ప్రపంచ పరిశీలన
ప్రపంచంపై టివి ఆధిపత్యం
ప్రపంచ వ్యాప్తంగా టివి ఎంత పేరుగాంచింది? ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ తెలిపినట్లు, ప్రపంచ వ్యాప్తంగా నూరు కోట్ల టివి సెట్లు వున్నాయి, ఇప్పుడున్న వాటికంటే అయిదేళ్ల క్రితంనాటివి 50 శాతం కన్నా మించివున్నాయి. జపానీయుల యిళ్లలో, టాయిలెట్లకన్నా టివిలే ఎక్కువున్నాయి. మెక్సికోలో కేవలం 50 శాతం యిళ్లలోనే టెలిఫోన్లున్నాయి కానీ ప్రతి యింట్లోనూ టివి మాత్రం వుంది. అనేక అమెరికన్లకు వారికిష్టమైనవి చూసేందుకు 25 లేక 30 ఛానల్స్ వున్నాయి. “ప్రపంచ వ్యాప్త టెలివిజన్ విప్లవం మూలంగా కల్గే సాంఘిక, రాజకీయ, ఆర్థిక ప్రభావాలు కోకొల్లలు. . . . అమెరికాలో రెండు తరాలవారికి జరిగినట్లే, మిగతావారందరికి టివిని ఎక్కువగా చూడడం వలన చదువు మీద శ్రద్ధ తరిగి పోగలదని అనేకులు భయాందోళనను చెందుతున్నారని” ట్రిబ్యూన్ పేర్కొంది. (g93 5/8)
పిల్లలు ఎవరికి కావాలి?
“పిల్లలను నువ్వు వుంచుకో, నేను డబ్బుంచుకుంటాను.” ఒకవేళ జపాన్ స్త్రీలు విడాకులు తీసుకుంటే తమకొరకు ఏమి వుంచుకోవాలని కోరుకుంటారు, అని అడిగిన ప్రశ్నకు వారుచెప్పిన సమాధానాల సారాంశాన్ని మైనీచీ డేలీ న్యూస్ ఈ ముఖ్య శీర్షికను ప్రచురించింది. బ్యాంకు సేవింగ్స్, డబ్బు, విడిది గృహాలు అత్యంత ప్రాధాన్యత యివ్వబడే మూడు విషయాలని, నాల్గవది కొడుకులు, అటు తర్వాత కుమార్తెలు, ఆ తర్వాత ఇళ్లు, టెలివిజన్ సెట్లు, కళాకృత్యాలు, స్త్రీల పర్సులని హకుహోడో అనే ఒక వాణిజ్య ప్రకటనల సంస్థ ఇటీవల జరిపిన ఒక సర్వేలో తేలింది. తండ్రులకు కూడా పిల్లలతో గడపడానికి సమయం చాలటంలేదు. టొకి బ్యాంక్ జరిపిన మరో సర్వేలో, పిల్లలతో మాట్లాడడానికి తమకు తీరిక లేదని 69 శాతం మంది జపాన్ తండ్రులు అంటున్నారని తేలింది. వాస్తవానికి తమ పిల్లలతో చర్చించాల్సిన పరస్పర విషయాలేమీ లేవని 22 శాతం మంది అంటున్నారు. (g93 4/22)
భూమిని వినాశనానికి నడుపుట
ప్రస్తుతం ప్రపంచ జనాబా వార్షిక పెరుగుదల దాదాపు 10 కోట్లుంది, అంతేకాదు 2050వ సంవత్సరానికల్లా ప్రపంచ జనాబా వేయి కోట్లు అవుతుందని అంచనా, అని బ్రిటిష్ మెడికల్ జర్నల్ నివేదించింది. ది రాయల్ సొసైటీ ఆఫ్ లండన్, యు. ఎస్. