అధ్యాయం 16
నలుగురు గుఱ్ఱపురౌతుల స్వారి!
దర్శనము 3—ప్రకటన 6:1-17
అంశం: నలుగురు గుఱ్ఱపురౌతుల స్వారి, బలిపీఠం క్రిందనున్న హతసాక్షులు, మరియు మహా ఉగ్రతదినము
నెరవేర్పు కాలం: గత 1914 నుండి యీ విధాన నాశనం వరకు
1. యేసు విప్పే ముద్రల్లోని మర్మాలను యెహోవా యోహానుకు ఎలా బయల్పరస్తున్నాడు?
ఈ క్లిష్ట కాలంలో, “త్వరలో సంభవింపనైయున్న” వాటి విషయంలో మనం అత్యంత ఆసక్తి చూపవద్దా? నిశ్చయంగా చూపాలి, ఎందుకంటే మనమూ అందులో యిమిడి యున్నాం! గనుక యేసు ఆ గ్రంథపు చుట్టను విప్పడానికి సిద్ధపడుతుండగా మనమిప్పుడు యోహానుతో కలిసి వెళ్దాం. ఇక్కడ గమనించదగిందేమంటే, యోహాను దాన్ని చదవనక్కర్లేదు. ఎందుకు? ఎందుకంటే, అందులోని విషయాలు ఆయనకు బలమైన చురుకైన దృశ్యాల పరంపరల ద్వారా “దర్శనముల” రూపంలో చూపించ బడుతున్నాయి.—ప్రకటన 1:1, 10.
2. (ఎ) యోహాను ఏం చూస్తున్నాడు, ఏం వింటున్నాడు, మరి కెరూబు దేనిని సూచిస్తుంది? (బి) మొదటి కెరూబు ఆజ్ఞ ఎవరినుద్దేశించి యివ్వబడింది, అలాగని నీవెలా సమధానమీయగలవు?
2 యేసు గ్రంథపు చుట్టలోని మొదటి ముద్రను విప్పుతుండగా యోహాను చెప్పే విషయాన్ని వినండి: “ఆ గొఱ్ఱెపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటిదానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి—రమ్ము అని ఉరుమువంటి స్వరముతో చెప్పుట వింటిని.” (ప్రకటన 6:1) ఇది మొదటి కెరూబు స్వరం. సింహంవంటి దాని స్వరూపం, యెహోవాసంస్థ ఆయన నీతితీర్పులను ధైర్యంగా తీర్చునని యోహానుకు సూచిస్తుంది. మరి ఆ యాజ్ఞ ఎవరికివ్వబడింది? యోహానుకు మాత్రం కాదు. ఎందుకంటే, యీ ప్రవచనార్థక దర్శనాల్లో భాగం వహించమని యోహాను ముందే ఆహ్వానించబడ్డాడు. (ప్రకటన 4:1) నాలుగు ఉపఖ్యానాల పరంపరలో మొదటిదానియందు పాల్గొనాలని ఆ “ఉరుమువంటి స్వరము” యితరులను పిలుస్తోంది.
తెల్లనిగుఱ్ఱం దాని ప్రసిద్ధిచెందిన రౌతు
3. (ఎ) ఇప్పుడు యోహాను దేనిని వివరిస్తున్నాడు? (బి) బైబిల్లోని సాదృశ్యముల కనుగుణంగా, తెల్లనిగుఱ్ఱం దేనిని సూచిస్తుంది?
3 యోహాను, ఆయనతోపాటు ఆసక్తిగల యోహాను తరగతి మరియు వారి యీనాటి సహచరులు వేగంతో నడుస్తున్న నాటకాన్ని చూచే ఆధిక్యత కల్గివున్నారు. యోహాను యిలా చెబుతున్నాడు: “మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లనిగుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండియుండెను. అతనికి ఒక కిరీటమియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలు వెళ్లెను.” (ప్రకటన 6:2) అవును, “రమ్ము” అనే ఉరుమువంటి పిలుపుకు జవాబుగా ఒక తెల్లని గుఱ్ఱము బయలు వెళ్తుంది. బైబిల్లో గుఱ్ఱం తరచూ యుద్ధాన్ని సూచిస్తుంది. (కీర్తన 20:7; సామెతలు 21:31; యెషయా 31:1) ఈ గుఱ్ఱం, అందమైన మగ గుఱ్ఱంవలె, తెల్లగా మెరుస్తోంది, తెలుపురంగు మచ్చలేని పరిశుద్ధతకు సూచన. (ప్రకటన 1:14; 4:4; 7:9; 20:11 పోల్చండి.) ఇదెంత యుక్తమైవుంది, ఎందుచేతంటే, యెహోవా పరిశుద్ధమైన దృష్టిలో జరిగే నీతియుక్తమైన యుద్ధాన్నిగూర్చి అది వివరిస్తోంది.—ప్రకటన 19:11, 14 కూడ చూడండి.
4. తెల్లనిగుఱ్ఱపు రౌతు ఎవరు? వివరించండి.
4 ఈ గుఱ్ఱపు రౌతు ఎవరు? ఆయన చేతిలో విల్లు అనే యుద్ధాయుధం ఒకటుంది, ఆయనకు కిరీటంకూడా యివ్వబడింది. ప్రభువు దినములో కిరీటాలు ధరించిన నీతిమంతుల్లో యేసు మరియు 24 మంది పెద్దలను సూచించేవారు మాత్రమే ఉన్నారు. (దానియేలు 7:13, 14, 27; లూకా 1:31-33; ప్రకటన 4:4, 10; 14:14)a ఆ 24 పెద్దలగుంపులోని ఒకడు వ్యక్తిగతంగా తన గొప్పతనంకొద్దీ కిరీటం పొందుతున్నట్లు చూపించబడతాడనేది అసంభవం. కాబట్టి, ఈ గుఱ్ఱపురౌతు యేసుక్రీస్తే గాని మరెవ్వరూ కాదు. ఆ చారిత్రాత్మక సంఘటన జరిగిన 1914 లో యెహోవా “నేను . . . నా రాజును ఆసీనునిగా చేసియున్నాను,” ఆయనతో “జనములను నీకు స్వాస్థ్యముగా” చేస్తానని చెప్పినపుడు, యోహాను పరలోకమందు ఆయనను ఆ సమయంలో చూస్తాడు. (కీర్తన 2:6-8)b అలా యేసు మొదటి ముద్రను విప్పుతూ, నూతనంగా కిరీటధారియైన రాజుగా తానెలావున్నాడో, దేవుని నియమిత కాలంలో యుద్ధం చేయడానికెలా సిద్ధంగా వున్నాడో బయలుపర్చుకుంటున్నాడు.
5. కీర్తనల రచయిత రౌతును ఎలా ప్రకటన 6:2 లోమాదిరే వర్ణిస్తున్నాడు?
5 ఈ దృశ్యం, యెహోవా నియమించిన రాజు నుద్దేశించి కీర్తన 45:4-7 నందు వ్రాయబడినదానితో చక్కగా సరిపోతుంది: “సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలు దేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైనవాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీచేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించు చున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి యున్నాడు.” యోహానుకు ఆ ప్రవచన వివరణతో పరిచయ మున్నందువల్ల, రాజుగా యేసు నిర్వహించే పనికి అది వర్తిస్తుందని ఆయన అభినందిస్తాడు.—హెబ్రీయులు 1:1, 2, 8, 9 పోల్చండి.
జయిస్తూ వెళ్లుట
6. (ఎ) ఆ రౌతు ఎందుకు గెలుస్తూనే వెళ్తుండాలి? (బి) ఏయే సంవత్సరాల్లో యీ రౌతు గెలుపు కొనసాగుతూ వుంటుంది?
