ఎయిడ్స్—పిల్లల విషాదాంత మరణాలు
వారి బొమ్మలను, చిత్రాలను చూశారా? వారి కథలను విన్నారా, చదివారా? మీరలా చేస్తే, అందువల్ల మీరు అదిరిపడ్డారా? కన్నీటిని ఆపుకోగలిగారా లేదా దుఃఖాన్ని దిగమ్రింగుకోగలిగారా? వారి నిమిత్తం మీ హృదయం పరితపిస్తుందా? ఎవ్వరు గమనించకుండానే చనిపోబోవువారి సన్నని మూల్గులు మీరింకా వినగల్గుతున్నారా? ఒకే పడకలో ఇద్దరు, ముగ్గురు, నల్గురిని అలా వదలివేసే—దీనావస్థా దృశ్యాలను మీరిప్పటికి తీసివేయగలరా? వారిలో అధికులు అలా విడిచివేయబడిరి. ఇప్పుడు లోకమంతట వ్యాపిస్తున్న ఈ మహమ్మారి వ్యాధి కారణంగానే వారు బాధపడి మరణిస్తున్నారు—అదే ఎయిడ్స్!
ఒక ఐరోపా దేశమునుండి 1990 ఫిబ్రవరిలో వెలువడిన వార్తలు, ప్రసరింపజేయబడిన చిత్రాలు, చూసిన ప్రేక్షకులను భయకంపితులను చేసినవి. ప్రపంచవ్యాప్తంగా, ఈ భయంకర వ్యాధిని గూర్చి లక్షలాది మంది వార్తాపత్రికలలోను, పత్రికలలోను చదువుతునేవున్నారు. టైం పత్రిక ఇలా తెల్పింది: “ఆ దృశ్యం ఘోరంగాను భయంకరంగాను వున్నది. ఊయల తరువాత ఊయలలో పసివారు, తప్పటడుగుల పిల్లలు పడుకొని ఉన్నారు, వారు ముసలివారివలె కనబడుతూ, వారి శరీరం ముడతలుపడి, లోతుగా పీక్కుపోయి ఎముకలే కనబడుచున్న వారి ముఖములలో ముంచుకొస్తున్న మరణపు సూచనలే కనబడుచున్నవి.” “నేను చూచిన వాటన్నిటిలోకెల్లా ఇదెంతో ఘోరమైనది” అని ఒక డాక్టరు వాపోయాడు. “స్పష్టముగా ఇది చికిత్సా క్రియల మూలముగా సంక్రమిస్తున్న అంటురోగమే.”
ఇదెలా సంభవిస్తుంది? ఎయిడ్స్ రోగమున్న తల్లులనుండి వచ్చే వైరస్వల్ల పుట్టిన అనేకమంది పిల్లలవలె కాకుండా, ఈ పిల్లలు హెచ్ఐవి పాజిటివ్తో జన్మించలేదు. బలహీనంగావున్న శిశువులను బలపరచుననే నమ్మకముతో ఈ బలహీనులు లేక నెలలు నిండకనే పుట్టిన క్రొత్తశిశువులకు, పుట్టిన తర్వాత ఎక్కించే రక్తం మూలంగా ఈ విశాదం జరిగింది—ఈ పద్ధతిని వైద్యనిపుణులు ఎప్పుడో త్రోసిపుచ్చారు. “హెచ్ఐవి పాసిటివ్ వున్న ఒక్క వ్యక్తి చేసే రక్తదానమే 10, 12 లేదా ఎక్కువమంది పిల్లలకు ఈ రోగాన్ని అంటించగలదని” ఒక డాక్టరు అన్నారు.
“ఎయిడ్స్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మేము పసిపిల్లలకు ఎయిడ్స్ వచ్చేవిషయాన్ని ఎదుర్కొంటున్నాము. అదొక అంటురోగం,” అని పారిస్లో వున్న ప్రపంచ వైద్యుల మానవ సేవాసంస్థ ప్రెసిడెంట్ డాక్టర్. జాక్ లీబా అన్నాడు.