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ రెండూకలిసి, అలాంటి పెరుగుదల పర్యావరణానికి చక్కబెట్టజాలని నష్టాన్ని కలుగజేస్తుందనే తిరుగు లేని ఉమ్మడి వాగ్మూలాన్నిచ్చాయి. అభివృద్ధి చెందిన దేశాలు వనరులను వినియోగించుకొనే విధంగా జనాబా అధికంగా పెరిగే వర్ధమాన దేశాలు కూడా వినియోగిస్తే నిజంగా అది సంభవించవచ్చు. విజ్ఞాన, సాంకేతిక విధానాలు ప్రముఖ పాత్రను వహించాలని విద్యాసంస్థలు సూచించాయి. అయితే “శర వేగంతో పెరిగిపోతున్న జనాబా, వనరుల దుర్వినియోగము, హానికరమైన మానవ అలవాట్ల వలన ఉత్పన్నమౌతున్న సమస్యలను పరిష్కరించుటకు” కేవలం వాటిపైనే ఆధారపడడం అంత వివేచనయుక్తం కాదని వారన్నారు. అవేమీ మారకపోతే “పునరుద్ధరించలేని పర్యావరణ వినాశనాన్ని గానీ ప్రపంచంలో పలుచోట్ల వున్న పేదరికాన్ని గానీ ఈ విజ్ఞానశాస్త్రము, సంకేతిక పరిజ్ఞానము ఆపజాలదని” ఆ వాగ్మూలం పేర్కొన్నది. “జనాబాను అరికట్టడానికి మనం గంభీరమైన చర్యలు గైకొనకపోతే, మిగతావన్నీ ద్వితీయస్థాయికి దిగిపోతాయి” అని లండన్ రాయల్ సొసైటీ ప్రెసిడెంటు, సర్ మైకేల్ అటియా పేర్కొన్నారు. (g93 5/8)
ఎన్నడూ చేరని సహాయం
ఆఫ్రికాలో ఆకలిని, పేదరికాన్ని తగ్గించడానికని యివ్వబడ్డ అంతర్జాతీయ సహాయ నిధిలో కేవలం 7 శాతం మాత్రమే దాన్ని పొందదగిన వారికి చేరుతుందని ఆఫ్రికా డెవలప్మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్షుడు, ఫర్హత్ యునెస్ సమ్మతించాడు. ఆఫ్రికాలోని లక్షలాదిమంది పిల్లల దుర్భిక్ష స్థితిని బట్టి ఈ దుస్సంఘటన ఉత్పన్నమైంది. ఈ ఖండమంతటిలో పోషకాహారం లభ్యముకాని మూడు కోట్ల మంది పిల్లలున్నారనీ, అంతే కాకుండా కుపోషణతో పెరుగుదల క్షీణించిపోయిన మరో నాలుగు కోట్ల పిల్లలు వున్నారని స్పానిష్ వార్తాపత్రిక ఎల్ పయెస్ నివేదించింది. సెనెగెల్ నందలి డాకర్లో 44 ఆఫ్రికా రాష్ట్రాల ప్రతినిధుల కూటమి జరిగినప్పుడు, సహాయ నిధి వికేంద్రీకరణ, సైనిక వ్యయాన్ని తగ్గించుట, ఈ పిల్లల పరిస్థితిని మెరుగుపర్చడానికి తీసుకునే రెండు ప్రాముఖ్య చర్యలని సిఫారస్సు చేయబడింది. (g93 5/8)
ఆఫ్రికా ధూళి
ఉష్ణమండలపు పచ్చిక మైదానము, పొదలతోనిండిన స్థలము నుండి వడ గాలులవలన ఎగురగొట్టబడే ఆఫ్రికా ధూళి, భూగోళమందలి యితర ప్రాంతాలకు ప్రయోజనకరంగా వుందని విజ్ఞానశాస్త్రజ్ఞులు అంటున్నారు. కొంతమేరకు, దక్షిణాఫ్రికాలో దీర్ఘకాలం కొనసాగిన జలశోషణం వలన సారవంతమైన ఆఫ్రికా నేల 1992 నాటికే ధూళి మేఘాలుగా మారిందని ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నివేదించింది. అధిక శాతం ధూళి అట్లాంటిక్ మహాసముద్రంలో పడి, ప్రత్యేకంగా, ఆహార శ్రేణిలో మొట్టమొదటివైన ప్లవకములకు, క్రిల్లకు ఎంతో ఉపయుక్తమైన ఇనుము వంటి ఖనిజాలను అందిస్తుంది. మిగిలిన శేషము అమెరికా దేశాలకు కొట్టుకుపోతోంది. అత్యధిక వర్షపాతమున్న అమేజాన్ అడవులలో జరిపిన పరీక్షలవలన, అక్కడి