6 మరి క్రొత్తగా కిరీటధారియైన రాజెందుకు యుద్ధానికి బయలు దేరాలి? ఎందుకంటే, ఆయన రాజ్యం యెహోవాకు ప్రధాన శత్రువైన అపవాదియగు సాతాను మరియు తెలిసో తెలియకో సాతానును సేవించే భూప్రజల వ్యతిరేకత మధ్య స్థాపించబడింది. పరలోకంలో రాజ్యస్థాపనే ఓ పెద్ద యుద్ధానికి దారితీస్తుంది. మిఖాయేలు (అంటే “దేవుని పోలిన వారెవరు?”) అనే నామమున, యేసు సాతానును అతని దయ్యాలను గెలిచి, వారిని భూలోకానికి పడద్రోస్తాడు. (ప్రకటన 12:7-12) భూమ్మీద జనాంగములు, ప్రజలు తీర్పుపొందుతూ, గొర్రెలాంటి మానవులు రక్షణార్థమై రాజుపక్షాన సమకూర్చ బడుతుండగా, ప్రభువు దినపు ప్రారంభ దశాబ్దములలో కూడ యేసు విజయోత్సవం కొనసాగుతూనే వుంది. లోకమంతా యింకనూ “దుష్టుని యందున్న”ప్పటికీ, యేసు ప్రేమతో తన అభిషక్త సహోదరులను, వారి సహచరులను కాయుచూ, ప్రతివారు విశ్వాస విజయాన్ని పొందడానికి సహాయం చేస్తూనేవున్నాడు.—1 యోహాను 5:19; మత్తయి 25:31-33.
7. ప్రభువు దినములోని ప్రథమ దశాబ్దాల్లో యేసు యీ భూమ్మీద ఏమేమి గెలుస్తాడు, మరి మన తీర్మానమేమై ఉండాలి?
7 ప్రభువు దినములోని గత 70 కంటె ఎక్కువ సంవత్సరాల్లో యేసు ఏ యితర విజయాలు సాధించాడు? భూలోకమంతా, యెహోవా ప్రజలు వ్యక్తిగతంగాను, సంఘంగాను అపొస్తలుడైన పౌలు తన పరిచర్యకు రుజువుగా చూపిస్తూ వర్ణించిన అనేక శ్రమల్ని, హింసల్ని, కష్టాలను అనుభవించారు. (2 కొరింథీయులు 11:23-28) యెహోవాసాక్షులకు ‘సాధారణమైన దానికన్న అధిక శక్తి’ అవసరమైయుండెను, ముఖ్యంగా యుద్ధం, దౌర్జన్యం జరిగే సమయంలో సహించడానికి శక్తి అవసరం. (2 కొరింథీయులు 4:7) అయితే అత్యంత బాధల్లోకూడ, నమ్మకమైన సాక్షులు పౌలు చెప్పినట్లే చెప్పగలుగు తున్నారు: “నాద్వారా సువార్త పరిపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను.” (2 తిమోతి 4:17) అవును, యేసు వారినిమిత్తం జయించాడు. మనం మన విశ్వాస పోరాటాన్ని పూర్తిచేయడానికి నిర్ణయించు కున్నంత కాలం ఆయన మనపక్షంగా విజయం సాధిస్తూనే వుంటాడు.—1 యోహాను 5:4.
8, 9. (ఎ) ఏ విజయాలలో యెహోవాసాక్షుల భూవ్యాప్త సంఘం భాగం వహించింది? (బి) యెహోవాసాక్షుల అభివృద్ధి నిజంగా ఏ రంగంలో ప్రముఖంగా కనబడుతుంది?
8 జయిస్తున్న రాజు నడిపింపు క్రింద భూవ్యాప్తంగానున్న యెహోవాసాక్షుల సంఘం అనేక విజయాల్లో పాలుపంచుకున్నది. విశేషంగా, 1918 లో వారు సాతాను రాజకీయ సంస్థద్వారా తాత్కాలికంగా ‘జయింపబడినప్పుడు’ యీ బైబిలు విద్యార్థులు నిర్మూలం కాకుండా ఆయన వారిని కాపాడాడు. అయితే 1919 లో వారిని విడుదల చేయడానికి ఆయన జైలు సంకెళ్లను తెంచాడు, ఆ పిదప “భూదిగంతములవరకు” సువార్త ప్రకటించేలా ఆయన వారిని బలపరచాడు.—ప్రకటన 13:7; అపొస్తలుల కార్యములు 1:8.
9 రెండవ ప్రపంచ యుద్ధానికి ముందును ఆ తర్వాతను, నియంతల పాలనా యంత్రాంగాలు అనేక దేశాల్లో యెహోవాసాక్షులను మట్టుపెట్టాలని ప్రయత్నించాయి, ముఖ్యంగా మతనాయకులు, ప్రత్యేకంగా రోమన్ కాథోలిక్ మతగురువులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో యీ నియంతల కొమ్ము కాసి మద్దతు తెలిపిన దేశాల్లో అలాంటి ప్రయత్నాలు జరిగాయి. అయితే, యుద్ధం ప్రారంభమైన 1939వ సంవత్సరంలో సువార్త ప్రకటించే 71,509 మంది సాక్షులు యుద్ధం ముగిసిన 1945వ సంవత్సరానికి 1,41,606 మంది అయ్యారు, మరోవైపు 10,000 మందికిపైగా జైళ్లలోనూ కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లోను దీర్ఘకాలంగా గడిపారు, వేలాదిమంది యితరులు చంపబడ్డారు. భూవ్యాప్తంగా చురుకైన సాక్షులు యీనాడు నలభైలక్షలు దాటారు. విపరీతంగా హింసలుకల్గిన దేశాల్లోను, కాథోలిక్ దేశాల్లోను, అంటే జర్మనీ, ఇటలీ, మరియు జపాన్వంటి దేశాల్లో అభివృద్ధి గణనీయంగావుంది. ఇక్కడ ప్రతిదేశంలోను 1,00,000 కంటె ఎక్కువమంది చురుకుగా సేవచేసేవారిప్పుడు రిపోర్టు చేస్తున్నారు.—యెషయా 54:17; యిర్మీయా 1:17-19.
10. గెలుస్తూన్న రాజు తన ప్రజలను “సువార్త పక్షమున వాదించుటయందును, దానిని స్థిరపరచుటయందును” ఏయే విజయాల ననుగ్రహించాడు?
10 జయిస్తూనేవున్న మనరాజు తన ఆసక్తిగల ప్రజలను న్యాయస్థానాల్లోను, పరిపాలకుల యెదుటను “సువార్త పక్షమున వాదించుటయందును దానిని స్థిరపరచుటయందును” అనేక విజయాల ననుగ్రహిస్తూ వారినాశీర్వదించాడు. (ఫిలిప్పీయులు 1:7; మత్తయి 10:18; 24:9) అంతర్జాతీయంగా—ఆస్ట్రేలియా, అర్జెంటీనా, కెనడా, గ్రీస్, ఇండియా, స్వాజిలాండ్, స్విట్జర్లాండ్, టర్కీ, మరితర దేశాల్లోనూ యిలాంటి విజయాలు లభించాయి. అమెరికాలో యెహోవాసాక్షులు సుప్రీంకోర్టులో గెలిచిన 23 కేసుల్లో “బహిరంగముగాను ఇంటింటను,” సువార్త ప్రకటించుకునే హక్కు మరియు విగ్రహారాధనయగు జాతీయతాచరణలలో పాల్గొనకుండా ఉండేవి యిమిడివున్నాయి. (అపొస్తలుల కార్యములు 5:42; 20:20; 1 కొరింథీయులు 10:14) అలా, భూవ్యాప్త సాక్ష్యపు విస్తరణకు మార్గం సుగమమయ్యింది.
11. (ఎ) రౌతు ఎలా “జయించుచు జయించుటకు” బయలు వెళ్తాడు? (బి) రెండు, మూడు, నాలుగు ముద్రలు విప్పబడడం మనపై ఎటువంటి ప్రభావం కల్గివుంది?
