడివున్నాడు. ఆయన పెద్దవాడౌతూ తెలివైనవాడిగా తయారౌతున్నాడు. చిన్నవయసులోనే ఆయన దేవుని దయను, మనుషుల దయను పొందాడు. అవును, యేసు చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక విషయాలకు మొదటి స్థానం ఇవ్వడంలో, అమ్మానాన్నల్ని గౌరవించడంలో మంచి ఆదర్శం ఉంచాడు.