‘పిల్లలు ప్రశస్తమే, గానీ కుమారులు అవశ్యం’
ఇండియాలో 85 కోట్లకంటె ఎక్కువ జనాభావున్నది, అందులో 1,000 కి 31 మంది చొప్పున జన్మిస్తూవున్నందున, ప్రతి సంవత్సరం 2 కోట్ల 60 లక్షల మంది క్రొత్త శిశువులు జన్మిస్తున్నారు. ఇది కెనడా దేశపు జనాభాతో సమానం. జనాభా పెరుగుదలను అరికట్టుట ప్రభుత్వం అత్యవసర పథకాలలో ఒకటియనుటలో ఆశ్చర్యం లేదు. ఆ పథకమెంత వరకు విజయం సాధిస్తుంది? అది ఎదుర్కొనే కొన్ని ఆటంకాలు ఏమిటి?
“ఇరవైకి ముందు వద్దు! 30 తర్వాత అసలే వద్దు! ఇద్దరు పిల్లలే ముద్దు!” అనే యీవాక్యం ఇండియాలోని బొంబాయినందున్న కుటుంబ నియంత్రణ ప్రధాన కార్యాలయపు గోడమీద అంటించబడిన రంగుల పోస్టర్లలో ఒకటి. మరో బొమ్మలో ఓ తల్లి తన ఐదుగురు పిల్లలతో వేధించబడుతుంది. అది ఇలా హెచ్చరిస్తుంది: “తర్వాత విచారపడవద్దు!” సమాచారం పెద్దగా, స్పష్టంగా వస్తుంది: ఇంటికి ఇద్దరు పిల్లలు చాలు. అయితే ఇంటికి ఇద్దరు పిల్లలు చాలనే ప్రభుత్వ సిఫారసును ప్రజలచే అంగీకరింపజేసి దాని ప్రకారం చేయించుట సులభం కాదు.
“అతనికున్న సంతాన సంఖ్యనుబట్టి పురుషుడు సంతోషిస్తాడని హిందువులు అనుకుంటారు. ఇంట్లో సంతానముంటే అది దీవెనకరమని నిజానికి వారభిప్రాయం. ఒకని కుటుంబం ఎంత పెద్దదైనా దాని వృద్ధికొరకు పూజలు చేయకుండ మానడని,” హిందూ మ్యానర్స్, కస్టమ్స్ అండ్ సెరిమొనీస్ అనే పుస్తకం తెల్పుతుంది. మతపరంగా చూస్తే, కుటుంబంలో పురుషునికి మగపిల్లవాడే అధిక యోగ్యుడు. “తన అంత్యక్రియలు జరిగించుటకు ఒక కొడుకును లేక మనుమడిని వదలి వెళ్లకపోవుట దురదృష్టాన్నికొని తెచ్చుకున్న దానితో సమానమని” ఆ పుస్తకమింకా చెబుతుంది. “అలా ఎవరూ లేకపోతే మరణాంతర జీవితంలో స్వర్గప్రాప్తికి ఆటంకముగా వుంటుందని వారి భావన.”
పితృదేవతారాధన లేక శుద్ధకర్మ జరిగించుటకు కూడ కుమారులు అవసరమే. “ఒక్క కుమారుడైనా తప్పని సరిగా అవసరమే”నని ఏ. యల్. బాషామ్, ది వండర్ దట్ వాజ్ ఇండియా అనుపుస్తకములో వ్రాస్తున్నాడు. “ప్రగాఢమైన కుటుంబ భావనగల హిందువుల భారత దేశంలో కుమారులు కావలెననే కోరికను బలపరచింది, వారే లేకపోతే ఆ వంశమే అంతరిస్తుంది.”
మత నమ్మకాలతోపాటు, కుమారులు కావాలనే కోరికను బలపరచే సాంఘికాచారమేమంటే భారత దేశంలో వారి తలిదండ్రులతోపాటే కుమారులు కలిసి జీవించే పారంపర్య ఉమ్మడి కుటుంబ విధానము, అందులో వివాహము చేసుకున్న కుమారులు తల్లిదండ్రులతోనే జీవిస్తారు. “కూతుళ్లు పెళ్లిళ్లు చేసుకుని అత్తవారింటికి వెళ్తారుగానీ కుమారులైతే వారి తలిదండ్రులతోపాటే వుంటారు, మరి కొడుకులే తలిదండ్రులను వృద్ధాప్యంలో పోషిస్తారని వారి ఆశ.” అని బాంబే మునిసిపల్ కార్పొరేషన్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలోని డాక్టర్. లలిత. యస్. చోప్రా అంటుంది. “ఇదేవారి భద్రత. ఇద్దరు కుమారులుంటే క్షేమమని తలిదండ్రులు భావిస్తారు. అప్పుడిక న్యాయంగా చూస్తే, యిద్దరు పిల్లల హద్దు చేరినపుడు, అందులో ఇద్దరూ ఆడపిల్లలే అయితే ఆ దంపతులు మూడవసారి కుమారుని కొరకు ప్రయత్నించే అవకాశమున్నది.”