11 యేసు “జయించుటను” ఎలా ముగిస్తాడు?c మనం గమనించనై యున్నట్లు ఆయన దీన్ని, యెహోవా సర్వాధిపత్యాన్ని రుజువు చేయడానికి అబద్ధమతాన్ని తీసివేసి ఆ పిదప సాతానుయొక్క దృశ్యమైన సంస్థలో మిగిలిన ప్రతి చిన్న భాగాన్ని సాదృశ్యమైన “అగ్నిగుండములో” పడవేయడం ద్వారా నెరవేరుస్తాడు. మన “రాజులకు రాజు” అర్మగిద్దోనులో సాతానుయొక్క క్రూరమైన రాజకీయ సంస్థలపై అంతిమ విజయం సాధించే ఆ దినంకొరకు మనం దృఢనమ్మకంతో నిరీక్షిద్దాం. (ప్రకటన 16:16; 17:14; 19:2, 14-21; యెహెజ్కేలు 25:17) ఈమధ్యలో తెల్లని గుఱ్ఱంమీద నున్న యీ జయశాలి, యెహోవా తన నీతిపరులైన భూలోక జనాంగానికి యథార్థపరులను కలుపుతూ వుండగా, తాను స్వారీ చేస్తూనే వుంటాడు. (యెషయా 26:2; 60:22) సంతోషభరితమైన రాజ్య విస్తరణలో అభిషక్తులైన యోహాను తరగతితో మీరును భాగం వహిస్తున్నారా? అలాగైతే, తర్వాతి మూడు ముద్రలను విప్పినప్పుడు అపొస్తలుడైన యోహాను ఏమి చూస్తాడో అది మిమ్మల్ని యీనాడు యెహోవా సేవలో ఎక్కువభాగం వహించులాగున నిశ్చయంగా పురికొల్పుతుంది.
అదిగో, ఎర్రనిగుఱ్ఱము!
12. రాజుగా తన అదృశ్య ప్రత్యక్షతా సూచననుగూర్చి యేసు ఏం చెప్పాడు?
12 భూమ్మీద యేసు పరిచర్య చివరి భాగంలో, శిష్యులాయన ఏకాంతంగా ఉన్నప్పుడిలా అడిగారు: “నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి?” దానికి సమాధానంగా అయన “వేదనలకు ప్రారంభము” కాబోయే ఆపదలనుగూర్చి ప్రవచించాడు. యేసు యిలా అన్నాడు: “జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును, కరవులును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాతములును గొప్ప సూచనలును పుట్టును.” (మత్తయి 24:3, 7, 8; లూకా 21:10, 11) మిగతా ముద్రలు విప్పబడినప్పుడు యోహాను చూసేవి ఆ ప్రవచనానికి ప్రముఖమైన సమాంతరాన్నిస్తున్నాయి. మహిమనొందిన యేసు రెండో ముద్రను విప్పుతున్నాడు చూడండి!
13. యోహానుకు ఏ తారతమ్యం స్పష్టంగా కనబడనైవుంది?
13 “ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు—రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని.” (ప్రకటన 6:3) ఆయాజ్ఞ యిచ్చింది దూడవంటి ఆకారంగల రెండవ కెరూబే. ఇక్కడ శక్తియనే లక్షణం సూచించబడింది, ఆ శక్తి న్యాయంగా ఉపయోగించబడింది. మరైతే యోహాను యిక్కడ దాన్ని భయంకరమైన మరణకరమగు శక్తిగా చూస్తున్నాడు.
14. తదుపరి యోహాను ఏ గుఱ్ఱపు రౌతును చూస్తాడు, ఈ దర్శనం దేనిని సూచిస్తుంది?
14 మరైతే, “రమ్ము” అని జారీచేయబడిన యీ రెండవ ఆజ్ఞకు సమాధానమెలా వచ్చింది? ఇలా వచ్చింది: “అప్పుడు ఎఱ్ఱనిదైన వేరొక గుఱ్ఱము బయలువెళ్లెను; మనుష్యులు ఒకని ఒకడు చంపుకొనునట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుఱ్ఱముమీద కూర్చున్నవానికి అధికార మియ్యబడెను; మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను.” (ప్రకటన 6:4) నిజంగా భయంకరమైన దర్శనమే! అది దేన్ని సూచిస్తుందనే విషయంలో సందేహమేమీలేదు, యుద్ధమే! అది జయిస్తున్న యెహోవా పక్షపురాజు కాదుగానీ అనవసరంగా రక్తాన్నొలికించే, బాధాకరమగు, క్రూరమైన, మానవ-నిర్మిత అంతర్జాతీయ యుద్ధమే. మరి యీ రౌతు ఎఱ్ఱని గుఱ్ఱాన్నెక్కాడనేది ఎంత యుక్తంగావుంది!
15. రెండవరౌతు స్వారిలో మనమెందుకు భాగం వహించడానికి కోరుకో కూడదు?
15 నిశ్చయంగా, యీ గుఱ్ఱపు రౌతుతోగాని అతని పరుగుతోగాని యోహాను కెటువంటి భాగంలేదు, ఎందుకంటె దేవుని ప్రజలనుగూర్చి యిలా ప్రవచింపబడింది: “యుద్ధంచేయ నేర్చుకొనుట యిక మానివేయును.” (యెషయా 2:4) ఇంకనూ “లోకములో” ఉన్నప్పటికిని యోహాను, యింకా చెప్పాలంటే యోహాను తరగతికి చెందినవారు, వారి సహచరులైన గొప్ప సమూహము యీనాడు రక్తపు మరకలతో నిండిన యిహలోక “సంబంధులుకారు.” మన యుద్ధోపకరణాలు ఆత్మీయమైనవి మరియు శరీరసంబంధ యుద్ధంగాక, సత్యాన్ని చురుకుగా ప్రకటించేందుకే అవి ‘దేవుని బలము కలిగియున్నవి.’—యోహాను 17:11, 14; 2 కొరింథీయులు 10:3, 4.
16. ఎఱ్ఱని గుఱ్ఱపురౌతుకు ఎప్పుడు ఎలా “ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను”?
16 తెల్లనిగుఱ్ఱంమీద కూర్చున్నవాడు కిరీటం పొందక ముందున్న 1914వ సంవత్సరానికి ముందు అనేక యుద్ధాలు జరిగాయి. అయితే ఆ ఎఱ్ఱని గుఱ్ఱంమీద కూర్చున్న వానికిప్పుడు “ఒక పెద్దఖడ్గ” మియ్యబడింది. ఇది దేన్ని సూచిస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధారంభంతో మానవ యుద్ధాలు మునుపటికంటే ఎక్కువ రక్తపాతంతోను, నాశనకరంగాను తయారయ్యాయి. మరి 1914-18 మధ్యకాలంలో జరిగిన రక్తపాతంలో, ట్యాంకులు, విషవాయువు, విమానాలు, జలాంతర్గాములు, పెద్దపెద్ద ఫిరంగులు, యింకా ఆటోమేటిక్ ఆయుధాలు తొలిసారిగా లేక ఎన్నడూలేనంతగా ఉపయోగించబడ్డాయి. మరి 28 దేశాల్లోనైతే, సైనికులేగాక జనాభామొత్తం యుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనడానికి బలవంత పెట్టబడింది. మృతులసంఖ్య భయంకరంగా ఉండేది. తొంభైలక్షలకంటె ఎక్కువమంది సైనికులు హతమార్చబడ్డారు, ఇక పౌరుల మరణాలు అసంఖ్యాకములు. యుద్ధానంతరం కూడ భూమ్మీదికి నిజమైన శాంతి తిరిగి రాలేదు. ఆ యుద్ధానంతరం 50 కంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత జర్మన్ రాజకీయవేత్త కోన్రాడ్ అడినార్ యిలా వ్యాఖ్యానించాడు: ఆ “1914నుండి మానవ జీవితాల్లో శాంతిభద్రతలు మటుమాయమయ్యాయి.” నిజంగా, ఎఱ్ఱనిగుఱ్ఱం మీద కూర్చున్నవానికి భూమ్మీద సమాధానం తీసివేసే అధికారమివ్వబడింది.
17. మొదటి ప్రపంచ యుద్ధానంతరం కూడ, ఆ “పెద్ద ఖడ్గం” ఎలా ఉపయోగించ బడుతూనే వున్నది?
