యెహోవాసాక్షులు—గ్రీసులో సమర్ధించబడ్డారు
తేజరిల్లు! విలేఖరి ద్వారా
గాఝీలోని క్రీటన్ గ్రామంలో ఉన్న ఆర్థడాక్స్ ప్రీస్ట్ చేసిన ప్రసంగాల్లో ఒకదానిలో, “మన ఈ గ్రామంలోనే యెహోవాసాక్షులకు ఒక మందిరం ఉంది. వారిని వదిలించుకోవడానికి నాకు మీ మద్దతు అవసరం” అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఒక సాయంకాలాన, రాజ్యమందిర కిటికీలు నాశనం చేయబడ్డాయి, గుర్తు తెలియని వ్యక్తులు కొందరు తుపాకీలతో కాల్చి పారేశారు. అలా మత స్వాతంత్ర్యాన్ని గూర్చిన వివాదం గ్రీసులో మళ్ళీ లేవనెత్తబడింది.
మత సంబంధ కూటాలను పెట్టుకునే అనుమతి కొరకు విద్యా మత శాఖా మంత్రికి అర్జీ పెట్టుకునేందుకు కీరీయాకాస్ బాక్సేవానీస్, వాసీలీస్ హాడ్జాకీస్, కాస్టాస్ మాక్రీడాకీస్, టీటాస్ మానూసాకీస్ అనే నలుగురు యెహోవాసాక్షులను ఈ సంఘటనలు పురికొల్పాయి. అనుమతి పొందడం వల్ల తమకు పోలీస్ సంరక్షణ లభిస్తుందని వారు ఆశించారు. అయినప్పటికీ, అది సులభంగా సాధ్యమయ్యేది కాదు.
తన అధికారం క్రింద ఉండే పేటలో ఉన్న యెహోవాసాక్షుల రాజ్యమందిరం వైపుకు అధికారుల అవధానాన్ని మళ్ళిస్తూ వాళ్ళపై ప్రతిబంధకాలను పెట్టాలని, వారి కూటాలు నిషేధించబడాలని కోరుతూ ఇరాక్లియన్లోని సెక్యూరిటీ పోలీస్ ప్రధాన కార్యాలయానికి ప్రీస్ట్ ఒక ఉత్తరాన్ని పంపాడు. దీని వల్ల పోలీస్ దర్యాప్తూ ప్రశ్నాపూర్వక విచారణా జరిగాయి. చివరికి, ప్రాసిక్యూటర్ సాక్షులకు వ్యతిరేకంగా క్రిమినల్ ప్రొసీడింగ్లను దాఖలు చేశారు. మరి ఆ కేసు కోర్టు ఎదుటకు తీసుకురాబడింది.
అక్టోబరు 6, 1987న, “వాళ్ళపై ఆరోపించబడిన చర్యను వారు చేయలేదు. ఎందుకంటే, ఒక మతానికి చెందిన సభ్యులు కూటాలను నిర్వహించుకునే స్వాతంత్ర్యాన్ని కలిగివున్నారు . . . దానికి అనుమతి అవసరం లేదు” అని అంటూ ఇరాక్లియన్లోని క్రిమినల్ కోర్టు ఆ నలుగురు ప్రతివాదులు నిర్దోషులని విడిచిపెట్టింది. అయినప్పటికీ, ఆ ప్రాసిక్యూటర్ రెండు రోజుల తర్వాత ఆ తీర్మానాన్ని గూర్చి అప్పీలు పెట్టుకున్నాడు, ఉన్నత న్యాయస్థానానికి ఆ కేసు తీసుకు వెళ్ళబడింది. 1990, ఫిబ్రవరి 15న ఈ కోర్టు ఈ నలుగురు సాక్షులకు రెండు నెలల జైలు శిక్ష వేసి, దాదాపు 100 అమెరికా డాలర్ల జరిమానా విధించింది. తర్వాత, ఆ ప్రతివాదులు గ్రీక్ సుప్రీం కోర్టుకు అప్పీలు పెట్టుకున్నారు.
