ప్రపంచ మతాలు తమ అంతానికి సమీపించాయా?
స్వీడన్ నందలి తేజరిల్లు! విలేఖరి ద్వారా
‘అది ఎలా సాధ్యం? ప్రపంచ మతాలు నేడు భూవ్యాప్తంగా ఎంతో పటిష్ఠంగాను ప్రభావవంతంగాను లేవా?’ అని మీరు విస్మయమొందేలా చేస్తుందా ఈ శీర్షిక.
అవును, కష్టాల సాగరంలో కడతేరుతున్నా, అవి ఎంతో పటిష్ఠంగాను ప్రభావవంతంగాను ఉన్నట్లు అనిపిస్తున్నాయి. ఈ 20వ శతాబ్దంలో, మానవచరిత్రయందు మునుపెన్నటికంటే ఎక్కువగా మతం సందేహించబడింది, దోషిగా నిరూపించబడింది. అంతరిక్ష పరిశోధకులు తమ అతిపెద్ద దుర్భిణిలతో విశ్వాన్ని విశ్లేషించారు, వ్యోమగాములు అంతరిక్షాన్ని చుట్టి వచ్చారు; ఒక సోవియట్ వ్యోమగామి వ్యక్తం చేసిన విధంగా, “దేవున్ని గానీ దేవదూతలను గానీ” వారు చూడలేదు. భౌతిక శాస్త్రవేత్తలు పదార్థాన్ని ఎంతో చిన్న చిన్న అణువులుగా విభజించారు గానీ వారు జీవాన్ని ప్రారంభించిన ఎలాంటి దైవిక శక్తినీ చూడలేదు. అమీబా నుండి మనిషి వరకు ఉన్న జీవం యొక్క సుదీర్ఘ పరిణామవాద గొలుసును పునఃనిర్మిస్తున్నప్పుడు ఆ గొలుసంతటిలో సృష్టి సంబంధ సూచనను ఒక చిన్న దాన్ని కూడా చూడలేదని జీవశాస్త్ర నిపుణులు మరియు పురాజీవ శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు.
అయితే, లౌకిక జ్ఞానం మరియు వస్తు వ్యామోహతత్త్వం ఈ గ్రహంపైనుండి మతపరమైన భావాలను తుడిచి వేయడంలో విఫలమయ్యాయి, మరి నాస్తికవాద రాజకీయ శక్తులు, తత్త్వాలు కూడా ఏమంత విజయవంతం కాలేదు. మరి 70 సంవత్సరాల కంటే ఎక్కువగా, ఏకపక్ష ప్రభుత్వాలు, నాస్తిక కమ్యూనిజాలు మతం అనేది ఒక మూఢనమ్మకమని మరియు “ప్రజలకు నల్ల మందు వంటిదని” ముద్ర వేశాయి, మత నాయకులను అధికారం నుండి తీసేశాయి మరియు వారి కార్యకలాపాలను నిషేధించాయి, చర్చీలు మరియు దేవాలయాలను నాశనం చేశాయి లేక కొల్లగొట్టాయి, ఆరాధికుల మనస్సులను మార్చేశాయి, వారిని హత్య చేశాయి. అయినప్పటికీ అలాంటి చర్యలు మతపరమైన భావాలను తీసేయలేకపోయింది. ఆ ప్రభుత్వాలు కూలిపోయిన వెనువెంటనే, అణచివేయబడిన మతం వినూత్న ఉత్సాహంతో పైకి లేచింది. మునుపటి కమ్యూనిష్టు దేశాల్లోని ప్రజలు తమ పాత దేవాలయాలకు మళ్లీ తరలివెళ్తున్నారు, వారి పితరులు చేసిన విధంగా భక్తితో వాటి ముందు మోకరిల్లుతున్నారు.
ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా మతపరమైన భావాలు ఇంకా రగులుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం సౌదీ అరేబియాలోని మక్కా పట్టణానికి భూమి నలుమూలలనుండి ముస్లిం యాత్రికులు కోట్ల సంఖ్యలో వస్తారు. పోప్ను ఒక్కసారి చూడాలని ప్రయత్నిస్తున్న మరియు అతని దీవెనను అందుకోవాలని నిరీక్షిస్తున్న కాథోలిక్ విశ్వాసుల గుంపులతో వాటికన్లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ తరచూ క్రిక్కిరిసిపోతుంది. కోట్లాదిమంది హిందూ భక్తులు, భారతదేశంలోని “పవిత్ర” నదుల తీరాల్లోని వందలాది యాత్రా స్థలాలకు తరలి వెళ్తూనే ఉన్నారు. భక్తిగల యూదులు ప్రార్థించేందుకు మరియు తమ వ్రాతపూర్వక ప్రార్థనను గోడసందుల్లో వదిలి వెళ్లేందుకు యెరూషలేములోని వేలింగ్ వాల్ వద్దకు వెళ్తారు.
అవును, మతాన్ని మానవజాతినుండి తీసేయడం అసాధ్యమని అనిపిస్తుంది. “మనిషి తన మనోలక్షణాన్నిబట్టి ఒక మతపరమైన జంతువు” అని ఐర్లాండ్లో పుట్టిన రాజనీతివేత్త అయిన ఎడ్మండ్ బర్క్ అన్నాడు. గణాంకాల ప్రకారం చూస్తే, భూమిపైనున్న 6 గురు వ్యక్తుల్లో 5 గురు ఏదో ఒక మతంతో కొద్దో గొప్పో సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇటీవలి లెక్కల ప్రకారం, మత ప్రమేయం లేని మనుష్యులు దాదాపు 84.2 కోట్ల మంది ఉండగా, గుర్తింపును పొందిన మతాన్ని అనుసరించే వారు 490 కోట్ల మంది ఉన్నారు.a
దీన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రపంచ మతాలు తమ అంతానికి సమీపించాయని విశ్వసించడం సహేతుకమేనా? ఒకవేళ నిజమైతే, అవి ఎప్పుడు మరియు ఎలా అంతమౌతాయి? ఏ మతమైనా మిగిలి ఉంటుందా? తర్వాతి రెండు శీర్షికల్లో ఈ ప్రశ్నలను పరిశీలిద్దాము.
[అధస్సూచి]
a “మత ప్రమేయం లేని” మనుష్యుల్లో వీరందరూ ఇమిడివున్నారు: “ఏ మతానికి చెందిన వారంకామని చెప్పుకొనే వ్యక్తులు, అవిశ్వాసులు, అజ్ఞాత వాదులు, స్వేచ్ఛగా ఆలోచించేవారు, మతాన్ని వదలుకుని అన్ని మతాల ఎడల విముఖత చూపే లౌకిక వాదులు.”
[3వ పేజీలోని చిత్రం]
వాటికన్ పట్టణము నందలి సెయింట్ పీటర్స్ స్క్వేర్