17 రక్తదాహాన్ని రుచిచూచిన పిదప, ఆ ఎఱ్ఱనిగుఱ్ఱం మీద కూర్చున్నవాడు రెండవ ప్రపంచ యుద్ధానికి దూకాడు. మారణాయుధాలు మరీ పాశవికంగా మారాయి, మరి మృతుల సంఖ్యయితే మొదటి ప్రపంచ యుద్ధంకంటె నాలుగురెట్లు ఆకాశాన్నంటింది. జపాన్మీద 1945 సంవత్సరంలో రెండు ఆటంబాంబులు పేలి, ఒక్కోక్కటి వేలాదిమందిని హతమార్చి వినాశనాన్ని సృష్టించాయి. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో, యీ ఎఱ్ఱని గుఱ్ఱమెక్కిన వాడు సుమారు 5 కోట్ల 50 లక్షల ప్రాణాలను బలిగొన్ననూ వానికింకా తనివి తీరలేదు. మరి 2వ ప్రపంచ యుద్ధంనుండి ఆ “పెద్ద ఖడ్గము” క్రింద కనీసం 1 కోటి 90 లక్షలమంది హతులయ్యారని విశ్వసనీయంగా తెలిసింది.
18, 19. (ఎ) రెండవ ప్రపంచ యుద్ధంనుండి జరుగుతున్న మారణహోమం సైనిక సాంకేతిక పరిజ్ఞానానికిగాక దేనికి ఒక సాక్ష్యంగా నిల్చింది? (బి) మానవజాతికి ఏ అపాయం ముంచుకొస్తుంది, అయితే తెల్లని గుఱ్ఱపురౌతు దాన్నెలా అడ్డుకుంటాడు?
18 ఇది సైనిక సాంకేతిక జ్ఞానానికి విజయకేతనమని అనదగునా? కాదుగానీ నిర్దాక్షిణ్యతగల ఆ ఎఱ్ఱనిగుఱ్ఱం దూకుతుందనేదానికది నిదర్శనం. మరి ఆ దూకుడు ఎక్కడంతమౌతుంది? కొందరు విజ్ఞానశాస్త్రజ్ఞులు వారి గణాంకాల ప్రకారం జోస్యంచెప్పేదేమంటే, పథకం ప్రకారంవచ్చే పోరాటాన్నటుంచి—రాబోవు 25 సంవత్సరాల్లో ఆకస్మిక అణుయుద్ధమొకటి అనివార్యం. అయితే, తెల్లని గుఱ్ఱమెక్కిన జయశాలికి యీ విషయంలో వేరే తలంపులున్నాయి.
19 మానవ సమాజం జాత్యహంకారం, ద్వేషంతో నిండుకొని వున్నంతకాలం మానవజాతి అణువిపత్తు అంచుమీద అలా కూర్చొని ఉండవలసిందే. దిక్కుతోచని స్థితిలో దేశాలు తమ అణుశక్తినంతా నిర్వీర్యంచేసినా, వాటిని తయారుచేసే సాంకేతిక పద్ధతిని యింకా తమవద్దనే దాచుకుంటాయి. స్వల్ప వ్యవధిలోనే, అవి వాటికవసరమైన మరణకరమగు అణ్వస్త్రాలను మరలా తయారు చేసికోగలవు; గనుక యీ మారణాయుధాలతో కూడిన ఎటువంటి యుద్ధమైనా తక్షణ మారణహూమాన్ని సృష్టించగలదు. ఈ ఎఱ్ఱనిగుఱ్ఱపు రౌతు పెడుతున్న పైశాచిక పరుగునకు తెల్లనిగుఱ్ఱపు రౌతు కళ్లెం వేయకపోతే—అవును అడ్డుకట్ట వేయకపోతే, యీనాడు రాజ్యాల నేలుతున్న అహంకార ద్వేషాగ్ని జ్వాలల్లో మానవజాతి తప్పక ఆత్మాహుతై పోవలసిందే. అటు సాతాను నడిపింపు క్రిందనున్న లోకంపై విజయం సాధించడానికీ, ఇటు యీ ఉన్మాదకాలాల్లోని అణు నిరాయుధీకరణా చంచల స్వభావులకు ఎంతో, ఎంతో భిన్నంగానున్న శాంతినాశించే ఓ శక్తిమీద—దేవునియెడల, పొరుగువారి యెడలగల ప్రేమమీద—అవును అటువంటి ప్రేమమీద నిర్మించబడిన ఒక నూతన మానవ సమాజాన్ని స్థాపించడానికి క్రీస్తురాజు రౌతుగా బయలువెళ్తాడని మనం దృఢనమ్మకం కల్గివుందాము.—కీర్తన 37:9-11; మార్కు 12:29-31; ప్రకటన 21:1-5.
ఒక నల్లని గుఱ్ఱం ముందుకు లంఘించుట
20. తెల్లని గుఱ్ఱపురౌతు ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొంటాడని మనకే అభయముంది?
20 యేసు యిప్పుడు మూడవ ముద్రను విప్పుతాడు! యోహానూ మీరేం చూస్తున్నారు? “ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు—రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని.” (ప్రకటన 6:5ఎ) ఈ మూడవ కెరూబు ప్రేమ అనే లక్షణాన్ని సూచించే “మనుష్యుని ముఖమువంటి ముఖము గలది.” నియమబద్ధమైన ప్రేమయనే ఆ శ్రేష్ఠమైన లక్షణం యీనాడు యెహోవా సంస్థలో ఉన్నట్లే, అది దేవుని నూతన లోకంలోనూ విస్తారంగా వుంటుంది. (ప్రకటన 4:7; 1 యోహాను 4:16) దేవుడు “తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండ” వలసిన తెల్లని గుఱ్ఱపురౌతు, ఆ పిదప యోహాను పరిశీలనకు తేబడిన విపతర పరిస్థితిని ప్రేమపూర్వకంగా తొలగిస్తాడని మనం నిశ్చయతకల్గి వుండవచ్చును.—1 కొరింథీయులు 15:25.
21. (ఎ) నల్లనిగుఱ్ఱం, దానిరౌతు దేనిని సూచిస్తుంది? (బి) నల్లనిగుఱ్ఱం యింకా నాశనాన్ని కొనసాగిస్తున్నట్లు ఏది రుజువుచేస్తుంది?
21 మూడవ జీవి “రమ్ము” అన్న పిలుపుకు సమాధానంగా యోహాను ఏమి చూశాడు? “నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు త్రాసుచేత పట్టుకొని కూర్చుండి యుండెను.” (ప్రకటన 6:5బి) డొక్కల కరవు! ఈ ప్రవచనార్థక దృశ్యంయొక్క అసలు సమాచారమదే. ప్రభువు దినము తొలిభాగంలో ఆహారం త్రాసుల్లో తూకంవేసి పంచవలసిన పరిస్థితులను గూర్చి అది సూచిస్తోంది. మరి 1914 నుండి ప్రపంచం కరవుకోరల్లో చిక్కుకునేవుంది. ఆధునిక యుద్ధం కరవుకు ఊపునిస్తుంది, ఎందుకంటె, ఆకలితో అలమటిస్తున్న వారికిచ్చే ఆహారాన్ని సరఫరా చేసేందు కుపయోగించే వనరులన్నీ తరచూ యుద్ధోపకరణాలను సరఫరా చేయడానికి ఉపయోగించ బడుతున్నాయి. వ్యవసాయదారులను బలవంతంగా సైన్యంలోకి యీడ్చుకుపోతున్నారు, మరి యుద్ధంవల్ల దెబ్బతిన్న పొలాలు, కాలిన భూములు ఆహారోత్పత్తిని తగ్గిస్తాయి. లక్షలాదిమంది ఆకలికి అలమటించి చనిపోయిన మొదటి ప్రపంచయుద్ధ కాలంలో యిదెంత సత్యమై ఉండెనో! అంతేగాక, ఆకలిగొన్న నల్లనిగుఱ్ఱం ఆ యుద్ధం తర్వాత అంతటితో ఆగలేదు. ఉక్రేయిన్లోనే, 1930 దశాబ్దంలో, కేవలం ఒకేసారి వచ్చిన కరవుకు యాభైలక్షలమంది బలైపోయారు. రెండవ ప్రపంచయుద్ధం మరింత ఆహారకొరతను తెచ్చింది. నల్లనిగుఱ్ఱమింకను లంఘిస్తుండగా, 1987 మధ్యకాలంలో 51 కోట్ల 20 లక్షలమంది క్షుద్భాధకు గురయ్యారని, ప్రతిరోజు 40,000 మంది పిల్లలు ఆహారకొరత మూలంగా మరణించారని ప్రపంచ ఆహార సమాఖ్య నివేదించింది.