1991, మార్చి 19న, హైకోర్ట్ ఆ అప్పీలును త్రోసివేసి, నేరనిరూపణను సమర్థించింది. రెండు సంవత్సరాలకన్నా ఎక్కువ కాలం గడిచిన తర్వాత, 1993, సెప్టెంబరు 20న సుప్రీం కోర్ట్ తీర్మానం ప్రకటించబడినప్పుడు పోలీసులు రాజ్యమందిరాన్ని మూసి ముద్ర వేసేశారు. ఈ చర్య వెనుకవున్నది క్రీట్లోని ఆర్థడాక్స్ చర్చియేనని పోలీస్ అధికారపత్రం వెల్లడిచేసింది.
మతస్వాతంత్ర్యాన్ని పరిమితం చేయాలన్న ఉద్దేశంతో 1938లో ప్రవేశపెట్టబడిన కొన్ని చట్టాలు గ్రీస్లో ఇప్పటికీ అమలులో ఉన్నందుకే ఆ పరిస్థితి ఏర్పడింది. ఒక వ్యక్తి ఒక ఆరాధనా స్థలాన్ని నిర్వహించాలని ఆశిస్తున్నట్లయితే, విద్యా మత విషయాల మంత్రిమండలి నుండి, ఆర్థడాక్స్ చర్చి యొక్క స్థానిక బిషప్ దగ్గర నుండి అనుమతి పొందాలనే నిబంధన చేశారు. పాతకాలంనాటి ఈ చట్టాలు అనేక దశాబ్దాలుగా యెహోవాసాక్షులకు అనేక ఇబ్బందులను తీసుకువచ్చాయి.
మత స్వాతంత్ర్యం మరియు మానవ హక్కులు
తమ నేరనిరూపణను సుప్రీం కోర్ట్ బలపరచిందని తెలుసుకున్న ఈ నలుగురు సాక్షులు ఫ్రాన్స్లోవున్న స్ట్రాట్స్బర్గ్లోని మానవ హక్కుల యూరప్ కమిషన్కు 1991, ఆగస్టు 7న ఒక దరఖాస్తు సమర్పించారు. ఆలోచనా స్వాతంత్ర్యాన్ని, మనస్సాక్షి కలిగివుండే స్వాతంత్ర్యాన్ని, మత స్వాతంత్ర్యాన్ని అలాగే ఒంటరిగా లేదా సమాజంలో ఇతరులతో పాటు బహిరంగంగానైనా లేదా వ్యక్తిగతంగానైనా తన మతాన్ని తెలియజేసుకునే హక్కును సంరక్షించే యూరప్ కన్వెన్షన్ యొక్క 9వ ఆర్టికిల్ను తమకు వ్యతిరేకమైన నేరనిరూపణ ఉల్లంఘించిందని దరఖాస్తుదారులు విజ్ఞప్తి చేసుకున్నారు.
ఈ విషయంలో గ్రీస్ యూరప్ కన్వెన్షన్లోని 9వ ఆర్టికిల్ను ఉల్లంఘించింది అన్న ఏకగ్రీవ నిర్ణయానికి 1995, మే 25న, కమిషన్లోని 25 మంది సభ్యులు వచ్చారు. వివాద విషయంగానున్న ఆ నేర నిరూపణ మతస్వాతంత్ర్య స్ఫూర్తికి పొందికగా లేదనీ, ప్రజాస్వామ్య సమాజంలో అది అవసరం లేదని వారు ప్రకటించారు. ఈ కేసు అంగీకారయోగ్యమన్న తీర్పు కూడా ఈ విధంగా ప్రకటించబడింది: “దరఖాస్తుదారులు . . . అనేక యూరప్ దేశాల్లో ఏ మతాచారాలూ అలవాట్లూ విస్తృతంగా గుర్తించబడి, అనుమతించబడ్డాయో ఆ మత సంస్థ సభ్యులు.” చివరికి, కమీషన్ ఈ కేసును మానవ హక్కుల యూరప్ కోర్ట్కు సమర్పించుకుంది.