సిద్ధాంతపరంగా చూస్తే పిల్లలంతా దేవుని వరమేనని తలంచినప్పటికినీ జీవితంలోని ప్రతిదిన వాస్తవాలు అందుకు భిన్నంగా చూపిస్తున్నవి: “బాలికలకు వైద్య సహాయమందించుటలో నిర్లక్ష్యం చేస్తున్నారనుట స్పష్టమని” ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక తెల్పుతుంది. “వారు బ్రతకడం కుటుంబం బ్రతకడానికి అంత ప్రాముఖ్యమని పరిగణించుటలేదు.” లింగ నిర్ధారణ జరిపి గర్భస్రావం చేయబడిన 8,000 పిండాలలో 7,999 పిండాలు ఆడపిల్లలవేనని బొంబాయిలో జరిపిన ఒక నివేదిక బహిర్గతం చేసింది.
ఎదురు పోరాటం
“కుటుంబంలో, ఎంతమంది పిల్లలు కావాలి కుటుంబమెంత పెద్దదిగా వుండాలని నిర్ణయించేది సర్వసాధారణంగా పురుషుడే,” అని బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్. యస్. యస్. సాబ్నిస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒకవేళ స్త్రీ సంతానమును మితపరచుకోవాలని గానీ హద్దులోవుండాలనిగానీ ఇష్టపడిననూ, బహుశా దాన్ని వ్యతిరేకించే భర్త వత్తిడికామె గురౌతుంది. “అందుకే మేము స్త్రీ-పురుషులున్న జట్టులను మురికివాడలోని వారి దగ్గరికి పంపి ఆరోగ్యశాఖకు సంబంధించిన మగవారు ఆ కుటుంబ యజమానితో మాట్లాడి, తక్కువమంది సంతానముంటే వారిని చక్కగా చూసుకోవచ్చునని కుటుంబ సంఖ్యను తగ్గించవలెనని ప్రోత్సహించునట్లు చేస్తున్నాము.” అయితే మనం గమనించినట్లు అనేక ఆటంకాలెదురౌతున్నాయి.
“పేదరికం మూలాన పేదవారిలో శిశుమరణాలు ఎక్కువగా ఉన్నాయి,” అని డాక్టర్ సాబ్నిస్ అంటున్నాడు. “గనుక కొందరెలాగూ చనిపోతారు కాబట్టి ఎక్కువమంది పిల్లలను కనే కోరిక నిశ్చయంగా వారికున్నది.” అయితే ఆ పిల్లల పోషణార్థం చేసేది మాత్రం శూన్యం. వాళ్లు ఎటో తిరుగుతూ భిక్షమెత్తుతూ, లేక చెత్తకుండీలో ఆహారం కొరకు వెదకుతూ వుంటారు. మరి తలిదండ్రుల సంగతేమిటి? “వారి పిల్లలెక్కడున్నది వారికి తెలియదు,” అని డాక్టర్. సాబ్నిస్ వాపోతున్నాడు.
ఇండియాలోని ప్రకటనలు తరచూ ఇద్దరు పిల్లలతో సంతోషంగా కనబడే దంపతులను చూపిస్తు వారు సాధారణంగా ఒక మగపిల్లవాన్ని, ఒక ఆడపిల్లను బాగా పెంచి పోషిస్తున్నట్లు చూపిస్తారు. సమాజంలోవున్న యీభాగమే—మధ్యతరగతే—ఇద్దరు పిల్లల ఉద్దేశమును ముందుగా అంగీకరిస్తున్నారు. అయితే, మా తలిదండ్రులు, తాత తండ్రులు 10 మంది లేక 12 మంది సంతానం కల్గివుంటే మాకెందుకుండ కూడదూ? మేమెందుకు ఇద్దరితో సరిపెట్టుకోవాలి? అని వాదించే పేదవారి మనస్సులలో ఇద్దరు పిల్లలు చాలు అనే ఉద్దేశ్యం లేదు. ఇండియాలోవున్న అధిక సంఖ్యాకులైన యీ నిరుపేద జనాంగములోనే, జనాభా పెరుగుదల అరికట్టు పద్ధతికి ఎదురు దెబ్బతగులుతుంది. “జనాభా ఇప్పుడు యౌవనదశలోను, సంతానోత్పత్తిచేయగల వయస్సులో వున్నది,” అని డాక్టర్. చోప్రా జ్ఞాపకం చేస్తున్నాడు. “ఫలితం అననుకూలంగానే వుండేటట్లు కనబడుతుంది. మా ఎదుట చాలా గొప్ప పని వేచివున్నది.” (g91 11/8)