22. (ఎ) ఒక స్వరం ఏం చెబుతుంది, ఏ అవసరతను తెల్పుతుంది? (బి) ఒక సేరు గోధుమలు, మూడు సేర్ల యవలు అంటే అర్థమేమిటి?
22 యోహాను మనకింకా యిలా తెల్పుతున్నాడు: “మరియు—దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడుచేయవద్దనియు, ఆ నాలుగు జీవులమధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను.” (ప్రకటన 6:6) సా.శ.పూ.607 లో యెరూషలేము నాశనానికి ముందు ప్రజలు “తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజించినట్లే” ఆహార సరఫరా సక్రమంగా జరుగులాగున బహు జాగ్రత్త వహించే అవసరతను తెలియజేయడంలో ఆ నాలుగు జీవులు ఏకమయ్యాయి. (యెహెజ్కేలు 4:16) యోహాను కాలంలో సేరు గోధుమలు ఒక సైనికుని దినభత్యంగా పరిగణించబడేవి. మరి ఆ భత్యం ధరెంత? ఒక దేనారం—అంటే ఒకరోజు భత్యం! (మత్తయి 20:2)d మరి కుటుంబముంటే ఏం చేసేవాడు? అప్పుడు, మూడు సేర్ల మెరుగుపెట్టని యవలు కొనేవాడు. అదికూడ ఓ చిన్న కుటుంబానికే సరిపోయేది. మరి యవలు గోధుమలంత మంచి ఆహారంగా లెక్కించబడేవి కావు.
23. “నూనెను ద్రాక్షారసమును పాడుచేయవద్దు” అనుటలో ఏ భావం యిమిడివుంది?
23 “నూనెను ద్రాక్షారసమును పాడుచేయవద్దు” అనే మాట అర్థమేమిటి? అనేకులను ఆహారకొరత, క్షామం సహితం పీడిస్తుండగా, ధనసంపన్నుల కెటువంటి హానిజరగదని కొందరభిప్రాయపడ్డారు. అయితే మధ్యప్రాశ్చ్యంలో నూనె ద్రాక్షారసం నిజంగా విలాసవంతమైన వస్తువులేమీ కావు. బైబిలు కాలంలో రొట్టె, నూనె, ద్రాక్షారసం మామూలు ఆహారపదార్థాలే. (ఆదికాండము 14:18; కీర్తన 104:14, 15 పోల్చండి.) నీళ్లు ఎల్లవేళలా బాగుండేవికావు, గనుక ద్రాక్షారసాన్ని మంచినీళ్లగాను, మందుగాను ఉపయోగించేవారు. (1 తిమోతి 5:23) ఇక నూనె విషయానికొస్తే, ఏలీయా కాలంలో సారెపతులోని విధవరాలు బీదరాలైననూ మిగిలిన రొట్టెలు చేయడానికి యింకనూ ఆమెయొద్ద కొంతనూనె వుండెను. (1 రాజులు 17:12) గనుక, “నూనెను ద్రాక్షారసమును పాడుచేయవద్దు” అనడంలో యీ నిత్యావసర వస్తువుల్ని అంతత్వరగా వాడవద్దని, జాగ్రత్తగా వాడాలనే సలహా యిస్తున్నట్లు కనబడుతుంది. లేకపోతే, అవి పాడైపోతాయి, అంటే క్షామానికంటె ముందే అయిపోతాయని అర్థము.
24. నల్లని గుఱ్ఱం ఎందుకు ఎక్కువకాలం దాని దాడిని కొనసాగించదు?
24 తెల్లనిగుఱ్ఱపు రౌతు త్వరలో ఆ నల్లనిగుఱ్ఱపు రౌతుకు పగ్గం వేస్తాడంటే మనమెంత సంతోషంగా ఉండాలి! ఎందుకంటే, నూతనలోకం నిమిత్తం ఆయన చేయనైయున్న ప్రేమగల ఏర్పాటునుగూర్చి యీలా వ్రాయబడింది: “అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును. . . . దేశములోను పర్వత శిఖరముల మీదను సస్యసమృద్ధి కలుగును.”—కీర్తన 72:7, 16; అలాగే యెషయా 25:6-8 కూడ చూడండి.
పాండురవర్ణ గుఱ్ఱం, దానిరౌతు
25. యేసు నాల్గవ ముద్రను విప్పినప్పుడు, యోహాను ఎవరి స్వరం వింటాడు, యిది దేన్ని సూచిస్తుంది?
25 కథ యింకా పూర్తికాలేదు. యేసు నాల్గవ ముద్ర విప్పుతాడు, యోహాను దాని ఫలితాన్నిలా మనకు తెల్పుతున్నాడు: “ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు—రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని.” (ప్రకటన 6:7) పక్షిరాజును పోలిన కెరూబు శబ్దమే యిది. ఇక్కడ దీర్ఘదృష్టిగల జ్ఞానాన్నిది సూచిస్తుంది, మరి నిజానికి యోహాను, యోహాను తరగతికి చెందిన వారు, దేవుని భూసంబంధులైన యితర సేవకులు యిచ్చట వివరించబడిన విషయాన్ని పరిశీలించి దానికి తగినట్లు మసలుకోవాల్సిన అవసరముంది. అలాచేయడంవల్ల, యీనాటి అహంకార, అవినీతికరమగు తరంలోని లోకజ్ఞానుల తెగులునుండి కొంతవరకు మనం కాపాడబడవచ్చు.—1 కొరింథీయులు 1:20, 21.
26. (ఎ) నాల్గవ గుఱ్ఱపు రౌతు ఎవరు, అతని గుఱ్ఱం రంగెందుకు తగినదై యున్నది? (బి) నాల్గవరౌతును వెంబడించే దేమిటి, దానికి బలైన వారికేమౌతుంది?
26 మరి నాల్గవ రౌతు పిలుపును వినగా ఏయే క్రొత్త భయంకర కృత్యాలు బయటపడ్డాయి? యోహాను మనకిలా తెల్పుతున్నాడు: “అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణముగల ఒక గుఱ్ఱము కనబడెను, దానిమీద కూర్చున్నవాని పేరు మృత్యువు. పాతాళలోకము (హేడీస్ NW) వానిని వెంబడించెను.” (ప్రకటన 6:8ఎ) ఈ చివరి గుఱ్ఱపు రౌతుకు ఒక పేరుంది: మృత్యువు. అతడొక్కడే ప్రకటనలో తన పేరును బహిరంగంగా చెప్పుకున్నాడు. పాండుర వర్ణంగల గుఱ్ఱంమీద మృత్యువు స్వారి చేస్తూన్నాడనటం యుక్తమే, ఎందుకంటే, పాండుర వర్ణం అనేపదం (గ్రీకులో క్లోరోస్) గ్రీకు సాహిత్యాలలో రోగంతోనున్న పాలిపోయిన ముఖాలను సూచించేవిధంగా ఉపయోగించబడింది. ఇంకా యుక్తరీతిలో, మరణం కూడ, వివరించజాలని విధంగా మృతులలోకాన్ని (సమాధిని) వెన్నంటి వస్తుంది, ఎందుకంటే, ఈ మృతులలోకం నాల్గవ రౌతుచేత హతులైన అనేకులను స్వీకరిస్తుంది. అయితే, సంతోషించదగిన విషయమేమంటే, ‘మరణము మృతుల లోకము తమ వశముననున్న మృతులను అప్పగించినప్పుడు’ వీరికి పునరుత్థానం కల్గుతుంది. (ప్రకటన 20:13) గానీ వారెలా మృత్యువాత పడతారు?