యెహోవాసాక్షులను ఆపలేము
1996, మే 20కి విచారణ జరపాలని నిర్ణయించబడింది. స్థానిక విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు, ప్రొఫెసర్లు, అలాగే జర్నలిస్టులు మరియు గ్రీస్ నుండి, జర్మనీ నుండి, బెల్జియమ్ నుండి, ఫ్రాన్స్ నుండి వచ్చిన చాలామంది యెహోవాసాక్షులతో సహా 200 కన్నా ఎక్కువ మంది కోర్టుగదిలోకి వచ్చారు.
దేశాధిపతులు ఉపయోగించిన పాలసీ, వాళ్ళు ఇచ్చిన తీర్పులు యూరోపియన్ కన్వెన్షన్నే గాక గ్రీస్ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించాయి అని ఏథెన్సు విశ్వవిద్యాలయంలోని మునుపటి ప్రొఫెసరైన ఇప్పటికీ ఆ హోదాలోనే పిలువబడుతున్న, సాక్షుల తరపున న్యాయవాదిగానున్న మి. ఫెదోన్ వగ్లరీస్ నొక్కిచెప్పాడు. “అలా కోర్టు విచారణకు తీసుకున్నది దేశ చట్టాన్నీ దాని అన్వయింపునూ.”
గ్రీకు గవర్నమెంట్ పక్షానున్న న్యాయవాది స్టేట్ కౌన్సిల్లోని జడ్జి. ఆయన వాస్తవాలను గూర్చి చర్చించేబదులు గ్రీస్లో ఆర్థడాక్స్ చర్చి స్థానాన్ని గూర్చి, దేశంతోను, ప్రభుత్వంతోను దానికి గల సన్నిహిత సంబంధాలను గూర్చి, మిగిలిన మతాలను అదుపు చేస్తూ ఉండాలని చెప్పబడిన అవసరతను గూర్చి మాట్లాడాడు. అంతేగాక, 1960 మొదలుకొని యెహోవాసాక్షుల సంఖ్య అత్యధికంగా పెరగడంలో సఫలులయ్యారు అని కూడా ఆయన పేర్కొన్నాడు. వేరే మాటల్లో చెప్పాలంటే ఆర్థడాక్స్ గుత్తాధిపత్యాన్ని సవాలుచేయడం విజయవంతమయ్యింది!
మతస్వాతంత్ర్యం ఉన్నతపర్చబడింది
సెప్టెంబరు 26న తీర్పు తీర్చబడుతుంది. పరిస్థితి సస్పెన్స్గా ఉంది, ముఖ్యంగా యెహోవాసాక్షులకు. న్యాయాధిపతియైన మి. రూడల్ఫ్ బెర్న్హార్డ్ట్ తీర్మానాన్ని ఇలా చదివాడు: యూరప్ కన్వెన్షన్ యొక్క 9వ ఆర్టికిల్ను గ్రీస్ ఉల్లంఘించిందని తొమ్మిది మంది న్యాయమూర్తులుగల కోర్టు ఏకగ్రీవ నిర్ణయాన్ని తీసుకుంది. కోర్టుకైన ఖర్చుల కొరకు అది ఆ దరఖాస్తుదారులకు దాదాపు 17,000 డాలర్ల మొత్తాన్ని మంజూరు చేసింది కూడా. మరి ముఖ్యమైనదేమంటే, మతస్వాతంత్ర్యానికి అనుకూలంగా అనేక గమనార్హమైన వాదనలు ఈ తీర్మానంలో చేర్చబడ్డాయి.