నిస్సారమైన నేలను మరలా సారవంతం చేసేందుకు ఆఫ్రికా ధూళి సహాయపడుతుందని తేలింది. “అట్లాంటిక్, అమెరికాదేశాలను సారవంతం చేసే ఈ ఆఫ్రికా ధూళి, జీవరాసి ఆవరణా పద్ధతులు ఎంత విస్తారముగా, ఎంత సుదూరంగా ఒక దానిపై ఒకటి ఆధారపడతాయో చూపిస్తోంది” అని వర్జీనియా విశ్వవిద్యాలయంలోని డా. మైకేల్ గార్స్టాంగ్ అన్నారు. “సమాచారమేమంటే మనం పూర్తిగా అర్థం చేసుకోలేని పరస్పర సంబంధిత, ఆధారిత జీవరాసి ఆవరణా నియమాలెన్నో మన భూగోళమందు వున్నాయి. ఈ విషయాలను గూర్చి మనం ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా అర్థం చేసుకొనడం మొదలు పెట్టాము.” (g93 5/8)
మత పత్రికల నిలిపివేత
“దేశములోని అతి పురాతన మత పత్రికలైన అమెరికన్ బాప్టిస్ట్, క్రిస్టియన్ హెరాల్డ్ యిక ప్రచురించబడ్డంలేదు” అని అసోసియేటెడ్ ప్రెస్ సమాచారము వెల్లడి చేసింది. “నూట పదిహేను సంవత్సరాల క్రిస్టియన్ హెరాల్డ్ పత్రిక 1878లో చపాక్వా, న్యూయార్క్ నందును, 189 సంవత్సరాల క్రితం అంటే, 1803లో ప్రారంభమైన పత్రిక అమెరికన్ బాప్టిస్ట్ పంపిణీ ఇప్పుడు తగ్గిపోతోంది.” వాలీ ఫోర్జ్, పెన్సిల్వేనియా నందు ముద్రించబడుతున్న నెలసరి పత్రిక అమెరికన్ బాప్టిస్ట్ స్థానే సమాచార పత్రం ప్రచురించబడుతుంది. అయితే, ఈ తరంలోని మరో మత పత్రికైన ది వాచ్టవర్ వృద్ధిచెందుతూనే వుంది. 1879లో ఇంగ్లీషు నందు నెలసరి పత్రికగా పీటర్స్బర్గ్, పెన్సిల్వేనియాలో 6000 ప్రతులతో మొదలైంది, ది వాచ్టవర్ ఇప్పుడు పక్షపత్రికగా 112 భాషలలో వెలువడడమేకాకుండా 1,64,00,000 ప్రతులు ప్రతి సంచికలో అందించబడుతున్నాయి. (g93 5/8)
కుష్టువ్యాధికి చికిత్స
కుష్టురోగులకు ఉద్యోగమివ్వకుండడం, యిస్తే తీసివేయాల్సిందేనా? దక్షిణాఫ్రికా పత్రికైన ఫార్మర్స్ వీక్లీ నందలి శీర్షిక ప్రకారం మాత్రం కాదు. “చికిత్స ప్రారంభించిన కొన్ని గంటల తరువాత వారినుండి యిక యితరులకు రోగమంటదు. తమ కుటుంబాలతో వారు మామూలుగా జీవించవచ్చును” అని లెప్రసీ మిషన్లోని ఒకి క్రుగర్ పేర్కొన్నాడు. అనేక రకాల మందులతో చేసే చికిత్స వలన “ఈ జబ్బును చాలా మట్టుకు నయం చేయగల్గడంలో అభివృద్ధిని సాధిస్తున్నందున,” ఈ వ్యాధి బాధితులకు ప్రారంభదశలోనే చికిత్స చేస్తే వారు శాశ్వతంగా వికలాంగులు కారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెల్పిన ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఒకటి ఒకటిన్నర కోట్ల మంది ప్రజలు కుష్టువ్యాధితో బాధపడుతున్నారని ఫార్మర్స్ వీక్లీ నివేదించింది. (g93 4/22)
బొద్దుగావుండే పిల్లలు—ఎందుకు?