27. (ఎ) మృత్యువు అనే రౌతు ఎలా తానును ప్రజలను బలిగొంటాడు? (బి) మృత్యువుకు “భూమియొక్క నాలుగవ భాగముపై అధికారము” ఇవ్వబడిందని చెప్పడంలో అర్థమేమిటి?
27 ఆ దర్శనం వాటిలో కొన్ని మార్గాలనిలా తెల్పుతూంది: “ఖడ్గమువలనను కరవువలనను మరణమువలనను భూమిలోనుండు క్రూర మృగములవలనను భూనివాసులను చంపుటకు భూమియొక్క నాలుగవ భాగముపైన అధికారము వానికియ్యబడెను.” (ప్రకటన 6:8బి) భూమ్మీది జనాబాలో అక్షరార్థంగా నాల్గోవంతనేమీ కాదుగానీ, అందులో జనసాంద్రత అధికంగా లేక అల్పంగానున్న ప్రాంతాల్లో సహితం ప్రజలీ రౌతుకు బలౌతారు. ఈ గుఱ్ఱపురౌతు, రెండవరౌతు యొక్క పెద్ద ఖడ్గానికి, మూడవరౌతు యొక్క క్షామం ఆహారకొరతలకు బలైన వారిని ప్రోగుచేస్తున్నాడు. లూకా 21:10, 11 లో వర్ణించబడినట్లు మరణకరమగు తెగుళ్లు, భూకంపాలద్వారా స్వయంగా తానుకూడ ప్రజల్ని బలిగొంటాడు.
28. (ఎ) “మరణకరమగు తెగులు” అనే ప్రవచనానికి ఎలా నెరవేర్పున్నది? (బి) యెహోవా ప్రజలీనాడెలా అనేక రోగాలనుండి రక్షింపబడుతున్నారు?
28 ఇచ్చట ప్రస్తుత ప్రాముఖ్యతేమంటే, “మరణకరమగు తెగుళ్లు” మరి స్పానిష్ ఫ్లూ అనే విషజ్వరం మొదటి ప్రపంచ యుద్ధానంతరం, 1918-19 లో కొన్నినెలల్లోనే 2 కోట్లమంది ప్రాణాలను బలితీసుకుంది. సెయింట్ హెలీనా అనే చిన్న ద్వీపమొక్కటే ఈ తెగులు వాతపడకుండ తప్పించుకుంది. అధికంగా హతులైనచోట కుప్పలుతెప్పలుగా పడిన శవాలకు దహన సంస్కారాలు చేయవలసి వచ్చింది. మరి యీనాడు, ముఖ్యంగా పొగాకు వాడకం మూలంగా వచ్చే హృద్రోగం, కేన్సర్వ్యాధి వణకు పుట్టిస్తున్నాయి. “అసహ్యకర దశాబ్దమని” అభివర్ణించబడిన 1980 దశాబ్దంలో బైబిలు నియమాల ప్రకారం అవినీతి అనబడే జీవిత విధానంవల్ల ఎయిడ్స్ మహమ్మారి యీ “మరణకరమగు తెగులు”కు తోడైంది. ఈ పుస్తకం రాసే సమయానికి యీ రోగపీడితులంతా చనిపోతూనే వున్నారు, మరి ఒక్క ఉత్తర అమెరికాలోనే 1990 సంవత్సరానికి పదిలక్షలమంది ఎయిడ్స్ పీడితులౌతారని అంచనా వేయబడింది; ఆఫ్రికాలో యింకా లక్షలాదిమంది దీనివాత పడతారనిపిస్తోంది. వ్యభిచారం జోలికిపోకుండ, యీనాడు అనేకరోగాలకు కారణమైన రక్తాన్ని దుర్వినియోగం చేయకుండ ఆయన వాక్యంలోని జ్ఞానయుక్తమైన సలహా వారిని కాపాడుతున్నందుకై యెహోవా ప్రజలెంత కృతజ్ఞులై యున్నారోగదా!—అపొస్తలుల కార్యములు 15:28, 29; 1 కొరింథీయులు 6:9-11 పోల్చండి.
29, 30. (ఎ) యెహెజ్కేలు 14:21 లోని “నాలుగు విధములగు” నిర్మూలనానికి యీనాటి వర్తింపేమిటి? (బి) ప్రకటన 6:8 లోని “క్రూర మృగములు” అంటే ఏమని మనమర్థం చేసుకోవచ్చు? (సి) ఈ ప్రవచనార్థక దర్శనంలోని ముఖ్యాంశ మేమిటని కనబడుతోంది?
29 చివరికి మరణానికి నాలుగవ కారణం క్రూరమృగాలని యోహాను దర్శనం తెల్పుతుంది. వాస్తవానికి, నాల్గవ ముద్రవిప్పగా బయటపడిన నాల్గుసంగతులు—యుద్ధం, క్షామం, వ్యాధి, మరియు క్రూరమృగం— అనేవి పూర్వం మరణానికి అసలు కారణాలుగా పరిగణించబడేవి. గనుక యీనాడివన్నీ ఆఖరుకు మరణాన్నే సూచిస్తున్నాయి. ఇది యెహోవా ఇశ్రాయేలీయులను హెచ్చరించినట్లే వుంది: “మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలెనని నేను ఖడ్గముచేతను క్షామముచేతను దుష్టమృగములచేతను తెగులుచేతను ఈ నాలుగు విధముల యెరూషలేముమీద తీర్పుతీర్చెదను.”—యెహెజ్కేలు 14:21.
30 ఈ 20వ శతాబ్దమంతా ఉష్ణమండల దేశాల్లో క్రూరమృగాలకు బలైనవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నను ఆధునిక కాలాల్లో ఆ వార్తలు వార్తాపత్రికల్లో పెద్దగా చోటు చేసుకోవడం లేదు. దేశాలు యుద్ధం మూలంగా నిర్మానుష్యమైతే, లేక కరవుకోరల్లో చిక్కుకున్న ప్రజలు మరీ బక్కచిక్కి ఆకలిగొన్న జంతువుల నెదిరించలేక భవిష్యత్లో వాటికి బలికావచ్చు. అంతేగాక, యీనాడు అనేకులు, తెలివిలేని జంతువులవలె, యెషయా 11:6-9 లో వర్ణించబడిన జంతు లక్షణాలను కనబరుస్తున్నారు. వీరే యీ ఆధునిక లోకంలో లైంగిక అవినీతిగల నేరాలకు, హత్యలకు, ఉగ్రవాదానికి, బాంబులు వేయడానికి ఎక్కువగా బాధ్యులు. (యెహెజ్కేలు 21:31; రోమీయులు 1:28-31; 2 పేతురు 2:12 పోల్చండి.) నాల్గవ గుఱ్ఱపురౌతు యిలాకూడ వారిని బలి తీసుకుంటాడు. నిజానికి, ఈ ప్రవచనం ముఖ్యంగా తెల్పేదేమంటే, యీ పాండుర వర్ణంగల గుఱ్ఱపురౌతు చివరకు అనేకవిధాలుగా మానవులను బలిగొంటాడు.
31. ఎరుపు, నలుపు, పాండురవర్ణపు గుర్రాలు విస్తారమైన వినాశనాన్ని కల్గిస్తున్ననూ మనమెందుకు నిబ్బరంగా ఉండవచ్చు?
31 మొదటి నాలుగు ముద్రలు విప్పినప్పుడు బయల్పడిన సమాచారం మనకు గట్టి అభయమిస్తుంది, ఎందుకంటే యీనాడు మరణానికి కారణాలుగా ప్రబలిన యుద్ధం, ఆకలి, వ్యాధి, మరితరమైన వాటివల్ల బెంబేలు పడవద్దని మనకుద్బోధిస్తుంది; లేదా నాయకులు ప్రస్తుత సమస్యలను పరిష్కరించలేనందుకు నిరాశచెందనక్కర్లేదు. ఎరుపు, నలుపు, పాండుర వర్ణపు గుఱ్ఱాలు చెలరేగుతున్నట్లు లోకపరిస్థితులు విశదపరిస్తే, తెల్లని గుఱ్ఱపురౌతు తన దాడిని ప్రారంభిస్తాడని మర్చిపోవద్దు. యేసు రాజయ్యాడు, మరి సాతానును పరలోకంనుండి భూమ్మీదికి పడద్రోయడంలో ఆయన యిప్పటికే గెలుపొందాడు. ఆయన మిగతా విజయాలలో, ఆత్మీయ ఇశ్రాయేలీయులను సమకూర్చుటయు, మహాశ్రమలను తప్పించుకొనుటకు లక్షలాదిమందిగా అంతర్జాతీయ గొప్పసమూహాన్ని సమకూర్చుట యిమిడివుంది. (ప్రకటన 7:4, 9, 14) ఆయన స్వారి తన గెలుపు పూర్తయ్యేవరకు కొనసాగుతుంది.