“మత స్వాతంత్ర్యం విషయంలో రాజకీయవేత్తల, పరిపాలకుల, అలాగే చర్చి అధికారుల అమిత జోక్యాన్ని” గ్రీక్ నియమం అనుమతిస్తుంది అని కోర్టు పేర్కొనింది. అనుమతి పొందవలసిన అవసరమున్న ఈ పద్ధతిని “ఆర్థడాక్స్ కాని కొన్ని మతవిశ్వాసాల అవలంబనపై, ముఖ్యంగా యెహోవాసాక్షుల మతవిశ్వాసాల అవలంబనపై కఠినమైన లేదా నిషేధాత్మకమైన నిబంధనలను పెట్టేందుకు”గాను దేశం ఉపయోగించింది అని కూడా అది చెప్పింది. అనేక దశాబ్దాలుగా ఆర్థడాక్స్ చర్చి ఉపయోగిస్తున్న భయంకరమైన కుతంత్రాలను కూడా ఈ అంతర్జాతీయ న్యాయస్థానం బయటపెట్టింది.
“కన్వెన్షన్ క్రింద హామీ ఇవ్వబడిన మత స్వాతంత్ర్య హక్కు మత విశ్వాసాలు లేదా అలాంటి విశ్వాసాలను వ్యక్తం చేసేందుకు ఉపయోగించబడే మాధ్యమాలు చట్టబద్ధమైనవా కావా అని నిర్ణయించే హక్కును దేశానికి ఇవ్వడం లేదు” అని కోర్టు నొక్కిచెప్పింది. “యెహోవాసాక్షులు గ్రీకు చట్టంలో ఇవ్వబడిన ‘గుర్తించబడిన మతం’ అనే నిర్వచనం క్రిందకు వస్తారు . . . అంతేకాక ఇది ప్రభుత్వంచేత ఆమోదించబడినదే” అని కూడా అది పేర్కొంది.
కేవలం ఆషామాషీ కాదు
దాదాపుగా ప్రముఖ గ్రీకు వార్తాపత్రికలన్నీ ఈ సమాచారాన్ని తరువాతి కొన్ని రోజుల వరకూ ప్రచురించాయి. 1996, సెప్టెంబర్ 29న కాథీమెరీనీ అనే ఆదివార పత్రిక ఈ వ్యాఖ్యానాన్ని చేసింది: “‘దానిని ఆషామాషీగా’ తీసుకుని నిర్లక్ష్యం చేసేందుకు గ్రీస్ దేశం ఎంత కృషి చేసిందో, స్ట్రాస్బర్గ్లోని మానవహక్కుల యూరోపియన్ కోర్టు నుండి అది అంత ‘చెంపదెబ్బ’ తినిందన్నది నిజంగా వాస్తవం, అంతర్జాతీయంగా నమోదు చేయబడిన వాస్తవమది. కోర్టు మానవ హక్కుల కన్వెన్షన్ యొక్క 9వ ఆర్టికిల్ను గ్రీస్ దేశానికి జ్ఞాపకం చేసి, గ్రీక్ శాసనాన్ని ఏకగ్రీవంగా ఖండించింది.”
“తాము యెహోవాసాక్షులైనందువల్లే ఈ విషమ పరిస్థితిని అనుభవిస్తున్న తన పౌరులకు ఈ కేసువల్ల అయిన ఖర్చులను ఇవ్వాలని ఆజ్ఞ జారీచేస్తూ” యూరోపియన్ కోర్టు “గ్రీస్ను ఖండించింది” అని 1996, సెప్టెంబర్ 28న ఎత్నాస్ అనే ఏథెన్స్ వార్తాపత్రిక వ్రాసింది.
దరఖాస్తుదారుల పక్షం తీసుకున్న న్యాయవాదుల్లో ఒకరైన మి. పానాస్ బీట్సాకీస్ ఒక రేడియో కార్యక్రమంలో ఇంటర్వ్యూ చేయబడినప్పుడు, “మనం 1996వ సంవత్సరంలో, 21వ శతాబ్దానికి సమీపంలో జీవిస్తున్నాం, మత స్వాతంత్ర్యం విషయంలో మౌలిక హక్కు కలిగివుండడాన్ని సంబంధించి ఏ విధమైన వివక్ష, వేధింపు, లేదా పరిపాలకుల జోక్యమూ ఉండకూడదని చెప్పకుండానే వ్యక్తమౌతుంది. . . . ప్రభుత్వం తన పాలసీని పునఃపరిశీలన చేసుకునేందుకు, ఈ ఆధునిక కాలాల్లో ఎందుకూ కొరగాని ఈ అర్థరహితమైన వివక్షకు విరామం వేయడానికి ఇదే సరైన అవకాశం” అన్నాడు.
