హృద్రోగం ప్రాణానికి ముప్పు
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాదిమంది స్త్రీ పురుషులకు గుండెపోటులు వస్తుంటాయి. అనేకమంది కొన్ని పరిణామాలతో బ్రతికి బయటపడతారు. ఇతరులు బ్రతకరు. మరి కొందరికి గుండె ఎంతగా పాడౌతుందంటే “ఉపయోగకరమైన పనులు తిరిగి చేయగలగడం సందేహాస్పదం” అని హృద్రోగ వైద్య నిపుణుడు అయిన పీటర్ కోన్ చెబుతూ ఇంకా ఇలా అంటున్నాడు: “అందువలన, సాధ్యమైనంతమేరకు గుండెపోటులను మొగ్గలోనే త్రుంచివేయడం అత్యంతావశ్యకం.”
గుండె మన శరీరమంతటికీ రక్తాన్ని పంపుచేసే ఒక కండరం. గుండెపోటు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్) వచ్చినప్పుడు, ఈ గుండె కండర భాగానికి రక్తం అందనప్పుడు అది చనిపోతుంది. ఆరోగ్యంగా ఉండడానికి, గుండెకు రక్తం ద్వారా తీసుకువెళ్లబడే ప్రాణవాయువు, మరితర పోషకాలు అవసరం. గుండె బయట దాని చుట్టూ చుట్టుకుని ఉండే కరోనరీ ధమనుల ద్వారా అది వీటిని పొందుతుంది.
వ్యాధులు గుండెలోని ఏ భాగాన్నైనా ప్రభావితం చేయవచ్చు. అయినప్పటికీ, అత్యంత సాధారణమైనది ఎథిరోస్క్లీరోసిస్ అని పిలువబడే లోలోపల దాగివుండి నెమ్మదిగా బయల్పడే కరోనరీ ధమనుల వ్యాధి. ఇది వచ్చినప్పుడు ప్లాక్ అనబడే క్రొవ్వుతో కూడిన నిక్షేపాలు ధమనుల గోడలపై పేరుకుపోతాయి. కాలం గడిచేకొలది ప్లాక్ పెరిగి, గట్టిబడి ధమనులను ఇరుకుగా చేసి, గుండెకు వెళ్లే రక్త సరఫరాను నిరోధిస్తుంది. లోలోపల దాగివుండి అనేకమైన గుండెపోటులకు రంగాన్ని సిద్ధం చేయడానికి కారకురాలైన కరోనరీ ధమనుల వ్యాధి (CAD) ఇదే.
సరఫరాను మించి గుండె ప్రాణవాయువును డిమాండు చేసినప్పుడు, ఒకటి లేక అంతకు ఎక్కువ ధమనులలో అవరోధం ఏర్పడడం మూలంగా గుండెపోటు వస్తుంది. మరీ అంత ఇరుకుగాలేని ధమనుల్లో సహితం ప్లాక్ నిక్షేపాలు ముక్కలై రక్తం గడ్డకట్టడానికి (కుదుపకు) నడిపిస్తుంది. వ్యాధి సోకిన ధమనులు కూడా ఈడ్పుకు మరెక్కువ లోనౌతాయి. ఈడ్పు ఉన్న ప్రాంతంలో రక్తం గడ్డకట్టవచ్చు, ఇలా జరగడం ధమని గోడ మరింత సంకుచితం అయ్యేలా చేసే ఒక రసాయనాన్ని విడుదల చేస్తూ గుండెపోటును కలిగిస్తుంది.
గుండె కండరానికి చాలాసేపటి వరకు ప్రాణవాయువు అందనప్పుడు దగ్గరలోని ధాతువుకు నష్టం వాటిల్లవచ్చు. కొన్ని ధాతువుల విషయంలో జరిగినట్లుగా గుండె కండరం పునరుత్పత్తి జరుగదు. గుండెనొప్పి ఎంత ఎక్కువసేపు ఉంటే గుండెకు అంత ఎక్కువ నష్టం వాటిల్లుతుంది, మరణం సంభవించే సాధ్యత కూడా అంత ఎక్కువగా ఉంటుంది. గుండె యొక్క విద్యుత్తు వ్యవస్థకు నష్టం వాటిల్లితే, గుండెకున్న సాధారణ లయ తప్పిపోయి అస్తవ్యస్తంగా తయారవ్వవచ్చు, మరి గుండె తీవ్రంగా కంపించడం (ఫిబ్రిలేట్) ప్రారంభమవ్వవచ్చు. అటువంటి ఎరిథ్మియా స్థితిలో మెదడుకు ప్రభావవంతంగా రక్తాన్ని పంపు చేసే సామర్థ్యాన్ని గుండె కోల్పోతుంది. పది నిమిషాల్లో మెదడు మరణిస్తుంది, తరువాత మరణం సంభవిస్తుంది.
అందువలన, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది వీలైనంత త్వరగా చర్య గైకొనడం ప్రాముఖ్యం. అలా చేయడం మూలంగా గుండెకు ఇంకా నష్టం వాటిల్లుతూ ఉండకుండా దానిని కాపాడవచ్చు, ఎరిథ్మియాను నివారించవచ్చు లేక దానికి చికిత్స చేయవచ్చు, అలా వ్యక్తి ప్రాణాలను సహితం కాపాడవచ్చు.