32. మొదటి నాలుగు ముద్రల్లో ప్రతిదానిని విప్పుటలోగల ప్రత్యేకత ఏమిటి?
32 “రమ్ము” అనే ఆజ్ఞతో ఆ నాలుగు ముద్రలు విప్పబడడం జరుగుతుంది. అలా పిలిచిన ప్రతిసారి ఒక గుఱ్ఱం దాని రౌతు వెంటనే వచ్చేవారు. ఐదవ ముద్రనుండి అటువంటి ఆజ్ఞ ఏదియు వినబడలేదు. అయితే ఆ గుఱ్ఱపురౌతులింకా స్వారీచేస్తూనే ఉన్నారు, వారు యీ విధానాంతం వరకు అలా స్వారీచేస్తూనే వుంటారు. (మత్తయి 28:20 పోల్చండి.) మిగిలిన మూడు ముద్రలు విప్పినప్పుడు యేసు ఏ యితర ప్రముఖ సంఘటనలను గూర్చి బయల్పరుస్తున్నాడు? వాటిలో కొన్ని సంఘటనలు మానవ నేత్రాలకు అదృశ్యంగా ఉంటాయి. మిగతావి కనబడినప్పటికినీ, అవింకా భవిష్యత్లో సంభవింపనై ఉన్నాయి. అయిననూ వాటి నెరవేర్పు నిశ్చయం. అవేమిటో మనం చూద్దాము.
[అధస్సూచీలు]
a అయిననూ, గమనించండి ప్రకటన 12:1 నందున్న “స్త్రీ”, . . . సూచనార్థక “పండ్రెండు నక్షత్రముల కిరీటమును” ధరించుకొని యున్నది.
b యేసు 1914 లో రాజ్యాధికారానికి వచ్చాడన్న వివరాలకొరకు వాచ్టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ న్యూయార్క్, ఇన్కార్పొరేటెడ్ వారు ప్రచురించిన “లెట్ యువర్ కింగ్డమ్ కమ్” అనే పుస్తకంలోని 14వ అధ్యాయం, దాని అనుబంధంలో చూడండి.
c అనేక అనువాదాలు యీ పదాన్ని “జయించుటకు” అని (రివైజ్డ్ స్టాండర్డ్, ది న్యూ ఇంగ్లీష్ బైబిల్, కింగ్ జేమ్స్ వర్షన్) లేదా “జయించుటకు బయలువెళ్లెను” అని (ఫిలిప్స్, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్) అనువదించినప్పటికి అసలు గ్రీకు వ్యాకరణంలో యిక్కడున్న తద్దర్మార్థక ప్రయోగం, ముగింపు లేక అంతిమ దశకు చేరుట అనే భావాన్ని స్ఫురింప జేస్తుంది. గనుకనే, రాబర్ట్సన్ యొక్క వర్డ్ పిక్చర్స్ ఇన్ ది న్యూ టెస్టమెంట్ అనే పుస్తకంలో యిలా వ్యాఖ్యానిస్తున్నాడు: “తద్దర్మార్థక క్రియాకాలంలో యిది అంతిమ విజయాన్ని సూచిస్తుంది.”
d న్యూ వర్ల్డ్ ట్రాన్స్లేషన్ రెఫరెన్స్ బైబిల్, అథఃస్సూచి చూడండి.
[-92వ పేజీలోని బాక్సు]
రాజు విజయోత్సవంగా స్వారిచేయడం
మరి 1930, 1940వ దశాబ్దాల్లో బద్దశత్రువులు, యెహోవాసాక్షుల పరిచర్య చట్టవిరుద్ధమని, నేరమని లేక విద్రోహచర్యయని కూడ అనడానికి ప్రయత్నించారు. (కీర్తన 94:20) అమెరికాలో 1936 లోనే 1,149 మందిని అరెస్టు చేసిన దాఖలాలున్నాయి. సాక్షులు అనేక చట్టబద్ధమైన కేసులను సుప్రీంకోర్టులో కూడ వాదించారు, వారు గెలిచిన కొన్ని ముఖ్యమైన కేసులు యీ క్రింద ఉన్నాయి.
మే 3, 1943 మర్డక్ అనే కక్షిదారికి పెన్సిల్వేనియాకు జరిగిన కేసు విషయంలో సుప్రీంకోర్టుతీర్పు ఏమని చెప్పిందంటే, డబ్బుకు సాహిత్యాలివ్వడానికి లైసన్స్ అక్కర్లేదు. అదేరోజు మార్టిన్ అనే కక్షిదారి, సిటీ ఆఫ్ థర్స్కు మధ్య జరిగిన కేసులోనైతే, యింటింటికి కరపత్రాలు, యితర ప్రచార సంబంధిత సామాగ్రిని పంచేటప్పుడు డోర్ బెల్ కొట్టడంలో తప్పేం లేదని తీర్పు చెప్పింది.
జూన్ 14, 1943 టేలర్ అనే కక్షిదారికి మిసిసిపీకి మధ్య జరిగిన కేసులో, సాక్షులు వారి ప్రచారం ద్వారా ప్రభుత్వానికి తిరుగుబాటు చేసే ధోరణిని ప్రోత్సహించలేదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అదేరోజున, వెస్ట్ వర్జీనియా స్టేట్ బోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్కు బెర్నట్టి అనే కక్షిదారునికి మధ్య జరిగిన కేసులో, జెండా వందనం చేయడానికి తిరస్కరించిన యెహోవాసాక్షుల పిల్లల్ని బడిలోనుండి పంపే హక్కు స్కూలుకులేదని కోర్టు తీర్పుచెప్పింది. ఆ మరునాడే, ఆస్ట్రేలియా హైకోర్టు యెహోవాసాక్షుల మీదనున్న నిషేధం, “నిరంకుశమని, నిశ్చలతలేనిదని, క్రూరమైనదని” అభివర్ణించి దాన్ని ఎత్తివేసింది.
[-94వ పేజీలోని బాక్సు]
“భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు . . . అధికార మియ్యబడెను”
సాంకేతిక పరిజ్ఞాన మెక్కడికి నడిపిస్తుంది? అంతర్జాతీయ అభివృద్ధి పరిశోధనా కేంద్ర అధ్యక్షుడు, ఇవాన్ యల్. హెడ్ ఇచ్చిన ప్రసంగంలోని విషయాల్ని ది గ్లోబ్ అండ్ మెయిల్, టొరంటొ, కెనడా, జనవరి 22, 1987, యీ విధంగా నివేదించింది:
“విశ్వసనీయంగా అంచనావేయ బడిందేమంటే, ప్రపంచంలో పరిశోధనాభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్న నలుగురు విజ్ఞానశాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులలో ఒకరు ఆయుధ తయారీలో పనిచేస్తున్నారు. . . . మరి 1986 గణాంకవివరాల ప్రకారం, దీనికయ్యే ఖర్చు నిమిషానికి 1 కోటి 50లక్షల డాలర్లకంటె ఎక్కువే. . . . సాంకేతిక పరిజ్ఞానం మీద ఇంతటి వత్తిడి తేవడం మూలంగావచ్చే ఫలితం మనందరికి క్షేమమేనా? అతిపెద్ద దేశాల దగ్గరున్న అణ్వాయుధాల శక్తి,—రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న దేశాలన్నీ ప్రయోగించిన అణుశక్తికన్న 6,000 రెట్లు అధికం. అంటే ఆరువేల రెండోప్రపంచ యుద్ధాలకు సమానమన్న మాట. మరి 1945 నుండి ప్రపంచం సైనికచర్య లేకుండా ఉన్నది ఏడు వారాల్లోపే. అలాగే 1 కోటి 93 లక్షలమంది ప్రాణాలను బలిగొన్నట్లు అంచనా వేయబడిన 150 కంటె ఎక్కువ జాతీయ లేదా అంతర్జాతీయ యుద్ధాలు జరిగాయి, వీటిలో అనేకం ఐక్యరాజ్యసమితి యుగంలో తయారైన నవీన సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యం మూలంగా జరిగినవే.”