ఉదాహరణకు, 1990 సెప్టెంబర్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటిసారిగా ప్రపంచమంతట పసివారిలో ఎయిడ్స్ అంటు రోగమున్నదనే గగుర్పాటు కలిగించే సాక్ష్యాధారములను విడుదల చేసింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ, అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సి సిండ్రోమ్ (ఎయిడ్స్) నకు కారణమౌతున్న వైరస్, 2000 సంవత్సరముల నాటికల్లా ఒక కోటి మంది పిల్లలకు ప్రాకుతుందని నివేదించింది. “ఆ 2000 సంవత్సరముల నాటికి వీరిలో చాలామందికి ఎయిడ్స్ వృద్ధి చెంది దానివల్ల మరణిస్తారు” అని ఎయిడ్స్ మీద ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమము యొక్క డైరెక్టర్ డాక్టర్. మైకెల్ మర్సన్ అన్నాడు. 1990 చివర్లో పూర్తి ఎయిడ్స్ ఉన్నట్లు నిర్థారణయైన 12 లక్షల మందిలో మూడవ భాగము ఐదు సంవత్సరముల లోపువయస్సుగల పిల్లలే.
ఎయిడ్స్ తెగులు వ్యాపకం ప్రపంచమంతా వ్యాపించిందనుటలో ఆశ్చర్యమున్నదా? 1992 సంవత్సరాంతానికి షుమారు నలభైలక్షలమంది శిశువులు హెచ్ఐవి అంటుకున్న తల్లులకు జన్మిస్తారు. వైరస్తో పుట్టిన ఐదుగురిలో నల్గురు, వారికి ఐదు సంవత్సరములు నిండేలోగానే ఎయిడ్స్ రోగం వచ్చేస్తుంది. ఒకసారి వారు ఎయిడ్స్ బారిన పడితే సాధారణంగా వారు ఒకటి లేక రెండు సంవత్సరములలో చనిపోతారని డాక్టర్ మర్సన్ జెనీవా విలేఖరుల సమావేశములో తెలిపాడు.
నిపుణుల ప్రవచనమేమనగా, ఒక్క 1992 సంవత్సరములోనే ఆఫ్రికా స్త్రీలలో 1,50,000 మందికి, మరింకా 1,30,000 మంది ఆఫ్రికా పిల్లలకు ఎయిడ్స్ రోగం అంటుకుంటుంది. అమెరికాలో ఇప్పటివరకు 20,000 మంది శిశువులు హెచ్ఐవి అంటుకున్న స్త్రీలకు జన్మించి యుండవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. న్యూజిలాండ్లోని వెల్లింగ్టన్ యొక్క ది ఈవెనింగ్ పోస్టు 1989, జూలై 12, సంచికలో బ్రెజిల్లోని 1,40,000 మంది యౌవనస్థులు ఈ వైరసును కల్గియున్నారని అంచనావేసింది. “అయితే నిపుణుల ఈ అంచనా తక్కువ కావచ్చునని భయపడుతున్నారు” అని ఆ పత్రిక తెల్పింది. వీరికి ప్రత్యేక చికిత్స ఇవ్వకపోతే ఈ గుంపు పట్టణంలో పేలిన ఆటంబాంబువలె అవుతుంది” అని మెడికల్ డైరెక్టర్ ఆఫ్ది నేషనల్ ఫౌండేషన్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ మైనర్స్ అన్నాడు. “అది అత్యంత తీవ్రమైన సమస్య”యని ప్రఖ్యాతి చెందిన బ్రెజిల్ దేశపు మనస్తత్వ శాస్త్రజ్ఞుడు విలపించాడు.
సమస్యలు పెరుగుచున్నవి
ఈ మరణకరమగు తెగులుకు బలైపోతున్న ఈ అమాయకుల దయనీయస్థితిని చూచినవారెవరికైనా మనస్సు ద్రవించక పోతుందా? ఉదాహరణకు ఈ నివేదికను పరిశీలించండి: “నార్వీజియన్ రెడ్ క్రాస్ ప్రకారం మధ్య ఆఫ్రికాలో 50 మంది పిల్లలను చంపారు—కొందరిని తమ స్వంత తల్లిదండ్రులే—ఎందుకంటే వారికి ఎయిడ్స్ సోకింది.” కుష్టు రోగం కంటె దారుణమైన కళంకమునిచ్చే ఈ రోగంతో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు గనుక ఎయిడ్స్ సోకిన పిల్లలను ఇండ్లనుండి వారు తరిమివేస్తున్నారు” అని దక్షిణాఫ్రికాలోని జోహనాస్బర్గ్ నందలి ఒక వార్తా పత్రిక సన్డే స్టార్ నివేదించింది. “కొన్ని ప్రాంతాలలో ఎయిడ్స్ సోకినవారిని వారి కుటుంబీకులను నీళ్లగుంటల వద్దకు, చర్చీలలోనికి అనుమతించుట లేదని,” ఆ వార్తాపత్రిక తెల్పింది.