“మునుపెన్నటికంటే కూడా ఈనాటి పిల్లలు మరీ బొద్దుగా ఉండి, హుషారుగా వుండడంలేదు” అని ది టొరాంటో స్టార్ నివేదించింది. “గత 20 సంవత్సరాల్లో పిల్లలు లావుగావుండడం చాలా విపరీతంగా పెరిగింది” అని కెనడాలో హామిల్టన్ నందలి షెడోక్ వాక్ మాస్టర్ హాస్పిటల్లో పిల్లల ఆహార డైరెక్టరైన డా. ఒదెద్ బారర్ పేర్కొన్నారు. వ్యాయామము చేయకపోవడం, సమతూకము లేని ఆహారము ముఖ్యకారణమని పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఇది యిలాగే కొనసాగితే, పిల్లల ఆరోగ్యం క్షీణించిపోవచ్చునని డాక్టర్లు భయాందోళనను వ్యక్తపరుస్తున్నారు. స్టార్ పత్రిక పేర్కొన్నట్లు “వ్యాయామం లేకపోవడం . . . హృద్రోగాలు, అధిక రక్తపోటు, మధుమేహవ్యాధి, ఎముకల వ్యాధి . . . వంటి వాటికి కారణం కావచ్చును.” “హుషారుగా లేని ఒక పిల్లవాడు లావుగావున్న ఒక పెద్దవానికి సమానమని” డా. బార్ ఒర్ చివరిగా అన్నాడు. ఆయన ఒక ఉత్సాహవంతమైన జీవన విధానాన్ని సిఫార్సుచేశాడు. (g93 4/22)
పొంచివున్న ప్రమాదం
“పొగత్రాగేవారికి గుండెపోటు వచ్చే అవకాశాలువున్నప్పటికీ వారు ఆరోగ్యంగానే వున్నారనే తప్పుడు సమాచారాన్ని యివ్వవచ్చు” అని ది న్యూయర్క్ టైమ్స్ శీర్షిక అన్నది. ఎందుకు? ఎందుకంటే పొగత్రాగడం మూలంగా గుండెలోని చిన్న రక్తనాళములకు కలిగిన హాని, మామూలుగా జరిపే గుండె పరీక్షల్లో తేలదు. కాబట్టి పొగత్రాగేవారు శారీరక లేక మానసిక ఒత్తిడిలో వున్నప్పుడు వారి గుండె రక్తానికై తపిస్తుంది, ఆ పరిస్థితి గుండెపోటు వచ్చే ప్రమాదాలను అధికం చేస్తుంది. పొగత్రాగేవారు పొగత్రాగని సమయంలో కూడా యిది సంభవించే అవకాశముందని, అంతేకాకుండా పొగత్రాగేప్పుడు యిది మరి విపరీతమౌతుందని డెస్ మోయినిస్ నందలి లోవా హార్ట్ ఇన్స్టిట్యూట్లో జరిపిన అధ్యయనములో తేలింది. ఒత్తిడిలో వున్నప్పుడు, గుండె దమనులకొనలు తెరుచుకొని, సామాన్యంగా రక్తాన్ని తీసుకు వెళ్లేదాని కన్నా నాలుగింతలు ఎక్కువ రక్తాన్ని తీసుకు వెళ్లగలవు. అయితే పొగత్రాగేవాని గుండెలో ఆ రక్త ప్రసారం 30 శాతం తగ్గిపోతుంది. (g93 5/8)
గర్భస్రావం తల్లులను కూడా చంపుతోంది
“సగటున ప్రతి నిమిషమూ ఒక స్త్రీ గర్భం మూలంగానో కాన్పు మూలంగానో చనిపోతోందని” అంచనా వేయబడిందని చాయిస్ పత్రిక నివేదించింది. ఇంకాస్త పొడిగిస్తూ యిలా అంటోంది: “గర్భసంబంధిత కారణాల వలన ప్రతి సంవత్సరం ఐదు లక్షల మంది తల్లులు మరణిస్తున్నారు. అంతేకాకుండా చనిపోయిన ప్రతి స్త్రీకీ 100 మంది యితర స్త్రీలు అనారోగ్యంతో లేక అంగవైకల్యంతో బాధపడుతున్నారు.” లాటిన్ అమెరికాలో, 73 మంది స్త్రీలలో 1 స్త్రీ గర్భసంబంధిత సమస్యలతో మరణిస్తోంది. ఆసియాలో, ప్రతి 54 మందికి 1 స్త్రీ మరణిస్తోంది; ఆఫ్రికాలో 21 మందికి ఒకరు మరణిస్తున్నారు. ఒక లక్షకు ఒకరు చనిపోయే పాశ్చాత్య ఐరోపాకు పోలిస్తే, ఈ సంఖ్యలు చాలా అధికంగా వున్నాయి. గర్భసంబంధిత మరణాలలో “గర్భస్రావం కూడా వుంది. మాతృత్వమునకు సంబంధించిన లోకవ్యాప్త మరణాలలో, ఐదు లక్షలలో రెండు లక్షల మంది దీని మూలంగానే ప్రతి సంవత్సరం మరణిస్తున్నారని” ఛాయిస్ గమనించింది. (g93 4/22)