98, 99వ పేజీలోని బాక్సు]
ప్రకటన గ్రంథపు సమగ్ర రూపం
ప్రకటన గ్రంథాన్ని గూర్చి యింతవరకు చర్చించిన దాన్నిబట్టి, ఆ గ్రంథపు సమగ్ర రూపాన్ని యింకా స్పష్టంగా తెలిసికొనుట కారంభిస్తాం. ఉత్సాహపూరిత ఉపోద్ఘాతం తర్వాత (ప్రకటన 1:1-9), ప్రకటన యీ క్రింది విధంగా 16 దర్శనాలుగా విభాగించబడినట్లు గమనించగలము:
1 దర్శనం (1:10–3:22): ఏడు సంఘాలకు సలహాపూర్వక ఉత్తేజపూర్వక సమాచారాన్ని పంపించే మహిమనొందిన యేసును యోహాను ఆత్మావశుడై చూస్తాడు.
2 దర్శనం (4:1–5:14): యెహోవా దేవుని పరలోక సింహాసనం యొక్క మహిమాన్విత దర్శనం. ఈయనే గొఱ్ఱెపిల్ల చేతికి గ్రంథపుచుట్ట నిస్తాడు.
3 దర్శనం (6:1-17): మొదటి ఆరు ముద్రలను విప్పడం, ప్రభువు దినములో సంభవించనైయున్న సంఘటనల సమిష్టి దర్శనాన్ని గొఱ్ఱెపిల్ల క్రమేపి బయలు పర్చుతాడు. ప్రకటనలోని నలుగురు రౌతులు బయలు వెడలుట, దేవుని హతసాక్షులు తెల్లని దుస్తులను పొందుతారు, మరియు మహా ఉగ్రత దినాన్ని గూర్చి వర్ణించబడింది.
4 దర్శనం (7:1-17): ఆత్మీయ ఇశ్రాయేలీయులైన 1,44,000 మంది ముద్రింప బడేవరకు దూతలు నాశన వాయువులను పట్టుకొని ఉంటారు. ఒక గొప్ప సమూహము తమరక్షణకై దేవునికి క్రీస్తుకు స్తోత్రం చెల్లిస్తారు, మహాశ్రమలను తప్పించు కొనుటకై వారు సమకూర్చ బడుతున్నారు.
5 దర్శనం (8:1–9:21) ఏడవ ముద్రను విప్పినప్పుడు, ఏడుబూరల శబ్దాలు వినబడతాయి, వాటిలోని మొదటి ఆరింటిలోనూ ఐదవ దర్శనముంది. ఈ ఏడు బూర శబ్దాలు మానవజాతిపై యెహోవా తీర్పులను ప్రకటిస్తాయి. ఐదవ, ఆరవ బూరశబ్దాలు మొదటి, రెండవ శ్రమలనుగూర్చి కూడ పరిచయం చేస్తాయి.
6 దర్శనం (10:1–11:19): బలిష్ఠుడైన ఒకదూత యోహానుకు చిన్న గ్రంథాన్ని యిస్తాడు, దేవాలయం కొలువ బడుతుంది, ఇద్దరు సాక్షుల అనుభవాలను గూర్చి యిందులో మనం తెలుసుకుంటాం. అది ఏడవ బూర శబ్దంతో ముగుస్తుంది, ఇది దేవుని శత్రువులపైకి రానైయున్న శ్రమనుగూర్చి—రానైయున్న యెహోవా రాజ్యాన్ని, ఆయన క్రీస్తురాజ్యాన్ని గూర్చి ప్రకటిస్తుంది.
7 దర్శనం (12:1-17) ఇది రాజ్యస్థాపనను గూర్చియు, దానిమూలంగా మిఖాయేలు సర్పాన్ని అంటే సాతానును భూమ్మీదికి పడద్రోయడాన్ని గూర్చి వివరిస్తుంది.
8 దర్శనం (13:1-18): బలమైన క్రూరమృగం సముద్రంలో నుండి బయటికి వస్తుంది, గొఱ్ఱెపిల్లవంటి రెండు కొమ్ములుగల మృగం దాన్ని ఆరాధించాలని ఉపదేశిస్తుంది.
9 దర్శనం (14:1-20): సీయోను పర్వతంమీద 1,44,000 మంది నిలుచునే అపూర్వ దర్శనం. భూలోకమంతటా దేవదూతల సువార్త ప్రకటనలు వినబడతాయి, భూమ్మీద పండిన ద్రాక్షాలు కోయబడతాయి, దేవుని ఉగ్రతయనే ద్రాక్షాతొట్టి త్రొక్కబడుతుంది.
10 దర్శనం (15:1–16:21): పరలోకంలో మరో సభతీరే చిత్రం, ఆ వెంటనే భూమ్మీద యెహోవా ఏడు ఉగ్రతా పాత్రలు క్రుమ్మరింపబడుట చూపబడుతుంది. ఈ భాగంకూడ, సాతాను విధానాంతాన్ని గూర్చిన ప్రవచనార్థక వర్ణనతో ముగుస్తుంది.
11 దర్శనం (17:1-18): మహావేశ్య, మహాబబులోను ఎర్రని క్రూరమృగంపై స్వారిచేస్తుంది, ఈ మృగం స్వల్పకాలం అగాధంలోకి వెళ్తుంది గానీ అది మరల పైకివచ్చి దాన్ని సర్వనాశనం చేస్తుంది.
12 దర్శనం (18:1–19:10) బబులోను కూలిపోవడం అది తుదకు నాశనమయ్యే విషయం ప్రకటింపబడుతుంది. దానికి తీర్పు జరిగిన తర్వాత కొందరు దుఃఖిస్తారు, యితరులు యెహోవాను స్తుతిస్తారు; గొఱ్ఱెపిల్ల వివాహం ప్రకటింపబడుతుంది.
13 దర్శనం (19:11-21): సాతాను విధానం, దాని సైన్యం, దాని మద్దతుదారుల మీద యెహోవా ఉగ్రతా తీర్పును అమలుపర్చడానికి యేసు పరలోక సైన్యాన్ని నడిపిస్తాడు; వారి శవాలతో ఆకాశపక్షులు విందు చేసుకుంటాయి.
14 దర్శనం (20:1-10) అపవాదియగు సాతాను అగాధంలో బందింపబడుట, క్రీస్తు తనతోటి అనుచరుల వెయ్యేండ్లపాలన, మానవజాతి అంతిమ పరీక్ష, సాతాను అతని దూతల నాశనము.
15 దర్శనం (20:11–21:8) సాధారణ పునరుత్థానం, గొప్ప తీర్పుదినం; నీతిమంతులైన మానవులకు నిత్యాశీర్వాదాలు తెచ్చే ఓ క్రొత్త ఆకాశం క్రొత్తభూమి కనబడుతుంది.
16 దర్శనం (21:9–22:5): గొఱ్ఱెపిల్ల భార్య, నూతన యెరూషలేము మహాదర్శనంతో ప్రకటన ముగుస్తుంది. ఆ పట్టణంనుండి మానవజాతికి దేవుడు ఏర్పాటు చేసిన స్వస్థత, జీవం చేకూరుతుంది.
ప్రకటన యెహోవా, యేసుక్రీస్తు, దూత నుండి వచ్చే సలహా, శుభ వచనాలతో ముగుస్తుంది. “రమ్ము!” అని అందరికి ఆహ్వానమియ్యబడుతుంది