వణకు పుట్టించే ఇతర గణాంకములు కూడ నిర్లక్షానికి తావివ్వవు. ఎయిడ్స్ మహమ్మారి మరో విషాదమునకు కారణమని ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న నివేదికలు ఆరోపిస్తున్నాయి. 1990 దశాబ్దంలో ఎయిడ్స్సోకని లక్షలాదిమంది పిల్లలు అనాధలు కానైయున్నారు. ఎందుకు? ఎందుకంటే వారి తల్లిదండ్రులు ఎయిడ్స్ వల్ల చనిపోతారు. 1992 నాటికి ప్రపంచ వ్యాప్తంగా యాభై లక్షలమంది ఎయిడ్స్ మూలంగా అనాధలైన వారుంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచన. “అదొక జరుగనారంభించిన ప్రళయం. మరి పరిస్థితిని చక్కబెట్టే పథకముతో కూడిన దీర్ఘదృష్టి మనకు లేక పోతే పెద్దపెద్ద అనాధ శరణాలయములను తెరువ వలసివస్తుంది,” అని శిశుసంరక్షణా నిపుణుడొకరు అన్నారు.
“ఆ బాధ దాదాపు అగమ్య గోచరమైయున్నది,” అని న్యూయార్కులోని ఓ కుటుంబాన్ని గూర్చి వివరిస్తూ వారిని పరామర్శించు వ్యక్తి అన్నాడు. “తల్లికి సోకింది, తండ్రికి సోకింది, పసిపాప జబ్బున పడింది, తలిదండ్రులు మరియు పసిపాప చనిపోనైయున్నారు, మరియు వారు ఏ కుటుంబ సభ్యులు లేకుండ 10 సంవత్సరముల అబ్బాయిని అనాధగా విడిచి వెళతారు.”
చివరిగా, న్యూయార్క్లోని ఆల్బర్ట్ ఎయిన్స్టన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో పనిచేస్తున్న డాక్టర్. ఎర్నెస్ట్ డ్రూకర్ యిచ్చిన యీ మంచి వివరణ ఇలా వున్నది. “తలిదండ్రులలో ఎవరో ఒకరు చనిపోయిన తర్వాత పిల్లలు తరచూ బంధకపు పోరాటములలో చిక్కుకు పోతారు. ఎయిడ్స్ మచ్చను మరియు పోగొట్టుకొనిన నష్టాన్ని పూరించుటకు ప్రయత్నిస్తుండగా ఒక కుటుంబ సభ్యుని నుండి మరొకరి వద్దకు తరుమబడతారు.”
పిల్లలలోను, యౌవనస్థులలో మరణానికి త్వరగా దారి తీయుటకు ఎయిడ్స్ ఒక ముఖ్య కారణమౌతుంది. ఒకటినుండి నాలుగు సంవత్సరముల వయస్సున్న పిల్లలలో అది మరణానికి కారణమగువాటిలో తొమ్మిదవదిగాను, యౌవనస్థులలో 25 సంవత్సరముల లోపు వయస్సున్న వారిలో ఏడవదిగావున్నది. 1990 దశాబ్దం తొలిభాగానికి మరణమునకు కారణములైన వాటిలో ఎయిడ్స్ అయిదవదిగా తయారు కాగలదని, ది ఎయిడ్స్/హెచ్.ఐ.వి రికార్డ్, సెప్టెంబర్ 1989 తెల్పింది. అయిననూ, ఈ భయంకరమైన వ్యాధిగ్రస్థులలోని అనేకులలో ప్రపంచమంతట ఒకేవిధమైన నిర్లక్ష్య ధోరణివున్నట్లు నివేదికలు తెలుపుచున్నవి. తర్వాతి శీర్షికలో కొన్ని కలవరపరచు వాస్తవాలను పరిశీలించండి. (g91 7/22)