గ్రీస్లో పరిపాలకుల జోక్యం, పోలీసుల జోక్యం, లేదా చర్చి జోక్యం లేకుండానే యెహోవాసాక్షులు తమ మత స్వాతంత్ర్యాన్ని అనుభవించగలిగేలా యూరోపియన్ కోర్టు ఇచ్చిన తీర్పుకు పొందికగా గ్రీస్ దేశం తన శాసనాన్ని రూపొందిస్తుందన్న నిరీక్షణను మానూసాకీస్ మరియు మరితరులకు వ్యతిరేకంగా గ్రీస్దేశం ఇమిడివున్న కేసులోని తీర్మానం కలుగజేస్తుంది. అంతేగాక, మత స్వాతంత్ర్యం సంబంధంగా గ్రీక్ న్యాయాధిపతుల సంఘానికి వ్యతిరేకంగా యూరోపియన్ కోర్టు ఇచ్చిన రెండవ తీర్పు ఇది.a
యెహోవాసాక్షులు దేవుని వాక్యానికి వ్యతిరేకంకాని అన్ని విషయాల్లో ప్రభుత్వ “పై అధికారులకు” విధేయులౌతారన్నది అంతటా తెలిసిన విషయమే. (రోమీయులు 13:1, 7) ఏ విధంగానూ వారు ప్రజల శాంతిభద్రతలకు అపాయకారులు కారు. దానికి భిన్నంగా, వారి ప్రచురణలు మరియు వారు చేసే ప్రజా పరిచర్య చట్టాన్ననుసరించే పౌరులుగా ఉండేందుకు, శాంతియుతమైన జీవితాన్ని నడిపేందుకు ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తాయి. వారు నిజాయితీగల చక్కగా స్థాపితమైన మతానికి చెందినవారు, వారి సభ్యులు వారి పొరుగువారి క్షేమానికి ఎంతో తోడ్పడ్డారు. బైబిలులోని ఉన్నత నైతిక ప్రమాణాలను పాటించడంలో, తమ పొరుగువారిని ప్రేమించడంలో, ముఖ్యంగా బైబిలు విద్యాభ్యాస పనిలో వ్యక్తం చేయబడినటువంటి వారి దృఢసంకల్పం వారు ఉన్న 200 కన్నా ఎక్కువ దేశాల్లో ఆరోగ్యకరమైన ప్రభావాన్ని చూపింది.
యూరోపియన్ కోర్టు ఇచ్చిన తీర్మానాలు యెహోవాసాక్షులకు గ్రీస్లోని మిగిలిన అల్పసంఖ్యాక మతాలన్నింటికీ గొప్ప మత స్వాతంత్ర్యాన్ని తెచ్చేందుకు తోడ్పడుతాయని ఆశించబడుతుంది.
[అధస్సూచీలు]
a 1993లో కోకినాకిస్ వ్యతిరేకంగా గ్రీస్ ఉన్న కేసులో మొదటి తీర్పు తీర్చబడింది.—కావలికోట, సెప్టెంబరు 1, 1993, 27వ పేజీ చూడండి.
[12వ పేజీలోని చిత్రం]
1993, సెప్టెంబర్ 20న పోలీస్ ముద్రవేసిన మొదటి రాజ్యమందిరం
[12వ పేజీలోని చిత్రం]
స్ట్రాట్స్బర్గ్లోని మానవ హక్కుల యూరప్ కోర్ట్
[13వ పేజీలోని చిత్రం]
ఇమిడివున్న సాక్షులు: టి. మానూసాకీస్, వి. హాడ్జాకీస్, కె. మాక్రీడాకీస్, కె. బాక్సేవానీస్