భాగం 23
సువార్త సుదూర ప్రాంతాలకు చేరింది
పౌలు నేలమార్గాన, సముద్రమార్గాన మిషనరీ యాత్రలు చేశాడు
పౌలు క్రైస్తవుడిగా మారిన తర్వాత, దేవుని రాజ్య సువార్తను ఉత్సాహంగా ప్రకటించాడు. ఒకప్పుడు క్రైస్తవులను వ్యతిరేకించిన ఈయనకే ఎన్నోసార్లు తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. దేవుడు మనుషుల కోసం చేయాలనుకున్నది తన రాజ్యం ద్వారా ఎలా చేస్తాడో ప్రకటించడానికి అలుపెరుగని ఈ అపొస్తలుడు ఎన్నో ప్రాంతాలకు ప్రయాణమై వెళ్లాడు.
పౌలు తన మొదటి మిషనరీ యాత్రలో లుస్త్రకు వెళ్లినప్పుడు అక్కడ ఒక పుట్టు కుంటివాడిని బాగుచేశాడు. అక్కడి ప్రజలు పౌలును, ఆయనతో పాటు వచ్చిన బర్నబాను దేవుళ్లని పిలుస్తూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ప్రజలు తమకు బలులు అర్పించబోతుంటే వీళ్లిద్దరు అతికష్టంమీద వాళ్లను ఆపారు. అయితే, పౌలు శత్రువులు రెచ్చగొట్టేసరికి, తర్వాత ఆ ప్రజలే ఆయనపై రాళ్లురువ్వారు. ఆయన చనిపోయాడనుకొని వదిలేసి వెళ్లిపోయారు. పౌలు ఆ ప్రమాదం నుండి బ్రతికి బయటపడి, ఆ తర్వాత శిష్యులను ప్రోత్సహించడానికి మళ్లీ అదే ప్రాంతానికి వెళ్లాడు.
యూదులుకాని విశ్వాసులు దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రంలోని కొన్ని నియమాలను పాటించాలని కొంతమంది యూదా క్రైస్తవులు వాదించారు. పౌలు ఆ సమస్యను యెరూషలేములోవున్న అపొస్తలుల, పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. ఆ పెద్దలు లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించి, దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో ఒక నిర్ణయం తీసుకొని సంఘాలకు ఉత్తరం రాశారు. విగ్రహారాధన చేయకూడదని, రక్తాన్నిగానీ రక్తంతోవున్న మాంసాన్నిగానీ తినకూడదని, వ్యభిచారం చేయకూడదని హెచ్చరించారు. అలాంటి ఆజ్ఞలు ‘అవశ్యమైనవి.’ అయితే వాటిని పాటించేవారు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పారు.—అపొస్తలుల కార్యములు 15:28, 29.
పౌలు రెండవ మిషనరీ యాత్ర చేస్తూ బెరయ (ఇప్పుడు గ్రీసులో ఉంది) అనే ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి యూదులు ఆయన ప్రకటించిన వాక్యాన్ని ఎంతో ఆసక్తితో విని, ఆయన బోధించిన విషయాలు లేఖనాల్లో ఉన్నాయో లేదో ప్రతీరోజు పరిశోధించేవారు. అక్కడ కూడా వ్యతిరేకత ఎదురవడంతో ఆయన ఏథెన్సుకు వెళ్లాడు. గొప్ప విద్యావంతులైన ఏథెన్సు వాసుల ముందు పౌలు ఓ శక్తివంతమైన ప్రసంగాన్నిచ్చాడు. యుక్తిగా, వివేచనతో ప్రభావవంతంగా ఎలా మాట్లాడాలనే దానికి ఆయనిచ్చిన ప్రసంగం ఒక మంచి ఉదాహరణ.
పౌలు తన మూడో మిషనరీ యాత్ర తర్వాత యెరూషలేముకు వెళ్లాడు. ఆయన అక్కడి దేవాలయానికి వెళ్లినప్పుడు కొంతమంది యూదులు ఆగ్రహంతో రెచ్చిపోయి ఆయన్ని చంపాలనుకున్నారు. రోమా సైనికులు కలుగజేసుకొని, పౌలును విచారణ చేశారు. రోమా పౌరుడైన పౌలు, రోమా అధిపతియైన ఫేలిక్సు ముందు తన వాదనను విన్నవించుకున్నాడు. యూదులు పౌలుమీద మోపిన నిందలకు ఏ ఆధారం చూపించలేకపోయారు. ఫేస్తు అనే మరో అధిపతి తనను యూదులకు అప్పగించకూడదని పౌలు, “కైసరు ఎదుటనే చెప్పుకొందును” అని అన్నాడు. దానికి ఫేస్తు “కైసరునొద్దకే పోవుదువు” అని చెప్పాడు.—అపొస్తలుల కార్యములు 25:11-13.
అప్పుడు పౌలును విచారణ కోసం ఒక ఓడలో ఇటలీకి తీసుకెళ్లారు. మార్గం మధ్యలో ఓడ బద్దలైపోవడంతో పౌలు శీతాకాలమంతా మెలితే ద్వీపంలో గడపాల్సి వచ్చింది. చివరకు, ఆయన రోము చేరుకున్నాక, అక్కడ ఆయన రెండు సంవత్సరాలపాటు ఒక అద్దె ఇంట్లో ఉన్నాడు. సైనికుల కాపలాలోవున్నా తనను చూడ్డానికి వచ్చిన వాళ్లకి ఆయన ఎప్పుడూ ఉత్సాహంగా దేవుని రాజ్యం గురించి ప్రకటించేవాడు.